Thursday, 30 April 2015

చరిత్రకు నోచుకోని విచిత్ర యుగం!

పురాతత్వశాఖ వారి తవ్వకాలలో బయటపడుతున్న మహా విషయాలకు సముచిత ప్రచారం లేదు. మూఢ విశ్వాసాలను వదిలించుకోవాలన్న ప్రచారం జరుగుతున్న సమయంలోనే మూఢ విశ్వాసాలు మన నెత్తికెక్కి కూర్చుని ఉండడం విచిత్రమైన వర్తమానం. ఈ మూఢ విశ్వాసాలు మన విద్యారంగాన్ని రెండువందలు ఏళ్లకు పైగా ప్రభావితం చేస్తున్నాయి. ఈ మూఢ విశ్వాసాలు విదేశీ దురాక్రమణదారుల వారసత్వ శకలాలు. ఒక్కొక్క ‘శకలం’ సకలంగా మారి మన జీవన రంగాలను ముక్కలు ముక్కలుగా మార్చివేస్తున్నాయి. మన వ్యవహారంలో, విజ్ఞానంలో సమన్వయం, సమగ్రత్వం లోపించడానికి హేతునిబద్ధత అడుగంటి పోవడానికి ఇలా ‘శకలం’ సకలమై కూర్చుని ఉండడం ప్రధాన కారణం. శకలాలను మళ్లీ ఒకటిగా కూర్చి సకలత్వాన్ని సాధించడానికి ఇప్పుడైనా కృషిజరగాలి. విద్యాప్రణాళికలలో, పాఠ్యపుస్తకాలలో, భాషాస్వరూపంలో సంస్కరణలు జరిగిపోవాలని ప్రచారం చేస్తున్నవారు ‘తవ్వకాల’ద్వారా బయటపడుతున్న చారిత్రక, భౌగోళిక, సాంస్కృతిక వాస్తవాలను మన జాతీయ జీవనంతో సమన్వయం చేసుకోవాలి! భారతీయ సంస్కృతి గొప్పదని అంటున్నవారే ‘ఆర్యు లు’అనేవారు బయటినుంచి మన దేశానికి వచ్చిపడినారని కూడ పాఠ్యాంశాలలో ఇప్పటికీ ఇరికిస్తూ ఉన్నారు. ఇది మూఢ విశ్వాస చిహ్నం....
‘చరిత్ర’కు ప్రారంభ బిందువును నిర్దేశించడం పాశ్చాత్యుల విశ్వవిజ్ఞాన అవగాహనా రాహిత్యానికి శతాబ్దుల సాక్ష్యం! ఆ చారిత్రక ప్రారంభ బిందువునకు ముందున్న కాలాన్ని ‘చరిత్ర పూర్వయుగం’గా చిత్రీకరించడం కాలగతికి పాశ్చాత్య చరిత్రకారులు చేసిన ఘోరమైన గాయం... ఈ ‘తథాకథిత’- సోకాల్డ్- చరిత్ర పూర్వయుగం- ప్రి హిస్టారిక్ ఏజ్-లో మాత్రం మానవులు లేరా? కనీసం ప్రాణులు లేవా? వారిది లేదా వాటిది మాత్రం చరిత్రకాదా?? చరిత్ర కాదనడం చరిత్రకు జరిగిన అన్యాయం. ఈ అన్యాయం చేసింది మిడిమిడి జ్ఞానం కలిగిన పాశ్చాత్య మేధావులు! ఈ ‘శకల’మే ‘సకల’మని ఐరోపా చరిత్రకారులు మనకు క్రీస్తుశకం పద్దెనిమిదవ, పంతొమ్మిదవ శతాబ్దులలో పాఠాలను చెప్పారు. ఆ పాఠాలను ఆ తరువాత మరింత నిష్ఠతో శ్రద్ధతో వల్లెవేస్తున్నాం! అందువల్లనే గొప్ప విషయాలను చెప్పదలచుకున్న మేధావులు, లేదా చెబుతున్నట్టు అభినయిస్తున్న మహా మేధావులు ‘చరిత్ర పూర్వయుగం’-ప్రిహిస్టారిక్ ఏజ్- అన్న విచిత్ర పద జాలాన్ని ఉటంకించడంతో ప్రారంభిస్తున్నారు! ప్రాచీన రాజధాని అమరావతి నవ్యాంధ్రప్రదేశ్‌కు మళ్లీ రాజధాని అవుతున్న సందర్భంగా ఈ ‘‘చరిత్ర పూర్వయుగం’’అన్న అర్థంలేని పదజాలం మళ్లీ విరివిగా ప్రచారవౌతోంది! ఈ ప్రచారం అతి ప్రాచీన అమరావతికి అవమానం. ఎందుకంటె అమరావతి లేదా కొందరు అంటున్నట్టు ‘్ధన్యకటకం’ ఐదువేల వంద ఏళ్లకు పూర్వం జరిగిన మహాభారత యుద్ధ సమయంలో ఉంది. అంతకు పూర్వం వేలాది ఏళ్లుగా ఉంది! కానీ బ్రిటిష్‌వారు మప్పిపోయిన ‘‘చరిత్ర పూర్వయుగం’’అన్న విచిత్ర పదార్థాన్ని ప్రచారం చేస్తున్నవారు ‘అమరావతి’ చరిత్రను రెండువేలు లేదా రెండు వేల ఐదువందల ఏళ్లకు పరిమితం చేస్తున్నారు! బ్రిటిష్‌వారు కాలాంతకులు, కాలాన్ని అంతంచేసినవారు... వారి వారసులు కూడ కాలాంతకులే! ‘‘చరిత్ర పూర్వయుగం’’ ఒకటుందని నమ్మడం ప్రచారం చేయడం మూఢ విశ్వాసబద్ధమైన బుద్ధికి నిదర్శనం! చరిత్ర అనాది... అనంతం... అందువల్ల చరిత్ర క్రమం ఆద్యం త రహితం! ‘‘చరిత్ర పూర్వయుగం’’,‘‘కోతి యుగం’’,‘‘రాతి యుగం’’,‘‘లోహ యు గం’’ అన్నవి బ్రిటిష్‌వారు, పాశ్చాత్యులు ‘‘విజ్ఞా నం’’గా భ్రమించిన మూఢవిశ్వాసాలు... బ్రిటిష్‌వారు మన దేశాన్ని వదలి వెళ్లినప్పటికీ, వారు అంటించిపోయిన ఈ మూఢ విశ్వాసాలు మన పుస్తకాలను, మస్తకాలను వదలకపోవడం భావదాస్య ప్రవృత్తికి ప్రత్యక్ష ప్రమాణం!

