Sunday 24 April 2016

హిందూ ధర్మం - 205 (అశ్వమేధయాగంలో అశ్వబలి లేదు - 1)

వక్రీకరణ - అశ్వమేధ యాగంలో అశ్వాన్ని బలి ఇస్తారు.

వాస్తవం -  అశ్వమేధయాగంలో గుఱ్ఱాన్ని ఉపయోగించే మాట నిజం కానీ బలి మాత్రం ఇవ్వరు. అసలు అశ్వమేధ యొక్క ఉద్దేశ్యం జంతుబలి కాదు, దేశ సంరక్షణ, సరిహద్దుల పటిష్టత అని ఆర్యసమాజ స్థాపకులు మహర్షి స్వామి దయానందులు వేదోక్తంగా నిరూపించారు.

రాష్ట్రంవా అశ్వమేధః (దేశమే అశ్వమేధం. (దేశసంరక్షణ కొరకు చేసేది)) అని శతపధ బ్రాహ్మణం 13.16.3 చెప్తున్నది.
ఇప్పుడు మనం అనుకుంటున్న సమాఖ్య వ్యవస్థ (Federalism) వేదంలో ఉంది. భారతదేశం ఒక దేశంగా ఏర్పడింది 1947 తర్వాత 1950లో అమల్లోకి వచ్చిన రాజ్యాంగం ద్వారా కాదు. ఈ దేశానికి ఎన్నో యుగాలు చరిత్ర ఉంది. అనేక మన్వతరాల నుంచి, కల్పాల నుంచి భారతదేశం ఏకఖడంగా ఉంది. ఎందరో రాజులు ఈ దేశాన్ని పరిపాలించారు. అనేకులు చక్రవర్తులై, సామ్రాట్టులై ప్రపంచాన్ని భారతదేశం పాదల చెంతకు తీసుకువచ్చారు. ఇప్పుడున్న వ్యవస్థలో దేశానికి ఒక ప్రధాని, రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు ఉన్నట్టుగానే పూర్వం కూడా అఖండ భారతానికి ఒక చక్రవర్తి, ఆయన క్రింద అనేక సామంత రాజులు చిన్న చిన్న రాజ్యాలను పాలిస్తూ ఉండేవారు. ఇప్పటిలాగే అప్పుడు కూడా రాజ్యంగం ఉన్నది. అప్పట్లో అది ధర్మంగా ఆధారంగా, శృతిని, స్మృతులను అనుసరించి ఉండేది. నిజానికి ధర్మమే దైవం ఏర్పరిచిన రాజ్యాంగం. అప్పుడు దాన్నే అనుసరించేవారు. దానికి ఎవరూ అతీతులు కారు, మార్పు చేసే అవకాశం(యుగధర్మం తప్పించి తరచు మార్పు చేసే అవకాశం) కూడా ఉండేది కాదు. ఎప్పుడైనా సామంత రాజులు గర్విష్టులై, చక్రవర్తికి కప్పం కట్టకుండా, తన రాజ్యాన్ని ఈ దేశం నుంచి వేరు చేయాలనే చర్యలకు పాల్పడినప్పుడు చక్రవర్తి అశ్వమేధ యాగం చేసేవారు. అందులో యాగ అశ్వానికి ఇది అశ్వమేధ యాగ పశువు అని కనిపించే విధంగా ఒక పతాకం (జెండా) కట్టి, దాని వెనుక సైన్యాన్ని కాపలాగా పంపించేవారు. ఆ గుర్రం దేశం మొత్తం సంచారం చేస్తుంది, దాన్ని ఎవరు అడ్డుకోరు. అడ్డుకుని, బంధించినవారు ప్రభువుతో యుద్ధం చేయాల్సి ఉంటుంది. దాన్ని అడ్డుకోవడమంటే దేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను ప్రశ్నించడమే. ఓడితే కప్పంతో బాటూ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. అలా ఆ గుర్రం దేశం మొత్తం సంచారం చేసి, తిరిగి యాగస్థలికి రావడంతో యాగం ముగుస్తుంది. అందులో అశ్వాన్ని బలి ఇవ్వడమేమీ ఉండదు. ఇందులో అశ్వమే ప్రధానం కానుక, ఆ గుర్రాన్ని యాగపశువు అన్నారు కానీ, దాన్ని బలి ఇస్తారని కాదు. కొన్ని యగాల్లో యజమానే యాగపశువు అని శాస్త్రం చెప్తోంది. అంటే యజమానిని బలి ఇస్తున్నారా? లేదు కదా. దేశంలో ఏర్పడ్డ చీలికను తొలగించి, సామంత రాజులందరూ ధర్మం ఆధారంగా ఏర్పడిన విశాల రాజ్యానికి కట్టుబడి ఉంటామని చెప్పడమే అశ్వమేధం యొక్క ప్రధాన ప్రయోజనం. ఇది దేశంలో అసంతృప్తులను నశింపజేసి, సరిహద్దులను పటిష్టం చేస్తుంది. అంతర్గత ఐక్యతను కాపాడుతుంది.

