Thursday, 12 November 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (81)



మణి లేకపోవడం వల్ల కఱువు రావడం, మరల భాగ్యం రావడం, అంతా నాటకంలో భాగమే. అసలు ద్వారకలో కృష్ణుడుండగా మణితో నిమిత్తం లేకుండా భాగ్యం ఉండదా? కఱువు, నాటకంలో ఒక భాగం. తరువాత భాగ్యం రావడమూ అంతే. మణిని ఆధారంగా తీసుకొని ఈ నాటకం ఆడించాడు, ఆ జగన్నాటక సూత్రధారి.


అతడు చెప్పినట్లే అక్రూరుని దగ్గరే మణియుంది. ప్రజలు సత్యం తెలుసుకొన్నారు. లెంపలేసుకున్నారు. కృష్ణుణ్ణి నుతించారు. 


బలరాముడూ విదేహ రాజ్యం నుండి తిరిగి వచ్చాడు. ఈ మొత్తం కథను వినిపించారు. కృష్ణుణ్ణి అనవసరంగా శంకించానని బాధపడ్డాడు బలరాముడు.


“మీదేమీ తప్పులేదు. నేను చవితి చంద్రుణ్ణి చూడడమే కొంప ముంచింది. ఇదీ బాగానే ఉంది. దీనివల్ల వినాయకుని గొప్పదనం వెల్లడైంది కదా అని కృష్ణుడన్నాడు. (అపార సంపద ఒక వ్యక్తి చేతిలో ఉంటే ఎన్ని అనర్ధాలు వస్తాయో గమనించారా? ప్రజలందరికీ చెందవలసిన విలువైన సంపద ప్రభుత్వాధీనంలో ఉందాలని ఈ కథ వెల్లడించడం లేదా? సంపద కలకాలం ఉండాలంటే శారీరిక, మానసిక శుచి తప్పక ఉండాలని బోధించడం లేదా? - అనువక్త)


Wednesday, 11 November 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (80)



ఇట్లా ప్రేమను, గౌరవాన్ని చూపిస్తూ వార్తలో లౌక్యాన్ని మేళవించాడు కృష్ణుడు. గమనించారా?


అసలేదో బుద్ధి చలించిందే గాని, అక్రూరుడు పరమ భాగవతుడే. ఈ మాటలను వినగా అతనిలో భక్తి పెల్లుబికింది. వచ్చి కాళ్ళపై బడ్డాడు.


నీ దగ్గరే ఉంచుకో అని భగవానుడన్నా మొత్తం సంపద అంతా లక్ష్మీపతికే చెందాలి కదా. తనకోసం దాచిపెట్టడం పాపమని, ఇది రాజద్రవ్యాన్ని అపహరించడమని పశ్చాత్తప్తుడయ్యాడు, అక్రూరుడు. మణిని తిరిగి ఇచ్చివేసాడు.


“దీనిని బహుమతిగా స్వీకరించవయ్యా, నేను ప్రేమతో ఇస్తున్నా, దానిని తిరస్కరించడం బాగుందా" అని అన్నాడు కృష్ణుడు, "నాపై నింద పోగొట్టుకోవడం కోసం ద్వారక ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలనే నేను నిన్ను రమ్మన్నాను. నీ దగ్గరే ఉంచుకో” అని తిరిగి ఇచ్చివేసాడు.


కృష్ణుడు ద్వారకను నిర్మించాడు. ఉగ్రసేనుణ్ణి సింహాసనం పై కూర్చుండబెట్టాడు. ఇతడు యదువంశ నేత. కనుక అధికారంతో ఉన్నవారు ఇతరులపట్ల ఎట్లా ఉండాలో తెలియపర్చడం లేదా? తాము నిజాయితీతో ఉండడమే కాదు, నిజాయితీతో ఉన్నట్లుగా కూడా కనబడాలి, లోకులను సంఘాన్ని అవినీతి నుండి కాపాడాలి. వారి పవిత్రమైన నడవడిని చూపించాలి కూడా అందుకే ఆంగ్లంలో "Cesar's wife must be above suspision" అనే నానుడి ఏర్పడింది. అందువల్లనే తనపై మోపబడిన నిందను తుడిచివేసుకోవడాన్ని కృష్ణుడు, నానా తంటాలు పడవలసి వచ్చింది. అతడు నిజంగా బాధపడి కాదు. లోకానికి ఆదర్శప్రాయంగా ఉండాలి. నాటకంలో వేషం వేసినవారికి బాధ లేకపోయినా, బాధపడుతున్నట్లు నటిస్తారు కదా!


