Tuesday 14 March 2023

శ్రీదత్త పురాణము (78)

 


ఋతధ్వజుడి తల్లితండ్రులు ఈ పిడుగులాంటి దుర్వార్తను తట్టుకోలేక మూర్చపోయారు. మదాలస అయితే ప్రాణాలనే వదిలేసింది. కాసేపటికి తెలివి వచ్చిన అత్తమామలుకి ఈ వార్త మరొక అశనిపాతమయ్యింది. రాజధానిలో విషాద వాతావరణం అలుముకుంది. రాజధానిలో మాయమైన కపట మహర్షి తాళకేతువు మళ్ళీ ఇక్కడ ఆశ్రమంలో ప్రత్యక్షమైనాడు. తన రాక కొరకు ఎదురుచూస్తున్న ఋతధ్వజుడ్ని మృదువుగా కౌగలించుకొని చిరంజీవ చిరంజీవ అని ఆశీర్వదించాడు. నాయనా రాకుమారా నన్ను కృతార్ధుణ్ణి చేసావు. చాలా సంతోషం. నేను చెయ్యాలని అనుకున్న వన్నీ చేసేశాను. నీకు ఆశీస్సులు కూడా ఇచ్చేశాను. కనుక నువ్వు ఇంక నీ రాజ్యానికి బయలుదేరవచ్చు అన్నాడు. ఋతధ్వజుడు మాయా మహర్షికి మరో మారు సాష్టాంగ నమస్కారం చేసి సెలవు తీసికొని తన కువలయాశ్వం అధిరోహించి రాజధానికి చేరుకున్నాడు. తనను చూసిన పౌరులందరూ గుసగుసలాడుకుంటూ నివ్వెరపోయి చూస్తున్నారు. పోనీలే బ్రతికేవున్నాడు. ప్రాణాలతో తిరిగివచ్చాడు అదృష్టవంతులం చిరంజీవ చిరంజీవ అంటూ వున్నారు. రాకుమారుడు ఇది ఏమిటో ఎందుకిలా వారు అంటున్నారో అర్థంకాలేదు రాజమందిరం చేరుకున్నాడు. దాసదాసీజనం ద్వారపాలకులు అందరూ విస్తుపోయారు. అందరూ గొణుక్కుంటూ చెమ్మగిల్లిన కళ్ళతో దీవిస్తున్నారు. తల్లితండ్రులూ ఆశ్చర్యపోయి అవాక్కయి అలాగే చూస్తూవుండిపోయారు. పాదాభివందనం చేసిన తనను తండ్రి ఆనందభాష్పాలు రాలుస్తూ ఉక్కిరి బిక్కిరి అవుతూ ఆప్యాయంగా ప్రేమతో కౌగలించుకున్నాడు. నాయనా మనం అదృష్టవంతులం నువ్వు జీవించేవున్నావు చాలు అంటూ ప్రేమగా శిరస్సు నిమిరాడు. తల్లి కూడా అలాగే దుఃఖం ఆనందం కలగలపి అవును అవును అంటూ ప్రేమగా వీపు నిమిరింది.


ఋతధ్వజుడు తండ్రితో - తండ్రీ ఏమిటి ఇందతా? ఏమయ్యింది మీకు? నేను బాగానే వున్నాను. నీ ఆజ్ఞప్రకారం యమునా తీరంలోని ఆశ్రమాలకి వెళ్ళాను. మునుల్ని సందర్శించాను. ఆశీస్సులు అందుకున్నాను. ఒక మహర్షి అడిగితే నా కంఠంలోని రత్నహారం బహుకరించాను. సంపూర్ణ ఆశీస్సులు అందుకొని హాయిగా తిరిగివచ్చాను. ఇంతకీ ఏదీ నా ప్రాణ ప్రియ మదాలస కనిపించడంలేదు? ఎక్కడికెళ్ళింది? అన్నాడు. కొడుకుకి ఏం సమాధానం చెప్పాలో ఆ దుర్వార్తను ఎలా అందించాలో అర్ధంకాలేదు. నాయనా అన్యాయం జరిగిపోయింది. ఎవడో కపట ఋషి అన్యాయంగా మోసం చేసాడు. నీ కంఠ హారం తెచ్చియిచ్చి నిన్ను రాక్షసుడెవడో హత్య చేసాడని నమ్మపలికాడు. తట్టుకోలేక మూర్ఛపోయాం మేము. నీ భార్య ప్రియ మదాలస ఆ మాటలు నమ్మి ప్రాణాలు వదిలేసింది. నువ్వు తిరిగి రానిలోకాలకు వెళ్ళి పోయావుగదా అని నేనే ఈ పాపిష్టిచేతులతో కోడలికి ఉత్తరక్రియలు జరిపించాను. ఇదిగో ఋషిఇచ్చిన కంఠహారం అంటూ హారాన్ని అందించాడు తండ్రి శత్రుజిన్మహారాజు.


No comments:

Post a Comment