Saturday 18 March 2023

శ్రీదత్త పురాణము (82)

 


నాగరాజా! మీరు నాకు ఆభరణములు. అందుకని మీరు అంటేనే నాకు ప్రత్యేకమైన ప్రేమ. ఈ కోరికతో అది రెట్టింపు అయ్యింది. కువలయాశ్వుడి సౌఖ్యం కోసం మీరు వరమడుగుతున్నారు. మీ కోరిక తప్పక నెరవేరుతుంది. మదాలస నీ ఇంట కూతురై పునర్భవం పొందుతుంది. దీనికి నీవు చేయవలసిన పని ఒకటుంది. నీ యింట జరిగే పితృతిధినాడు మధ్యమ పిండాన్ని నువ్వు భుజించాలి. మదాలసను తలుచుకుంటూ భుజించాలి. పితృ పూజ చెయ్యాలి. ఆ క్షణంలోనే మదాలస యధాతధంగా అంటే మరణించినప్పటి వయోరూప గుణాలతో ఆవిర్భవిస్తుంది.


కంబలాశ్వతరులను ఆశీర్వదించి కాలకంఠుడు అదృశ్యమయ్యాడు. సోదరులిద్దరూ సంతోషంగా పాతాళానికి తిరిగి వెళ్ళారు. పితృతిధి వచ్చింది. ఈ సారి సోదరులిద్దరే ఏకాంతంగా శ్రద్ధగా శ్రాద్ధ విధులు నిర్వహించారు. మధ్యమ పిండాన్ని శివుడి ఆజ్ఞ ప్రకారం మదాలసను స్మరిస్తూ అశ్వతరుడు భుజించాడు. చిన్నగా నిట్టూర్పు విడిచాడు. అదే సమయంలో అతడి మధ్యమ ఫణాగ్రభాగం నుండి మదాలస సద్యోయౌవనంతో ఆవిర్భవించింది. ఈ విషయాన్ని రహస్యంగా వుంచాలని సోదరులిద్దరూ నిర్ణయించుకున్నారు.


తనకు విశ్వాస పాత్రమైన ఇద్దరు నాగకన్యలను పిలచి మదాలసకు తోడు ఇచ్చి రహస్య స్థావరంలో విడిది ఏర్పాటు చేసారు.


ఋతుధ్వజునికి బహుకరించడం కోసం మదాలసను పునరుజ్జీవితురాలిని చేస్తానని తపస్సుకు వెళ్ళిన తండ్రి ఇంటికి తిరిగి వచ్చాడే తప్ప తెచ్చిందేమీ కనిపించలేదు నాగకుమారులకి ఏమయ్యిందని అడిగే ధైర్యంలేక మిన్న కుండపోయారు. ఎప్పటిలాగే బ్రాహ్మణ బాలుర రూపాలు ధరించి భూలోకానికి వెళ్ళి ఋతుధ్వజుడితో ఆడుతూ వున్నారు. ఒక రోజు నాగరాజు తన బిడ్డలిద్దరిని దగ్గరికి పిలచి చెరొక తొడపై కూర్చోపెట్టుకొని ఇలా అన్నాడు. మీరిద్దరూ భూలోకినికెళ్ళి ఋతుధ్వజునితో క్రీడిస్తూవున్నారు. బాగానే ఉంది. ఒక్కసారి అయినా అతన్ని మన లోకానికి తీసుకురాలేదేమి. ఇదేనా స్నేహమంటే! అతడికి మీరు ఏదో ప్రత్యుపకారం చెయ్యాలని అనుకున్నారు. మళ్ళీ ఆ మాటే అడగలేదు. ఏ లోకంలోనైనా ప్రయాణం చేసే కువలయాశ్వం అతని దగ్గరవుంది అన్నారు గదా దాన్ని ఎక్కి రమ్మనండి. నా ఆహ్వానంగా చెప్పండి అన్నాడు నాగరాజు.


నాగ కుమారులు సంబరపడ్డారు. తండ్రి ఎందుకో చెప్పడంలేదు కానీ ఏదో కధవుంది అని ఊహించారు. వెంటనే బయలుదేరి భూలోకం చేరుకున్నారు. బ్రాహ్మణ బాలకులుగా మారిపోయారు. ఋతుధ్వజుణ్ని కలుసుకున్నారు. కాసేపు ఆట పాటలు అయ్యాయి. మిత్రమా మనం ఇన్నాళ్ళు కలసి మెలసి తిరిగాం నువ్వు మాత్రం ఒక్కసారి అయినా మా యింటికి రాలేదు. రమ్మని పిలవందే రాకుమారుడివి ఎలా వస్తావు? పిలవనితప్పు మాదే. మా తండ్రిగారు ప్రత్యేకంగా చెప్పమన్నారు. వారు నిన్ను చూడాలంటున్నారు. నీ రాచమర్యాదలకు భంగం కలగదు అనుకుంటే మా ఆహ్వానం మన్నించు. మా ఇంటిని ఒకసారి దర్శించు. అని బ్రాహ్మణ బాలురు పలుకుతూ వుంటే ఋతధ్వజుడు ఎంతో ఆనందించి సంబరపడ్డాడు. ఎప్పుడో ఎందుకు ఇప్పుడే పెడదాం పదండి. మిత్రుల ఇళ్ళకు వెళ్ళడానికి రాచమర్యాదలు ఎందుకు? మీ తండ్రిగారు రమ్మన్నారు అన్నారుగదా వారికి నా మీద ప్రేమ కలుగడం నిజంగా నా అదృష్టం. వారిని దర్శించి ఆశీస్సులు పొందుతాను. పెద్దల ఆశీస్సులు ఆమోఘంగా పనిచేస్తాయి. నడవండి వెళదాం మీ ఇల్లు ఎక్కడో నాకు తెలీదు. దూరమా దగ్గరా? నడిచి వెడదామా! లేదా కువలయాశ్వాన్ని పిలవనా? అని అడుగుతూంటే ఋతధ్వజుడి అంగీకారానికి మురిసిపోయారు నాగ కుమారులు.

No comments:

Post a Comment