Sunday 5 March 2023

శ్రీదత్త పురాణము (69)

 

దత్తస్వామి తనకు వరాలు ఇచ్చిన రోజు ఏటేటా గుర్తు చేసుకుంటూ ఆ రోజు ప్రత్యేకంగా దత్త పూజా మహోత్సవాలు జరుపుతూవున్నాడు. వీటిలో ప్రజలంతా ఉత్సాహంగా పాల్గొనేటట్లుగా చేస్తున్నాడు. అతడి చేష్టలు చిత్రాతి చిత్రంగా వుంటున్నాయి. ఉన్నట్లుండి ఒక్కొక్క రోజున దత్త దర్శనమున కెళ్లాడు. నమస్కరించి వెంటనే తిరిగి వస్తూ వుంటాడు. ఒక్కొ రోజున అక్కడే ఉండిపోతూ వుంటాడు. ధర్మ శాస్త్రాలు యోగవిద్యలూ పండితులతో చెప్పించుకొని వింటూ వుంటాడు. వారిని బహుదా సేవిస్తూ వుంటాడు. వారిని అనేక విషయాలు అడిగి తెలుసుకుంటూ వుంటాడు. దత్తుడి గురించి తానేమి విన్నాడో అన్నీ తన ప్రజలకు వివరిస్తూ వుంటాడు. అతడికి దాచవలసింది ఏమీ లేదు.


ఒక రోజు కార్తవీర్యుడు తన అంతఃపుర కాంతలతో కలసి రేవానదిలో క్రీడిస్తూ వున్నాడు. ఉన్నట్లుండి అతడికి వింత ఆలోచన వచ్చింది, తనలో నుండి సహస్ర బాహువులను ఆవిర్భవింపజేసాడు. రేవానదిని అడ్డగించాడు. ఒకప్రక్క అయిదువందల చేతులు ఇంకొక ప్రక్క అయిదువందల చేతులు వేసి మధ్యలో తాను వుండి రేవానదికి ఆనకట్ట వేశాడు. ప్రవాహం ఆగిపోయింది. ఒక్క చుక్క నీరు కూడా ముందుకు సాగలేదు. నీరంతా ఎగదన్నింది. వెనుకవైపున దూరంగా ఎక్కడో విడిది చేసిన రావణాసురుని సేనా శిబిరాలను రేవానది ముంచివేసింది. రావణుడికి కోపం వచ్చింది. మేఘంలేని వానలాగ వర్షంలేని ఈ వరద ఏమిటని హుంకరించి విషయం ఏమిటో తెలుసుకొనిరమ్మని భటులను పంపాడు. వాళ్ళు వచ్చి చూసి సంగతి తెలియజేసారు. ఆడవాళ్ళతో జలకాలాటకు వచ్చిన కార్తవీర్యుడు ఒంటరిగా దొరికాడు కనుక తేలికగా జయింపవచ్చునని భావించాడు రావణుడు. సైన్యంతో వచ్చి చుట్టుముట్టాడు. అర్జునుడు చిద్విలాసంగా నవ్వుతూ నదిలో నుండి లేచి వచ్చాడు. తనకున్న సిద్దులతో ఎంతమంది రాక్షసులు వున్నారో అన్ని రూపాలను ధరించి అందర్ని క్షణంలో మట్టుబెట్టాడు. రావణాసురుణ్ని వెయ్యి చేతులతో పట్టుకొని బంధించి వాడి ఇరవై చేతులను విరిచికట్టేసి తన రాజ్యానికి తీసికెళ్ళి చెరసాలలో బంధించాడు.


కొన్ని రోజులకు ఈ వార్త లంకాపట్టణమంతా తెలిసి పోయింది. దశకంఠుడి తాతగారు పులస్త్య బ్రహ్మ వచ్చి కార్తవీర్యుణ్ణి అభ్యర్ధించి మనవణ్ణి విడిపించుకుపోయాడు.


కార్తవీర్యార్జునుడికి ఇలాంటి దివ్యశక్తులూ మహిమలు దత్తస్వామి అనుగ్రహం వల్ల లభించాయి. దత్తాత్రేయుడంటే సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడే శంక చక్ర గదాధారి. అతడే పరాత్పరుడు అతడే వాసుదేవుడు. అతడే మహా మాయతో కలసి ఈ చరాచర జగత్తుకి సృష్టి, స్థితి, లయాలు జరుపుతూ వుంటాడు. ఇతడికన్నా అన్వేషింపదగిన వస్తువులేదు. ధ్యానింపదగిన శక్తిలేదు. కర్మబంధనాలు త్రెంచి ముక్తిని ప్రసాదించే హృషీకేశుడు ఇతడే. శ్రీహరికి దత్తరూపమే ఉత్తమోత్తమం. త్రికరణశుద్ధిగా చేస్తే చాలు అనుగ్రహం కురిపిస్తాడు. నేను భక్తికి దాసుణ్ని భక్తితో పత్రంగాని, పుష్పంగాని, ఫలంగాని, చివరకు కాసిన్ని మంచినీళ్ళుగాని నాకు సమర్పించండి నేను మిమ్మల్ని కాపాడుతాను అనేది స్వామి వారి ప్రతిజ్ఞ. ధర్మ సంస్థాపనకు అధర్మ నిర్మూలనకు శిష్ట రక్షణకూ దుష్ట శిక్షణకూ బద్ధ కంకణుడై శ్రీహరి దత్తావతారం ధరించాడు.


No comments:

Post a Comment