పురాతత్త్వశాఖ వారి త్రవ్వకాలలో బయటపడుతున్న ప్రాచీన అవశేషాలు ‘‘హరప్పా మొహంజాదారో నాగరికత’’ కాలంనాటివని, అంతకు పూర్వంనాటివని వర్గీకరణలు జరుగుతున్నాయి. అంతవరకు కాలానికి సంబంధించిన పేచీలేదు. కాని ‘‘హరప్పా నాగరికత’’ లేదా ‘‘సింధునదీ పరీవాహక ప్రాంత- ఇండస్ వ్యాలీ- నాగరికత’’అన్న పదజాలం మన జాతీయ అద్వితీయ తత్త్వానికి విఘాతకరమైనవి! ఈ దేశంలో గతంలో రెండుమూడు జాతులవారు పరస్పరం కొట్టుకొని చచ్చారన్న అబద్ధాన్ని ప్రచారం చేయడానికి బ్రిటిష్‌వారు ఈ ‘‘హరప్పా నాగరికత’’ను ‘‘కనిపెట్టి’’ పోయారు. ఈ హరప్పా నాగరికత కాలంనాటి మానవ అస్థిపంజరాలు నాలుగు ఇటీవల హర్యానాలో జరిగిన తవ్వకాలలో బయటపడినాయి. ఈ అస్థిపంజరాలు ఐదువేల ఏళ్లనాటివట! హరప్పా, మొహంజోదారో అన్న ప్రాచీన నగరాలు సింధూ పరీవాహ ప్రాంతంలో ప్రాచీన కాలంలో ఉండి ఉండవచ్చు. కానీ నగరాల పేరుతో ‘నాగరికత’లు, ‘‘రాజ్యాలు’’ ఉండడం భారతీయ చరిత్రలో సంభవించలేదు. ఇలా ఉండడం గ్రీకుల పద్ధతి పాశ్చాత్యుల పద్ధతి! నగరాలు మన దేశంలో రాజధానులు మాత్రమే. ‘‘నాగరికత’’అన్నది దేశమంతటా విస్తరించి ఉండిన ఒకే ఒక అద్వితీయ సాంస్కృతిక వ్యవస్థ! అందువల్ల బ్రిటిష్‌వారు కనిపెట్టిన ‘‘హరప్పా నాగరికత’’ నిజానికి భారతదేశమంతటా సమకాలంలో విస్తరించి ఉండిన అద్వితీయ సామాజిక వ్యవస్థ! అది వేద సంస్కృతి, సనాతన సంస్కృతి, భారతీయ సంస్కృతి, హిందూ సంస్కృతి....

