Sunday 20 March 2016

హిందూ ధర్మం - 200 (జంతుసంరక్షణ - విమర్శల ఖండన, ధార్మికులకు సూచనలు)

మిత్రస్యమా చక్షుషా సర్వాని భూతాని సమీక్షంతం|
మిత్రస్యమా చక్షుషా సర్వాని భూతాని సమీక్షే
మిత్రస్య చక్షుషా సమీక్షామహే|| - యజుర్వేదం 26-18

అన్ని జీవులు నన్ను తమ మిత్రుడి వలే చూచుగాక. నేను కూడా వాటిని నా మిత్రులవలే చూచుదునుగాక. ఓ భగవంతుడా! అందరం (సకల జీవరాసి) పరస్పరం స్నేహ భావంతో మెలిగేలా పరిస్థితులను ఏర్పరుచు.

ఈ విధంగా చెప్పిన వేదం, తదనుగుణంగా సకల జీవరాశుల పట్ల స్నేహ భావంతో మెలిగిన ఋషులు జంతువులను బలివ్వమని వేదంలో చెప్తారా? ఋష్యాశ్రమాల్లో వైరి భావం కలిగిన జీవులు కూడా స్నేహభావంతో మెలిగాయి. ప్రకృతిని తనకంటే నీచమనదిగా కాక, తనతో సమానమైనదిగా దర్శించమనే వైదిక సంస్కృతి చెప్పింది. 'ఆత్మవత్ సత్వభూతేషు' అని పునఃపునః చెప్పింది. అటువంటి ధర్మం ఆకలి కోసం, రుచి కోసం జంతువులను చంపమని చెప్తుందా?

గత భాగంలో వేదంలో జంతుసంరక్షణ గురించి చెప్పుకున్నాం. హిందువుల్లో కొందరు అర్దం చేసుకోవలసిన విషయం ఒకటి ఉంది. ధర్మం అంటే కేవలం గోసంరక్షణ మాత్రమే కాదు. గోవుతో పాటు సకల జీవరాశి క్షేమంగా ఉండాలి. గోవుకు ప్రాముఖ్యం ఇచ్చినా, మిగితా జీవరాశి కూడా భగవద్ సృష్టిలో భాగమే. వాటి పట్ల కూడా ప్రేమ, కరుణా, వాత్సల్యం కలిగి ఉండాలి. అష్టాంగ యోగంలో మొదటి మెట్టైన యమంలోనే అహింసను ప్రస్తావించారు. యమాలు అహింసతోనే మొదలైతాయి. మాకు మిగితా వాటి గురించి అవసరంలేదు, కేవలం గోవు గురించి మాట్లాడతాం అనడం వేదం ప్రకారం తప్పు.

'ఏ వ్యక్తైనా ప్రేమ, కరుణా మొదలైన గుణాలను ముందు తాను అలవరచుకోకుండా, భగవంతుడు తన పట్ల కరుణ కలిగి ఉండాలని భావన చేసి పూజ, జపం, యోగం మొదలైనవి ఏవి చేసినా, అవి నిష్ఫలమే అవుతాయన్న మాట సత్యం. వ్యక్తికి ఇతరుల పట్ల ప్రేమ, కరుణ, జాలి ఇత్యాది గుణాలు లేకపోతే, తన పట్ల భగవంతుని దయ ఉండాలని ఆశించే అధికారం అతనికి ఎక్కడుంది? ఇతరులకు చేసే సేవ, ఆధ్యాత్మిక ఉద్ధతి కోసం పూజాది సంస్కారాలు, రెండూ ఎలా చేయాలంటే, అవి నిన్ను, అవతలి వ్యక్తిని ......... ఇద్దరిని పవిత్రుల్ని చేయాలి' అని నడిచే దేవుడుగా పేరుగాంచిన అపరశంకరులు, కంచి మహాస్వామి శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి చెప్పిన మాట. కాబట్టి కేవలం గోవు గురించి మాత్రమే మాట్లాడే హిందువులు ఈ విషయాన్ని ఆలోచించాలి. వేదం ప్రమాణంగా తీసుకుని సకల జీవుల శ్రేయస్సుకై పాటుపడాలి. ప్రతి సాధువు, గురువు, సన్యాసి సకల జీవరాశుల క్షేమం కోసమే పాటుపడ్డారు.

