Wednesday 11 November 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (80)



ఇట్లా ప్రేమను, గౌరవాన్ని చూపిస్తూ వార్తలో లౌక్యాన్ని మేళవించాడు కృష్ణుడు. గమనించారా?


అసలేదో బుద్ధి చలించిందే గాని, అక్రూరుడు పరమ భాగవతుడే. ఈ మాటలను వినగా అతనిలో భక్తి పెల్లుబికింది. వచ్చి కాళ్ళపై బడ్డాడు.


నీ దగ్గరే ఉంచుకో అని భగవానుడన్నా మొత్తం సంపద అంతా లక్ష్మీపతికే చెందాలి కదా. తనకోసం దాచిపెట్టడం పాపమని, ఇది రాజద్రవ్యాన్ని అపహరించడమని పశ్చాత్తప్తుడయ్యాడు, అక్రూరుడు. మణిని తిరిగి ఇచ్చివేసాడు.


“దీనిని బహుమతిగా స్వీకరించవయ్యా, నేను ప్రేమతో ఇస్తున్నా, దానిని తిరస్కరించడం బాగుందా" అని అన్నాడు కృష్ణుడు, "నాపై నింద పోగొట్టుకోవడం కోసం ద్వారక ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలనే నేను నిన్ను రమ్మన్నాను. నీ దగ్గరే ఉంచుకో” అని తిరిగి ఇచ్చివేసాడు.


కృష్ణుడు ద్వారకను నిర్మించాడు. ఉగ్రసేనుణ్ణి సింహాసనం పై కూర్చుండబెట్టాడు. ఇతడు యదువంశ నేత. కనుక అధికారంతో ఉన్నవారు ఇతరులపట్ల ఎట్లా ఉండాలో తెలియపర్చడం లేదా? తాము నిజాయితీతో ఉండడమే కాదు, నిజాయితీతో ఉన్నట్లుగా కూడా కనబడాలి, లోకులను సంఘాన్ని అవినీతి నుండి కాపాడాలి. వారి పవిత్రమైన నడవడిని చూపించాలి కూడా అందుకే ఆంగ్లంలో "Cesar's wife must be above suspision" అనే నానుడి ఏర్పడింది. అందువల్లనే తనపై మోపబడిన నిందను తుడిచివేసుకోవడాన్ని కృష్ణుడు, నానా తంటాలు పడవలసి వచ్చింది. అతడు నిజంగా బాధపడి కాదు. లోకానికి ఆదర్శప్రాయంగా ఉండాలి. నాటకంలో వేషం వేసినవారికి బాధ లేకపోయినా, బాధపడుతున్నట్లు నటిస్తారు కదా!


No comments:

Post a Comment