ఇలా దేశమంతటా ఉండిన దాన్ని ఒక ప్రాంతానికి పరిమితం చేయడం పాశ్చాత్యుల పరిమిత బుద్ధికి నిదర్శనం. ‘తక్షశిల’ప్రాచీన విద్యాకేంద్రం, రాజ్యంకాదు, రాజధాని కూడ కాదు. కానీ గ్రీకు బీభత్సకారుడైన అలెగ్జాండరు క్రీస్తునకు పూర్వం నాలుగవ శతాబ్దిలో మన దేశంలో కొంత భాగాన్ని గెలిచాడన్న అబద్ధాన్ని పాశ్చాత్య చరిత్రకారుడు క్రీస్తుశకం పద్దెనిమిదవ శతాబ్దిలో ప్రచారం చేశారు. ఈ అబద్ధ ప్రచారంలో భాగంగా విశ్వవిఖ్యాత విద్యాకేంద్రమైన ‘తక్షశిల’ను ఒక ప్రత్యేక రాజ్యంగా కల్పించారు!! ఇదే పద్ధతిలో దేశమంతటా ఒకే జాతీయ సంస్కృతి అనాదిగా ఉండడం వాస్తవం కాగా, ఈ వేద సంస్కృతికి భిన్నమైన ‘‘హరప్పా నాగరికత’’ను పాశ్చాత్యులు ఏర్పాటుచేశారు. పైగా ఈ ‘‘హరప్పా నాగరికత’’ ధ్వంసమైన తరువాత మాత్రమే క్రీస్తునకు పూర్వం పదిహేనవ పనె్నండవ శతాబ్దుల మధ్య వేద సంస్కృతి ఈ దేశంలో పుట్టుకొచ్చిందన్న మరో భయంకర అబద్ధాన్ని కూడ పాశ్చాత్యులు మన చరిత్రకు ఎక్కించిపోయారు!! ఈ దేశంలో ‘యుగాలు’గా వేద సంస్కృతి పరిఢవిల్లుతోందన్నది వాస్తవ చరిత్ర. ఈ చరిత్రను చెరచి, వేదాల ప్రాచీనతను కేవలం మూడువేల ఐదువందల ఏళ్లకు కుదించడానికి బ్రిటిష్‌వారు చేసిన కుట్రలో ఈ తథాకథిత ‘‘హరప్పా నాగరికత’’ భాగం... ఈ కుట్రను భగ్నంచేయడానికి వీలైన అవశేషాలు తవ్వకాలలో అనేక ఏళ్లుగా బయటపడుతున్నాయి. ఇప్పుడు హర్యానాలో జరిగిన త్రవ్వకాలలో ఏడువేల ఐదువందల ఏళ్లనాటి పట్టణం బయటపడింది! ‘‘హరప్పా నాగరికత’’ కేవలం ఐదువేల ఏళ్ల ప్రాచీనమైనదన్న పాశ్చాత్య అబద్ధాన్ని ఈ ‘‘పట్టణం’’ ఇలా బట్టబయలుచేసింది.. భూస్థాపిత సత్యమిలా భువనమెల్ల మార్మోగెను....