సమాజంలో ఒక వర్గం ఉంది. వారిని ఏమనాలో నాకు తెలియదు. కమ్యూనిష్టులు, మతమార్పిడి మూర్ఖులు, కుహనామేధావులు, ఇలా అనేకులు ఈ వర్గంలోకి వస్తారు. వీళ్ళు మూర్ఖులంటే మూర్ఖులు. వారికి ధర్మాన్ని వ్యతిరేకించడమే పని. వీరంతా అప్పుడప్పుడు పర్యావరణ పరిరక్షణ గురించి మాట్లాడుతారు. కానీ గోవధకు వచ్చేసరికి వేదంలో గోవధ ఉన్నది అంటారు, గోవధ నిషేధం తప్పంటారు. అలా కాదు, వేదంలో గోవధ లేదు అంటే, గోసంరక్షణ ఉందంటే ........... చూశారా! వేదానికి పక్షపాతం. వేదం కేవలం గో సంరక్షణ గురించి మాత్రమే మాట్లాడింది, మిగితా జీవులను చిన్నచూపు చూసిందంటారు. జాతరల సమయంలో జంతుబలి మూఢనమ్మకం, చూశారా! మతాల కారణంగా జంతువులు ఎంత బాధపడుతున్నాయో అంటారు. అది కూడా కేవలం హిందూ ధర్మం కారణంగానే. అధర్మాల జోలికి వెళ్ళరు.  వీరేదో పెద్ద జంతు ప్రేమికుల మాదిరి భావించుకుంటారు. కానీ వారి జీవితాల్లో మాంసం లేకపోతే ముద్ద దిగదు. అదేంటో మరి? వీరి భావజాలం ఏంటో వీరికే తెలియదు. తాము దేని మీద పోరాటం చేస్తున్నామో కూడా స్పష్టంగా తెలియని (Clarity లేని) అయ్యోమయ్యం (Confused) గుంపు ఇది. వారందరికి ఇది కనువిప్పు కావాలి. ఇప్పుడు చర్చించుకున్న విషయం రెండు విమర్శలను తిప్పికొడుతుంది. ఒకటి వేదం గోవు పట్ల పక్షపాతం ప్రకటించిందని చెప్పడం, రెండవది వేదంలో గోవధ ఉంది అనడం. జంతువధనే వేదం వ్యతిరేకించినప్పుడు ఇక గోవధ ఎక్కడ ఉంటుంది. ఎలా ఉంటుంది?

ఇప్పుడు ధర్మద్వేషుల నుంచి ఇంకొక విమర్శ వస్తుంది. అన్ని జీవులను కాపాడమని వేదం చెప్పినప్పుడు కేవలం గో వధ నిర్మూలనకే చట్టం ఎందుకు? అన్ని రకాల హింసను ఆపివేయుటకు ధార్మికులు పోరాటం చేయచ్చు కదా అని .........
వేదం సకల జీవరాశి యొక్క క్షేమం కోరింది. భారతదేశంలో జంతు సంరక్షణకు వన్యప్రాణి సంరక్షణ చట్టం ఉంది. దాని ప్రకారం జంతువులను చంపిన వారికి కారాగార శిక్ష విధిస్తారు. అయితే నెమలి, పులి కూడా దీని చట్రం క్రిందికే రాగా, వాటిని జాతీయ జంతువులుగా ప్రకటించడం మూలంగా వాటికి కొంత ప్రత్యేకత ఉంది. అలానే గోవుకు కూడా. సకలజీవరాశుల క్షేమం కోరిన వేదమే గోవును అత్యంత ప్రధానమైనదిగా చెప్పింది. కనుక ముందు గోవును కాపాడమని హిందువుల ఆకాంక్ష. ధార్మికుల వలె మీకు కూడా అన్ని జీవుల పట్ల మమకారం ఉందంటున్నారు కనుక ముందు గోవధ నిషేధంతో ప్రారంభించి, అన్ని రకాల జీవహింసను నిషేధిద్దాం, కలిసి రండి అని మా ధార్మికుల పిలుపు. ఒక్క అడుగు ముందుకు పడితే, ఆ తర్వాత పెద్ద మార్పే సంభవిస్తుంది. అసలు అడుగే వేయొద్దంటే ఎలా? కనుక ఇలాంటి విమర్శలు చేస్తే మీ వాదన నిలవకపోవటమే కాదు, మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవలసిన అవసరం వస్తుందని గ్రహించండి.

To be continued ..............

No comments:

Post a Comment