Tuesday 12 April 2016

మమ్మల్ని స్వదేశీయులుగా గుర్తించండి అంటున్న ఈశాన్యభారతీయులు



వీళ్ళను చూడగానే వీళ్ళు ఏ నేపాల్ వాళ్ళో, చైనా వాళ్ళో అనుకుంటారు. కానీ కాదు. వీళ్ళు కూడా భారతీయులే. ఇదే భూభాగంలో అనాదికాలం నుంచి ఉంటున్న స్వజాతీయులే. వీళ్ళు ఈశాన్య భారతానికి చెందిన వాళ్ళు. వీళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్పడానికి ఒక కారణం ఉంది. స్వదేశంలో కూడా విదేశీయులలాగా బ్రతకీడుస్తున్న దుస్థితి వీళ్ళది. వాళ్ళ ప్రాంతంలో అభివృద్ధి తక్కువ. అందువల్ల వీళ్ళు చదువుల కోసం ధిల్లీ మొదలైన అనేక ప్రాంతాలకు వచ్చినప్పుడు వీళ్ళు ఎదురుకునే వివక్ష అంతాఇంతా కాదు.

వీళ్ళు రోడ్ల మీద నడుస్తుంటే ఆకతాయిలు వీళ్ళను చీనీలను, నేపాలీలని ఆటపట్టిస్తారు. స్వదేశంలో కూడా విదేశీయులుగా గుర్తించబడి మనోవ్యధకు లోనవుతున్నారు మన ఈశాన్య భారతీయ సోదరులు.
ఈశాన్య భారతానికి చెందిన అమ్మాయిలు విద్య కోసం ఉత్తరభారతానికి వచ్చినప్పుడు, వాళ్ళకు హాస్టల్స్‌లో రూములు ఇవ్వరట. అదేమిటంటే మీరంత మంచి వాళ్ళు కాదు, మీకు అక్కర్లేని అలవాట్లు ఉంటాయంటూ ముఖం మీదే చెప్పి పంపించేస్తారు. ఈ అమ్మాయిలను కేవలం కామభావంతోనే చూస్తూ, వీళ్ళను వేశ్యలుగా ముద్రవేస్తూ ఆనందాన్ని పొందుతారు కొందరు. ఇది ఈశాన్య భారతీయుల ఆత్మగౌరవానికి ఎంత భంగకరం చెప్పండి. అటవీ ప్రాంతం ఎక్కువన్నంత మాత్రాన, గిరిజనులైనంత మాత్రాన, వస్త్ర ధారణ ఆధునికంగా ఉండడం చేత వీళ్ళను అలా అపహాస్యం చేయవచ్చా? కానీ చదువుకున్న మూర్ఖులే ఈ విధంగా వీరిని అవమానిస్తున్నారు.
వీళ్ళు కుక్కలను తింటారని, మనుష్యులను ఎత్తుకుపోతారని అనేక ప్రచారాలను కల్పిస్తున్నారు కొందరు వెధవలు.
వీళ్ళకు ఒక సంస్కృతీ సంప్రదాయం లేదని, ఎలా పడితే అలా బ్రతుకుతారని నిందారోపణలు చేస్తారు ఇంకొందరు.

ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా, వీళ్ళు ఎంతగానో వివక్ష ఎదురుకుంటున్నారు. ఇది ఎంతో బాధాకరం. అయితే వీళ్ళు ఎదురుకుంటున్న వివక్షను తమ రాజకీయ వికృత క్రీడకు వాడుకోవాలనుకుంటున్న కమ్యూనిష్టులు, ఈశాన్య భారతం మీద కన్నేసిన చైనా, క్రైస్తవ మిషనరీలు సమస్యను మరింత జఠిలం చేస్తున్నాయి. దీనికి తోడు దేశంలో విచ్చినకర సాహిత్యాన్ని ప్రోత్సహించే మేధావులు ఉండనే ఉన్నారు.

