Saturday 30 April 2016

నాస్తికుడు ఆస్తికుడయ్యాడు

సనాతన ధర్మానికి చెందిన గురువులను నిందించడం, చిన్నచూపు చూడడం, విమర్శించడం చాలా గొప్పగా భావిస్తారు కొందరు. ఇందులో ప్రధానంగా హేతువాదులమని చెప్పుకునే నాస్తికులు ముందుంటారు. ఈ మధ్యే జరిగిన ఓ సంఘటన చెప్తాను. నా మిత్రుడు ఒకతను నాస్తికుడు, భగవంతుని విశ్వసించడు, కానీ సానుకూలాంశం ఏమిటంటే అతనికి భారతీయ సంస్కృతి మీద, గురువుల మీద కాస్త గౌరవం ఉంది. నిజానికి అతను నాతో ఎప్పుడు మాట్లాడే అవకాశం రాకపోయినా, అతన్ని గమనించేవాణ్ణి. నేనే కాదు, నాతో పాటు పని చేస్తున్న వ్యక్తులంతా అతడిని గమనించేవారు. మోక్షం కోరి ఆధ్యాత్మిక సాధనలు చేసేవారు అనేకులు కనిపిస్తారు, కానీ ఈ వ్యక్తి కొన్ని లౌకిక విషయాల కోసం శక్తిని సంపాదించడానికి ఆధ్యాత్మిక సాధన చేసేవాడు. ఈశ్వరుని యందు నమ్మకం ఉంచి, గురువుల వ్యాక్యాల యందు శ్రద్ధతో సాధన చేస్తే అది త్వరగా ఫలిస్తుంది, అది లేని కారణంగా సాధారణంగా సాధన ఫలించే సమయానికంటే అధికసమయమే ఈ వ్యక్తికి పట్టింది. దానికి తోడు ఇతడు పూర్తిగా గురువులు చెప్పినట్టుగా కాక, తనకు తోచినవి చెప్పి, సమర్ధించుకునేవాడు. తరచు గురువులను విమర్శించేవాడు, వాళ్ళు ఏవేవో చెప్తారని, అతిశయోక్తులు వాడతారని, భయపెడతారని ఆత్మజ్ఞానులను సైతం విమర్శించేవాడు. ఈ విమర్శలు తట్టుకోలేకే అతణ్ణి చాలామంది విడిచి వెళ్ళిపోయారు. నిప్పు తెలిసి ముట్టుకున్నా, తెలియక ముట్టుకున్నా కాళుతుంది. అట్లాగే చేసిన ప్రతి కర్మకు ఫలితం వచ్చే తీరుతుంది. అదే విధంగా ఇతనికి కూడా ఆలస్యంగా కలిగినా, ఒక దివ్యానుభూతి కలిగింది. దట్టంగా, కారు చీకట్ల వలే వ్యాపించిన నాస్తికం ఈశ్వరానుగ్రహం అనే సూర్యుని ముందు అంతరించింది. అతను ఇప్పుడు పూర్తి ఆశ్తికుడయ్యాడు. ఇంతకముందు అతను ఏ గురువులనైతే విమర్శించాడో, ఇప్పుడు అదే గురువులను ఆకాశానికి ఎత్తుతున్నాడు. వారు ఆనాడు చెప్పింది సత్యమని, తానే పొరబడ్డానని అంటున్నాడు. వాళ్ళను విమర్శిస్తూ రాసిన వ్యాక్యాలను ఉపసంహరించుకున్నాడు. ఈ మార్పేదో అప్పుడే వచ్చుంటే, ఇంతకాలం వృధా అయ్యేది కాదు. పైగా అతని చెత్తమాటలు విని కొందరు పక్కదారి కూడా పట్టారు.

చెప్పొచ్చేదేమిటంటే గురువులు (ముఖ్యంగా యోగులు, ఆత్మజ్ఞానులు) ఏం చెప్పినా, అది సత్యమే. మలినమైన మన బుద్ధులకు అందని విషయాలను వారు చెప్పినప్పుడు, దాన్ని అందుకోలేని మన అజ్ఞానాన్ని అంగీకరించాలేకాని, వారిని నిందించకూడదు. ఆధ్యాత్మిక సాధన ఎంతో కష్టతరమైనది. మొదటి మెట్టు మీద ఉన్నప్పుడు ఎన్ని సార్లు కిందపడ్డా పర్వాలేదు, కానీ పైమెట్టు దాకా వెళ్ళి క్రిందపడితే, లేవడం కష్టం. కాలం వృధా అయిపోతుంది. అందుకే గురువులు అనేక హెచ్చరికలు చేస్తారు. తల్లి వలె ఎన్నో జాగ్రత్తలు చెప్తారు. అవి అర్దం చేసుకోలేక, వాటిని అతిశయోక్తులని వారిని విమర్శిస్తే, నష్టపోయేది మనమే కానీ వాళ్ళు కాదు. ఇంకో విషయం ఏమిటంటే దేవుడు లేడు, ఉంటే కనిపించమను అని అనడం సులభం. భూమి సూర్యుని చుట్టు తిరుగుతోందని చెప్పినా, నేను నమ్మను, శాస్త్రవేత్తలు అబద్దం చెప్తున్నారు అంటే నిన్ను ఎవడు ఉద్ధరిస్తాడు? నువ్వే అంతరిక్షంలోకి వెళ్ళి చూడాలి. అలా వెళ్ళాలంటే దానికి తగిన విధంగా నువ్వు సిద్ధం అవ్వాలి. అది కుదరదు, ఉన్న పళంగా ఎగిరిపోవాలంటే నిన్ను మూర్ఖుడు అంటారు. ఇది కూడా అంతే. భగవంతుడు లేడు అని అనడం కంటే ఇంతకముందు కాళీదాసు, చైతన్య మహాప్రభు, తెనాలి రామకృష్ణ, రామకృష్ణ పరమహంస మొదలైన అనేకులు ఈశ్వర దర్శనం పొందినవారు ఉన్నారు. ఆయన ఎలా ఉంటాడో వర్ణించాడు. వారు మార్గాలు కూడా చూపారు. అసలు ఈశ్వర సాక్షాత్కారానికి ధర్మమే రాజమార్గం. ఈ సౌలభ్యం వేరే మతాల్లో లేదు. అక్కడ భగవంతుడు ఒట్టి నమ్మకం మాత్రమే. అక్కడ భగవదనుభూతి పొందినవారు కానీ, పొందేమార్గాలు కానీ ఉండవు. అందుకే ఆ మతాల్లో వారు నాస్తికులయ్యారంటే అర్దం ఉంది. కానీ సనాతన ధర్మంలో ఈశ్వరసాక్షాత్కారానికి మార్గాలున్నాయి. గురువును ఆశ్రయించి, ఆ మార్గంలో వెళితే, తప్పకుండా ఈశ్వర సాక్షాత్కారంతో పాటు ముక్తి కూడా లభిస్తుంది.

ప్రశ్నించడం పేరుతో మూర్ఖంగా వాదించే జడుల మాటలు నమ్మకండి. మీరంతా హిందువులు. హిందువుల రక్తంలో నాస్తికత్వానికి చోటు లేదు అన్న స్వామి వివేకానందుని మాటలు మరువకండి. సద్గురువును ఆశ్రయించి సాధనతో భగవద్సాక్షాత్కారం పొందండి. గురువులను, శాస్త్రాలను విమర్శించడం ఆపండి.

గురువు అనుగ్రహం సదా మీపై ఉన్నది.

No comments:

Post a Comment