Tuesday 26 December 2023

శ్రీ గరుడ పురాణము (45)

 


క్షరానికీ (ప్రపంచం) అక్షరానికీ (చేతన) అతీతుడను, శరీరధర్మరహితుడను, ఇంద్రియాలకు లొంగని అతీంద్రి యుడను, హోతను, ద్రష్టను, శ్రోతను, ఘ్రాత (గంధాన్ని గ్రహించు వాడు)నూ నేనే.


అందరి మనసులలో నేనుంటాను గాని నాకు మనసు లేదు. విజ్ఞానినీ జ్ఞాన స్వరూపాన్నీ నేనే. *దృగ్రూపుడను నేనే. ప్రాణులలో ప్రాణస్వరూపుడను, అహంకారాది రహితుడను, అహంకార జన్య వికారాల నుండి కూడ ముక్తుడను నేనే.


* దృగ్రూపుడనగా సమస్త ప్రపంచానికీ ద్రష్ట. దృశ్యము, దృష్టి అయినవాడు 



ఈ జగత్తుకి సాక్షినీ, నియంతనూ నేనే. పరమానంద స్వరూపమూ నాదే. జగత్తు యొక్క జాగ్రత్, స్వప్న, సుషుప్త్యవస్థలకు సాక్షీభూతుడనైన నాకు ఏ అవస్థలూ వుండవు. తురీయ బ్రహ్మనూ విధాతనూ నేనే. *దృగరూప పరమాత్మనూ నేనే. (సమస్త ప్రపంచానికీ ద్రష్టం, దృశ్యం, దృష్టి అనేవి ఉంటాయి. ఈ మూడూ పరమాత్మే. ఆయనే దృగ్రూపుడు) నిర్గుణ, ముక్త, బుద్ధ, శుద్ధ, ప్రబుద్ధ, అజర, సర్వవ్యాపి, సత్యస్వరూప, శివస్వరూప పరమాత్మను నేనే'.


* దృగ్రూప


ఈ ప్రకారం విద్వాంసుడైన యోగి పరమాత్మను పూర్తిగా తెలుసుకొని, తానే పరమాత్మననే ధ్యానంలోకి సంపూర్ణంగా నిష్క్రమించి, ఆయన సారూప్యాన్ని పొందుతాడు. ఇదే ధ్యానయోగము. సువ్రతులలో నుత్తముడవగు శంకరదేవా! నీవు మాత్రమే నిజమైన సంపూర్ణ ధ్యానయోగివి కాగలిగావు. ఇకపై ఈ ధ్యాన యోగమును పఠించిన వారికి చింతన, మననాలను చేసేవారికీ విష్ణులోకం ప్రాప్తిస్తుంది.” (అధ్యాయం - 14)


విష్ణు సహస్రనామం


(విశ్వం విష్ణుర్వషట్కారో... అని ప్రారంభమయ్యే విష్ణు సహస్రనామం మరొకటుంది. దానిని శ్రీ కృష్ణుని సమ్ముఖంలో భీష్ముడు ధర్మరాజునకుపదేశించాడు. అది వేరు)


"హే ప్రభో! అగాధమగు జలనిధి వంటి ఈ సంసారాన్ని సురక్షితంగా దాటించి నీ వద్దకు గొని తేగల నావ వంటి మహామంత్రాన్నుపదేశించండి” అని ప్రార్థించాడు శివుడు.


No comments:

Post a Comment