Tuesday, 10 November 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (79)



నింద తొలగింది


ఇక కృష్ణునిపై వేసిన నింద ఎట్లా తొలగిందో చూద్దాం:


ద్వారకలో అనుకోకుండా కఱువు అలముకొంది. అదే సమయంలో కాశి పట్టణం భాగ్య భోగ్యాలతో కళకళలాడుతూ ఉందనే వార్త వినబడింది. అక్రూరుడక్కడున్నాడని ఆలయ సేవలు చేస్తున్నాడనే వార్తలూ వినబడ్డాయి. కనుక మణి, అక్రూరుని దగ్గర ఉండాలని ఊహించారు.


భగవానుడు సర్వజ్ఞుడు కదా! అతనికి వార్తాహరులు కావాలా? కాని మామూలు మనిషిలా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఇట్లా ప్రజల మాటల కనుగుణంగా ఒక వార్తాహరుణ్ణి పంపాడు. ఏమని? 


ద్వారక, నీవు లేకపోతే వెలవెలబోతోంది. కఱువు తాండవించింది, నీపు వెంటనే వచ్చి నీ యదు వంశపు పెద్దరికాన్ని నిలబెట్టుకో, నీ దగ్గర మణియున్నా సరేసరి, సత్రాజిత్తు ఇప్పుడు లేడు, అతనికి ఔరసనునిగా మగసంతానమూ లేదు, సత్యభామ తండ్రిని పోగొట్టుకొని విలపిస్తోంది. మణిని గురించి పట్టించుకోవడం లేదు. ఎవరి చేతిలోనో ఆ మణి ఉండటం కంటే నీవంటి సచ్చరిత్రుని దగ్గర ఉండటమే మేలు". కృష్ణుడు ఈ మణిని తీసుకోవడానికి పూర్తిగా అర్హుడైనా తన గురించి చెప్పకుండా అతణ్ణే పొగిడాడు. సందేహం కలగకుండా ఇట్లా ప్రశంసించాడు: "నా అన్నగారు నన్నే శంకిస్తున్నాడు. అతడు శంకిస్తే ఇక జాంబవతి శంకించకుండా ఉంటుందా? నా దగ్గరే ఈ మణి యున్నట్లు జాంబవతి భావిస్తోంది. మొదట తపస్సువల్ల సత్రాజిత్తు సంపాదించాడు కనుక, దానిని దాచివేసి అతని కూతురుకే కట్టబెట్టతాడని భావించి యుండవచ్చు కూడా. ఇక సత్యభామ, ఈ మణి జాంబవంతుని దగ్గర ఉండడం వల్ల దీనిని జాంబవతికే నేను కట్టబెడతాననీ భావించి యుండవచ్చు. ఇట్లా అందరిలోనూ సందేహాలలుముకున్నాయి. ద్వారకలో ఉన్న రకరకాల ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు. కనుక నీవు బాహాటంగా నీ దగ్గరే ఉందని తెలియపర్చాలి. అంతేకాదు, మన ప్రాంతం కలవు కాటకాలనుండి దూరంగా ఉండాలన్నా ఆ మణి నీ దగ్గర ఉండవలసిందే" అని కబురు పెట్టాడు కృష్ణుడు.


