Tuesday 23 July 2013

శాకంబరీ దేవి

మన సంస్కృతిలో శక్తి ఆరాధనకు విశేషమైన ప్రాధాన్యం ఉంది. అందులోనూ పరబ్రహ్మాన్ని స్త్రీగా, అమ్మగా కొలిచే ఏకైక సంస్కృతి హిందూ సంస్కృతి మాత్రమే. అటువంటి ఆ మహాశక్తిని ఆషాఢమాసంలో శాకంబరి/శాకంభరి దేవిగా అలంకరిస్తారు. ఆషాఢమాసంలో శాకంభరి దేవి నవరాత్రులు చేస్తారు. ఈ మాసంలో అమ్మవారిని శాకంభరిదేవిగా ఆరాధించడం వలన లోకమంతా చల్లగా ఉంటుంది. శాకంబరి దేవి గురించి శ్రీ దేవి భాగవతంలో ప్రస్తావించబడింది. శాకంబరి దేవి అవతార వైశిష్ట్యం గురించి తెలుసుకోవడం వలన సకల శుభాలు కలుగుతాయి.

--------------------------------------

జనమేజయ ఉవాచ:

వేదవ్యాస మహర్షితో జనమేజయుడు "ఓ మహర్షి! రాజర్షి హరిశ్చంద్రుడు శతాక్షిదేవి భక్తుడని సెలవిచ్చారు. శివుని భార్య అయిన శివా (శివ అంటే శివుడు, శివా అంటే పార్వతీ దేవి), శతాక్షి దేవిగా ఎందుకు పిలువబడుతోంది? అందుకుగల కారణం వివరించండి. విని నా జన్మను సార్ధకం చేసుకుంటాను. ఎవరు ఆ మహాదేవి ఒక్క మహిమలను పరిశుద్ధమైన మనసుతో, ఆదిశక్తి యందు అచంచలమైన భక్తితో వింటారో/తెలుసుకుంటారో, వారు విన్న ఒక్కో వాక్యానికి ఆశ్వమేధ యాగం చేసిన పుణ్యం ప్రాప్తిస్తుంది. కనుక శతాక్షి దేవి గురించి చెప్పగలరు" అన్నాడు.

వ్యాస ఉవాచ -

"ఓ రాజా! నువ్వు దేవి భక్తుడవు. అందువల్ల నీకు ప్రత్యేకంగా పరమేశ్వరి గురించి చెప్పనవసరం లేదు. నేను శతాక్షి దేవి గురించి చెప్తాను విను" అంటూ వ్యాస మహర్షి ప్రారంభించారు.

పూర్వం దుర్గముడనే మహాకౄరుడైన అసురుడు/దానవుడు ఉండేవాడు. హిరణ్యాక్షవంశంలో జన్మించాడు. రురు చక్రవర్తికి యొక్క కొడుకు. చాలా శక్తివంతుడు, భయానకుడు. 'వేదం చెప్పినట్టుగా వేదమంత్రాలతో చేసిన యజ్ఞభాగాన్ని దేవతలు గ్రహించి శక్తివంతులవుతారు. శక్తివంతమైన దేవతలు జనుల యొక్క కోరికలను సిద్ధింపజేస్తారు. దేవతలకు బలం వేదం. దేవతలను నాశనం చేయాలంటే, దేవతలను ఓడించాలంటే, వేదాలను వశం చేసుకోవాలి. అప్పుడు దేవతల వలె శక్తిని పొందవచ్చు. అందులో సందేహం ఏంత మాత్రమూ లేదు' అనే ఆలోచన వాడి మనసులో కలిగింది.

ఈ ఆలోచన రాగానే హిమాలయాలకు వెళ్ళి బ్రహ్మదేవుడి గురించి ఘోరతపస్సు ప్రారంభించాడు. కేవలం గాలిని మాత్రమే తీసుకుంటూ, ఏ ఇతర ఆహారపదార్ధం తీసుకోకుండా వేయి సంవత్సరాలు తీవ్రంగా తపస్సు చేశాడు. దుర్గముడి తపస్సు నుంచి పుట్టిన తేజస్సుతో కూడిన తాపం (వేడి) దేవ, దానవ లోకాలను తపింపచేసింది.

దుర్గామాసురుడి తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు వికసించిన తామరపూవు వంటి ప్రసన్నమైన వదనం (ముఖం) తో వరం ప్రసాదించడానికి హంసవాహనం మీద ప్రత్యక్షమయ్యారు. చిన్నగా తన కన్నులు తెరిచి, తీవ్రమైన ధ్యానంలో ఉన్న దుర్గమాసురుడి వంక చూసి, నీకు ఏ వరం కావాలో కోరుకో, నీ మనసులో ఉన్నది నీకు సిద్ధించుగాక, నీవు అన్ని శుభాలే పలుకుగాక అన్నాడు. నేను నీ తీవ్రమైన తపస్సుకు మెచ్చి, నీకు వరం ఇవ్వడానికి వచ్చాను అన్నారు.

అది విన్న దుర్గముడు తన సమాధి (ధ్యానం) నుంచి మేల్కొని బ్రహ్మను స్తుతించాడు. తరువాత తాను భావించినట్టుగానే "ఓ సురేశ్వరా! వేదాలన్నీ నా దగ్గర ఉండాలి. మూడు లోకాల్లో ఋషులు, బ్రాహ్మణుల దగ్గర ఉన్న వేదమంత్రాలు నా ఆధీనంలో ఉండాలి. ఓ మహేశ్వరా! నాకు దేవతలను ఓడించగలిగే శక్తి కావాలి" అని పలికాడు. బ్రహ్మదేవుడు 'తదాస్తు' అని పలికి సత్యలోకానికి వెళ్ళిపోయాడు.

తతః ప్రబృతి విప్రైస్తు విస్మృతా వేదరహస్యాః
స్నాన సంధ్యా నిత్య హోమ శ్రాద్ధా యజ్ఞ జపాదయః

దుర్గముడికి బ్రహ్మ ఇచ్చిన వరప్రభావం చేత బ్రాహ్మణులు వేదాలను మర్చిపోయారు. బ్రాహ్మణులే అన్ని వర్ణాల వారికి వేదవిహితకర్మలను, వేదోక్త ధర్మాన్ని ప్రవచించాలి, అందరిని నడిపించాల్సిన బ్రాహ్మణులే వేదాలను మర్చిపోవడంతో మిగితా అన్ని వర్ణాల వారు కూడా ధార్మిక జీవనానికి దూరమయ్యారు. ఫలితంగా స్నానము, సంధ్యావందనము, నిత్యాగ్నిహోత్రము, శ్రాద్ధ కర్మలు, యజ్ఞాలు, జపాలు అన్ని భూమి మీది నుంచి మాయమైపోయాయి. దాంతో కరువు ఏర్పడింది. భూగోళం మొత్తం రోదలనలు, హాహాకారాలు, ఆర్తనాదాలతో నిండిపోయింది. ఇది ఎలా జరిగింది? ఇది ఎలా జరిగింది? అని బ్రాహ్మణులు ప్రశ్నించుకోసాగారు. వేదం లేనినాడు మాకు విధింపబడిన కర్మలను మేము ఏ విధంగా ఆచరించాలి అని విచారించసాగారు.

యజ్ఞంలో వేయబడిన హవిస్సును స్వీకరించిన దేవతలు శక్తిని పొంది జనుల యొక్క కోరికలని తీరుస్తారు. యజ్ఞాలు ఆగిపోవడం చేత నిర్జరులైన (ముసలితనం అంటూ లేనివాళ్ళు) దేవతలు బలహీనులు, వృద్ధులుగా మారిపోయారు. దాంతో దేవతల యొక్క రాజధాని అయిన అమరావతి మీద దైత్యులు (రాక్షసులు) దాడి చేసారు.

హవిస్సు లేక బలహీనులైన దేవతలు వజ్రం వంటి ధృడమైన శరీరంగల రాక్షసులతో యుద్ధం చేయలేకపోయారు. ఫలితంగా దైత్యులు అమరావతిని స్వాధీనపరుచుకుని దేవతలను వెళ్ళగొట్టారు. దేవతలందరూ రాక్షసులు చేరుకోవడానికి కష్టతరమైన మేరు/సుమేరు పర్వత గుహలలోకి చేరుకుని ఆదిశక్తి మీద మనసు నిలిపి, అచంచలమైన, ఉత్కృష్టమైన భక్తితో ధాన్యంలో మునిగిపోయారు.    

చాలామంది ఇక్కడ ఒక సందేహం వస్తుంది. దుర్గాముసుడు వేదాలను పొందదం వల్ల లోకంలో క్షామం (కరువు) ఏర్పడడమేమిటి? సర్వశక్తివంతులు, కోరిన కోరికలను తీర్చే దేవతలు యజ్ఞాలు చేయకపోవడం వలన శక్తిహీనులవడమేంటి? యజ్ఞ హవిస్సు లేక శక్తిహీనులైన దేవతలను అమరావతి నుంచి తరిమేయడమేంటి? అని చాలామందికి అనిపిస్తుంది. కధలో ముందుకు వెళ్ళే ముందు వాటి ఈ సందేహాలను క్లుప్తంగా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం.

సనాతన ధర్మంలో దేవతలకు పరమాత్మకు (పరబ్రహ్మానికి) తేడా ఉంది. ఇంద్రుడు, అగ్ని, వాయువు, వరుణుడు మొదలైన అష్టవసువులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు మొదలైనవాళ్ళు దేవతలు. శివ, విష్ణు, పార్వతీ, లక్ష్మీ, గణపతి, వేంకటేశ్వర స్వామి మొదలైనవారు పరబ్రహ్మం(పరమాత్మ) యొక్క ప్రతిబింబాలు. దేవతలు కూడా మనవంటి వారే, పుణ్యకర్మ చేయడం వలన వారికి దేవతాజన్మ వచ్చింది, పుణ్యం సుఖంగా రూపాంతరం చెంది సంతోషం అనుభవిస్తారు, సుఖం అనుభవించగానే పుణ్యం క్షీణిస్తుంది, అలా పుణ్యం క్షీణించిన ఇంద్రాది దేవతలు తిరిగి భూలోకంలో పుడతారు. కానీ పరబ్రహ్మం వీటికి అతీతుడు. ఆయన అన్నిటికి సాక్షి, ద్రష్ట, అంతర్యామి. పరమాత్మ సర్వశక్తివంతుడు, నిత్యపుష్టుడు, శాశ్వతుడు. దేవతలు ప్రకృతి శక్తులు. ప్రకృతిలో అంతర్యామిగా ఉంటూ మానవాభివృద్ధికి కారణమవుతుంటారు. ప్రకృతిలో ఉండే విద్యుత్ శక్తి ఇంద్రుడు. మిత్రావరుణులు ఆక్సిజెన్, హైడ్రోజెన్ అణువులు. ఇంద్ర, మిత్ర, అగ్ని, వరుణ అనేవి నానార్ధాలు కలిగిన పేర్లు. వీటికి అనేక కోణాల్లో అనేక అర్దాలున్నాయి.

సృష్టి ఆదిలో పరమాత్ముడు మనుష్యులను, దేవతలను, వీరితో పాటు యజ్ఞాన్ని సృష్టించాడు. మానవులు, దేవతలు ఒకరిమీద ఒకరు పరస్పరం ఆధారపడి ఉండేలా, మనుష్యులు చేసిన యజ్ఞం యొక్క హవిస్సును (యజ్ఞంలో వేయబడిన ఆహుతులను హవిస్సు అంటారు) దేవతలు స్వీకరించి శక్తివంతులయ్యేలా, శక్తివంతమైన దేవతలు మనుష్యుల కోరికలను తీర్చాలని, కోరికలు తీరడంతో సంతుష్టులైన మానవులు తిరిగి యజ్ఞాలు చేయాలని పరమాత్మ శాసనం చేశారు. భగవద్గీతలో ఈ విషయమే కృష్ణ పరమాత్మ చెప్తారు. ఈ దేవతలను శక్తివంతం చేస్తుంది నిత్యాగ్నిహోత్రం. ఈ నిత్యాగ్నిహోత్రం అన్ని వర్ణాల వారూ చేయాలి. ఇందులో ఎవరికి మినహయింపు లేదు.

హోమం, యజ్ఞం మొదలైనవి కాలుష్యాన్ని తగ్గిస్తాయని మన గ్రంధాలు చెప్తున్నాయి, ఆధునిక పరిశోధనలూ చెప్తున్నాయి. అగ్నిహోత్రం చేయడం చేత ఆరోగ్యం సంతరించడంతో పాటు, మన చుట్టూ ఉన్న కాలుష్యాన్ని తగ్గించినవారం అవుతాం. వీటికి తోడు యజ్ఞం పర్యావరణంలో సమతుల్యాన్ని సృష్టిస్తుంది. వేదంలో చెప్పబడినట్టుగా చేయబడిన యజ్ఞం ఏ కాలంలోనైన వర్షాన్ని కురిపిస్తుంది (ఆధునిక కాలంలో మళ్ళీ ఋజువు చేయబడింది).

ఇక వేద మంత్రం విషయానికి వద్దాం. మంత్రం శబ్దమే అయినా దానికి ఒక రూపం ఉంటుంది. మంత్రం చదివినప్పుడు కొన్ని తరంగాలు ఉద్భవిస్తాయి. యజ్ఞంలో వేసిన హవిస్సును అగ్నిదేవుడు దేవతలకు చేర్చడంలోమంత్రం కీలక పాత్ర పోషిస్తుంది. ఆధునికులకు అర్దమయ్యేలా చెప్పాలంటే అగ్నిహోత్రంలో వేసిన ఆహుతుల మధ్య రసాయన చర్య (కెమికల్ రీయాక్షన్) జరిగి, అవి గాలిలో సూక్ష్మరూపంలో, వాయువుల రూపంలోనూ ఆకాశంలో నిర్దేశిత ప్రదేశం చేరడానికి పట్టే సమయంలో ఆ మంత్రం చదవడం పూర్తి అవుతుందన్నమాట. ఒక్కో రకమైన యజ్ఞంలో ఒక్కో రకమైన చంధస్సుతో కూడిన మంత్రాలు చదువుతారు, ఆ మంత్రం పఠనానికి పట్టే సమయంలో ఈ హవిస్సు వాయురూపంలో అతివేగంగా ఆయప్రదేశాలకు చేరుతుంది.

క్లుప్తంగా చెప్పుకోవాలంటే అంతరిక్షలోకి ప్రయోగించిన రాకెట్ నిర్దేశిత కక్ష్యలోకి చేరడానికి క్రింది రాకెట్ కేంద్రం నుంచి కంప్యూటర్ల ద్వారా ఎలా పర్యవేక్షిస్తారో, సరిగ్గా అదే విధంగా యజ్ఞ హవిస్సు దేవతలను (ప్రకృతిలో నిర్దేశిత ప్రదేశాన్ని) చేరడానికి మంత్రం సహాయపడుతుంది.

ఇది దైవికంగా చూసినప్పుడు యజ్ఞం దేవతలకు శక్తినిస్తే, సైన్సుపరంగా చూసినప్పుడు పర్యావరణంలో సమతుల్యాన్ని ఏర్పరుస్తుంది. మనిషి యొక్క మానసిక, శారీరిక స్థితులను బట్టి చెప్పవలసి వస్తే యజ్ఞం శరీరంలో ఉన్న రాక్షసులను (రోగాలను) తరిమేస్తుంది. మద్యపానం, ధూమపానం (సిగిరెట్టు) మొదలైన వాటికి బాగా అలవాటు పడినవారు, రోజు అగ్నిహోత్రం చేయడం చేత, అతి తొందరగా ఈ దురలవాట్లను మానేసినట్లు ఆధునిక పరిశోధనలు చెప్తున్నాయి.

ఇప్పుడు గమనిస్తే దుర్గామసురుడు కోరిన వర ప్రభావం చేత యజ్ఞయాగాదులు నిలిచిపోయాయి. ఫలితంగా పర్యావరణం కాలుష్యమైంది, పర్యావరణసమతుల్యం దెబ్బతిన్నది, హవిస్సు లేక దేవతలు శక్తిహీనులయ్యారు, వర్షాలు కురవడం ఆగిపోయింది. పర్యావరణం దెబ్బతింటే కలుషిత పదార్ధాలు పెరిగిపోతాయి. అవి ఓజోన్ పొర నాశనానికి, భూతాపం పెరగడానికి కారణమవుతాయి. భూతాపం పెరిగితే, ఋతువులు క్రమం అస్తవ్యస్తం అవుతుంది. అతివృష్టి, అనావృష్టి ఏర్పడతాయి. సమయం కాని సమయంలో వర్షాలు పడతాయి. ఫలితంగా వ్యవసాయం దెబ్బతింటుంది, ఆకలి పెరుగుతుంది, కాలుష్యం, భూతాపం కొత్తరోగాలను పుట్టిస్తుంది. దాంతో ప్రపంచమంతా హాహాకారులు వినిపించాయి. ఇక అసురులు అమరావతిని స్వాధీనపరుచుకోవడం కూడా చూస్తే, దేవతలు మానవ మనసుపై ప్రభావం చూపిస్తారు, మంత్రపఠనం, అగ్నిహోత్రం ఇందులో కీలక పాత్ర పోషిస్తాయి. మనిషి మనసే అమరావతి (దేవతలకు రాజాధాని). వేదం మనిషి యొక్క జీవనాన్ని నిర్దేసిస్తుంది. ఇవన్ని మర్చిపోవడం వలన మనిసి మనసులోకి చెడు ఆలోచనలు (రాక్షసులు) ప్రవేశిస్తాయి. అత్యాశ, హింస, స్వార్ధం, భౌతిక వాదం పెరిగిపోతాయి. బయట ఏర్పడిన కరువు ప్రభావం కూడా ఉంటుంది కాబట్టి మనిషిలో ఉన్న దైవత్వం పోయి, మనసును రాక్షసత్వం ఆక్రమిస్తుంది. అందుకే దేవతలు రాక్షసుల చేతిలో ఓడిపోయి సుమేరు పర్వత గుహలలో తలదాచుకున్నారని కధలో కనిపిస్తుంది.  

జనమేజయుడితో వ్యాసమహర్షి ఈ విధంగా పలుకుతున్నారు. ఓ రాజా! పవిత్రమైన అగ్ని ఆరాధన (అగ్నిహోత్రము, యజ్ఞయాగాదులు), హవిస్సులు లేని కారణం చేత వర్షాలు కురవడం ఆగిపోయింది. ఎప్పుడు జలాలతో నిండుగా ఉండే చెరువులు, తటాకాలు, నదులు అన్ని పూర్తిగా ఎండిపోయాయి. భూగోళం మీద త్రాగడానికి చుక్క నీరు కూడా లేదు. భూమి మొత్తం ఎండిపోయింది. ఈ పరిస్థితి ఒక వంద సంవత్సరాల పాటు కొనసాగింది. కరువు కారణంగా జనులు, జంతువులు, ఆవులు, గేదెలు, ఒక్కటేమిటి అన్ని జీవులు చాలావరకు మరణించాయి. వేదమూ, వైదిక క్రియలు మర్చిపోయిన కారణం చేత చనిపోయిన శవాలకు దహన సంస్కారం (కాల్చడం) నిలిచిపోయింది. ప్రపంచంలో ఎక్కడ చూసిన అందరి ఇళ్ళలో శవాలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి. (వేదమే సమస్తకర్మలకు మూలం. చెప్పులు కుట్టడం నుంచి యజ్ఞం వరకు, రాకెట్ తయారి, అణుబాంబు తయారి వరకు అన్నిటికి వేదమే మూలం.) ఇలాంటి సందర్భంలో ప్రశాంత చిత్తులైన బ్రాహ్మణులు (బ్రహ్మ జ్ఞానం కలిగినవారిని బ్రాహ్మణులు అంటారు. బ్రహ్మజ్ఞానికి జన్మతో సంబంధం లేదు) ఈ అనర్ధాన్ని చూసి 'శివా'ను వేడుకోవడం కోసం హిమాలయ పర్వతాలకు పయనమయ్యారు.

పూజ, సమాధి, ధ్యానం మొదలైనవాటితో ఆ పరమేశ్వరిని సంతుష్టురాలిని చేయడానికి ఏ రోజు కారోజు ప్రయత్నిస్తూనే ఉన్నారు. నిరాహారులై, 'అమ్మ' యందే మనసు నిలిపి 'అమ్మ'ను శరణాగతి చేశారు .

దయాం కురు మహేశాని పామరేషు జనేషు హి|
సర్వాపరాధయుక్తేషు నైత్ఛలాఘ్యాం తవాంబికే||

ఓ మహేశాని (మాహా మహా ఐశ్వర్యములకు అధికారిణి; మహేశ్వరుని భార్య;)! మా యందు దయ చూపు. మేము పామరులము (ఏమి తెలియనివారము). ఎన్నో తప్పులు చేసాము. నిన్ను స్తుతించే అనుగ్రహం పొందే అర్హత కూడా లేదు. అయినా నీ బిడ్డలం కదమ్మా! మా యందు దయ చూపవూ!

కోపం సంహార దేవేశి సర్వాంతర్యామిరూపిణి |
త్వయా యతా ప్రేరయేతే2ం కరోతి స తధాజనాః ||
నాన్య గతిర్జనస్యస్యా కిం పశ్యసి పునఃపునః|
యతేఛ్చసి తధాకర్తుం సమర్ధోసి మహేశ్వరీ ||

ఓ దేవేశి (దేవతలకు ఈశ్వరి)! మా మీద నీ కోపాన్ని తగ్గించమ్మా. నీవు సర్వజీవులలో అంతర్యామిగా ఉంటూ అందరిని నడిపిస్తున్నావు, అందరి కర్మలకు సాక్షిగా ఉన్నావు. అందరి యొక్క ఆలోచనలు ఎరిగినదానివి, అందరిని ఆలోచింపచేసేదానివి కూడా నీవే. నువ్వు ఏ విధంగా నడిపిస్తే జనులు ఆ విధంగా నడుస్తారు. నీవు తప్ప మాకు వేరే గతి లేదు. నువ్వే శరణు. ఓ మహేశ్వరీ! నీవు ఏమైనా చేయగల సమర్ధురాలవు. అయినా నీవు దేని కోసం మళ్ళీమళ్ళీ మౌనంగా  చూస్తున్నావు.

సముద్ధర మహేశాని సంకటాత్పరమోత్థితాత్ |
జీవనేన వినా2స్మాకం కథం స్యాత్స్థితిరంబికే ||
ప్రసీదం త్వం మహేశాని ప్రసీద జగదంబికే |
అనంతకోటి బ్రహ్మాండా నాయికెతే నమోనమః ||

ఓ మహేశాని! ఇప్పుడు సంభవించిన సంకట పరిస్థితి నుంచి మమ్ముల్ని రక్షించు తల్లీ. ఓ అంబికా (అమ్మా)! నీరు లేకపోతే మేము ఎలా జీవించగలము. దయచూపు ఓ మహేశాని! ఓ జగదంబ (జగత్తునకు అమ్మ) ! కనికరించు. ఓ మహేశాని! కరుణించు! అనంతకోటి బ్రహ్మాండాలకు నాయికవు (నడిపించే దానివి) అయిన నిన్ను మళ్ళీమళ్ళీ వేడుకుంటున్నాం అమ్మా!

నమః కుటస్థం రూపాయై చిద్రూపాయై నమోనమః |
నమో వేదాంతవేద్యాయై భువనేశ్యై నమోనమః ||
నెతినెతీతి వాక్యైర్యా బోధ్యతే సకలాగమైః |
తాం సర్వకారణాం దేవీం సరభావేన సన్నతాః ||

సకల జనుల యొక్క భ్రూమధ్యంలో (రెండు కనుబొమ్మల మధ్య ప్రదేశంలో) 'కూటస్థ' అనే పేరుతో చైతన్యరూపంలో ఉన్న ఓ దేవి, నీకు మా నమస్సులు.
- భ్రూమధ్యలో ఆజ్ఞాచక్రం ఉంటుంది. ఇది జీవుడి స్థానం. జపం, ధ్యానం, ప్రాణాయామం మొదలైనవి సాధన చేసే సమయంలో కన్నులు మూసుకుని దృష్టినంతా ఆజ్ఞాచక్రం మీద నిలపమని గురువులు చెప్తారు. బ్రహ్మచర్యం, అహింస, శమము, దమము, అస్తేయం మొదలైన అనేక లక్షణాలను (యోగశాస్త్రాంలో, ధర్మశాస్త్రంలో చెప్పబడ్డవి) కలిగి ఉంటూ, ఈ ఆజ్ఞాచక్రం మీద దృష్టి నిలిపి రోజు ధ్యానం చేయడం చేత సిద్ధులు ప్రాప్తిస్తాయని చెప్పబడింది. దూరశ్రవణం, దూరవీక్షణం, భవిష్యద్దర్శనం మొదలైనవి ఎన్నో. అయితే సాధకుల లక్ష్యం ఈశ్వరుడే కావాలి కానీ సిద్ధులు కాదు. ఈ ఆజ్ఞాచక్రం నిద్రాణమవ్వకుండా ఉండటం కోసమే తిలక ధారణ చేస్తారు. సనాతనధర్మాన్ని అవలంబించేవారందరూ విధిగా బొట్టు పెట్టుకోవాలి. ప్రతి శుభకార్యానికి ముందు దీపారాధన చేస్తారు. దాని కంటే ముందు కుంకుమ ధరిస్తారు. బొట్టు లేకుండా చేసే ఏ కార్యం కూడా ఫలితాన్ని ఇవ్వదని ధర్మం గట్టిగా చెప్తోంది. బొట్టు అంటే స్టిక్కర్లు, రంగులు కాదు, అచ్చమైన కుంకుమ, లేదా గోమయంతో చేసిన విభూతి, లేదంటే చందనం. ఇలా బొట్టు పెట్టుకోవడం ఈ ఆజ్ఞాచక్రాన్ని ప్రేరేపించడం కోసమే. పిల్లలకు చిన్నవయసు నుంచే బొట్టు పెట్టుకోవడం అలవాటు చేస్తే, ఈ ఆజ్ఞాచక్రం చైతన్యంగా ఉంటూ, ఇంద్రియ నిగ్రహాన్ని, మనోనిగ్రహాన్ని ప్రసాదిస్తుంది. అమ్మవారు ఈ ఆజ్ఞాచక్రంలో కూటస్థం రూపంలో ఉంటుంది. అనగా చైతన్యం అన్నమాట. సాధకుడు ఈ స్థాయికి చేరుకున్నప్పుడు, అతడు కళ్ళతో పనిలేకుండా తన చుట్టూ 360 డిగ్రీల్లో జరిగేవి, దూరంగా జరిగేవీ కూడా వీక్షించగలడు. అందుకే ఇక్కడ అమ్మవారికి 6 ముఖాలని లలిత సహస్రనామాల్లో చెప్పబడింది. 6 ముఖాలు 4 దిక్కులను, పైన, క్రింద చూస్తుంటాయి, అనగా భగవంతుడు లక్షణమైన సర్వతోముఖం అన్నమాట.
చిత్ అంటే చైతన్యం, కదలిక, సర్వజీవుల్లోను చైతన్యం రూపంలో వ్యకతమవుతున్న తల్లే అమ్మవారు. చిద్రూపిణిగా, పరిపూర్ణమైన చైతన్యంగా నిత్యం వెలుగొందుతూ ఉండే నీకు నమస్సులు.
వేదవేదాంతల ద్వారా తెలుపబడేదానివి నీవు.
సకల భువనాలకు ఈశ్వరివైన నీకు మా నమస్కారాలు.
ఇది కాదు, ఇది కాదు అంటూ ఆగమాల ద్వారా తెలుపబడే అన్నిటికంటే ఉన్నతమైన, సర్వాతీతమైన పరతత్వం నీవు.
ఓ దేవి! అన్నిటికి కారణం నీవేనమ్మా! ఇంత వైభవం కలిగిన ఓ మహాదేవి సర్వ భావములతో నీకు నమస్కరిస్తున్నాము అంటూ వేడుకుంటున్నారు.

ఇతి సంప్రార్థితా దేవీ భువనేశీ మహేశ్వరీ |
అనంతాక్షిమయం రూపం దర్శయామాసపార్వతీ ||
నీలానజనసమప్రఖ్యాం నీలపద్మాయతేక్షణం |
సుకకర్షసమోత్తుంగవృతపీనఘనస్థనం ||

ఈ విధంగా అందరూ కలిసి సకల భువనాలకు ఈశ్వరీ అయిన మహేశ్వరిని ప్రార్ధించడంతో ఆఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి,  నిరాకార రూపిణి, త్రిగుణాత్మికా, సచ్చిదానంద స్వరూపిణి, సమస్త లోకాలను కేవలం తన సంకల్ప మాత్రంచేత సృజించగలిగిన శక్తిస్వరూపిణి, అయిన ఆ జగజ్జనని కాటుకరంగును పోలిన నల్లని వర్ణంతో, దివ్యప్రభలను విరజిమ్మే తేజస్సుతో, నీలి పద్మాలవంటి విశాలమైన కన్నులు శరీరమంతా కలిగినదై, అనంతమైన అక్షములతో (కన్నులతో), పెద్ద వక్షోజములతో మూర్తీభవించింది.

బాణముష్టించ కమలం పుష్పపల్లవ మూలకాన్ |
శాకాదీన్ ఫలసమాయుక్తాన్ అనంతరస సమ్యుతాన్ ||
క్షుత్ తృష్ణ జరాపహ హస్తైర్బిభృతిచ మహాధనుః |
సర్వసౌందర్య సారం తద్రూపం లావణ్యశోభితం ||

ఒక చేతితో బాణం, రెండవ చేతితో కమలం పట్టుకుంది, మూడవచేతితో సారవంతమైనవి, తినగానే పుష్టినిచ్చేవి, ఆకలిని తీర్చేవి, బలహీనతలను నశింపజేసేవైన పుష్పములు (పువ్వులు), మొలకలు, కందమూలాలు, కూరగాయలు, ఆకుకూరలు, రసము కలిగిన పండ్లు ధరించింది. నాల్గవ చేతితో ఒక మహాధనస్సును ధరించి కనిపించింది. ప్రపంచంలో ఉన్న అందమంతా ఒక చోట చేర్చిన సరితూగని మహాసౌందర్యంతో, అన్ని రకాల సౌందర్యాలను కలబోసిందా అన్నట్టుగా సర్వ సౌందర్యరాశియై, ప్రేమ, కరుణ మొదలైన గుణాలను వ్యక్తపరుస్తూ సర్వజీవులను సమ్మోహ పరుస్తున్నట్టుగా ఉన్నది ఆ దేవి యొక్క దివ్య స్వరూపం. అది జగన్మోహన స్వరూపం. ఆ రూప సందర్శనమే కామవాంఛలను పటాపంచలు చేస్తుంది.

కోటిసూర్యప్రతీకాశం కరుణారససాగరం |
దర్శయిత్వా జగద్దాత్రీ సో2నంతనయనోద్భవో ||
మోచాయమాస లోకేషు వారిధారాః సహస్రశః |
నవరాత్రం మహావృష్టిరభూనేత్రోద్భవైర్జలం ||


కరుణా సముద్రురాలు అయిన ఆ తల్లి కోటి సూర్యల కాంతితో వెలిగిపోతోంది. జగత్తు మొత్తాన్ని ధరించే ఆ మహాశక్తి అక్కడున్న దయనీయ పరిస్థితిని అనంతమైన కన్నులతో వీక్షించింది. సర్వాతితురాలైనప్పటికి ఆ మహాశక్తి బ్రహ్మ మొదలు సకల జీవులకు అమ్మ. ఏ తల్లీ కూడా తన బిడ్డలు కష్టాలు పడుతుంటే చూడలేదు. బిడ్డలు పడే బాధకంటే, వారి బాధను చూసి తల్లి పడే బాధయే ఎక్కువ. ఆ పరమేశ్వరీ కూడా తన బిడ్డల కష్టాలను చూడలేక విలపిస్తూ కన్నీరు కార్చింది. అమ్మ యొక్క అక్షయమైన కన్నుల వెంట వచ్చిన నీరు ఏరులై పారింది. దాంతో తొమ్మిది రాత్రుల పాటు ఎన్నడు ఎరుగని అతిభారీ వర్షాలు కురిసి ఎండిపొయిన భూమి మీద జలం పొంగి ప్రవహించింది.

దుఃఖితాన్వీక్షస్య సకలాన్నేత్రాశృణీ విముంచతి |
తర్పితాస్తేన తే లోకా ఓషధయః సకలా అపి ||
నదీనదాప్రవాహాస్తైర్జలైః సమభవన్నృపా |
నీలీయ సంస్థితాః పూర్వం సురారస్తే నిగర్తా బహిః ||

దుఃఖితులైన జనులను, జీవులను చూసి అమ్మ ధారగా కార్చిన కన్నీరు జనులు, ఓషధుల యొక్క బాధలను తీర్చేసింది. ఆ కన్నీటి ధారతో నిండిన నదులు తిరిగి ప్రవహించసాగాయి. అప్పటివరకు మేరు పర్వత గుహలలో దాక్కున దేవతలు బయటకు వచ్చారు.

వ్యాఖ్య - అమ్మవారి కన్నుల వెంట వచ్చిన నీరే నదులుగా, సరసుల్లో ప్రవహించింది. ఇప్పుడున్న జలవనరులన్నీ అమ్మవారి ప్రసాదమే. అదంతా ఆవిడ మనకోసం ప్రేమతో కార్చిన కన్నీరే. అటువంటి జలాన్ని మనం ఎంతో జాగ్రత్తగా ఉపయోగించాలి. ప్రసాదంగా భావించాలి. నీటిని వృధా చేయకూడదు. జలవనరులను కలుషితం చేయకూడదు. అప్పుడే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అలా కాకుండా నీటిని వృధా చేస్తూ, జలాలను కలుషితం చేస్తుంటే, ఎన్ని పూజలు చేసిన అమ్మ అనుగ్రహం ఎలా కలుగ్తుంది? పైగా అమ్మవారిని అవమానించిన పాపం కూడా వస్తుంది.

మిలిత్వా ససురావిప్రా దేవీంసమభితుష్టువుః |
నమో వేదాంతవేద్యేతే నమో బ్రహ్మస్వరూపిణీ ||
స్వమాయయా సర్వజగద్దాత్రై తే నమోనమః |
భక్తకల్పద్రుమే దేవి భక్తార్ధం దేహదారిణి ||

బ్రాహ్మణులతో కలిసి దేవతలు కూడా 'అమ్మ'ను స్థుతించసాగారు.  వేదాంతము ద్వారా తెలియబడే దానివి, సాక్షాత్తు పరబ్రహ్మానివి అయిన నీకు వందనాలు. సకల జగత్తును నీ మాయ చేత సృష్టిస్తావు. భక్తుల పాలిటి కల్పవల్లివి, కల్పవృక్షానివి, కోరిన కోరికలు తీర్చేదానివి. భక్తుల కోసమే నీవు ఒక రుపాన్ని ధరిస్తావు/పొందుతావు. అటువంటి నీకు శిరస్సువంచి నమస్కరిస్తున్నాం తల్లీ.

నిత్యతృప్తే నిరుపమే భువనేశ్వరి తే నమోనమః |
అస్మత్ఛంత్యార్ధమతులం లోచనానాం సహస్రకం ||
త్వయా యతో ధృతందేవి శతాక్షీ త్వం తతోభవ |
క్షుదయాపీడితా మాతః స్తోతుంశక్తిర్నచాస్తినః ||

నిత్యం అనంతమైన తృప్తితో ఉండేదానివి, ఎవరుతోనూ పోల్చదగినదానివి కావు, సమస్త భూవనాలకు ఈశ్వరివైన నీకు మా నమస్కారములు. సహస్ర (అనంతమైన) కన్నులు కలిగినరూపంతో వ్యక్తమై లోకాలకు శాంతిని పంచావు. అందువల్ల నీవు 'శతాక్షీ దేవి'గా పిలువబడుతావు. ఆకలితో పీడింపబడుతున్న మాకు ఇంక నిన్ను స్తుతించే శక్తి లేదు తల్లీ.

అమ్మా మా యందు కృప చూపించి వేదములను తిరిగి మాకు ప్రసాదించు అని దేవతలు, జనులు మహేశ్వరిని వేడుకున్నారు.



వ్యాసుడు జనమేజయుడుతో "ఓ రాజా! ఈ మాటలు వినగానే అమ్మ తన చేతిలో ధరించిన రుచికరమైన కూరగాయలు, పండ్లను జనులకు ఇచ్చింది. ఆ పరమేశ్వరి.......... బ్రహ్మ దేవుడు మొదలు చిన్న కిటకముల వరకు అందరికి తల్లి కదా. అందువల్ల జనులతో పాటు ఇతర జీవుల ఆకలిని కూడా తీర్చింది. జంతువులకు, పక్షులకు వాటికి సరిపడా ఆహారాలను అందించింది.

ప్రార్ధనలు చేయగానే కరుణించి మంచి రసకరమైన, పుష్టికరమైన కూరగాయాలను, పండ్లను అందరికి ప్రసాదించింది కనుక ఆ రోజు నుంచి 'శాకంబరి' / 'శాకంభరి' అనే పేరుతో ప్రపంచంలో ప్రసిద్ధి పొందింది. శాకంబరీ దేవి ఆహారానికి, ప్రకృతికి ప్రతిరూపం. శాకములంటే కూరలని అర్ధం. శాకంభరి హరితజీవనానికి ప్రతీక. స్తోత్రాలే కాక, ఆహారాన్ని, కాయగూరలు, పండ్లను వృధా చేయకపోవటం, సద్వినియోగం చేయటం, అమ్మ కన్నీటి నుంచి వచ్చినాయి కనుక నీటిని వృధా చేయకుండా ఉండటం, ప్రకృతిని రక్షించడం, ప్రకృతికి పుష్టి కలిగించే పనులు చేయటం కూడా శాకంభరి దేవికి చేసే ఆరాధనయే అవుతుంది.

అమ్మ అందరికి ఆకలిని తీర్చిందన్న విషయం, దేవతలందరూ సమావేశమవడం వలన కలిగిన శబ్దాన్ని దూత ద్వారా తెలుసుకున్న దుర్గామాసురుడు అగ్గి మీద గుగ్గిలమయ్యాడు. అమ్మతో యుద్ధం చేయడానికి భారీ సైన్యంతో రణరంగంలోకి దూకాడు.

దుర్గమాసురుడు వేయి అక్షౌహిణుల సైన్యంతో (ఒక అక్షౌహిణిలో 21,780 ఏనుగులు, 21,780 రధాలు, 65,610 గుర్రాలు, 1,09,350 మంది సైనికులు ఉంటారు), అత్యంత వేగంగా బాణాల సంధిస్తూ, దేవతల సైన్యాన్ని చేధించుకుంటూ ముందుకు కదిలి అమ్మవారి ముందు నిలబడ్డాడు. విప్రులను చుట్టుముట్టేశారు రాక్షసులు. ఈ సంఘటనను చూసిన దేవతలు, విప్రులు భయంతో 'మమ్మల్ని రక్షించమ్మా! మమ్మల్ని కాపాడు' అంటూ రోదించారు. వెంటనే అమ్మవారు దేవతలు, ద్విజుల రక్షణార్ధం, వారి చుట్టు ఒక తేజోమయమైన, చక్రం వంటి వలయాన్ని సృష్టించింది. రాక్షసులతో పోరడడానికి తాను ఆ తేజోవలయం బయట నిల్చుంది.


అప్పుడు దేవికి, దైత్యులకు (రాక్షసులకు) మధ్య భీకరమైన యుద్ధం జరిగింది. యుద్ధరంగంలో విడువబడుతున్న బాణాలు వర్షంలా కురుస్తున్నాయి. సూర్యమండలాన్ని కూడా ఈ బాణాలు కప్పివేశాయా అన్నట్టుగా జరుగుతోంది యుద్ధం. బాణాలు పరస్పరం ఢీకొనడం వలన వాటి మధ్య అగ్నిజ్వాలలు ఎగిసి పడుతున్నాయి. భీకరమైన శబ్దాలు, కళ్ళతో చుడలేనంత కాంతి వెలువడుతోంది. ఆ యుద్ధ భూమిలో ధనుస్సును లాగి వదలడం వలన ఏర్పడిన శబ్దాలు దిక్కులన్నిటికి వ్యాపిస్తున్నాయి. దిక్కులను సైతం చెవిటివాటిగా మారుస్తున్నాయి. ఈ సమయంలోనే అమ్మవారి శరీరం నుంచి తీవ్రశక్తులు ఉద్భవించాయి.

కాళి, తారా, బాలా త్రిపుర సుందరి/ త్రిపుర బాలా, త్రిపుర భైరవి, రమా, బగళా, మాతంగి, త్రిపుర సుందరి, కామాక్షి, తులజా, జంభిని, మోహిని, చిన్నమస్త మొదలైన విద్యలు/శక్తులు, పదివేల చేతులు కలిగిన అనేక మంది గుహ్యకాళీలు శాకంబరీ దేవి నుంచి ఉద్భవించారు.

పరాశక్తి శరీరం నుంచి 32 మహాశక్తులు, మరో 64 మహాశక్తులు ఉద్భవించారు. వీరితో పాటు అనేకమంది ఆయుధాలు ధరించిన దేవి స్వరూపాలు అమ్మవారి శరీరం నుంచి అవతరించారు. యుద్ధభూమి మొత్తం మృదంగం, శంఖం, వీణ, ఇతరాత్ర సంగీత వాయిద్యాల ఘోషతో మార్మోగుతోంది. అంతటా దేవి స్వరూపాలతో నిండిపోయింది. ఈ మహాశక్తులందరి చేత 100 అక్షౌహిణిల రాక్షస సైన్యం నశించింది. ఇదంతా చూస్తున్న రాక్షస అధిపతి, దేవతల శత్రువు అయిన దుర్గమాసురుడు ముందుకు వచ్చి మొదట మహశక్తులతో పోరాడాడు. యుద్ధం మరింత భీకరమైంది. అమ్మవారి దేహం నుంచి పుట్టిన శక్తులచేత 10 వ రోజు నాటికి అన్ని అక్షౌహిణిల సైన్యం సంపూర్తిగా నశించిపోయింది. (ఇక్కడ మనం ఒకటి గమనించాలి. అమ్మవారు తల్చుకుంటేనే దుర్గమాసురుడు, వాడి సైన్యం మొత్తం నశించిపోతుంది. అమ్మ సర్వసమర్ధురాలు, సర్వశక్తులకు అధిదేవత. కానీ ఎంతైనా అమ్మ కదా. ఏ తల్లి తన బిడ్డలని తానే చంపుకోదు. వాడు ఎంత కౄరుడైన వాడు మారుతాడేమో అన్ని వేచి చూస్తుంది. అందుకే అమ్మవారైన, ఏ ఇతర దైవమైనా ఒక్కసారిగా రాక్షసులను అంతం చేయరు. వారిలోని రాక్షసత్వాన్ని మాత్రమే నాశనం చేయాలని భావిస్తారు. ఎంత ప్రయత్నించినా వాళ్ళు మారకపోతే, మొండిగా మారి లోకాలకు సంకటంగామారితే లోకకల్యాణం కోసం వారిని సంహరిస్తుంది. కానీ దయాసముద్రురాలు కనుక మళ్ళీ తనలోనే కలిపేసుకుంటుంది. ఇంకొక విషయం ఏమిటంటే కర్మపండాలి. కర్మ తీరేవరకు మరణం సంభవించదు. అమ్మవారు ఎంత ఓర్పు వహించినా, ఇంకా రెచ్చిపోయి, అంత తపస్సు చేసినా, మూర్ఖత్వంతో అమ్మవారి మీద యుద్ధం చేసి, కర్మను ఇంకా పెంచుకోని, తనకు తానుగా భయంకరమైన చావు కొని తెచ్చుకుంటున్నాడు దుర్గముడు. జీవుడికి కర్మ చేయడంలో అధికారం ఉంది, కర్మఫలం ఈశ్వరుడిస్తాడని గీతలో భగవానుడు చెప్పిందే ఇక్కడ కనిపిస్తోంది. వాడికి మంచైనా, చెడైనా చేసే అధికారం ఉంది, ఆ తర్వాత జరగబోయే పరిణామాల్లో మాత్రం వాడికి అధికారంలేదు. అప్పుడు ఈశ్వరుడు చూసుకుంటాడు. ఇలా మనం ఏది చేయాలో, ఏదో చేయకూడదో తెలియదు కనుకే ధర్మం అనేది ఈశ్వరుడిచ్చాడు. దాన్ని తెలుసుకుని సన్మార్గంలో నడిస్తే, అప్పుడు సత్కర్మ చేసి, సత్ఫలితాలను పొందుతాము. లేదంటే పాపకర్మ చేసి, కోరి కష్టాలను కొని తెచ్చుకున్న వాళ్ళమవుతాము.)

యుద్ధం 11 రోజు ఉధృతమైంది. దుర్గముడు ఎర్రని పూలహారం ధరించి, శరీరానికి ఎర్రచందనం పూసుకుని, విజయం తనేదననే ఉత్సాహంతో రధం ఎక్కాడు. గట్టిగా అరుచుకుంటూ, మహాశక్తులందరిని చేధించుకుంటూ వేగంగా వెళ్ళి రధాన్ని మహాదేవి ముందు నిలిపాడు. అమ్మవారికి, దుర్గమాసురుడికి మధ్య రెండు ప్రహరల పాటు (ఒక ప్రహర అంటే దరిదాపుగా 3 గంటల సమయం) మహాయుద్ధం జరిగింది. ఆ యుద్ధం అందరి గుండెల్లో భయాన్ని నింపింది. ఆ సమయంలో అమ్మవారు 15 అత్యంత శక్తివంతమైన బాణాలను విడిచిపెట్టింది.

అమ్మవారి విడిచిపెట్టిన 15 బాణాల్లో 4 బాణాలు రధాన్ని లాగుతున్న నాలుగు గుర్రాలను హతమార్చాయి. ఒక బాణం రథసారధిని నశింపజేసింది. రెండు బాణాలు దుర్గామాసురుడి రెండు కళ్ళను, మరో 2 బాణాలు వాడి రెండు భుజాలను, ఒక బాణం రధంపైనున్న ధ్వజాన్ని(జెండాని) నాశనం చేశాయి. జగదంబ చేత విడిచిపెట్టబడిన మిగిలిన 5 దుర్గమాసురుడి హృదయంలోనికి చొచ్చుకొనిపోయాయి. వెంటనే దుర్గముడు రక్తం కక్కుకుని చచ్చిపోయాడు. వాడి దేహం నుంచి జ్యోతిస్వరూపంలో ఆత్మ బయటకు వచ్చి అమ్మవారిలో కలిసిపోయింది. శక్తివంతమైన రాక్షసుడు మరణించడంతో మూడులోకాల్లోనూ శాంతి నెలకొంది. బ్రహ్మ, ఇతర దేవతలు సర్వలోకాలకు అధిష్టాత్రి అయిన అమ్మవారి ముందు నిలబడి భావావేశంతో, భక్తిపారవశ్యంతో గద్గద స్వరంతో అమ్మవారినిను స్థుతించారు.

దేవ ఉవాచ :
జగద్భ్రమ వివర్తైక కారణే పరమేశ్వరీ |
నమః శాకంభరీ శివే నమస్తే శతలోచనే ||
సర్వోపనిషదోద్ఘుష్టే దుర్గమాసురనాశిని |
నమో మహేశ్వరీ శివే పంచకోశాంతరస్థితే ||

దేవతలు అంటున్నారు :

ఓం పరమేశ్వరీ, ఈ జగత్తు యొక్క ఆది, అంతాలకు, కారణం నీవు. నీవే శాకంభరివి. అక్షయమైన (లెక్కలేనన్ని) కన్నులు కలదానివి. సకల ఉపనిషత్తుల చేత కీర్తించబడిన దివ్యత్వానివి. దుర్గమాసుర సంహారిణివి. సకల శుభాలకు ఈశ్వరివి, పంచకోశముల లోపల ఉండే తత్వాన్ని నీవు. అటువంటి నీకు మా నమస్కారములు.

చేతసాం నిర్వికల్పేన యా ధ్యాయంతి మునీశ్వరః |
ప్రణావార్తస్వరూపాం తాం భజామో భువనేశ్వరీం ||
అనంతకోటి బ్రహామండజననీం దివ్యవిగ్రహాం |
బ్రహ్మవిష్ణ్వాదిజననీం సర్వభావైర్నతా వయం ||


ఈ సృష్టిలో ప్రతీదీ నిత్యం మార్పునకు లోనవుతూనే ఉంటుంది. కానీ నీవు ఈ స్థితికి అతీతమైనదానివి, చైతన్య తత్వానివి. మునీశ్వరుల చేత ధ్యానింపబడే దానివి. ప్రణవ(ఓంకారం) స్వరూపానివి. సకల భువనాలకు ఈశ్వరివైన నిన్నే కీర్తిస్తున్నాము. ఎన్నో కోట్ల బ్రహ్మాండాలకు అమ్మవు. చిన్మయస్వరూపిణివి. బ్రహ్మ, విష్ణూ మొదలైన వారందరికి తల్లివి, వారందరు సర్వభావములతో నీకు పాదాభివందనం చేస్తారు.

కః కుర్యాత్ పరమాం దృష్ట్వా రోదనం సకలేశ్వరః |
సదాయం పరమేశానీం శతాక్షి మాతరం వినా ||

అత్యంత దీనులు, బలహీనులైన మా బాధలను చూసి అన్నిటికి అతీతమైన నీవు, శతాక్షిదేవిగా, దయాస్వరూపిణివై రోదించావు. మా కష్టాలను తీర్చావు. నీవు తప్ప అటువంటి పని ఇంకెవరు చేయగలరు?

వ్యాస ఉవాచ :
ఇతి స్థుతాసురైర్దేవి బ్రహ్మవిష్ణ్ణవాదిభిర్వరైః |
పూజితా వివిధైర్ ద్రవ్యైః సంతుష్టాభూచ్చ తత్క్షణే ||



ఈ విధంగా స్థితిస్తూ బ్రహ్మ, విష్ణు మొదలైన దేవతలు అమ్మను వివిధ ద్రవ్యాలతో పూజించి ఆరాధించారు. వెంటనే అమ్మ సంతుష్టురాలయ్యింది. వేదాలను తిరిగి తెచ్చి ఇచ్చింది. వెంటనే మధురమైన స్వరంతో అందరిని, ముఖ్యంగా బ్రాహ్మణులను ఉద్ద్యేశించి ఈ విధంగా పలికింది. " వేదాలు నా శరీరంలో ముఖ్యమైన భాగాలు. కాబట్టి వేదం విషయంలో చాలా జాగ్రత్త తీసుకోండి. వేదం లేకపోతే ఎటువంటి కష్టనష్టాలు, ఉపద్రవాలు వస్తాయో, మీరు చూశారు. నన్నే నిత్యం పూజించండి. నిత్యం నా సేవ చేయండి. మీకు శుభాలు కలగడానికి ఇంతకంటే వేరెమార్గం లేదు. అత్యుత్తమమైన నా ఈ మహత్యాన్ని నిత్యం చదవండి. నేను పరసన్నురాలనవుతాను. మీకు ఉన్న ఆపదలను, భవిష్యత్తులో రాబోయే ఉపద్రవాలను మొత్తం ఈ విధంగా తీసేస్తాను.

దుర్గమాసుర సంహారం చేత నేను పొందిన 'దుర్గా' నామాన్ని, అక్షమయమైన కన్నులతో సాక్షాత్కరించాను కనుక నేను పొందిన 'శతాక్షి' అనే నామాన్ని నిత్యం ఎవరు స్మరిస్తారో వారు నా మాయ నుంచి విముక్తులై, పరమపదానికి నడుస్తారు, నేనే నడిపిస్తాను. ఈ సమయంలో నేను నా అసలు తత్వం మీతో ఇంకేమి చెప్పగలను. అనేక తత్వాలసారం నేను. నేనే అన్నిటి వెనుక ఉన్న అసలు తత్వాన్ని, అందరిని అన్నిటిని నడిపించేదానిని నేనే, దేవతలు, రాక్షసులు కూడా నన్నే ఆరాధిస్తారని గ్రహించండి, గుర్తించండి.

వ్యాస ఉవాచ:

ఈ విధంగా పలికి, సచ్చిదానంద స్వరూపిణి అయిన అమ్మ, జనులకు ఆనందం కలిగించి దేవతల కన్నుల ముందు నుంచి అదృశ్యమైంది. ఓ రాజా! జనమేజయ! అత్యంత రహస్యమైన, మహాగోప్యమైన ఈ కధను నీకు వివరించాను. 'గోపనీయం ప్రయత్నేన సకలకల్యాణకారకం' సకల కల్యాణాలను/శుభాలను కలిగించే ఈ కధను ప్రయత్నపూర్వకంగా అత్యంత రహస్యంగా ఉంచు (అంటే ఎవరు అడగకుండా చెప్పకు. ఒకవేళ ఈ కధ చెప్పినా అత్యంత శ్రద్ధగా ఎవరు వింటారో, ఎవరు కధను పరిహాసం చేయరో, వారికే చెప్పాలి). అత్యంత భక్తి తత్పరతో ఈ కధను ఎవరు నిత్యం వింటారో, పఠిస్తారో, వారి సకల కోరికలు తీరి, అంతిమంగా దేవీలోకానికి చేరుతారు.

ఇతి శ్రీ వ్యాసప్రోక్త శ్రీ దేవిభాగవతే మహాపురాణే సప్తమస్కంద అష్టాదశోధ్యాయః |

శ్రీ శాకంబరీ దేవీ ప్రకృతి స్వరూపం. పాడిపంటలకు అధిదేవత. శాకంబరీ దేవిని ఎక్కడ ఆరాధిస్తారో అక్కడ వర్షాలు బాగా కురుస్తాయి. శాంతి వర్ధిల్లుతుంది. ఆకలి బాధలు తీరిపోతాయి. అటువంటి శాకంబరీ దేవి ఆశీస్సులతో మన దేశం, ఈ సమస్త ప్రపంచం శాంతిసౌభాగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుందాం. పర్యావరణాన్ని రక్షిద్దాం.

ఓం శాంతిః శాంతిః శాంతిః 

No comments:

Post a Comment