హరప్పా నాగరికతను ధ్వంసంచేసిన తరువాత వేదాలు వైదిక సంస్కృతి విలసిల్లాయన్న పాశ్చాత్యుల ‘‘అబద్ధాల చరిత్ర’’కు పెద్ద అవరోధం మహాభారత యుద్ధం. మహాభారత యుద్ధం కలియుగం పుట్టడానికి పూర్వం ముప్పయి ఆరవ ఏట జరిగింది! కలియుగం పుట్టిన తరువాత మూడువేల నూట రెండేళ్లకు క్రీస్తుశకం పుట్టింది. ఇలా క్రీస్తునకు పూర్వం 3138 ఏళ్లనాడు మహాభారతయుద్ధం జరిగిందని అమెరికా శాస్తవ్రేత్తలు సైతం నిర్ధారించిన సంగతి దశాబ్దిక్రితం ప్రముఖంగా ప్రచారమైంది. అమెరికా శాస్తవ్రేత్తలు నిర్ధారించకపోయినప్పటికీ ప్రాచీన భారత చరిత్రకారులు చేసిన నిర్ధారణలు నిజంకాకుండా పోవు. కాని పాశ్చాత్య భావదాస్య సురాపానం మత్తుదిగని భారతీయ మేధావులు అమెరికావారి ఐరోపావారి నిర్ధారణలను నమ్ముతున్నారు. ఆ నిర్ధారణ కూడ జరిగింది కనుక ఇకనైనా ‘హరప్పా’నాగరికత అన్న మాటలను వదలి పెట్టి దేశమంతటా అనాదిగా ఒకే వేద సంస్కృతి కొనసాగుతున్న వాస్తవాన్ని చరిత్రలో చేర్చాలి! ప్రాథమిక స్థాయినుండి స్నాతకోత్తర స్థాయివరకు గల విద్యార్థులకు బోధించాలి! మహాభారత యుద్ధం జరిగిననాటికి, క్రీస్తునకు పూర్వం మూడువేల నూటముప్పయి ఎనిమిదేళ్లనాటికి, దేశమంతటా ఒకే జాతీయత ఒకే సంస్కృతి నెలకొని ఉన్నాయి! అలాంటప్పుడు అదే సమయంలో ‘‘వేద సంస్కృతితో సంబంధం లేని, వేదాలకంటె ముందు ఉండిన’’ ఈ హరస్పా ఎలా ఉండి ఉంటుంది??

చరిత్రను ఆవహించిన మూఢవిశ్వాసాన్ని ఇకనైనా వదలగొట్టాలి!

‘రాతియుగం’, ‘కోతియుగం’వంటివి కృతకమైన కల్పితమైన కాలగణన పద్ధతులు. ‘చరిత్ర పూర్వయుగం’అన్నది ఉండడానికి వీలులేదు. ఎందుకంటె సహజమైన విశ్వవ్యవస్థ తుది మొదలు లేకుండా వ్యవస్థీకృతమై ఉంది! ఈ ‘తుది మొదలులేనితనం’ కాలానికీ- టైమ్- దేశానికీ- స్పేస్-వర్తిస్తున్న శాశ్వత వాస్తవం. ఈ వాస్తవం ప్రాతిపదికగా కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం, కలియుగం వరుసగా తిరుగుతున్నాయి. శిశిర ఋతువు తరువాత వసంత ఋతువువలె రాత్రి తరువాత పగటివలె కలియుగం తరువాత మళ్లీ కృతయుగం రావడం చరిత్ర! ఇది సనాతనమైన నిత్యనూతనమైన హేతుబద్ధమైన వాస్తవం! ఈ వాస్తవం ప్రాతిపదికగా విద్యార్థులకు ఇకనైనా చరిత్రను బోధించాలి! ‘రాతియుగం’తోకాక కృతయుగంతో చరిత్రను మొదలుపెట్టాలి. కృత త్రేత ద్వాపర కలియుగాలు ఒకదానితరువాత ఒకటి రావడం ఖగోళ విజ్ఞానపు గీటురాయిపై నిగ్గుతేలిన నిజం!

