Monday 11 December 2023

శ్రీ గరుడ పురాణము (31)

 


సదాశివాదులారా! విష్ణుభగవానుని విశేషపూజకై అయిదు ప్రకారాల రంగులు కలిపిన చూర్ణంతో వజ్రనాభమండలాన్ని నిర్మించాలి. దీనికి సమాన పరిమాణంలో పదహారు కోష్ఠకాలతో నిర్మించాలి.

 

వజ్రనాభ మండలం తయారు కాగానే న్యాసం చేసుకొని శ్రీహరిని పూజించాలి. హృదయ మధ్యంలో విష్ణుభగవానుని, కంఠంలో సంకర్షణుని, శిరంపై ప్రద్యుమ్నుని, శిఖాభాగంలో అనిరుద్ధుని, సంపూర్ణ శరీరంలో బ్రహ్మనీ, రెండు చేతులలో శ్రీధరునీ భావించుకొని న్యాసం చేసుకోవాలి. తరువాత అహం విష్ణుః అని ధ్యానం చేస్తూ పద్మంలో (మండలంలో నిర్మింపబడిన పద్మంలో) కర్ణిక భాగంలో శ్రీహరిని స్థాపించాలి. మండలానికి తూర్పులో సంకర్షణునీ, దక్షిణంలో ప్రద్యుమ్నునీ, పశ్చిమంలో అనిరుద్ధుని, ఉత్తరంలో బ్రహ్మదేవునీ స్థాపించాలి. ఈశాన్యంలో ముందు శ్రీహరిని స్థాపించి ఆ తరువాత దిక్పాలకులను వారి వారి మంత్రాలతో ఈ దిగువ నిచ్చిన దిక్కులలో నిలపాలి.

 

ఓం ఇంద్రాయ నమః - ఇంద్రుని - తూర్పులో

ఓం అగ్నయే నమః - అగ్నిని - ఆగ్నేయంలో

ఓం యమాయనమః - దక్షిణంలో - యముని

ఓం నిరృతయే నమః - నైఋతిలో - నిరృతిని

ఓం వరుణాయ నమః - పశ్చిమంలో - వరుణుని

ఓం వాయవే నమః - వాయవ్యంలో - వాయువుని

ఓం కుబేరాయ నమః - ఉత్తరంలో - కుబేరుని

ఓం ఈశానాయ నమః - ఈశాన్యంలో - ఈశ్వరుని

 

స్థాపించిన తరువాత అందరు దేవతలనూ గంధాది ఉపచారాల ద్వారా పూజించాలి. దీని వలన సాధకునికి దేహాంతంలో పరమపదం ప్రాప్తిస్తుంది.

 

దేవగణములారా! దీక్షితుడైన శిష్యుడు వస్త్రంతో తన రెండు కన్నులనూ మూసుకొని దేవతల మూలమంత్రాలను పఠిస్తూ నూట యెనిమిది ఆహుతులను అగ్నిలోనివ్వాలి. పుత్ర లాభమును కోరుకొనేవారు దానికి ద్విగుణంగా అంటే రెండు వందల పదహారు ఆహుతులను అగ్నికి సమర్పించాలి. సాధనాసిద్ధికైతే మూడు రెట్లు (మూడు వందల ఇరవై నాలుగు) మోక్షప్రాప్తి కోసం చేసే దేశికునికైతే నాలుగు రెట్లు అనగా నాలుగు వందల ముప్పది రెండు ఆహుతులు అవసరం. (దేశికుడనగా ఉపదేశమిచ్చే ఆచార్యుడు)


No comments:

Post a Comment