Sunday 2 July 2017

వారాహీ అమ్మవారి వైభవం గురించి కొంత.......



ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి ఆషాఢ శుద్ధ నవమి వరకు గల తిథుల రాత్రి సమయంలో వారాహీ అమ్మవారిని పూజిస్తారు. వీటిని గుప్తనవరాత్రులు అంటారు. అమ్మవారి వైభవం గురించి కొంత.......

లలితా పరమేశ్వరి యొక్క ఐదు పుష్పబాణాల నుంచి ఉద్భవించిన శక్తుల వరాహ ముఖంతో ఆవిర్భవించిన శక్తి శ్రీ మహా వరాహీ దేవి. లలితా దేవి సైన్యానికి ఆమె సర్వ సైన్యాధ్యక్షురాలు. ఆమెకు ప్రత్యేక రథం ఉంది, దానిపేరు కిరి చక్రం. ఆ రథాన్ని 1000 వరాహాలు లాగుతాయి, రథసారథి పేరు స్థంభిని దేవి. ఆమె రథంలో దేవతా గణమంతా కొలువై ఉంటుంది. ముఖ్యంగా ఆయుర్వేద మూలపురుషుడైన ధన్వంతరీ, మరియు దేవవైధ్యులైన అశ్విని దేవతలు.

కిరిచక్ర రథారూఢ దండనాథా పురస్కృతా |
జ్వాలామాలిని కాక్షిప్త వహ్నిప్రాకార మధ్యగా || 27 ||
భండసైన్య వధోద్యుక్త శక్తి విక్రమహర్షితా |
నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుకా || 28 ||
భండపుత్ర వధోద్యుక్త బాలావిక్రమ నందితా |
మంత్రిణ్యంబా విరచిత విషంగ వధతోషితా || 29 ||
విశుక్ర ప్రాణహరణ వారాహీ వీర్యనందితా |

అంటూ లలితా సహస్రనామాల్లో హయగ్రీవ, అగస్త్యులు ఈ అమ్మవారి గురించే చెప్పుకున్నారు.  విశుక్రుడిని ఈ తల్లి హతమార్చింది.
ఈ అమ్మవారిని ఆజ్ఞా చక్రంలో ధ్యానిస్తారు.

వారాహీ అమ్మవారు అంటే భూదేవి. హిరణ్యాక్షుడు భూదేవిని జలాల్లోకి తీసుకువెళ్ళినప్పుడు, శ్రీ మహావిష్ణువు వరాహరూపంలో అవతరించి, వాడిని సంహరించి, భూమాదేవిని రక్షిస్తాడు. స్వామి మీద ప్రేమతో అప్పుడు అమ్మవారు వారాహీ రూపం తీసుకుందని, అందువలన ఈమె #వరాహస్వామి యొక్క స్త్రీ రూపమని కొన్ని ధ్యానశ్లోకాల్లో కనిపిస్తుంది. అంటే వారాహీ అమ్మవారు అంటే ఎవరో కాదు సర్వసంపదలను ఇచ్చే శ్రీ #మహాలక్ష్మీ. అందుకే శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో వారాహీ ధరణీ ధ్రువా అని కనిపిస్తుంది. కాబట్టి ఈ అమ్మవారిని పూజిస్తే వరహాస్వామి లాగే అన్ని కోరికలను నెరవేర్చుతుంది. భూతగాదాలను నివారిస్తుంది, లేదా పరిష్కరిస్తుంది.

అమ్మవారిని చిత్రాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే, ఆవిడ హలము (నాగలి), ముసలము (రోకలి) ధరించి కనిపిస్తుంది. నాగలిని భూమిని దున్నడానికి ఉపయోగిస్తే, రోకలిని ధాన్యం దంచడానికి వాడతారు. దీనిబట్టి అమ్మవారు సస్యదేవత అని గ్రహించాలి. అంటే పాడిపంటలను సమృద్ధిగా ఇచ్చే కల్పవల్లీ శ్రీ వారాహీ మాత. అందుకే అమ్మవారిని ఆషాఢ మాసంలో పూజించమన్నారు. నిజానికి రైతు గోఆధారితం వ్యవసాయం ద్వారా భూమిని శుద్ధి చేసి, సాగు చేస్తే అది కూడా ఒక రమైన వారాహీ ఉపాసనే అవుతుంది. ఎందుకంటే వారాహీ అంటే ఎవరో కాదు సాక్షాత్తు భూమాత.

#వారాహీ అమ్మవారిని చూసి ఉగ్రదేవతగా భ్రమపడతారు కొందరు. కానీ వారాహీ చాలా శాంతస్వరూపిణి. వెంటనే అనుగ్రహిస్తుంది, కరుణారస మూర్తి అని గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి. వారాహీ అమ్మవారిని స్మరిస్తే శత్రు నాశనం జరుగుతుంది, అంటే వ్యక్తిలో ఉన్న అంతఃశ్శత్రువులైన కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, అహంకారం, అజ్ఞానం నశిస్తాయి. అంతఃశ్శత్రువులను జయించినవాడికి బయట శత్రువులు ఉండరు లేదా కనిపించరు, అంత విశాలమైన దృష్టి అతడికి కలుగుతుంది. అలాంటి దివ్యస్థాయిని ప్రసాదిస్తుంది వారాహీ మాత.  

1 comment:

  1. మీకు శతకోట వందనాలు చాల బాగ చెప్పారు.

    ReplyDelete