Wednesday 2 December 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (101)



నేనిట్లా చెప్పానంటే శాస్త్రిగారి అభిప్రాయాన్ని అందించాను. అంటే ఒక్క వినాయకుణ్ణే పూజించి మిగతా దేవతలను పూజించవద్దని కాదు. రకరకాల అభిరుచులు, మనః ప్రవృత్తులుంటాయి కదా. ఆపైన ఒక్కొక్క దేవతనే పూజించడం వల్ల వారి విశ్వాసమూ గట్టిపడుతుంది. అందుకే తిరునల్లార్ లోని శనిని పూజించడం, మకర సంక్రమణకాలంలో అయ్యప్పను ఆరాధించడం విశేషంగా కన్పిస్తుంది. ఎవరికో గాని అద్వైత జ్ఞానం పట్టుబడదు. ఒక్కొక్క దేవతనే ఇష్టదైవంగా భావించేవారున్నా పెక్కుమందిని పూజించాలనే సాధారణంగా ఉంటుంది. అంతేకాదు, తమ ఇష్టదేవతనే రకరకాలుగా అలంకరిస్తారు.


రకరకాల రుచులను మనస్సు కోరుతుంది. కోరనీయండి. దానిని సహజ మార్గంలో పోనీయండి. అది ఒక్కదాని పై లగ్నమగునట్లు నెమ్మది నెమ్మదిగా దీనిని నియమించండి. అనగా ఒక్కదానినే పట్టుకోవాలని నిర్భంధంగా మనస్సును బిగించకూడదు. మనస్సునకు ఒత్తిడి చేస్తే అది మన అదుపులో అస్సలుండదు. ఇట్లా పెక్కుమంది దేవతలను ఆరాధించి మనస్సులోని మాలిన్యాన్ని క్రమక్రమంగా పొగొట్టుకొనేటట్లు చేయడమే మన లక్ష్యం. డ్వైతభావన నుండి అద్వైతానికి పయనించునట్లుగా చేయడమే లక్ష్యం. ఇదంతా విఘ్నేశ్వరుదొక్కడే చాలనే తతః హేతున్యాయాన్ని వివరించడం వల్ల ఇంతగా చెప్పవలసి వచ్చింది. అంత మాత్రంచే ఇతర దేవతలను భజించకూడదని కాదు. ఈ శ్లోక రచయిత కూడా పెక్కు దేవతలను భజించినవాడే. ఇట్లా చెప్పినవాడు శివుణ్ణి అర్చించాడు కదా!


ఏదో బౌద్ధిక స్థాయిలో (Intellectual Plane) చెప్పితే సరిపోదు. మనకు మనస్సుంది కదా. భక్తి విషయం వచ్చేప్పటికి బుద్దికి అవకాశం ఉండదు. అందువల్ల మనం ప్రాథమిక దశలో ఉన్నాం కనుక ముందుగా అందర్నీ కొలుద్దాం. ఇష్ట దైవాన్ని భజిద్దాం. ఏది మనకు తృప్తి నిస్తే అట్లా కొలుద్దాం. 


శ్లోకం చివరలో అనేక దేవతలను భజించవడం వల్ల వచ్చే అన్ని ఫలాలను వినాయకుడిస్తాడని ఉంది. సర్వార్థ ప్రతిపాదనైక చతురో ద్వైమాతురో, అనగా నాల్గు పురుషార్ధాలను ఇస్తాడని ఉంది.

No comments:

Post a Comment