Wednesday 15 March 2023

శ్రీదత్త పురాణము (79)


 

ఋతధ్వజుడు ఈ వార్త విని అవాక్కయ్యాడు. విషయం అర్ధం అయ్యింది. మనస్సు కుతకుతలాడింది. కువలయాశ్వాన్ని ఎక్కి యమునా తీరానికి వెళ్ళాడు. అక్కడ ఇంతకు ముందు కనిపించిన ఆశ్రమంగాని, పర్ణశాలలు గానీ, చిత్ర విచిత్ర రూపాల స్వాగత తోరణాలు గాని ఏ ఒక్కటీ ఆనవాలుకైనా లేవు. అన్ని పిచ్చిమొక్కలు - పాదలతో ఆ ప్రదేశం నిండివుంది. ఇది కచ్చితంగా రాక్షసుల కుట్ర. పాతాళ కేతువును సంహరించినందుకు వాడి సోదరుడు తాళకేతువు ఇలా కుట్ర పన్ని కసితీర్చుకున్నాడన్నమాట. అలనాటి యుద్ధంలో వాణ్ని కూడా సంహరించివుంటె సరిపోయేది. పారిపోయి పిరికిపంద ఇలా దొంగదెబ్బ తీసాడు. నా ప్రియ మదాలసను పొట్టన బెట్టుకున్నాడు. నాకు కడలేని దుఃఖం మిగిల్చాడు. సరే ఇప్పుడేమి విచారించి ఏమి లాభం కనిపించని శత్రువు మీద కసితీర్చుకొనేదెలాగ? కనిపించని లోకాలకు వెళ్ళిపోయిన ప్రాణ ప్రియపట్ల ఋణం తీర్చుకొనేదెలాగ? ఇవే ఆలోచనలతో క్షణంలో రాజధానికి తిరిగి వచ్చాడు. ఏ రాక్షసుడు ఈ మోసం చేసాడో తండ్రికి వివరించాడు. యాగరక్షణకు వెళ్ళినందుకు, ముని వాటికలకు రాష్ట్రు పీడ తొలగించినందుకు శ్రీరామచంద్రుడికి దక్కిందేమిటి? రాక్షసాగ్రహం సీతాపహరణం. తండ్రీ నాకు అదే జరిగింది. గాలవ ముని వెంట పంపుతూ నాకు మీరు ఆ పోలిక కూడా తెచ్చారు. నిజమే అప్పుడు మీరు దశరధులయ్యారు. ఇప్పుడు నేను భార్యావియోగినయ్యాము. దుఃఖంలో శ్రీరామచంద్రుణ్ని అయ్యాను. ఆ శ్రీరామప్రభువులాగే నేనూ దీక్షను స్వీకరిస్తున్నాను. ఏక పత్నీ వ్రతదీక్ష. తండ్రీ ఈజన్మలోగానీ మరొక జన్మలో గాని నాకు భార్యంటూ ఏర్పడితే అది మదాలస మాత్రమే అవుతుంది. ఇంకెవరినీ చేపట్టను. నన్ను వలచి ఎక్కడో గంధర్వలోకం నుంచి వచ్చి నాకు దాంపత్య జీవన మాధుర్యాలు పంచిన ప్రాణసఖి మదాలస కోసం ఎన్ని జన్మలైనా నిరీక్షిస్తాను. ఋణం తీర్చుకుంటాను అన్నాడు ఋతధ్వజుడు. ఇలా భీషణ ప్రతిజ్ఞ చేసి ఆనాటి నుండి తన యౌవనాన్ని పరిత్యజించి అన్నెంపున్నెం ఎరుగని బాల్యంలోనే గడుపుతూవున్నాడు. మా వయస్సు పిల్లలతో తాను ఒకడుగా కలిసిపోయి ఆటపాటలతో క్షణం తీరిక లేకుండా కాలక్షేపం చేస్తున్నాడు. తండ్రీ నాగరాజా ఇదీ మా మిత్రుడికి జరిగిన అన్యాయం, తాళకేతువు చేసిన మోసం. దీనికేమైనా విరుగుడు ఆలోచించి మా ప్రాణమిత్రుడి దిగులు తొలగించగలిగితే అది మనమివ్వదగిన సరియైన బహుమానం అవుతుంది. అప్పుడు మేము స్నేహ ఋణం తీర్చుకొన్నవాళ్ళం కాగలుగుతాము.


పుత్రులిద్దరూ ఏక కంఠంగా బ్రతిమాలుకున్నారు. నాగరాజు అశ్వతరుడు క్షణం ఆలోచించాడు. తనయుల్లారా మీరింతగా చెబుతున్నారు కనుక తప్పకుండా ప్రయత్నం చేద్దాం. పరోపకారం కన్నా పరమ ధర్మం ఏముంది. ప్రయత్నం చేద్దాం ఫలప్రదాత ఆ దైవం ఉండనే వున్నాడు. ధైర్యేలక్ష్మీః ప్రశీదతి అన్నారు పెద్దలు. కాబట్టి నా ప్రయత్నం నేను చేస్తాను. ఇలాంటివి నెరవేరాలంటే తపస్సాక్కటే సాధనం. మీ మిత్రుడికోసం సరస్వతీదేవిని ఆరాధిస్తాను. ఆమె తప్పక అనుగ్రహిస్తుంది అంటూ అశ్వతరుడు ఆ క్షణంలోనే తపస్సుకు బయల్దేరి సరాసరి హిమాలయాలకు చేరుకున్నాడు. ఒక గిరిశిఖరం పై స్థిరచిత్తంతో యమ నియమాలతో తపస్సుకి కూర్చున్నాడు. సర్వార్ధ ప్రకాశికయైన వాగ్దేవిని (సరస్వతిని) త్రికరణ శుద్ధిగా ఆరాధించాడు. ఇలా స్తుతించాడు.


No comments:

Post a Comment