Monday, 9 November 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (78)



ఒక్క శ్లోకం చాలు


ఇక నీలాపనిందలు తొలగాలంటే మరొక సూక్ష్మోపాయం ఉంది. మొత్తం శ్యమంతకోపాఖ్యానాన్ని చదవడమూ కష్టమే. కనీసం కథ పై దృష్టి పెట్టండి అందొక్క శ్లోకమైనా చదవండి. ఈ శ్లోకాన్నే జాంబవరి పల్కింది, పిల్లవాణ్ణి జోకొట్టే సందర్భంలో. ఈ శ్లోకాన్ని బట్టి రహస్యాన్ని ఛేదించాడు కృష్ణుడు దీనిని లోగడ పేర్కొన్నాను. అయినా


సింహః ప్రసేనం అవధీత్ సింహో జాంబవతా హతః 

సుకుమారక! మారోదీ: తవ హ్యేష శ్యమంతకః


ఈ ఒక్క శ్లోకం చదివితే మొత్తం కథ అంతా మదిలో మెదులుతుంది. ఈ శ్లోకంలో రెండవ సగం, మనలనుద్దేశించినట్లుంది చూడండి. ఓయి పిల్లవాడ! ఏడవకుమని అంది. ఈ సుకుమారక అనే పదం మనకూ అన్వయిస్తుంది. తవ హ్యేష శ్యమంతకః, మణి నీకొరకే. ఇట్లా వినాయకమణి, కృష్ణమణి మనకే, మనకొరకే ఉన్నాయని భావించండి. వాళ్ళ అనుగ్రహం ఉంటే చీటికీ మాటికీ మనం ఏడవాలా?


ప్రత చూడామణి కల్పంలో ప్రతమెట్లా చేయాలో చెప్పబడింది. ఈ శ్లోకాన్ని తప్పక చదవాలని చెప్పింది.


Sunday, 8 November 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (77)



లీలా ఫలితం - లోకక్షేమం


గణపతితో కృష్ణుడొక విజ్ఞప్తిని చేసాడు. అతనికి లోకక్షేమం కావాలి కదా! "నీవు నా ఎదురుగా కనబడ్డావు, నా సమస్యను తీర్చావు. బాగానే ఉంది. అయితే ఇట్టి బాధలనుండి విముక్తి నాకొక్కడికే చెందకుండా అందరికీ ఉపయోగించే మార్గాన్ని చూపుమని” అన్నాడు.


ఇంతకుముందు గణపతి, చంద్రుణ్ణి ఎవరు చూసినా కష్టాలు పడతారని అన్నాడు కదా. కృష్ణుని మాటలను పురస్కరించుకుని అందరికీ మేలు చేయాలని ఇట్లా అన్నాడు. “ఆ చవితినాడు చూస్తే నిందలు వస్తాయని లోగడ అన్నాను. ఇక నీ శ్యమంతకమణి కథను ఎవరు చదివినా, విన్నా వెంటనే వారికి వచ్చిన నిందలు పోతాయని ఇప్పుడు వరం ఇస్తున్నా. ఈ చవితినాడు నేనావిర్భవించాను కదా! ఈనాడు ఆ కథ చదివితే చాలని అంటున్నా. నీలాపనిందలే కాదు ఎట్టి మానసిక ఆందోళనలూ ఉండవని అందరూ సుఖశాంతులతో ఉంటారని హామీ ఇస్తున్నానని" గణపతి అన్నాడు.


మానవావతారం ఎత్తినపుడు కష్టాలు, నష్టాలు తప్పవు. ఇట్లా లీలగా అనుభవించి కృష్ణుడు, లోకానికి ఉపకరించాడు.

Saturday, 7 November 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (76)



ఇట్లా చంద్రుడు - గణపతి కథను వినిపించాడు నారదుడు కృష్ణునికి. నీవు భాద్రపద శుక్ల చవితి నాడు చంద్రుణ్ణి చూసావు. వినాయకుని శాపం నీకు తగిలి యుంటుందని అన్నాడు. దానికి విరుగుడుగా చవితినాడు పూజ చేయవలసిందని అన్నాడు.


