Friday 31 March 2023

శ్రీదత్త పురాణము (95)

 


విరాగి, జ్ఞాని అనేవి కూడా పూర్ణ అర్ధంలో ఒక్కటే. ఈ విరాగి ప్రారబ్దాలను అనుభవిస్తూ, నిష్కామర్మ కర్మలు చేస్తూ క్రమంగా ముక్తిపొందుతాడు. అతడికి మరింక పునర్జన్మ లేదు. సకామంగా కర్మల్ని ఆచరిస్తే అనుభవించటానికి మళ్ళీ, మళ్ళీ పుట్టవలసిందే. ఫలానుభవం ఆశిస్తే కర్మలు నశింపవు. అందుకనే ఈ కర్మబంధాలు జన్మపరంపరను కలిగిస్తాయి. నిష్కామ కర్మాచరణమొక్కటే దీనికి తరుణోపాయం. అప్పుడు కర్మబంధాలు ఉండవు. 


జన్మ పరంపరలు ఉండవు. ఇది జన్మరాహిత్యప్రదమైన జ్ఞానమార్గం. ఇక యోగమార్గం చెబుతాను శ్రద్ధగా విను.


యోగమార్గంలో ప్రయాణించాలి అంటే ముందుగా మనస్సునూ ఇంద్రియాలను జయించాలి. ఇది అంత తేలిక కాదు. దృఢ నిశ్చయం తీవ్ర ప్రయత్నం నిరంతర సాధన ఉండాలి. ముందుగా ప్రాణాయామాన్ని అభ్యసించాలి. దీనితో శరీరంలోని కఫాది దోషాలన్నీ నశిస్తాయి. రెండవది - ధారణ - దీని వల్ల మనస్సులోని కిల్బిషాలన్నీ తొలగిపోతాయి. దాని తర్వాత ప్రత్యాహారం దీనితో ఇంద్రియ సంసర్గ దోషాలన్నీ నశిస్తాయి. ధ్యానం మూడవది. ఇది అనీశ్వర గుణాలను తొలగిస్తుంది. అంతరంగాన్ని శుద్ధి చేస్తుంది. రాగి, బంగారంలాంటి లోహాలను కొలిమిలో కాలిస్తే వాటిలోని దోషాలు పోయి శుద్ధి అయినట్లు ఈ ప్రాణాయామం వల్ల ఇంద్రియాలు పరిశుభ్రమవుతాయి. ప్రాణాయామము అంటే ప్రాణాపాన నిరోధం. ఇది లఘువు - మధ్యమం - ఉత్తమం అని మూడు విధాలు. ఇక్కడ కాలప్రమాణం గురించి నీవు తెలుసుకోవాలి. ఇక లఘువును ఉచ్ఛరించటానికి పట్టేకాలాన్ని లేదా కనురెప్ప మూసి తెరవటానికి పట్టే కాలాన్ని ఒక "మాత్ర" - అంటారు. పన్నెండు మాత్రల సేపు ప్రాణవాయువును నిరోధిస్తే దాన్ని లఘు ప్రాణాయామం అంటారు. దీని వల్ల స్వేదదోషం నశిస్తుంది. ఇరవై నాలుగు మాత్రలకాలం చేస్తే దాన్ని మధ్యమప్రాణాయామం అంటారు. దీనివల్ల వణుకు రోగం తగ్గుతుంది. ముప్పది ఆరు మాత్రలకాలం ప్రాణాయామం చేస్తే దాన్ని ఉత్తమం అంటారు. దీనితో విషాదదోషం అంతరిస్తుంది. ప్రాణవాయువును ఇంతంతసేపు నిరోధించటం సాధ్యమా అని విస్తుపోవద్దు. మహా మహా క్రూర జంతువులే మనిషికి మచ్చిక అవుతున్నాయి. చెప్పినట్టు వింటున్నాయి. అలాగే సాధన వల్ల ప్రాణవాయువు, మహాయోగికి చెప్పుచేతల్లో వుంటుంది. ప్రారంభంలో మావటివాడులాగా దానికి మనం లొంగి వుంటాం. ఆపైన ఆ ఏనుగు మనకు లొంగివస్తుంది.


No comments:

Post a Comment