Saturday 4 March 2023

శ్రీదత్త పురాణము (68)



దత్త దేవా నా జన్మ ధన్యమైయ్యింది. నీ అనుగ్రహానికి నేను పాత్రుణ్ని అయ్యాను. ఇంతకన్నా నేను కోరుకోవలసింది ఏముంది. అయినా నీ ఆజ్ఞను కాదనలేక, నా రాజధర్మాన్ని విడిచిపెట్టలేక కొన్ని వరాలు అడుగుతున్నాను. నేను చేసే ప్రజాపాలనలో ధర్మార్ధాలు వృద్ధిపొందేటట్లు, ఎదుటివారి ఆలోచనలు నాకు తెలిసిపోయేటట్లు, పుణ్య పాప సుఖ దుఃఖాల ద్వంద్వాలను తెలుసుకునే ప్రసిద్ధి కలిగేటట్లు, నేను కోరుకున్నప్పుడు నాకు వేయి బాహువులు (చేతులు) వచ్చేటట్లు, అణిమాది అష్టసిద్ధులు నాకు వశం అయ్యేటట్లు పర్వతాలపై ఆకాశం పై, సముద్రంపై, సృధివిలో పాతాళంలో నిరాటంకంగా సంచరించే శక్తి కలిగేటట్లు నా కన్నా గొప్పవాడు ప్రసిద్ధుడు అయిన వ్యక్తిచేతిలోనే మరణించేటట్లు, నేను దారి తప్పినప్పుడల్లా నాకు సన్మార్గం చూపించే వారు లభించేటట్లు, గొప్ప గొప్ప అతిధులు నిత్యము దొరికేటట్లు, సంపదలు అక్షయంగా వుంటేటట్లు నన్ను స్మరిస్తేచాలు ప్రజలకు పోయిన వస్తువులు దొరికేటట్లు, నీ పట్ల నిశ్చలమైన భక్తి నిలచేటట్లు అనుగ్రహించుదేవా అని అడిగాడు.


కార్తవీర్యుడు కోరికలన్నీ దత్తుడు అంగీకరించాడు. తధాస్తు అని పలికాడు. నా అనుగ్రహంవల్ల నీవు చక్రవర్తిని అవుతావు వెళ్ళు అన్నాడు. అర్జునుడు పరమానందంతో తన చేతుల్ని చూసుకున్నాడు. చొట్ట చేతుల స్థానంలో బలమైన దృఢమైన చేతులు వచ్చాయి. సంవత్సరముల తరబడి సేవ చేసి అలసిన శరీరం వింతకాంతితో వెలిగిపోయింది. తృప్తిగా శరీరం అంతా చూసుకొని ఆనందంతో మరోసారి సాష్టాంగ నమస్కారంచేసి దత్తస్వామి వద్ద సెలవు తీసికొని బయలుదేరాడు. రాజధాని మహిష్మతీపురం చేరుకున్నాడు. పౌర జానపద సామంత దండనాయక మంత్రి కవి పండితావళి సాక్షిగా పట్టాభిషేకం జరిపించుకున్నాడు. అమరులూ, గంధర్వులూ, అప్సరసలూ వచ్చి సింహాసనం మీద కూర్చుండబెట్టి ఆశీర్వదించి వెళ్ళారు. గురువర మహిమ వల్ల సామ్రాజ్యంలో సకల సంపదలూ వృద్ధి చెందాయి. ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు. అర్జునుడు అత్యంత బలిష్ఠుడై రాజ్య పరిపాలన చేస్తున్నాడు. రాజ్యంలో తాను తప్ప ఎవరూ ఏ ఆయుధమూ చేపట్టరాదని అలా పడితే అతణ్ని పరహింసా పరాయణుడిగా గుర్తించి శిక్షిస్తామని దీనికి శిక్ష శిరచ్ఛేదమని శాసనం అమలుచేసాడు. అంతే ఆ క్షణం నుండి అతని రాజ్యంలో ఎవ్వడైనా ఆయుధం ముట్టుకుంటే ఒట్టు గ్రామ పాలన, క్షేత్రపాలన, పశుపాలన, గోబ్రాహ్మణ సంరక్షణ సమస్తమూ తానే చూసుకుంటున్నాడు. ప్రజలకు చోర, సర్ప, అగ్ని, శత్రు భయాదులు లేకుండా చేసాడు. ఒకవేళ ఎవరికైన ఏదైనా ఆపద వస్తే కార్తవీర్యార్జునుడ్ని తలుచుకుంటే చాలు స్వయంగా ప్రత్యక్షమై వారి వారి ఆపదలు తొలగిస్తున్నాడు. అతడి స్మరణతో పోయిన వస్తువులు కూడా దొరుకుతున్నాయి. ప్రజలు హాయిగా సుఖశాంతులతో భోగభాగ్యములతో వర్ధిల్లుతున్నారు అతడి పాలనలో, భూరి దక్షిణలతో యజ్ఞ యాగాది క్రతువులను మహావైభవంగా జరిపిస్తున్నాడు. చుట్టుప్రక్కల రాజ్యాలన్నింటిని జయిస్తున్నాడు. ఇతడి ధర్మానురక్తిని, శౌర్య పరాక్రమాలను ఆత్మాభిమానాన్ని కళ్ళారా చూసిన అంగీరసుడు ఆనందం పట్టలేక కార్తవీర్యార్జునుడు అంతటి రాజు మరొకడు లేడని ఘంటాపధంగా ప్రకటించాడు.


No comments:

Post a Comment