Sunday 12 March 2023

శ్రీదత్త పురాణము (76)

 

మదాలసను తన దివ్యాశ్యం మీద ఎక్కించుకొని భూలోకానికి బయలు దేరపోతున్నాడు కువలయాశ్వుడు. సరిగ్గా అదే సమయానికి పాతాళకేతువు సైన్యంతో వచ్చిపడ్డాడు. జాగ్రత్తగా కూర్చోమని మదాలసను హెచ్చరించి కువలయాశ్వుడు ధనుష్టంకారం చేశాడు. ఆ దివ్యాస్త్రం మీద అనూహ్యమైన వేగంతో అనుహ్యమైన దారుల్లో మెరుపుతీగలా తిరుగుతూ మొత్తం దైత్యమహాసైన్యాన్ని అవలీలగా సంహరించాడు. పాతాళకేతువును ఖండించి విజయశంఖం పూరించాడు. తాళకేతువు తన అనుచరులు మరికొంతమందితో పలాయనం చిత్తగించాడు.


మదాలసా సహితుడై కువలయాశ్వుడు భూలోకానికి వచ్చి గాలవమహర్షికి నమస్కరించి పాతాళకేతు వధను వివరించి ఆశీస్సులు అందుకొని తన రాజధానికి వెళ్ళిపోయాడు. కువలయాశ్వానికి తగిన విడిది ఏర్పాటు చేయించాడు. తల్లిదండ్రులకు ఆ నవ దంపతులు పాదాభివందనం చేసి, దీవెనలు అందుకొని, అంతఃపురంలో ప్రవేశించారు. రాజభోగాలు అనుభవిస్తూ శృంగార క్రీడా విలాస వినోదాలతో మురిసిపోతున్నారు.


తాళ కేతువు కుతంత్రం


కొడుకూ కోడళ్ళ అనుకూల దాంపత్యాన్ని చూసి సంబరపడి పోతున్న శత్రుజిన్మహారాజు ఒకరోజు కొడుకును చేరబిలచి ఇలా అన్నాడు. నాయనా కుమారా అప్పుడప్పుడు సాయంకాలం వేళల్లో అయినా ముని వాటికల వైపుకి వెళ్ళి ఆశ్రమవాసుల క్షేమ సమాచారములు తెలుసుకొని వస్తూవుండు. వారి కుశలమే మన కుశలం. వారి దీవెనలే మనకు శ్రీరామరక్ష. ఇది మన రాజ ధర్మం కూడా అని మృదువుగా ఉపదేశించాడు. ఋతుధ్వజుడు అంగీకరించి మరునాటి సాయంకాలం కువలయాశ్వాన్ని అధిరోహించి పవిత్ర యమునాతీరంలోని అడవిలోకి వెళ్ళాడు. అక్కడొక దివ్యమైన ఆశ్రమం కనిపించింది. చిత్ర విచిత్ర విరాజితమైన పర్ణశాలలు కనిపించాయి. ఒక్కొక్క పర్ణశాలలో నేల కూడ ఒక్కొక్క రంగులో వుంది. ఆ పర్ణశాలల చుట్టూతా తీర్చిదిద్దబడిన అందమైన ఉద్యానవనములు. ఆ వనాలలో వివిధ రూపాల్లో ఉన్న పొదరిల్లులు. కొన్ని దేవతామూర్తుల రూపాల్లో, కొన్ని రధాకారాలలో కొన్ని గజాశ్వాది జంతువుల ఆకృతిలో కొన్ని వివిధ పక్షి జాతుల రూపాలలో ఉన్నాయి. వివిధ కంఠ స్వరాలతో పలకరిస్తున్న పక్షులు జంతువులు కనీ వినీ ఎరుగని పువ్వులు, ఫలాలు. ఆశ్చర్యచకితుడై ఋతధ్వజుడు ఆశ్రమం అంతటా తిరిగాడు. తను ఏ ప్రక్కకు వెళ్ళినా పచ్చని స్వాగత తోరణాలు అప్పుడే తనకోసమే కట్టినట్లుగా వున్నాయి. ఋతధ్వజుని ఆనందానికి అంతులేకుండా పోయింది. పర్ణశాలల నుండి మెల్లగా పెల్లుబికి వస్తున్న హోమధూపం, బూడిద వర్ణంలో వినువీధికి ప్రయాణం చేస్తుంది. పెద్ద వృక్షవాటికల క్రింద వేదపనసలకు సంతచెప్పుకుంటున్న శిష్యబృందాలు. ఇంతలో ఒక పర్ణశాల దగ్గర ఒక మహర్షి తన కోసమే ఎదురు చూస్తూవున్నట్లుగా అర్ఘ్యపాత్రతో కనిపించాడు. ఆ మహర్షి ముఖంలో తేజస్సు కన్పిస్తోంది, కానీ కన్నుల్లో ప్రశాంతి కనబడటం లేదు. ఆ మహర్షి ఏదో కలత చెంది కలవరపడుతున్నట్లు అనిపించింది. ఋతధ్వజుడు దగ్గరికి వెళ్ళి పాదాభివందనం చేశాడు. మహర్షి సాదరంగా ఆత్మీయంగా దారితీసాడు. మహర్షీ తమరెవరు? మీ చూపుల్లో ఏదో కలవరపాటు కన్పిస్తోంది నిజమో అది నా భ్రాంతియో. మీ ఆశ్రమానికి ఏ రాక్షసుల పీడలు లేవుగదా క్రూరమృగాల బెడద కూడా లేదు కదా. ఫలం, పుష్పం సమిధలు, జలం ఇవన్ని మీకు సమృద్ధిగా లభిస్తున్నాయా? మా తండ్రిగారు శత్రుజిన్మహారాజు మిమ్మల్ని దర్శించి కుశల వార్తలు తెలుసుకొని రమ్మన్నారు అన్నాడు.


No comments:

Post a Comment