ఈ ఖగోళ వాస్తవాలను ఎవ్వరూ మార్చలేరు... వక్రీకరించలేరు. ఈ ఖగోళ వాస్తవం ప్రకారం ‘సప్తర్షులు’అన్న అంతరిక్ష సముదాయం భూమినుండి చూసినప్పుడు వందేళ్లపాటు ‘అశ్వని’వంటి నక్షత్రాలతో కలసి ఉదయిస్తుంది. ఈ సప్తర్షి మండలం అలా ‘రేవతి’వరకూ గల నక్షత్రాలతో ఉదయించే కాలఖండం రెండువేల ఏడువంద ఏళ్లు. ఈ ఖగోళ వాస్తవం ప్రాతిపదికగా కలియుగంలో ఇది యాబయిరెండవ శతాబ్ది! ఇది 5117వ సంవత్సరం. శాతవాహన ఆంధ్రులు కలియుగంలో 2269నుండి 2775వరకు 506 ఏళ్లపాటు మొత్తం భారతదేశాన్ని పాలించారు, దేశానికి రాజధాని గిరివ్రజం...!! ధాన్యకటకం అప్పటికే ఉంది, ధాన్యకటకం అమరావతి కావచ్చు, కోటిలింగాల కావచ్చు!్ధన్యకటకం రాజధానిగా సహస్రాబ్దులు పాలించిన తరువాతనే ఆంధ్రులు గిరివ్రజం రాజధానిగా భారత సమ్రాట్టులయ్యారు. ఇదీ యుగాల చరిత్ర.... ‘చరిత్ర పూర్వయుగం’ లేదు!

- హెబ్బార్ నాగేశ్వరరావు 30/04/2015 (ఆంధ్రభూమి విశ్లేషణ)
http://www.andhrabhoomi.net/content/main-feature-58

భాగవతం నుంచి సూక్తి


Tuesday, 28 April 2015

స్వామి చిదానంద సరస్వతీ సూక్తి

భగవంతుని గుర్తుంచుకోవడమే జీవితం. మర్చిపోవడమే మరణం - స్వామి చిదానంద సరస్వతీ (Divine life society, Rishikesh)



Monday, 27 April 2015

భూమాత అరోగ్యమే మన ఆరోగ్యం - భవిష్యత్తు మన చేతుల్లోనే

యత్ పిండాండే తత్ బ్రహ్మాండే అని శాస్త్రం అంటుంది. అనగా ఏది పిండాండంలో ఉందో, అదే బ్రహ్మాండంలోనూ ఉంది అని అర్దం. పిండాండం అనగా ఈ శరీరం ................ ఒకే పదార్ధం నుంచి ఈ సృష్టి ఏర్పడింది. దానిలో భాగమే ఈ భూగోళం, భూమి నుంచి వచ్చిదే ఈ దేహం. శరీరం భూమిలో భాగం. అదీగాకా హిందు ధర్మం ప్రకారం భూమి జీవం లేని మట్టి ముద్ద కాదు. భూమిలో జీవం ఉంది, శక్తి ఉంది, సర్వజీవులకు పుష్టినిచ్చే శక్తి ఉంది. శక్తి ఉంటే ఆమెను దర్శించవచ్చు, మాట్లాడవచ్చు, కబుర్లు చెపచ్చు, రోగాలను నయం చేసుకోవచ్చు. మనకులాగా భూమికి ప్రాణం ఉంది. అందుకే ఆవిడను భూమాత అన్నారు. మనకున్న శరీరంలానే, ఆవిడకు ఒక శరీరం ఉంది. అదే భూమి. మనకు శరీరంలో రోగనిరోధకశక్తి ఉన్నట్లే, భూమాతకు ఉంది. రకరకాల మార్పుల ద్వార ఆవిడ తనలో కలిగిన దోషాలను తొలగించుకుంటుంది.

