Wednesday 31 July 2024

శ్రీ గరుడ పురాణము (251)

 


మంచివాడు, సచ్ఛరిత్రుడునైన పతిని మదమెక్కి వదిలేసిన స్త్రీ ఏడుజన్మల దాకా ఆడదానిగానే పుడుతుంది. అన్ని జన్మలలోనూ విధవగానేపోతుంది. అన్నపానాదుల విషయంలో భ్రష్టురాలైన స్త్రీ మరుజన్మలో పందిగా పుడుతుంది.


ఔరసుడూ, క్షేత్రజ్ఞుడూ ఒకే తండ్రికి పుడితే ఆ తండ్రి పోయినపుడు రెండు రకాల వాళ్ళూ పిండదానం చేయవచ్చును.


పరివేత్త (అన్నకు పెండ్లి కాకుండా తానే ముందు చేసుకున్న తమ్ముడు) పరివిత్తి (తమ్ముడికి వివాహం జరిగిపోయి తాను అది లేకుండా వుండిపోయిన అన్న) ఈ రెండు రకాల వారికీ కృచ్ఛవ్రతం చేసుకునే దాకా శుద్ది లేదు. తమ్ముని పత్ని కూడా కృచ్ఛవ్రతం చేయాలి. కన్యాదాత అతికృచ్ఛం చేసుకోవాలి. ఇటువంటి వివాహాన్ని చేయించిన పురోహితుడు చాంద్రాయణ వ్రతం చేయాలి. అప్పుడుగాని వీరికి శుద్ధి లేదు.


అన్న గూనివాడో, మరుగుజ్జో, నపుంసకుడో, నత్తివాడో, జన్మాంధుడో, ఇతర అంగ విహీనుడో అయితే మాత్రం తమ్ముడు ముందుగా వివాహం చేసుకోవచ్చును. దోషం లేదు.


నిశ్చితార్థంలో ఎవరికో వాగ్దత్తయైన కన్య ఆ వరుడు పరదేశమేగిపోయి (ఇక రాడని తెలిసి)నా, మృతి చెందినా, సన్యాసం పుచ్చుకున్నా, నపుంసకుడని తెలిసినా, పతితుడై పోయినా (ఆమె) వేరొకరిని వరించి వివాహం చేసుకొనవచ్చును. పతితోబాటు, సతీధర్మముననుసరించి, అగ్ని ప్రవేశం చేయు స్త్రీ తన శరీరంపై ఎన్ని రోమాలున్నాయో అన్నేళ్లపాటు స్వర్గంలో నివాసముండగలదు*.


* సతీసహగమనాన్ని ప్రస్తుత రాజ్యాంగం నిషేధించింది - అను


Tuesday 30 July 2024

శ్రీ గరుడ పురాణము (250)

 


తినకూడనివి తినడం, దొంగతనం, పోకూడని చోటికి పోవడం మనిషి పతనానికి కారణాలౌతాయి. వ్యవసాయం చేసేవాడు అలసిపోయిన ఎద్దుని మరల కాడికి కట్టరాదు. దాని చేత బరువులనూ మోయించరాదు. ద్విజులు స్నానం, యోగం, పంచయజ్ఞం వీటిని మానరాదు. బ్రాహ్మణులకి నిత్యం భోజనాలు పెట్టాలి. క్రూరకర్ముల విషయంలో మొగమాటానికీ స్వార్థానికీ తావివ్వకుండా ప్రవర్తించాలి.


నువ్వులనూ, నేతినీ అమ్ముకోరాదు. పంచసూనాజనిత దోషం పోవడానికి బలి వైశ్వ దేవహోమాన్ని నిత్యం చేయాలి. రైతు తన సంపాదన లేదా పంటలోని అరవభాగాన్ని రాజుకీ, ఇరువదవ భాగాన్ని దేవునికీ, ముప్పది మూడవ భాగాన్ని బ్రాహ్మణులకీ ఇవ్వాలి. దీని వల్ల కృషి హింసా పాపం ప్రక్షాళితమవుతంది. ఈ విధంగా ఇవ్వకపోతే (పన్ను ఎగ్గొడితే) పాపం వస్తుంది. అదీ దొంగతనంతో సమానమైన పాపం !