కృష్ణుడా మాటలను నమ్మి వ్రతం ఆచరించాడు. మేనల్లుడు కదాయని తేలికగా చూడలేదు. అతడు శుక్ల, కృష్ణ పక్ష చతుర్దులను రెంటినీ ఆచరించాడు. లేకపోతే ఇందెవరు గొప్పయని మనం శంకిస్తాం.


శుక్లాంబరధరుడైన గణపతి, కృష్ణుని ముందు సాక్షాత్కరించి నీవు మానవాకారం ధరించావు, అదర్శవంతంగా ఉండదానికి నీవూ నియమాలను పాటించవలసిందే. ఇకనుండి నింద తొలగిపోతుందిలే చంద్రుని మాదిరిగా తళతళా ప్రకాశిస్తావులే - అని మేనమామకే వరం ప్రసాదించాడు గణపయ్య.

Friday, 6 November 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (75)

 


కృష్ణుడు - చంద్రుడు


కృష్ణునికి సంబంధించిన గోకులాష్టమి పూజలోనూ చంద్రునకు అర్ఘ్యం ఉంటుంది కూడా. ఇట్లా కృష్ణుడు చంద్రుణ్ణి కూడా పూజించాలనే నియమాన్ని పెట్టియుంటాడు, విఘ్నేశ్వరుడు దయ చూపించినట్లుగా.


మరొక కథ ఇతనిలో సంబంధం ఉంది. రాముడు సూర్యవంశంలో పుట్టి రవికుల తిలకుడని, ఇనుకుల తిలకుడని పేరు గడించాడు. అంటే సూర్యునకు ప్రాధాన్యం ఇచ్చి చంద్రునకు అప్రాధాన్యం ఉన్నట్లే కదా. రాముని దగ్గరకు వెళ్ళి నన్నెట్లా విస్మరించావయ్యా అని విలపించాడు. బాధపడకయ్యా, నా పేరు చివర నీ పేరు నుంచుకొని ఇక రామచంద్రుడని పిలువబడుతానులే, అన్నాడట. అంతేకాదు, మరొక అవతారంలో చంద్రవంశంలోనే పుడతానని అన్నాడట. అందువల్ల కృష్ణుడు, చంద్రవంశంలో అవతరించాడు. చంద్రుడికి అర్ఘ్యం ఇచ్చేటట్లు చేసాడు. కనుక కృష్ణాష్టమి రోజున చంద్రునకు అర్ఘ్యం ఇయ్యాలి.

నింద పోగొట్టడానికి వరం


మరొకవిధంగానూ సత్కరించాడు గణపతి. సంకటహర చతుర్థినాడు తనతో చంద్రునికి పూజ చేయాలని చెప్పడమే గాక ఆ తిథికి ముందున్న తిథినాడు చంద్రుణ్ణి చూస్తే మంచిదని కూడా అన్నాడు. అమావాస్య తరువాత వచ్చే పా డ్యమినాడు చంద్రుణ్ణి చూస్తే చవితినాడు చూసిన దోషం తొలగిపోతుందనే నియమాన్ని ఏర్పాటు చేసాడు.


ఆ చవితి ముందున్న తదియనాడు చూడాలి. ఈ రోజే ఈశ్వరుడు అమ్మవారు, గణపతి కూడా చంద్రరేఖను నెత్తిపై ధరించారు. అమావాస్య తరువాత వచ్చిన పాడ్యమిలో చంద్రుడు మసక మసకగా కన్పిస్తాడు. విదియనాడు కన్పిస్తాడు. దానిని చంద్రదర్శనమని పంచాంగాలలోనూ ఉంటుంది. ఆ తదియనాడు చూడడాన్ని మరిచిపోయాం. లోకంలో చవితినాడు చూస్తే బాధలు పడవలసి వస్తుందనే నానుడి మాత్రం ఏర్పడింది. అమావాస్య నుండి మొదలు పెడితే నాల్గవ తిథి, తదియ వస్తోంది. (అట్లా లెక్కబెట్టి చూడడం లేదేమో!)