Friday 17 March 2023

శ్రీదత్త పురాణము (81)



అశ్వతరుడు చేసిన ఈ స్తోత్రానికి వాగ్దేవి ప్రసన్నురాలయింది. ప్రత్యక్షమయ్యింది. తానుగా పలికింది. నాగరాజా నీ తపస్సుకి సంతోషించాను నీ స్తోత్రం నన్నెంతగానో మురిపింపజేసింది. ఏమి వరం కావాలో కోరుకో నీ ఇష్టం వెంటనే నీ అనుగ్రహిస్తాను అంది.


విష్ణు జిహ్వాస్వరూపిణీ! సరస్వతీ! ధన్యుణ్ని తల్లీ! నీ అనుగ్రహాన్ని మించిన బలం మరొకటి లేదు. సంగీత రూపంగా అనుగ్రహాన్ని వర్షించు. నాకూ నా సోదరుడు కంబలుడికీ సంగీత స్వర సంపదను సమగ్రంగా ప్రసాదించు. ఆ శాస్త్రంలోని లోతులూ రహస్యాలూ అన్నీ మాకు కటాక్షించు.


అశ్వతరా నీ కోరికకు సంతసించాను. నీకు, కంబలునికీ సంగీత శాస్త్రం అంతా ప్రసాదిస్తున్నాను. స్వీకరించండి. ముల్లోకాల్లో మీకు సాటి వచ్చే సంగీత విద్వాంసుడు లేడు. ఉండడు. ఈ క్షణం నుండీ మీదే అగ్రపీఠం, నువ్వు చేసిన స్తోత్రంలో నా రూపాన్ని గుణాలను అద్భుతంగా వర్ణించావు. చాలా సంతోష పడుతున్నాను. దీన్ని భక్తితో తెల్లవారు జామునే పఠించిన వారికి అభీష్టాలన్నీ తీరతాయి. విద్య, తేజస్సు, ధనం, ధాన్యం పశుగేహ సుతాది సమృద్ధి అన్నీ సిద్ధిస్తాయి. ఇది నా ఆశీస్సులు అని పలికి ఆ సప్తజిహ్వ సరస్వతీ దేవి అంతర్ధానం చెందింది.


కంబలాశ్వతరులిద్దరూ గాంధర్వ విద్యాధురీణులు అయ్యారు. హిమాలయాల నుండి సరాసరి కైలాసానికి వెళ్ళారు. తమ దివ్య సంగీత విద్యతో పార్వతీ పరమేశ్వరులను స్తుతించారు. తంత్రీలయ సమన్వితంగా సప్తవిధ గీతాలతో కీర్తించారు. త్రిసంధ్యలలోనే కాదు అర్ధ రాత్రి కూడా ఆ త్రినేత్రుణ్ని ఆరాధించారు. ఉబ్బులింగడు అన్న మాటేగానీ ఒక పట్టాన కైలాసం దిగిరాలేదు. చాలా సంవత్సరాలు గడచిపోయాయి. సోదరులలో భక్తి, నిష్టాపట్టుదల, మరింతగా వృద్ధి చెందాయి. షట్కాలాలలో సంగీతంతో శివార్చన చేస్తున్నారు. అప్పటికి పరాత్పరుడికి అనుగ్రహం కలిగింది. ప్రత్యక్షమయ్యాడు. వరం కోరుకోండి అన్నాడు.


సర్పభూషితాంగా! కందర్ప దర్పభంగా ఇంత కాలానికి కటాక్షించావా తండ్రీ! సరస్వతీదేవి ప్రసాదించిన సంగీత విద్య చరితార్ధమయ్యింది. అష్ట మూర్తి పశుపతి మా ఇద్దరిదీ ఒకే కోరిక కువలయాశ్వుడి ధర్మపత్ని మదాలస రాక్షస మాయకు లోనై ప్రాణాలు విడిచింది. అదే వయస్సుతో అదే మదాలసను నాకు బిడ్డగా అనుగ్రహించు. జాతి స్మరురాలై మునుపటిలాగానే శాంతికి సహనానికి పెట్టింది పేరై బ్రహ్మ విద్యా పరాయణురాలై యోగినిగా యోగమాతగా విరాజిల్లేట్లు కరుణించు. 


No comments:

Post a Comment