Friday 3 March 2023

శ్రీదత్త పురాణము (67)


 కార్తవీర్యుడికి గర్గముని చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. దత్తుడు ఇంద్రాది దేవతల్ని పరీక్షించిన కధ గుర్తొచ్చింది. ఇప్పుడు ఇది తనకు కఠిన పరీక్ష. అంటే స్వామి అనుగ్రహించబోతున్నాడన్న మాట. ఇందులో నెగ్గితే తన కోరిక నెరవేరుతుంది. ఈ ఆలోచనలతో ధైర్యం వచ్చింది. దత్త స్వామితో ఇలా అన్నాడు. దత్త యోగీంద్రా నువ్వు సాక్షాత్తూ శ్రీ మన్నారాయణుడవని నా విశ్వాసం. ఈ తల్లి కలుముల కల్పవల్లి మహాలక్ష్మి. ఇక్కడ మీకు సేవచేస్తున్న పరిచారక గణం అంతా గంధర్వులు. వీరితో సహవాసము నీ సేవా భాగ్యము నాకు బహుజన్మ తపఃఫలం. ఏ రాజభోగాలు దీనికి సాటి రావు. స్వామి నీ కఠిన పరీక్షలు గురించి విన్నాను. నీ మాయలు కళ్ళారా చూసాను. ఇంద్రాది దేవతలకే అర్ధంకాదు నీ మాయలు. వాటిని అర్ధం చేసుకోవడం నువ్వు పెట్టే పరీక్షల్లో నెగ్గడం నా బోటి సామాన్య మానవుడికి అయ్యేపనా. స్వామి నువ్వు కరుణా మూర్తివని వేదాలు శాస్త్రాలు పొగుడుతున్నాయి. అలాంటి నీవు ఒక సామాన్య మానవుణ్ని ఇంతగా కఠిన పరీక్షలకు గురి చెయ్యడం భావ్యమా? నువ్వే వంచిస్తే మాకు దిక్కు ఎవరు? రక్షకుడెవరు? పోనీలే పరీక్షించు నీకు సంతృప్తి కలిగే దాకా పరీక్షించు. రెండు చేతులే కాదు రెండు కాళ్ళు పోయినా ఫరవాలేదు. చివరకు ప్రాణాలు పోయినా ఇబ్బంది లేదు. నీ సేవ వదలను. నీ సన్నిధిని విడిచిపెట్టను.


అవతలకి పొమ్మని మాత్రం ఆజ్ఞాపించకు. అదే పదివేలు అంటూ కార్తవీర్యార్జునుడు ఆపుకోలేని దుఃఖంతో సాష్టాంగపడ్డాడు. కన్నీళ్ళతో కాళ్ళు కడిగాడు. దత్తాత్రేయుడు చిరునవ్వులు చిందిస్తూ మురిసిపోయాడు.


కార్తవీర్యా, లే నీ భక్తికి సంతోషించాను. నీ జ్ఞానానికి ఆనందించాను. నీ సేవలకు సంతృప్తి చెందాను. లే లేచి వరం కోరుకో నీకు కావలసింది ప్రసాదిస్తాను. లక్ష్మీ సమేతుడుగా (అనఘ) నన్ను సేవించిన వారికి మృష్టాన్న మద్యమాంసాదులు నాకు నివేదనలు చేసిన వారికి, వీణా వేణు శంఖాదులు మ్రోగిస్తూ సంగీత సాహిత్య నృత్యాలతో నన్ను ఆరాధించిన వారికి, వేద శాస్త్ర పండితులను సత్కరించే వారికి, నేను కోరికలన్నీ తీరుస్తాను. పుత్ర పౌత్రాభి వృద్ధిని ధన ధాన్య భోగభాగ్య సమృద్ధిని ఆయురారోగ్యములను తనివితీరా ప్రసాదిస్తాను. నన్ను శంకించే వారిని అవమానించే వారిని నిర్ధాక్షిణ్యంగా అణిచిపారేస్తాను. కార్తవీర్యార్జునా ఇది నా దీక్ష నీ మీద నాకు అనుగ్రహం కలిగింది. నీకు ఏమేమి కావాలో నిస్సంసయంగా కోరుకో వెంటనే తీరుస్తాను అన్నారు దత్తస్వామి.


కార్తవీర్యుడు మనస్సులో కళ్ళల్లో ఆనదం వెల్లివిరిసింది. కళ్ళల్లో ఆనంద భాష్పాలు రాలాయి. మెల్లగా లేచి నిలబడ్డాడు స్వామి వైపు సవినయంగా చూస్తూ శిరస్సు వంచి మెల్లగా చిన్న స్వరంతో ఇలా అన్నాడు.

No comments:

Post a Comment