Sunday 14 February 2016

హిందూ ధర్మం - 195 (గోవు ప్రాముఖ్యత - 7)

గోవు గురించి ఎంత చెప్పుకున్నా, చెప్పుకోవాల్సింది ఇంకా మిగిలే ఉంటుంది. అన్ని విశిష్టతలున్నాయి గోమాతకు. అయితే అసలు విషయం పక్కదారి పట్టకూడదు కాబట్టి ఇది ఇక్కడకు ఆపేద్దాం. తర్వాత మళ్ళీ తెలుసుకుందాం. అయితే గో సంరక్షణ అన్నప్పుడు అందులో వృషభాలను కూడా కలపవలసి ఉంటుంది. ఎందుకంటే ఆవు లేకపోతే ఎద్దు లేదు, ఎద్దు లేకపోతే ఆవు లేదు. ఆ రెండు లేని వ్యవసాయం నిరర్ధకం. ఆవుకు ఎంత ప్రాధాన్యం ఉందో, ఎద్దుకు కూడా అంతే ప్రాధాన్యం ఉంది. గోమాత పుత్రుడే వృషభరాజు. 'దేశీఆవుకు పుట్టిన దూడ ఆడదైతే ఆవు అవుతుంది, మగదైతే ఎద్దు అవుతుంది. కేవలం నాటావు కోడేదూడ మాత్రమే ఎద్దు అవుతుంది. జెర్సీకి పుట్టిన కోడేదూడ ఎద్దు అవ్వదు, ఎందుకంటే దానికి నూపురం ఉండదు' అన్నారు రాజీవ్ దీక్షిత్. ప్రపంచంలోనే అత్యంత సుందరమైన జీవి ఎద్దు. ఎద్దుకు ఉండే నూపురమే నాగలిని, బండ్లను లాగటానికి ఉపయోగపడుతుంది. చెరుకు, నూనె గానుగలను లాగటానికి ఉపయోగపడుతుంది. ఆ నూపురమే లేకపోతే దాని ఉపయోగమేమీ ఉండదు.


ఈశ్వరసృష్టిలో ఇది ఒక అద్భుతం. మానవుడి ఆకలిని తీర్చటానికి, ఆహారాన్ని పండిచటానికి అవసరమైన ఎరువులను, పంటకు వచ్చే పురుగును నివారించే ఔషధాలను ఆవు అందిస్తే, ఎద్దు పొలంలో దుక్కుదున్ని రైతుకు సాయం చేస్తుంది. ఎంతటి బరువునైనా తన మీద మోసి, పొలం దున్నుతుంది. రైతు కుంటుంబంలో కలిసిపోతుంది. అవి చేసే మేలు మరవలేకేనే, వాటి కోసం ఓ పండగ వచ్చింది. అదే కనుమ. కనుమ జంతువులకు కృతజ్ఞత తెలుపుకునే పండగ. అచ్చమైన వ్యవసాయపండుగ.

ఎద్దు వ్యవసాయ క్షేత్రంలో కాళ్ళు పెట్టినప్పుడు దాని గిట్టల నుండి అమృతబిందువులు రాలుతాయని, అందువలన ఎద్దు తిరిగిన పొలం పంటను ఆహారంగా స్వీకరించినవారికి నేత్రవ్యాధులు రావని వేదం చెప్తోంది. ఈ విషయాన్ని అనేకమార్లు చాగాంటి కోటేశ్వరరావుగారు తమ ప్రవచనాల్లో ప్రస్తావించారు. మహానారయణోపనిషత్తు ఇత్యాదులు కూడా రైతులకు సందేశం ఇస్తూ 'ఓ భూమిపుత్రుడా! ఈ భూమి నీ తల్లి, ఈమెను విషములతో కలుషితం చేయ్యకు. గోమయం, గోపంచకాలతో శుద్ధి చేయు, సారాన్ని పెంచి ఆమెను పూజించు' అని రైతుకు సందేశం ఇస్తున్నది. భూమి కలుషితమవడంలో ట్రాక్టర్ల పాత్ర కూడా ఉంది. ట్రాక్టర్లు తిరిగిన భూమి యొక్క సారం త్వరగా క్షీణించిపోతుంది. ప్రముఖ శాస్త్రవేత్త ఐన్‌స్టీన్ కూడా ఈ విషయాన్ని చెప్తూ, ట్రాక్టర్ల ద్వారా వ్యవసాయం చేస్తున్నందున రాబోయే 400 ఏళ్ళలో అమెరికాలో భూసారం పూర్తి నశిస్తుందని చెప్పారు. ట్రాక్టర్లతో దున్నే భూమిలో 1000 ఏళ్ళ తర్వాత పచ్చి గడ్డిపరక కూడా మొలవదు. భారతదేశంలో వేళ్ళ ఏళ్ళ నుంచి వ్యవసాయం జరుగుతున్నా, భూసారం క్షీణించకుండా ఉండటానికి కారణం పొలంలో ఎడ్లను ఉపయోగించటమే.

