Monday 13 March 2023

శ్రీదత్త పురాణము (77)



అప్పుడా మహర్షి నాయనా రాకుమారా! తండ్రికి తగిన తనయుడవు నీవు. చాలా సంతోషంగావుంది. అడవిలో కందమూల ఫలాదులు తింటూ జీవించేవాళ్ళం అడవిలో మాకు ఎలాంటి బాధలు లేవు హాయిగా మా జపాలు మా తపస్సులు చేసుకుంటున్నాం అయినా అడివిలోకి వచ్చి మా క్షేమ సమాచారములు కనుక్కొనే పాలకులు వుండడం మా అదృష్టం. అయితే నా కన్నుల్లో దాగిన కలవర పాటును నీవు గ్రహించావు. దానికి కారణం వుంది. నేను ఒక యజ్ఞం చేస్తున్నాను. అది ముగింపుకొచ్చింది. ఇప్పుడు భూరిదక్షిణలు సమకూర్చుకోవాలి. ఎలాగా అనే దిగులు. బహుశ అదే నా కన్నుల్లో నీకు కనిపించివుంటుంది. నీకు అభ్యంతరం లేకపోతే నీ మెడలో ధగధగలాడుతున్న రత్న హారాన్ని ఇచ్చి వెళ్ళు అన్నాడు. ఆ మహర్షి అడగడమేమిటి రాకుమారుడు ఇవ్వడం తక్షణం జరిగిపోయాయి. అప్పుడా మహర్షి రాకుమారా నీ దాతృత్వం నన్ను మురిపిస్తోంది. సంతోషం. ఇక్కడేవుండు. నేనొకసారి యమునానదికి వెళ్ళి జలాధి దేవతను అర్చించి ఇప్పుడే వస్తాను. నీకు ఆశీస్సులిస్తాను. అవి అందుకొని వెడుదువుగాని అంటూ ఆ మహర్షి త్వరత్వరగా నదివైపుకి వెళ్ళాడు.


పిచ్చివాడు నన్ను నిజంగానే మహర్షి అనుకుంటున్నాడు. ఇది నిజంగానే ఆశ్రమం అనుకొంటున్నాడు. కన్నుల్లో కలవరపాటుని గుర్తించాడు కానీ నన్ను తాళకేతువుగా గుర్తించలేకపోయాడు. నా అన్న పాతాళ కేతువును సంహరించిన ఈ దుష్టుడికి తగిన ప్రతీకారం చేస్తాను. నా అన్న ఆత్మకు శాంతి కలిగిస్తాను అనుకున్నాడు దొంగ మహర్షి ఋతధ్వజుడు. చేతికి చిక్కాడన్న సంబరంతో తాళకేతువు యమునా నదిలోకి దిగాడు. తన మాయాశక్తితో అదృశ్యమై వెళ్ళి శత్రుజిన్మహారాజు ముందు ప్రత్యక్షమయ్యాడు.


భార్యతో, కోడలి కూర్చుని ఆ మహారాజు ఏదో వినోదం తిలకిస్తున్నాడు. హఠాత్తుగా ప్రత్యక్షమైన మహర్షిని చూసి ఆశ్చర్యంతో అందరూ లేచి నిలబడ్డారు. పరిచారకులు అర్ఘ్యపాద్యాదులు సమకూర్చారు. అతిధి మర్యాదలు జరిపారు. మహారాజా నాకు నోరు రావడంలేదు. ఇంతటి అప్రియమైన వార్తను నీకు అందించవలసిన దుఃస్థితి నా నొసటరాశాడు భగవంతుడు. ఇదిగో కంఠహారం మీ కుమారుడిది. ఎవడో మాయావిరాక్షసుడు ఋతధ్వజున్ని పొట్టన బెట్టుకున్నాడు. కువలయాశ్వాన్ని అపహరించుకుపోయాడు. మా ఆశ్రమానికి చేరువలోనే ఈ ఘోరం జరిగింది. ఆశ్రమ వాసులందరూ కలసి రాకుమారుని పార్థివ శరీరానికి అంత్యక్రియలు జరిపించారు. ఈ రత్నహారాన్ని మీకు అందించి మిమ్మల్ని ఓదార్చి ధైర్యం చెప్పి రమ్మని నన్ను పంపించారు మా ఆశ్రమవాసులందరూ. నా తపశ్శక్తిని ధారపోసి వాయువేగను నోవేగములతో నీ ముందు ప్రత్యక్షమయ్యాను. మహారాజా ఆనిత్యాని శరీరాణి ఉన్నారు. జాతస్య హి ధ్రువో మృత్యు అన్నారు. నీకు తెలియనివి కావు. తాపసులం మమ్మల్నే ఈ సంఘటన కంటతడి పెట్టించింది. ఇక కన్నవారి సంగతి కట్టుకున్న వారి సంగతి వేరే చెప్పాలా? గుండె దిటవు చేసుకోండి. చిన్నపిల్ల మదాలసను ఓదార్చండి అంటూ వచ్చినంత వేగంగానూ మాయమయ్యాడు.


No comments:

Post a Comment