Saturday 2 December 2023

శ్రీ గరుడ పురాణము (22)

 


ధ్రువ వంశం - దక్ష సంతతి


శివాది దేవతలారా! ఉత్తానపాదునికి ఇద్దరు భార్యలు; సురుచి, సునీతి. వారిలో సురుచికి ఉత్తముడు సునీతికి ధ్రువుడు పుట్టారు. వారిలో ధ్రువుడు చిన్నతనంలోనే నారద మహర్షి కృప వల్ల ప్రాప్తించిన ఉపదేశానుసారం దేవాధి దేవుడైన జనార్దనునారాధించి ఆయన దర్శనభాగ్యాన్ని పొందాడు. ఆ తరువాత పెద్దకాలం పాటు మహారాజుగా, మనిషిగా బాధ్యతలను నిర్వర్తించి దేహాంతంలో విశ్వంలోనే కాంతివంతమైన నక్షత్రంగా ఉత్తమ స్థానంలో నిలిచాడు.


ధ్రువుని కొడుకు క్లిష్టుడు. ఆ తరువాత ఆ వంశంలో పరంపరగా ప్రాచీన బర్హి, ఉదారధి, దివంజయుడు, రిపుడు, చాక్షుషుడు, రురు, అంగుడు, వేనుడు రాజ్యం చేశారు. ఈ వేనుడు నాస్తికుడు, ధర్మభ్రష్టుడు, పొగరుబోతు. మహర్షులను, పూజ్యులను దారుణంగా అవమానించేవాడు. దేశం పాడైపోతుండడంతో మరో దారిలేక మహర్షులంతా కుశాఘాతాలతో వానిని చంపివేశారు! రాజ్యం అరాచకం కాకుండానూ, విష్ణుమానస పుత్రుని కోసమూ ప్రయత్నాలు చేయసాగారు. ముందు వేనుని శరీరం కాస్త వెచ్చగా వుండగానే అతని ఊరు భాగాన్ని మంత్ర సహితంగా మంథనం చేయగా ఒక పుత్రుడు ఉదయించాడు. అతడు నల్లగా, అతిచిన్న పరిమాణంలో వుండడంతో, అతనిని 'ఇక్కడే వుండు' అనే భావంతో 'నిషేద’ అన్నారు. ఈ శబ్దం వల్ల అతని పేరు నిషాదుడుగా స్థిరపడిపోయింది. అనంతర కాలంలో అతడు కొండల మీదికి వెళ్ళిపోయాడు. తరువాత మునులంతా కలిసి తమ తపశ్శక్తిని వినియోగించి శ్రీహరిని జపిస్తూ వేనుని కుడిచేతిని మథించగా అందునుండి విష్ణువే పృథు నామంతో అవతరించాడు. ఆయన ప్రజానురంజకమైన పరిపాలనను చేయడమే కాక వారికోసం పృథ్విని పితికి సమస్త ద్రవ్యాలనూ రాబట్టి ప్రజలను ఐశ్వర్యవంతులను చేశాడు *. (* వేన చరిత్రలో మనం గమనించ వలసినదేంటంటే అప్పట్లో మేధావులు, విద్యావంతులు, తపోధనులైన మహర్షులు రాజెలాగుంటే మనకేం, దేశమేమైపోతే మనకేం అని ఊరుకోలేదు. విపరీతంగా శ్రమించి, తపశ్శక్తిని ధారవోసి విష్ణువునే క్రిందికి)

పృథువు తరువాత వంశానుగతంగా అంతర్ధానుడు, హవిర్ధానుడు, ప్రాచీన బర్హి, రాజులయ్యారు. ఈ ప్రాచీన బర్హిలవణ సముద్ర పుత్రియైన సాముద్రిని పెండ్లాడి పదిమంది పుత్రులను కన్నాడు. వారందరూ ప్రాచేతస నామంతో ప్రసిద్ధులై ధనుర్వేదంలో నిష్ణాతులై లోకంలో ధనుర్ధారులను తయారు చేశారు. ధర్మాచరణ నిరతులై ప్రజలను కాపాడారు. తరువాత పదివేల సంవత్సరాల పాటు నీటి అడుగున కఠోరతపస్సు చేసి తత్ఫలితంగా ప్రజాపతి పదవినీ, వరప్రసాదియైన మారిషయను దివ్యస్త్రీని భార్యగానూ పొందారు. శివుని చేత శపింపబడిన దక్షుడు ఈ మారిషకే కొడుకుగా పుట్టాడు.

No comments:

Post a Comment