Thursday 30 March 2023

శ్రీదత్త పురాణము (94)

 


సంసార మహాయాత్రలో అలిసిపోయి భ్రాంతచిత్తులై దీని నీడకు చేరినవారికి సుఖమనేది ఎలా లభిస్తుంది చెప్పు? సత్సంగం అనే రాయి మీద బాగా పదును బెట్టిన జ్ఞానఖడ్గంతో ఈ మమతా మహాతరువుని నరికి వెయ్యగలిగిన వారికి ఆత్మమార్గం కనిపిస్తుంది. వారు ఆ దారిన ప్రయాణించి శాంతమూ నీరజస్కమూ నిష్కంటకమూ అయిన బ్రహ్మవనాన్ని చేరుకుంటారు. అప్పుడు అక్కడ పునరావృత్తి వర్జితమైన నివృత్తిని పరాప్రజ్ఞను అందుకుంటారు. పంచభూతాలతో పంచేద్రియాలతో నిర్మితమైన ఈ స్థూలశరీరం నువ్వు కావు. నేనూ కాను, పంచతన్మాత్రికాధికంతో ఏర్పడిన సూక్ష్మశరీరం నువ్వు కావు, నేను కాను.


రాజా! గుణాత్మకమూ సంఘాత రూపమూ అయిన ఈ దేహంతో ప్రధానుణ్ని దర్శించగలుగుతున్నావా?


మేడిపండు, మశకమూ, నీరు, చేప, నిషీకమూ ముంజుగడ్డి (ధర్భ) వీటి సంబంధం లాంటిదే క్షేత్ర ఆత్మల సంబంధం.


వీటి లోతును తెలుసుకున్నావు సంతోషం.


అలర్కుడికి దుఃఖం తొలగిపోయింది. కానీ మళ్ళీ అదే విషయాలు - రాజ్యమూ . రాజభోగాలూ ఆక్రమణలూ యుద్ధాలూ జ్ఞాపకం వస్తున్నాయి. దుఃఖం తొలగినట్టే తొలగి మళ్ళీ వచ్చి ఆవరిస్తోంది. శాశ్వతంగా దుఃఖాన్ని తొలగించుకోవాలనుకున్నాడు. దత్తాత్రేయుల వారిని ప్రశ్నించాడు.


దత్తదేవా! నీ దయ వల్ల నాకు జ్ఞానోదయం అయ్యింది. ప్రకృతి-పురుష వివేకం కలిగింది. నేను అంటే ఏమిటో తెలిసింది. దుఃఖం అంతరించింది. కానీ ఈ స్థితి స్థిరంగా ఉండేట్టు కనిపించటం లేదు. మళ్ళీ అజ్ఞానం ఆవరించి దుఃఖానుభవం తొంగి చూస్తోంది. దుఃఖరహితస్థితిని స్థిరపరచుకొనే ఉపాయం చెప్పు. ప్రకృతి బంధాన్ని శాశ్వతంగా తెంచుకోవటం ఎలాగో ఉపదేశించు. పునర్భవం లేకుండా నిర్గుణ పరబ్రహ్మంతో శాశ్వతంగా ఐక్యం మార్గం పొందే చూపించు. నువ్వు తప్ప నాకు శరణ్యులు లేదు. అనుగ్రహించు. అలర్కుడి ప్రార్థనను దత్తుడు మన్నించాడు. అతడిలో భక్తినీ, ఆర్తిని గుర్తించి అతి రహస్యమైన యోగవిద్యను ఇలా ఉపదేశించాడు.


అలర్క నృపాలా! నీ జిజ్ఞాసకు ఆనందించి ఈ రహస్య విద్యను ఉపదేశిస్తున్నాను. శ్రద్ధగా గ్రహించు. ప్రకృతి పురుషులు వేరు వేరని తెలుసుకున్నావు గదా! పురుషుడు ఆ ప్రకృతి గుణాలతో కలిసిపోకుండా బ్రహ్మపదార్థంతో కలవటమే ముక్తి అంటే.

ఈ శరీరం తుచ్చమూ, నశ్వరమూ అయినా, ఇది పూర్తిగా తిరస్కరింపతగినది, త్యజింపదగినది కాదు. దీని వల్ల కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ధర్మసాధనకు, కర్మసాధనకు మూలం ఇదే. ఈ శరీరంతోనే స్థిరమైన వివేకాన్ని సంపాదించుకోవాలి. అవివేకం వల్ల మమకారం, మమకారం వల్ల సంగం, సంగం వల్ల దుఃఖం కలుగుతున్నాయి. కనుక సంగాన్ని వదులుకోవాలి. అప్పుడే యోగసిద్ధి కలుగుతుంది. అదే ముక్తి అంటే. వీటిని తొలగించుకుంటూ వెళ్తూ సంగం వదిలించుకుంటే మమకారం నశిస్తుంది. మమకారం నశిస్తే వైరాగ్యం ఉదయిస్తుంది. ఇది ఉదయించగానే సృష్టిలో ఉన్న సమస్త పదార్థాలలో దోషాలు కనిపిస్తాయి. దోషాలు కనిపించినపుడు ఆ పదార్థాల మీద అనురాగం కలుగుతుందా? కలుగదు. అందుచేతనే జ్ఞానికి ఉన్న చోటనే ఇల్లు. తిన్నదే భోజనం. దేని మీద మమకారం ఉండదు. అభిలాష ఉండదు. ఈ కొంచెం (దినుసు) వైరాగ్యాన్నే జ్ఞానం అంటారు. ఇదే మోక్ష సాధనం. తక్కినదంతా అజ్ఞానం. జ్ఞానము, వైరాగ్యము పరస్పర పోషకాలు. 

No comments:

Post a Comment