మనిషికి పంచకోశాలు ఉన్నట్లే భూమాతకు పంచకోశాలున్నాయి. ప్రాణమయకోశంలో దోషాలు ఏర్పడప్పుడు వ్యక్తికి స్థూలసరీరంలో రోగాలు సంభవిస్తాయి. అట్లాగే భూమాతకు ప్రాణమయకోశంలో దోషం ఏర్పడితే అవిడకు రోగలు వస్తాయి. భూమాతకు ప్రాణమయకోశం వాతావరణమే. భూవాతవారణం చెడిపోయిన కారణంగా ఆవిడ స్థూలశరీరంలో అనారోగ్యం సంభవిస్తోంది. దాని ఫలితమే తరచూ సంభవించే ప్రకృతి ఉపద్రవాలు.

మానవుడి మనోమయకోశంలో దోషాల కారణంగా మానసిక సమస్యలు ఏర్పడతాయి. భూమాతకు అంతే. ఇది మరచిన మానవుడు ఈ రోజు రకరకాల చర్యలతో భూవాతావరణాన్ని పాడు చేస్తున్నాడు. అనగా భూమాత ప్రాణమయకోశాన్ని కలుషితం చేస్తున్నాడు. హింస, క్రూర ఆలోచనల ద్వారా మనోమయ కోశాన్ని పాడు చేస్తున్నాడు. వాటి కారణం చేతనే మానవుడు ప్రకృతి విలయాలకు అతలాకుతలమవుతున్నాడు .......................

భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. మనం భూమాత గర్భంలో ఉన్నాం. భూమికి ఏం జరిగినా, అది నేరుగా మన మీదే ప్రభావం చూపిస్తుంది. కనుక మనం సుఖంగా ఉండాలన్న, మన భూతల్లి సుఖంగా ఉండాలన్న భూమాతపట్ల మానవ దృక్పధంలో మార్పు రావాలి. భూమిలో ఉన్న అమ్మను గుర్తించాలి, ఆవిడకు హాని చేసే చర్యలను మానుకోవాలి. ప్రకృతిని పరిరక్షించాలి. సర్వమానవాళి అమ్మ ఆరోగ్యాన్ని రక్షించుకునే విధంగా నడుచుకోవాలి. అమ్మ ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం.

Sunday, 26 April 2015

హిందూ ధర్మం - 156 (సామవేదం)

3. సామవేదం - గీతేషు సామాఖ్యా - గానమే సామం అని జైమిని మహర్షి నిర్వచనం. ఋక్కుల యొక్క గానమే సామం. మానవుడు ఏ జ్ఞానం పొంది, ఎటువంటి కర్మలు ఆచరిస్తే జీవాత్మ జననమరణ చక్రం నుంచి (జన్మల పరంపర నుంచి) విడుదలవుతుందో అటువంటి అంశాల గురించి సామవేదం ప్రధానంగా చెప్తుంది. భగవంతుని యొక్క స్తుతి గురించి, ఉపాసనా పద్ధతుల గురించి చెప్తుంది. భగవంతుని యొక్క అనంతమైన శక్తులే వేర్వేరు రూపాల ద్వారా వ్యక్తమవుతున్నాయి. వాటిని ఉపాసించడం వలన మానవుడికి ఆధ్యాత్మిక ఉన్నతికి కలుగుతుంది. సామవేద మంత్రాలు అత్యంత ఉత్కృష్టమైనవి, వాటిని వినడం చేత మానిషి భావావేశానికి లోనవుతాడు. సామవేదమంత్రాలు మానవుడి మనసును, ఆత్మను ప్రశాంతమైన, నిశ్చల స్థితికి తీసుకెళ్ళగల శక్తి కలిగి ఉన్నాయి. మానవుడు మానసిక, ఆధ్యాత్మిక స్థాయిలో శక్తులను సంపాదించేందుకు, అతని అభివృద్ధికి ఇవి తోడ్పడతాయి. వేదల పరంగా సామవేదం 3 వది, మంత్రాల పరంగా చిన్నదే అయినా, వేదాలపై పూర్తి అవగాహన రావలంటే సామవేదాన్ని అర్దం చేసుకోవాలని బృహద్దేవత చెప్తోంది. ఇందులో 95% మంత్రాలు ఋగ్వేదం నుంచి గ్రహించబడినవే. సామగానం దేవతలను తృప్తి పరుస్తుంది. సర్వజీవులయందు ఐక్యతను పెంచి, ప్రపంచశాంతికి దోహదం చేస్తుంది. సామవేద మంత్రపఠనం శుద్ధిని ఇస్తుంది. అణువులు, పరమాణువుల గురించి, వాటిలో ఉండే శక్తి గురించి, అన్నిటియందు పరమాత్మ శక్తి ఏ విధంగా వ్యాప్తమై ఉందో సామవేదం 222 మంత్రం చెప్తోంది. వ్యవసాయం, ఔషధం, ఖగోళం, గణితశాస్త్రల వివరణ సామవేదం, విషములు వాని లక్షణాలు, వాటి విరుగుడు గూర్చిన శాస్త్రము 221 మత్రం వెళ్ళడిస్తోంది. ముఖ్యంగా బీజగణితం గురించి చెప్పబడింది.

