Sunday 13 December 2015

హిందూ ధర్మం - 187 (నిరుక్తము - 5)

14. వేదంలో భృగు అనేది నిర్దిష్ట నామవాచకం కాదు, మహర్షి నామధేయం కాదు. భృ అనగా స్వీయ నిర్వహణ. తమ సంపాదన / శక్తి మీద బ్రతకడం. గు అనేది తీవ్రమైన శ్రమను సూచిస్తోంది. తమ స్వశక్తి మీద జీవించటానికి తీవ్రమైన కృషి చేసేవారు భృగువులు.

*వేదం అన్నప్పుడు ఈ సందర్భంలో మంత్రసంహితగానే అర్దం చేసుకోవాలి. బ్రాహ్మణాలు, ఆరణ్యకాలు, ఉపనిషత్తులో ఋషుల పేర్లు ఉంటాయి. కాని సంహిత వరకు మాత్రం అది కాలానికి, చరిత్రకు అతీతం, సనాతనం కనుక అందులో వ్యక్తులు, నదులు, చారిత్రిక ప్రదేశాల పేర్లు ఉండవు. అలాగే ఋషుల పేర్లకు వేరే అర్దాలున్నాయని, అందువల్ల అసలు ఋషులే లేరని చెప్పకూడదు. ఈ రెండు వేర్వేరు అంశాలు. ఉదాహరణకు 'వేద' అని ఒక వ్యక్తి పేరు ఉన్నంతమాత్రాన, వేదం అతని జీవితం గురించి చెప్తుందని చెప్పడం ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో ............ అలా కాదు వేదం అనేది ఒక గ్రంధం అని, దాని గురించి ఎవరైనా వివరిస్తే, అసలు 'వేద' అనేది గ్రంధం పేరు కాబట్టి ఆ పేరుతో వ్యక్తి అనేవాడు లేడని చెప్పడం అంతే మూర్ఖంగా ఉంటుంది. వేదం (మంత్రసంహిత) లో ఉన్న అనేక పేర్లను వ్యక్తులు పెట్టుకున్నారు. యుక్తిని ఉపయోగించి అర్దం చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకానీ రెండిటిని కలిపేసి విపరీతాలకు తావు ఇవ్వకూడదు.

15. వేదంలో భరతుడనగా మృదు స్వభావం కలవాడు, అభివృద్ధి, పురోగతి కోరుకునేవాడిని అర్దం. అంతేకానీ శ్రీ రామచంద్రుని తమ్ముడిగా అర్దం స్వీకరించకూడదు.

16. తన వాళ్ళు / ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించడంలో నిష్ణాతుడిని వేదంలో వశిష్ఠుడిగా చెప్పారు. వసు బ్రహ్మచారుల మధ్య ఉంటూ, ఉన్నతమైన స్థానాన్ని పొందిన గురువును కూడ ఇది సూచిస్తుంది.

17. వేదంలో సరస్వతీ అనేది నది యొక్క నామం కాదు. బ్రాహ్మణాల్లో సరస్వతీ అనే పదానికి 13 అర్దాలున్నాయి. నిఘంటులో 57 పర్యాయపదాలున్నాయి. దయానంద సరస్వతీ గారు సరస్వతీ అనేది భగవంతునికున్న నామాల్లో ఒకటని సత్యార్ధ ప్రకాశ్ లో చెప్పారు. ఆయనే వివాహ సందర్భంలో సరస్వతీ అనే పదం కనిపించినప్పుడు భార్యగా అర్దం చెప్పాల్సి ఉంటుందని వివరించారు. ఋగ్వేదం 7 వ మండలం 9 వ సూత్రం 5 వ మంత్రంలో సరస్వతీ అంటే వివరణాత్మకమైన ప్రసంగం అని చెప్పారు.

సాయనుడి ప్రకారం ఋగ్వేదంలో 15 చోట్ల సప్తనదుల ప్రస్తావన ఉంది. ఆయన వాటిని గంగా, యమునా నదులుగా అనువదించారు. కానీ దయానందులు, నిరుక్తం ఇత్యాదుల ప్రకారంగా ఆత్మ కేంద్ర స్థానం, అదే ముఖ్యశక్తి కేంద్రం. దాని నుంచి 7 నదులు ప్రవహిస్తాయి (అవి శక్తి ప్రవహాలు). 1. అహంకారం, 2. మనసు, 3. శబ్ద, 4. స్పర్శ, 5. రస (రుచి), 6. రూప, 7. గంధం (వాసన). చివిరి ఐదింటిని పంచతన్మాత్రలు అంటారు. అహంకారం అనే ప్రవాహం అహం అనే క్షేత్రం/ మార్గంద్వారా పయనిస్తుంది. (అహం నశిస్తే అన్నీ నశిస్తాయి, ఆత్మజ్ఞానం కలుగుతుంది అని రమణమహర్షి ఉపదేశం. అహం కారణంగానే కర్తృత్వం ఏర్పడుతుంది. అహం అనగా 'నేను' అనే భావన. అహం నుంచే క్రమంగా 'నేను ఇంత వాడిన్నన్న అహంకారం బయలుదేరుతుంది.) ధ్యానం అనే మార్గం ద్వార మనసు ప్రవహిస్తుంది. (ఒక వస్తువు మీద దృష్టి నిలపడమే ధ్యానం. ఆత్మ శక్తే మనసు ద్వారా భావనల రూపంలో వ్యక్తమవుతోంది.) పదాలు (శబ్దాలు) ఎటు నుంచి వినిపిస్తాయో, ఆ దిశగా చెవుల ద్వారా శబ్ద ప్రవాహం ఉంటుంది. స్పర్శ ప్రవాహాం చర్మం ద్వారా స్పర్శ క్షేత్రానికి ప్రవహిస్తుంది. రస ప్రవాహం నాలుకను క్షేత్రంగా చేసుకుని రుచి కలిగించే దిశ యందు ప్రవహిస్తుంది. అదే విధంగా రూప ప్రవహాం కంటిని ఆధారంగా చేసుకుని దృశ్యం (చూడబడుతున్న వస్తువు) దిశగా ప్రవహిస్తుంది. గంధ ప్రవాహం ముక్కును ఆధారంగా చేసుకుని శ్వాస ద్వారా ప్రవహిస్తుంది. ఆత్మ నుంచి వచ్చే ఈ 7 ప్రవాహాలు నిత్యం బయటకు ప్రవహించి, కర్మలు చేయగా, సుషుప్తి అవస్థలో (గాఢనిద్రలో) లోపలికి ప్రవహించి ఆత్మ యందు ఐక్యమవుతాయి. ఈ సప్త ప్రవాహాలే సప్త ఋషులు, సప్త కిరణాలు, ఆత్మ యొక్క సప్త హస్తాలు. (ఈ ఏడింటికి ఆత్మయే కీలకం. ఆత్మ లేకపోతే వీటికి అస్థిత్వం లేదు.)  

To be continued ................. 

No comments:

Post a Comment