స్వదేశంలో చైనీయులుగా ఆత్మ గౌరవం లేకుండా బ్రతికేకంటే చైనాలో కలిసిపోయి, ఆత్మ గౌరవంతో బ్రతకమని చైనా తన ఏంజంట్ల ద్వారా అరుణాచల్ ప్రదేశ్ మొదలైన ఈశాన్య రాష్ట్రాల్లో బాగా ప్రచారం చేయిస్తోంది. అదేమీ వీళ్ళ మీద ప్రేమతో చేస్తున్న ప్రచారం కాదు. ఇక్కడున్న సహజ సంపదను దోచుకునే కుట్ర అది. చైనా కుట్రను పారించడంలో కమ్యూనిష్టులు చాలా ముందుంటున్నారు. రాబోయే 15 ఏళ్ళలో #చైనా ఈశాన్య భారతాన్ని కబళించాలని పన్నాగం పన్ని, దానికి అనుగుణంగా ముందుకు వెళుతోంది. మేలుకో భారతీయుడా!

ఇక్కడున్నది అంతా గిరిజనులే, అమాయకులే. వీరిని మతమార్పిడి చేసి, ఆసియాలో ఈశాన్య భారతాన్ని మరో వాటికన్ చేసి, ప్రత్యేక దేశం చేసి, తద్వారా ఆసియాలో క్రైస్తవాన్ని ప్రచారం చేసుకోవాలనుకుంటున్నాయి మిషనరీలు. నాగాల్యాండ్‌లో 100 ఏళ్ళ క్రితం మిషనరీలు అడుగుపెట్టగా, ఇప్పుడు ఆ రాష్ట్రలో 95% క్రైస్తవులే ఉన్నారంటే పరిస్థితిని అర్దం చేసుకోవచ్చు. ఈ మతమార్పిడులకు తోడు, పరలోక క్రీస్తు రాజ్యం రావాలంటే పాపపు భారతదేశం నుంచి వైదొలగాలని వీరికి భోధనలు చేస్తున్నారు. మేలుకో భారతీయుడా!

వాక్ స్వాతంత్రం, హక్కులు, ఉద్యమాలు, వివక్షలు, అసలు భారతదేశమే లేదు, రాజ్యాంగం పేరుతో విభిన్న వర్గాల వారిని బలవంతంగా కలిపి ఉంచారంటూ గోల చేసేవారు, తీవ్రవాదులకు మద్ధతు పలికేవారు, వారికి సంఘీభావంగా ర్యాలీలు తీసేవారు, దొంగ రచయితలు, కుహనా మానవతావాదులు, దేశద్రోహులు ఈశాన్య భారతంలో రెచ్చగొట్టే ప్రసంగాలను చేస్తూ వీరిని భారతదేశం నుంచి వేరు చేయాలని చూస్తున్నారు. వీరి మీద కొందరు చేసిన దాడులను భూతద్దంలో చూపించి, వీరిని #భారతమాత నుంచి వేరు చేయాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. మేలుకో #భారతీయుడా!

60 ఏళ్ళుగా వీళ్ళను కేంద్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోయినా, కేంద్రంలో కొత్తగా మోదీ ప్రభుత్వం ఏర్పడ్డాక పరిస్థితిలో చాలా మార్పు కనిపిస్తోంది. అయినప్పటికి సగటు ఈశాన్య భారతీయుడు తమ గురించి మిగితా భారతీయులు తెలుసుకోవాలని, తమను కూడా భారతీయులుగానే గుర్తించాలని కోరుకుంటున్నారు. వారిక్కూడా దేశం మీద ప్రేమ ఉంది. సైన్యంలో కూడా ఈశాన్య రాష్ట్రాల వారున్నారు.

మీకెప్పుడైనా ఇటువంటి ముఖ కవళికలున్నవారు కనిపిస్తే, వారిని ప్రత్యేకంగా చూడకండి. వారిలో ప్రత్యేక అస్థిత్వవాదాన్ని సృష్టించకండి. వారిని కూడా ప్రేమతో కలుపుకోండి. వారిని మన నుంచి వేరు చేసే అవకాశం ఎవరికి కల్పించకండి,

జై హింద్ 

1 comment: