Sunday 2 February 2014

హిందూ ధర్మం - 10

మతం ఎప్పుడు మానవులకే, అందునా దాన్ని అంగీకరించేవారికి పరిమితం అయ్యింది. మనం చెప్పుకుంటున్న ధర్మం మనుష్యులకే కాదు, అన్నిటికి అన్వయం అవుతుంది. జంతువులకు ఒక ధర్మం ఉంది. దాన్నే మన పశుధర్మం అంటాం. వాటికి ఉదయం లేచిన దగ్గరి నుంచి, ఆహారం కోసం వెతకడం, ఏదైనా జంతువు కనిపిస్తే దాన్ని చంపి తనడం, తన కడుపు నింపుకోవడం, తనకు హాని చేసే ఇతర జంతువులను చంపడం, తమ శారీరిక కోరికలను తీర్చుకోవడంలో బంధుత్వాలు వంటివి లేకపోవడం పశుధర్మం. అవి ప్రకృతి ధర్మానికి అనుగుణంగా, ప్రకృతి చక్రంలో భాగంగా జరుగుతున్నాయి. వీటిని కూడా భగవంతుండే నిర్ణయించాడు.

ఉదాహరణకు పక్షులనే గమనించండి. కొన్ని పక్షులు సూర్యోదయం వరకు గూడులోంచి కదలవు. సూర్యుడు రాగానే, ఆహారం కోసం బయటకు వస్తాయి, సూర్యాస్తమయానికి తిరిగి ఎట్టి పరిస్థుతుల్లోనూ గూళ్ళకు చేరుకుంటాయి. అట్లాగే కొన్ని పక్షులు రాత్రి బయటకు వస్తాయి. ఈ విధంగా, అవి కొన్ని నియమాలకు, కట్టుబాట్లకు లోబడి పనిచేస్తాయి. ఆ కట్టుబాట్లే వాటి ధర్మం. వాటిని ప్రక్రృతి నియంత్రిస్తుంది. పుట్టుకతోనే వాటికి వాటి ధర్మం తెలుసు. ఎందుకంటే ఒక్క మానవ జన్మ తప్ప, ఇతర జన్మలలో ఆత్మకు కర్మ చేయడంలో స్వేఛ్చలేదు. వాటికి కూడా మనసు ఉంటుంది, బుద్ధి ఉంటుంది, కానీ వాటి బుద్ధి పూర్వ జన్మవాసనల మీద ఆధారపడి ఉంటుంది. కానీ మనిషికి మాత్రం తను చేసే కర్మల మీద పూర్తి స్వేచ్చనిచ్చాడు, స్వతంత్రంగా ఆలోచించే బుద్ధినిచ్చాడు ఈశ్వరుడు. ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నవాడు భగవంతుడిని చేరితే, దుర్వినియోగం చేసుకున్నాడు మళ్ళీమళ్ళీ జంతువులుగా, పక్షులుగా పుట్టి బాధలు అనుభవిస్తాడు. అందుకే ప్రతి మనిషి ధర్మాన్ని తెలుసుకుని, ఆచరించి, తరించాలి.

అసలు మన ధర్మం ఏంటి? మనం ఏం ఏం ఆచరించాలి? ఏల బ్రతకాలి? ధర్మం లక్షణాలు ఏంటి? అదేమని భోధిస్తుంది వంటి విషయాలు తెలుసుకుందాం.

To be continued...................

No comments:

Post a Comment