Tuesday 21 March 2023

శ్రీదత్త పురాణము (85)

 

నాయనా ఋతధ్వజా! ఇది మాయా మదాలస నీవు ముట్టుకుంటే మాయమవుతుంది. ఇలాగే దూరంగా నిలబడి చూసి ఆనందించు. ఇప్పటికి ఇంతే అన్నాడు. ఇంకా ఆ మాటలు పూర్తికాక ముందే ఋతధ్వజుడు మూర్చపోయాడు. మదాలస అయోమయంతో నాగరాజు వైపు చూసింది. చిరునవ్వులు చిందిస్తూ ఆమెకు ధైర్యం చెబుతూ ఋతధ్వజుని కలత దీర్చాడు నాగరాజు. తాను తన బిడ్డల కోరికపై మదాలస గురించి తపస్సు చెయ్యడం సరస్వతీ, మహాదేవుల ప్రసాదంగా ఆమె పునరుజ్జీవించడం అంతా వివరించి, మదాలసా ఋతధ్వజులను ఒకరికొకర్ని అప్పగించాడు. దంపతులు ఒకేసారి సాష్టాంగపడ్డారు. పుత్రపౌత్రాభివృద్ధిరస్తు అని ఆశీర్వదించాడు నాగరాజు. ప్రియ మిత్రులు నాగకుమారులిద్దరూ ఆనందభాష్పాలతో పులకించిపోతూ తప్పట్లు కొడుతూ కేరింతలు కొట్టారు. మల్లె మొగ్గలూ ముత్యాలు కలిపి దోసిళ్ళ కొద్దీ ఆ నవదంపతుల మీద గుమ్మరించారు. మదాలసా ఋతధ్వజులు ఆ రోజు అక్కడే వుండి అమృతమయమైన విందులు ఆరగించి విశ్రమించారు. మరునాడు అందరి వద్దా సెలవు తీసికొని కువలయశ్వాన్ని స్మరించాడు. అది వచ్చింది. ఇద్దరూ ఎక్కారు. నాగరాజు ఆశీర్వదించాడు. అప్పుడప్పుడూ వస్తూవుండండి. ప్రియ మిత్రులు ఇక్కడవున్నారన్న మాట మర్చిపోవద్దు అన్నారు. నాగ కుమారుల కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.


మిత్రమా నీ చిరకాల వాంఛ నెరవేరింది. సంతోషమే. కానీ రేపటి నుండి మన ఆటపాటలు వుండవు కదా పోనీలే మీ పిల్లల్ని ఆడించడానికి వస్తుంటాము. జ్ఞాపకం పెట్టుకొని పిలవండి. వెళ్ళిరండి - అంటూ ఇంక అక్కడ వుండలేక లోపలికి వెళ్ళిపోయారు. ఋతధ్వజానికీ దిగులుగానే వుంది. కానీ ప్రియ మదాలస మరల లభించడంతో ఆనందంగా మనస్సు రాజధానివైపు పరుగులు తీస్తోంది. నాగరాజుకి మరొక్కసారి నమస్కరించి బయలుదేరారు మదాలసా ఋధ్వజులు.


కువలయాశ్వం మీద ఆకాశమార్గాన వస్తున్న మదాలసా రాజకుమారులను చూసి ప్రజలంతా ఆశ్చర్య ఆనందాలతో మునిగిపోయారు. చనిపోయాడనుకున్న రాకుమారుడు తిరిగి రావడం. ఆశ్చర్యం అయితే తమ కన్నుల ఎదుటే ప్రాణాలు వదిలిన మదాలస పునర్జీవితమై రావడం ఈనాటి ఆశ్చర్యం. ఏమైతేనేమి కథ సుఖాంతం అయ్యింది. దేవతలు దయతలిచారు. అంతే చాలు అని ప్రజలు జయజయధ్వానాలు చేసారు. కోలాహలం ఏమిటి? అని రాజదంపతులు రాజప్రసాదం వెలుపలికి వచ్చి చూసారు. ఎట్ట ఎదుట కువలయాశ్వం మీద కొడుకు కోడలు. కలా? నిజమా? అనుకొనే లోపలే దంపతులు అశ్వందిగి వచ్చి పాదాభివందనం జేసారు. కొడుకును తండ్రీ, కోడల్ని తల్లీ కౌగలించుకొని ఆనంద భాష్పాలలో మునిగారు. అందరు తేరుకున్నాక జరిగిందంతా పూసగ్రుచ్చినట్లుగా వివరించాడు ఋతధ్వజుడు. రాజు గారు రాజ్యంలో పెద్ద ఉత్సవం జరిపించారు. సకల దేవతలకు ఆరగింపులు జరిపారు. భూరి, దక్షిణలతో అందర్నీ ఆనందపరిచారు.


No comments:

Post a Comment