Monday 27 March 2023

శ్రీదత్త పురాణము (91)


 

సుబాహువు వెంటనే కాశీరాజును కలుసుకున్నాడు. మదాలసాకువల యశ్వులకు మేము నలుగురు పుత్రులం. పై ముగ్గుర్నీ కాదని నాల్గవవాడు అలర్కుడు రాజ్యం కాజేశాడని ఇది అన్యాయం కనుక నువ్వు దండెత్తి అతణ్ని ఓడించి రాజ్యద్రుష్ణుడ్ని చేసి తమ రాజ్యం తమకు అప్పగించమని వేడుకున్నాడు. కాశీరాజు ముందే దండయాత్రకు అంగీకరించలేదు. ముందుగా యోగ్యుడైన దూతను పంపాడు. సహజంగానే అలర్కుడు అహంకారంతో కాశీరాజు ప్రతిపాదనను తిరస్కరించాడు. సుబాహువునే స్వయంగా వచ్చి అర్థించమనండి మంచిగా అడిగితే ఇస్తాను. అంతేగానీ శత్రువులను ఆశ్రయించి ఇలా దూతలను పంపిస్తే మాత్రం బెదిరింపులకు లొంగను అని సమాధానం పంపాడు. సుబాహువు తన అభిమానం దెబ్బతిన్నట్లుగా నటించాడు. కాశీరాజును మాటలతో ఎగత్రోశాడు. మీరు పంపిన సందేశాన్ని తిరస్కరించటం అంటే మిమ్మల్ని తిరస్కరించటమే సమర్థుడైన క్షత్రియుడు తిరస్కారాలను భరిస్తాడా?


వెళ్ళి యాచిస్తాడా? ఇంకదండోపాయ మొక్కటే మార్గం అన్నాడు. కాశీరాజు అవునని సర్వసేనాసమేతుడై అలర్కుడిపై దండెత్తాడు. గిరిదుర్గాలను, వనదుర్గాలను ఆక్రమించుకుని ఆటవికరాజులను లోబరుచుకుని అలర్కుడి సామంతులను తొలగించి తన వారికి అప్పగించి ఇలా ఒక పథకం ప్రకారం అలర్కుడి రాజ్యాన్ని అన్నివైపుల నుండీ ఆక్రమించాడు కాశీరాజు. అలర్కుడి యొక్క ప్రతిఘటనలు, ప్రయత్నాలు ఫలించలేదు. దైవమే అనుకూలించనప్పుడు అన్నీ ఎదురుదెబ్బలే. అన్ని అపజయాలే. వృధాగా అహంకరించటం తప్ప మానవమాత్రుడు ఏ పాటి. అలర్కుడిలో భరింపరాని విషాదం అలుముకుంది. అలనాడు తల్లి ఇచ్చిన ఉంగరం గుర్తుకు వచ్చింది. భరింపరాని దుఃఖం కలిగినప్పుడు అది తెరిచి అందులో వున్న శాసనాన్ని చదవమంది తల్లి మదాలస. త్వరత్వరగా స్నానం చేసి శుచిగా ఆ వుంగరం విప్పిచూశాడు. అందులో చిన్న బంగారురేకు వుంది. మెల్లగా పైకితీశాడు. కళ్ళకి అద్దుకున్నాడు. ఆ రేకు మీద సన్నటి అక్షరాల్లో రెండు శ్లోకాలు వున్నాయి.


1.శ్లో: సంగసర్వాత్మనా త్యాజ్య: సుచేత్ త్యక్తుం న శక్యతే || 

స సబ్దిసృహ కర్తవ్యః సద్భిస్సంగోః స భేషజమ్ |


2.శ్లో: కామస్సర్వాత్మనా హేయః హాతుం చేత్ శక్యతే న సః॥ 

ముముక్షాం ప్రతి కర్తవ్యో సాపై తస్యాసి భీషణమ్ | 

విడువవలయు విడువవలయు సంగమ్ము విడువవలయు 

విడువలేని ఎడల వలయు సత్సంగ మొనరింపవలయు 

సతనము సంగ రోగౌషధము సత్సంగ మిలలో-

విడువవలయు విడువవలయు కామమ్ము విడువవలయు

విడువలేని ఎడల మోక్షకామమునెప్పుడు కోరవలయు

కామరోగౌషధమ్ము మోక్షకామమ్ము ఇలలో.


దేనితోనూ సంగం పనికిరాదు. దాన్ని పూర్తిగా విడిచిపెట్టాలి. విడవడం సాధ్యం కాకపోతే దాన్ని సత్సంగంగా మలుచుకోవాలి. సజ్జనులతో సాంగత్యం పెంచుకుంటే అదే సంగవిముక్తికి మహాఔషధం. అలాగే కామమనేది అన్ని విధాల ప్రమాదకరమైనది. దాన్ని కూడా వదిలించుకోవాలి. అది శక్యంకాకపోతే దాన్ని మోక్షం వైపుకి మళ్ళించాలి. ముక్తి కాముకుడు కావాలి. కామత్యాగానికి ఇదొక్కటే సరియైన మందు. ఈ రెండు శ్లోకాలు పదాలు పదే పదే ఉచ్ఛరించాడు. భావం హృదయానికెక్కింది. ముక్తికామమే ఉత్తమోమమని విశ్చయించుకున్నాడు. దాన్ని సాధించాలంటే సత్సంగం. మొదటి మెట్టు అని గ్రహించాడు. సాధు సజ్జనుల కోసం ఆలోచించాడు. దత్తాత్రేయుడు గుర్తుకి వచ్చాడు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా సహ్యాద్రికి బయలుదేరాడు. దత్తుణ్ని దర్శించాడు. పాదాలపై బడి సాష్టాంగ నమస్కారం చేశాడు. మహాత్మా నిన్ను శరణు వేడుతున్నాను. నీవేదిక్కు కరుణించు. దుఃఖార్తుడనై వచ్చాను. దయచేసి నా దుఃఖం తొలగించు - అని దీనాతిదీనంగా ప్రార్థించాడు.


No comments:

Post a Comment