Sunday 8 November 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (77)



లీలా ఫలితం - లోకక్షేమం


గణపతితో కృష్ణుడొక విజ్ఞప్తిని చేసాడు. అతనికి లోకక్షేమం కావాలి కదా! "నీవు నా ఎదురుగా కనబడ్డావు, నా సమస్యను తీర్చావు. బాగానే ఉంది. అయితే ఇట్టి బాధలనుండి విముక్తి నాకొక్కడికే చెందకుండా అందరికీ ఉపయోగించే మార్గాన్ని చూపుమని” అన్నాడు.


ఇంతకుముందు గణపతి, చంద్రుణ్ణి ఎవరు చూసినా కష్టాలు పడతారని అన్నాడు కదా. కృష్ణుని మాటలను పురస్కరించుకుని అందరికీ మేలు చేయాలని ఇట్లా అన్నాడు. “ఆ చవితినాడు చూస్తే నిందలు వస్తాయని లోగడ అన్నాను. ఇక నీ శ్యమంతకమణి కథను ఎవరు చదివినా, విన్నా వెంటనే వారికి వచ్చిన నిందలు పోతాయని ఇప్పుడు వరం ఇస్తున్నా. ఈ చవితినాడు నేనావిర్భవించాను కదా! ఈనాడు ఆ కథ చదివితే చాలని అంటున్నా. నీలాపనిందలే కాదు ఎట్టి మానసిక ఆందోళనలూ ఉండవని అందరూ సుఖశాంతులతో ఉంటారని హామీ ఇస్తున్నానని" గణపతి అన్నాడు.


మానవావతారం ఎత్తినపుడు కష్టాలు, నష్టాలు తప్పవు. ఇట్లా లీలగా అనుభవించి కృష్ణుడు, లోకానికి ఉపకరించాడు.

No comments:

Post a Comment