Tuesday 10 November 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (79)



నింద తొలగింది


ఇక కృష్ణునిపై వేసిన నింద ఎట్లా తొలగిందో చూద్దాం:


ద్వారకలో అనుకోకుండా కఱువు అలముకొంది. అదే సమయంలో కాశి పట్టణం భాగ్య భోగ్యాలతో కళకళలాడుతూ ఉందనే వార్త వినబడింది. అక్రూరుడక్కడున్నాడని ఆలయ సేవలు చేస్తున్నాడనే వార్తలూ వినబడ్డాయి. కనుక మణి, అక్రూరుని దగ్గర ఉండాలని ఊహించారు.


భగవానుడు సర్వజ్ఞుడు కదా! అతనికి వార్తాహరులు కావాలా? కాని మామూలు మనిషిలా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఇట్లా ప్రజల మాటల కనుగుణంగా ఒక వార్తాహరుణ్ణి పంపాడు. ఏమని? 


ద్వారక, నీవు లేకపోతే వెలవెలబోతోంది. కఱువు తాండవించింది, నీపు వెంటనే వచ్చి నీ యదు వంశపు పెద్దరికాన్ని నిలబెట్టుకో, నీ దగ్గర మణియున్నా సరేసరి, సత్రాజిత్తు ఇప్పుడు లేడు, అతనికి ఔరసనునిగా మగసంతానమూ లేదు, సత్యభామ తండ్రిని పోగొట్టుకొని విలపిస్తోంది. మణిని గురించి పట్టించుకోవడం లేదు. ఎవరి చేతిలోనో ఆ మణి ఉండటం కంటే నీవంటి సచ్చరిత్రుని దగ్గర ఉండటమే మేలు". కృష్ణుడు ఈ మణిని తీసుకోవడానికి పూర్తిగా అర్హుడైనా తన గురించి చెప్పకుండా అతణ్ణే పొగిడాడు. సందేహం కలగకుండా ఇట్లా ప్రశంసించాడు: "నా అన్నగారు నన్నే శంకిస్తున్నాడు. అతడు శంకిస్తే ఇక జాంబవతి శంకించకుండా ఉంటుందా? నా దగ్గరే ఈ మణి యున్నట్లు జాంబవతి భావిస్తోంది. మొదట తపస్సువల్ల సత్రాజిత్తు సంపాదించాడు కనుక, దానిని దాచివేసి అతని కూతురుకే కట్టబెట్టతాడని భావించి యుండవచ్చు కూడా. ఇక సత్యభామ, ఈ మణి జాంబవంతుని దగ్గర ఉండడం వల్ల దీనిని జాంబవతికే నేను కట్టబెడతాననీ భావించి యుండవచ్చు. ఇట్లా అందరిలోనూ సందేహాలలుముకున్నాయి. ద్వారకలో ఉన్న రకరకాల ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు. కనుక నీవు బాహాటంగా నీ దగ్గరే ఉందని తెలియపర్చాలి. అంతేకాదు, మన ప్రాంతం కలవు కాటకాలనుండి దూరంగా ఉండాలన్నా ఆ మణి నీ దగ్గర ఉండవలసిందే" అని కబురు పెట్టాడు కృష్ణుడు.


No comments:

Post a Comment