Sunday 31 January 2016

హిందూ ధర్మం - 193 (గోవు ప్రాముఖ్యత - 5)

గోమూత్రానికున్న మరిన్ని ఔషధ లక్షణాలు తెలుసుకుందాం. మనం నిత్యం తీసుకునే ఆహారం పూర్తిగా జీర్ణం కాక చాలా కొద్ది భాగం (Residue) శరీరంలో మిగిలిపోతుంది. ఈ విషాలను ఆయుర్వేదం ఆమం (Toxins) అంటుంది. వ్యాయామం, యోగాసనాలు, సరైన జీవనవిధానం, అప్పుడప్పుడు ఉపవాసాల ద్వారా దాన్ని నిర్మూలించే ప్రయత్నం చేసే పద్ధతి సనాతన ధర్మం అందించింది. అయితే ఇలా మిగిలిపోయిన జీర్ణం కానీ పదార్ధాలు శరీరంలో విషాలుగా మారి, జబ్బులను కలిగిస్తాయి. జబ్బులను నయం చేసుకోవటానికి మందులను అధికంగా వాడినప్పుడు, రోగం తగ్గినా, ఆ మందులలోని కొంత భాగం వ్యర్ధ పదార్ధంగా దేహంలో మిగిలిపోతుంది. కాలక్రమంలో అది మురుగిపోయి, ఆమంగా మారి, కొత్త జబ్బులను కలిగిస్తుంది. మానవులకు ఈ ఆమం పెరిగిపోవడం వలన అనేకానేక వ్యాధులు వస్తాయి. శరీరంలో ఇతర మార్గాల ద్వారా ఏర్పడిన ఆమాన్ని తొలగించేందుకు ఔషధాలున్నాయి కానీ, ఔషధాల వలన ఏర్పడిన ఆమాన్ని తొలగించే మందులు ప్రపంచంలో లేవు. దీని విరుగుడు ఒక్క గోమూత్రం మాత్రమే. గోమూత్రాన్ని లేదా పంచగవ్యాన్ని 40 రోజుల పాటు ఉదయం పొరగడుపున నిర్ణీత పద్ధతిలో స్వీకరిస్తే, అది ఆమాన్ని హరించి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. అంతటి శక్తి గోమూత్రానికుంది.

శరీరం కఫ, వాత, పైత్యాలనే మూడు దోషాలతో ఏర్పడిందని ఆయుర్వేదం చెప్తోంది. వీటినే త్రిదోషాలు అంటారు. ఇవి సమంగా ఉంటేనే వ్యక్తి ఆరోగ్యంగా ఉంటాడు. ఈ 3 దోషాలు ఏది ఎక్కువైనా, అది రోగాలను కలిగిస్తుంది. జబ్బు ఒకటే కావచ్చు, కానీ దాన్ని కలిగించిన దోషం వేరై ఉండచ్చు. అందుకనే ఆయుర్వేదంలో బయటకు కనిపించే లక్షణాలను చూసి రోగానికి ఔషధమివ్వరు. మూలం ఏంటో కనుక్కునే ప్రయత్నం చేస్తారు. ఈ త్రిదోషాలకు జన్యుపరమైన సంబంధం కూడా ఉందని ఈ మధ్యనే సిసిఎంబి వారి పరిశోధనలో తేలింది. వేళ ఏళ్ళుగా ఆయుర్వేదం చెప్తున్న త్రిదోషాలను ఇన్నాళ్ళు అంగీకరించని ప్రపంచం ఈ పరిశోధనతో సత్యమని ఒప్పుకుని తీరాల్సి ఉంటుంది. ఈ త్రిదోషాలను సమంగా ఉంచే లక్షణం గోమూత్రానికుంది.  గోమూత్రాన్ని స్వీకరిస్తే కఫ, వాత, పైత్యాలు అదుపులోకి వస్తాయి.

గోమూత్రం కాలేయ పని తీరును మెరుగుపరుస్తుంది. కాలేయం (Liver) బాగుంటే శుద్ధమైన రక్తం ఏర్పడుతుంది. ఫలితంగా రోగనిరోధశక్తి పెరుగుతుంది.

శరీరానికి శక్తినిచ్చే కొన్ని సూక్ష్మపోషకాలు (micro-nutrients) దేహంలో ఉంటాయి. ఇవి మూత్రవిసర్జన ద్వారా బయటకు వెళ్ళిపోతాయి. వీటిని శరీరం అధికంగా కోల్పోతే వృద్ధాప్యలక్షణాలు త్వరగా వస్తాయి. గోమూత్రంలో ఈ సూక్ష్మపోషకాలను భర్తీ చేసే అనేక తత్త్వాలు ఉండడం చేత, దాన్ని స్వీకరించినవారికి ఆరోగ్యం సిద్ధిస్తుంది. వృద్ధాప్య లక్షణాలు త్వరగా రావు.

మానసిక ఆందోళన నాడీవ్యవస్థను ప్రభావితం చేస్తుంది. గోమూత్రాన్ని హృద్యమని, మేధ్యమని అన్నారు. అనగా అది మెదడుకు, గుండెకు శక్తినిస్తుందని అర్దం. గోమూత్రం మెదడు, గుండెకు ఆందోళన వలన నష్టం కలగకుండా రక్షిస్తుంది. ఆయా భాగాలను రోగాల నుంచి కాపాడుతుంది.

 Source: https://cowurinebenefit.wordpress.com/2012/10/06/cow-urine-benefits/

To be continued ....................

No comments:

Post a Comment