ట్రాక్టర్లతో దున్నినప్పుడు నాగలి అవసరమైన లోతు కంటే ఎక్కువలోతుకు వెళ్ళి, భూమిలోని శత్రుజీవాలతో పాటు మిత్రజీవాలను సైతం నాశనం చేస్తుంది. ఆ కారణంగా భూమి నిస్సారమవుతుంది. అప్పుడు నీరు కూడా ఎక్కువగా అవసరమవుతుంది. అమెరికాలో ఈ పద్ధతి వల్లనే వేల ఎకరాల భూమి నిస్సారమైపోయింది. ట్రాక్టర్ల ఉపయోగం వలన వాయుమండలం కూడా కలుషితమవుతుంది. ఇవన్నీ వనరుల దుర్వినియోగానికి కారణమవుతున్నాయి. ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న అతి పెద్ద సమస్య భూతాపం (Global Warming). దీనికి గ్రీన్ హౌస్ వాయువులు కారణం. ఇప్పుడు అనుసరిస్తున్న ఆధునిక వ్యవసాయ పద్ధతుల వలన భూతపానికి కారణమయ్యే గ్రీన్ హౌస్ వాయువుల్లో మూడింట ఒక వంతు (One-third) వ్యవసాయ క్షేత్రాల నుంచే వెలువడుతుండడం బాధాకరమైన విషయం. వీటిన్నిటికి పరిష్కారం వ్యవసాయంలో ఎద్దును ఉపయోగించటమే. అయితే ఇది భారతీయులకు కొత్త విషయం కాదు.

పాడిపంటలు అనే మాట మనకు భాషలో ఎప్పటి నుంచో ఉంది. పాడి అంటే పశువులు. అందులో ఎడ్లు కూడా వస్తాయి. దున్నడం దగ్గరి నుంచి కోసుకొచ్చిన పంటను ఇంటికి చేర్చడంలో, దాన్ని అంగడికి తీసుకువెళ్ళడంలో ఎద్దు పాత్ర ఉంది. అది రైతుకు, వ్యవసాయానికి వెన్నుముక వంటిది.      

'భగవంతుడు భారతదేశానికిచ్చిన వరం ఆవు అన్నారు మహర్షి వాగ్భటుడు. ఎడ్లలో కూడా రెండు రకాలున్నాయి. తక్కువ పాలిచ్చే ఆవుకు పుట్టినవి చాలా బలం కలిగి ఉంటాయి. ఇది నేను ప్రయోగాత్మకంగా చేసి చూశాను. 3 టన్నుల బరువును ఎలాంటి శ్రమ లేకుండా, ఎక్కడా ఆగకుండా 40 కిలోమీటర్లు లాగగలుగుతాయి. వాటితో పోటీ పడలేము. అదే ఎక్కువ పాలిచ్చే గోసంతతి ఎడ్లు కూడా 3 టన్నుల బరువును లాగగలిగినా, మధ్యలో అక్కడక్కడా ఆగి, విశ్రాంతి తీసుకుంటాయి. ముందు చెప్పిన వాటికంటే కాస్త నెమ్మదిగా పరిగెడతాయి. అయినప్పటి ప్రతి జాతికి దాని విశేషాలు, ప్రత్యేకతలు ఉన్నాయి' అని శ్రీ రాజీవ్ దీక్షిత్ గారు ఒక ఉపన్యాసంలో వెళ్ళడించారు.

To be continued ................

Sources -
https://www.youtube.com/watch?v=Xp3o-6OQBAY
https://www.youtube.com/watch?v=yvR-SQ90tPI
http://www.nature.com/news/one-third-of-our-greenhouse-gas-emissions-come-from-agriculture-1.11708

1 comment:

  1. శ్రీ గురుభ్యోనమః !!

    ReplyDelete