ఈ అశ్వమేధ యాగం ఈ అఖండభారతంలో ఎన్నో సార్లు జరిగింది. ద్వాపరయుగంలో ధర్మరాజు ప్రభువుగా కృష్ణుని సంకల్పంతో అఖండభారతం 18 రాష్ట్రాలతో, ఒకే రాజ్యాంగంతో, సమాఖ్య వ్యవస్థగా అవతరించింది. అప్పటి నుంచి అధర్మాన్ని అనుసరించారని ఈ పవిత్ర భూమి నుంచి వెలివేయబడ్డవారు తిరిగి ఈ దేశం మీద దండెత్తినప్పుడు, తమ మతాన్ని ఈ భూమిలో వ్యాపింపజేసి, అంతర్గతంగా విబేధాలను సృష్టించి, దేశాన్ని బలహీనం చేయాలని చూసిన ప్రతిసారి ఈ దేశపు రాజులు అశ్వమేధం నిర్వహించారు. కలియుగంలో కూడా క్రీ.శ. 7 వ శతాబ్దం వరకు, భారతదేశం కేంద్రీకృతవ్యవస్థ పతనమయ్యేవరకు ఈ దేశంలో అశ్వమేధాలు నిర్వహించారట. భౌద్ధం ప్రబలి, కొన్ని రాజ్యాలను అఖండభారతవని నుంచి వేరు చేయాలనుకున్నప్పుడు, హిందూ ప్రభువులు, దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని దీన్ని నిర్వహించి, దేశ సరిహద్దులను పటిష్టం చేశారు.

ఒకనాడు ఇప్పటి పర్షియా, ఇరాన్, మెసపుటామియా, ఇరాఖ్ వరకు భరతవర్షం భారతదేశపు రాజుల ఆధీనంలో, ఈ భారతభూమిలో భాగంగా ఉండేది. అటుపక్క మధ్య ఆసియా లోని కశ్యప సముద్రం (కాస్పియన్ సముద్రం) వరకు వ్యాపించి ఉండేది. ఒకప్పుడు హిందువులైన పారశీకులు అధర్మాన్ని పాటించడం వలన దేశ బహిష్కారానికి లోనుకాగా, సరిహద్దుల్లో తిష్టవేసి, ఈ సంస్కృతి మీద ద్వేషంతో మన దేశంలో తమ మతాన్ని ప్రచారం చేసి, కొన్ని ప్రాంతాలను దేశం నుంచి వేరు చేశారు. అటు తర్వాత బౌద్ధులు. అంతర్గతంగా, ఈ దేశంలో ఉంటూనే, ఈ ధర్మం మీద ద్వేష భావనతో, కొన్ని రాజ్యాలను అఖండభారతం నుంచి వేరు చేశారు. (ఆ కారణంగానే అఖండభారతం అనేక ముక్కలైంది. అటు తర్వాతా ఆయా ప్రాంతాల మీద ఇతర మతాలు దండెత్తడం వలన, బౌద్ధం లాంటివి కూడా అక్కడ నశించాయి.) వీరు ధర్మానికి వ్యతిరేకులు కనుక, అశ్వమేధం లాంటి యాగాలు చేస్తే, తమకు రాజకీయ ప్రాభవం దక్కదని, యజ్ఞయాగాది క్రతువులను నిరసించారు. ఆ ప్రభావంతో ఈ దేశంలో అనేక రాజులు సరిహద్దులను పటిష్టం చేసే ఇటువంటి యాగాలను విస్మరించి, అహింస పేరుతో మౌనం వహించి, అఖండభారత విచ్ఛిన్నానికి కారుకులయ్యారు. అయినప్పటికి ధర్మజ్వాల నశించలేదు. క్రీ.పూ. 7 వ శతాబ్దంలో వచ్చిన ఆదిశంకరుల ప్రభావం ఈ దేశంపై 1500 సంవత్సరాలు ఉన్నది. ఆయన ధర్మానికి కొత్త ఊపిరిలూదారు. అందుచేత విక్రమాదిత్యుడు, శాలివాహానుడు మొదలైన రాజులు భరతవర్షం కోల్పోయిన భాగాలను తిరిగి ఈ దేశంలో విలీనం చేశారు.

To be continued ............

No comments:

Post a Comment