Tuesday 19 January 2016

సద్గురు జగ్గివాసుదేవ్ - కష్టాలు -కధ

ఆ పరమాత్ముడి తో ఒక సన్నకారు రైతు ఒకసారి బలంగా దెబ్బలాట వేసుకొన్నాడు.

"నీకు పైరు గురించి ఏం తెలుసు? నీకిష్టమైనప్పుడు వానను కురిపిస్తావు. ఆ కాలంలో గాలి వీచేలా చేస్తున్నావు. నీతో పెద్ద గొడవగా ఉంది. మాట్లాడకుండా ఆ పనులన్నీ ఒక రైతుకి  అప్పగించారాదూ!” అన్నాడు.

 భగవంతుడు వెంటనే "అలాగా! అయితే ఈనాటి నుంచి గాలి, వాన, ఎండ అన్నీ నీ అజమాయిషిలోనే  ఉంటాయి”  అంటూ వరమిచ్చి చక్కాపోయాడు.
 ఆ రైతు ఆనందానికి అవధుల్లేవు.

ఋతువులు మారాయి. "వానా! కురవాలి" అన్నాడు  రైతు.
కురిసింది. ఆగమనగానే ఆగింది.

తడినేలను దున్నాడు. కావాల్సిన వేగంతో  గాలిని విసరమన్నాడు. విసిరింది.
విత్తుజల్లాడు. గాలి, వాన, ఎండ అన్నీ ఆ రైతు మాట ప్రకారమే జరిగాయి.
పైరు పచ్చగా ఏపుగా పెరిగింది. ఆ పొలం చూడటానికి ఎంతో రమ్యంగా ఉంది.
కోతల కాలం వచ్చింది.

 రైతు ఒక కంకి కోశాడు. గింజ నులిమి చూ శాడు. అదిరిపడ్డాడు.  లోపల ధాన్యం  లేదు. ఉత్తి ఊక, మరొకటి, మరొకటి అంటూ అన్నీ కోసి చూశాడు. ఎందులోనూ ధాన్యం లేదు. అంతా ఉత్తి ఊకమాత్రమే ఉంది.

"హారి దేవుడా!" అంటూ కోపంగా ఎలిగెత్తి పిలిచాడు. "వాన,ఎండ,గాలి అన్ని తగిన మోతాదుల్లోనే వాడాను. కాలానుగుణంగా, ఋతువులకి తగట్టుగా. అయితే పైరు పాడైపోయిందే! ఏం? ఎందుకు?"

భగవంతుడు నవ్వాడు. "నా ఆధీనంలో గాలి బలంగా వీచేది. అప్పుడు అమ్మను కౌగిలించుకొనే పిల్లల్లా నారు వేళ్ళు భూమిలోకి లోతుగా జోచ్చుకొని గట్టిగా  పట్టుకొనేవి. వాన తక్కువైనా నీటికోసం వేళ్లను నాలుగు పక్కలకు పాకించేది. పోరాటం అంటూ ఉంటేనే చెట్లు తమను కాపాడుకోవడం కోసం బలంగా పెరుగుతాయి.

 అన్ని వసతులు నువ్వే కల్పించేసరికి పైరు సోమరిదయ్యింది. నవనవలాడుతూ పెరిగిందే తప్ప ఆరోగ్యవంతమైన ధాన్యాన్ని అందించాలని దానికి తెలీదు.
"నాకు నీ గాలి, వాన,ఎండ వద్దు. నువ్వే ఉంచుకో". అంటూ రైతు దేవుడిచ్చిన వాటిని తిరిగిచ్చేశాడు.

జీవితం లో అన్నీ చక్కగా అమరిపోతే, అంతకన్నా విసుగు, శూన్యం వేరే ఉండదు. కష్టాలు మిమ్మల్ని అదిమేసటప్పుడే మీలో చాకచక్యం మరింత పెరుగుతుంది. సావాళ్ళే మనిషికి పరిపూర్ణతను ఇస్తాయి.

- సద్గురు జగ్గివాసుదేవ్

Sent by Ashwin Kumar Dulluri 

No comments:

Post a Comment