'న సమా యజ్ఞోభవతి' - సామవేదం లేనిదే యజ్ఞమే లేదు అని చెప్పబడింది. కృష్ణుడు కూడా గీతలో 'వేదానం సామవేదోస్మి' - నేను వేదాల్లో సామవేదాన్ని అన్నాడు. ఇతర మూడు వేదాలు కూడా సామవేదాన్ని ప్రశంసించడం, సామవేదం యొక్క గొప్పతనాన్ని తెలియపరుస్తోంది.

పతంజలి మహర్షి మాహాభాష్యం రాసే సమయానికి సామవేదానికి 1000 శాఖలు ఉండేవి. కానీ ప్రస్తుతం 3 శాఖలు మాత్రమే మిగిలాయి. వాటిలో కౌధుమశాఖ గుజరాత్‌లో, రాణాయణీ శాక మహరాష్ట్రలో, రామేశ్వరంలో, జైమిని శాఖ కర్ణాటకలో ప్రచారంలో ఉంది. కౌధుమ సంహిత పూర్వార్చికము, ఉత్తారార్చికము అని రెండు భాగాలు. ఈ రెండు భాగములు కలిపి 1824 మంత్రాలున్నాయి.

ప్రతి శాఖకు ఒక బ్రాహ్మణము, ఒక ఆరణ్యకము, కనీసం ఒక ఉపనిషత్తు ఉంటాయి. కానీ ప్రస్తుతం సామవేదానికి సంబంధించి మహాతాండ్య బ్రాహ్మణం ఒక్కటే లభ్యమవుతోంది. జైమినీ బ్రాహ్మణము దొరికిన, అది పూర్తిగా లభ్యమవ్వటంలేదు. ఆరణ్యకలలో తలవకార ఆరణ్యకము, ఛాందోగ్యారణ్యకము లభ్యమవుతున్నాయి. తలవకార ఆరణ్యకము మిక్కిలి ప్రసిద్ధము. కేనోపనిషత్తు దీని అంతర్భాగము. ఈ వేదానికి సంబంధించి ఛాందోగ్యోపనిషద్, కేనోపనిషద్ లభిస్తున్నాయి.

యజ్ఞసమయంలో సామవేద మంత్రోఛ్ఛారణ చేసే సామవేద పండితుడిని 'ఉద్గాత' అంటారు.

To be continued ............................

Saturday, 25 April 2015

స్వామి నిఖిలానంద సరస్వతీ సూక్తి

ముక్తిని పొందటానికి ధ్యానమే చివరిమెట్టు.
ధ్యానం చేయడానికి జ్ఞానం ఉండాలి
జ్ఞానం వైరాగ్యంతోనే కలుగుతుంది
వైరాగ్యం కలగాలంటే కర్మయోగంతో ప్రయాణం ప్రారంభించాలి
ముక్తి మార్గం ధ్యానంతో మొదలవ్వదు.

- స్వామి నిఖిలానంద సరస్వతీ