(పరాశరుడు ఏ వర్ణానికెన్నాళ్ళు మృత్యు అశౌచముంటుందో యాజ్ఞవల్క్యుని లాగే చెప్పాడు) బంధువులలో ఈ మైల నాలుగో తరం దాకా పది రోజులు, అయిదవ తరంలో ఆరురోజులు, ఆరో తరంలో నాలుగురోజులు, ఏడవతరంలో మూడురోజులు వుంటుంది. పరదేశంలో నున్న బాలకుడు పోతే మృత్యు అశౌచం పెద్దగా వుండదు. వార్త వినగానే స్నానం చేస్తే వెంటనే శుద్ధి అయిపోతుంది.


గర్భస్రావ, గర్భపాతాలలో బిడ్డ మరణించినపుడు తల్లి ఎన్నవ నెల గర్భవతి అయి వుండినదో అన్ని రోజుల అశుచి ఆ బిడ్డ బంధుగణానికి వుంటుంది. నాలుగవ నెల వఱకూ జరిగే గర్భనష్టాన్ని గర్భస్రావమని ఆరు మాసాలు నిండేలోగా గర్భనష్టం జరిగితే గర్భపాతమనీ అంటారు.


శిల్పకారుడూ, మేదరవాడు, రాజూ, రాజ గురువూ, శ్రోత్రియ బ్రాహ్మణుడూ, దాసదాసీ జనమూ, భృత్యులూ వీరిలో ఎవరు పోయినా (వారి సంతానానికి తప్ప) మైల వుండదు.


పురిటి మైల అనగా పిల్లలు పుట్టినపుడు కలిగే అశుచి కన్నతల్లికే పదిరోజుల పాటు వుంటుంది. తండ్రి స్నానం చేయగానే శుచి అవుతాడు. వివాహం లేదా యజ్ఞం తలపెట్టి అన్ని యేర్పాట్లూ చేసుకొన్నాక మృత్యు లేదా పురిటి వార్త తెలిసినా ఆ ఉత్సవం చేయువారికి, అందులో పాల్గొనువారికి అశుచి వుండదు. అనాథ శవాన్ని మోసేవారికి ప్రాణాయామ మాత్రమున శుద్ధి కలుగుతుంది. తెలిసీ శూద్రశవాన్ని మోసినవారికి మాత్రం మూడురాత్రుల వఱకూ అశుచి.


Monday 29 July 2024

శ్రీ గరుడ పురాణము (249)

 


ఆపత్కాలంలో అనివార్యమైనపుడు గృహస్థ బ్రాహ్మణుడు కూడా భిక్షమెత్తుకోవచ్చును. ఇది మూడు రోజుల వఱకే అంగీకార్యము. ఆ బ్రాహ్మణుని నుండి ధాన్యమును భిక్షగా పొందిన బ్రాహ్మణుడు దానిని ఒక్కరోజు మాత్రమే ఆకలి తీర్చుకొనుటకు వాడుకోవాలి. ఆ విషయాన్ని బహిరంగంగా ఒప్పుకోవాలి. అప్పుడు అతని పాలకుడైన రాజు అతని వంశం, రీతి, శాస్త్రాధ్యయనం, వేదజ్ఞానం, తపము, జపము మున్నగు వైశిష్ట్యాలను విచారించి ఆ బ్రాహ్మణుడు ధర్మానుకూలంగా జీవించగలిగే ఏర్పాటు చేయాలి. అని యాజ్ఞవల్క్య మహర్షి చెప్పాడు.”


(అధ్యాయం 106)


పరాశర మహర్షి చెప్పిన వర్ణాశ్రమ ధర్మాలు: ప్రాయశ్చిత్త కర్మలు


సూతుడు శౌనకాది మహామునులతో మాట్లాడుతూ తన గురువైన వ్యాసమహర్షికి పరాశర మహర్షి వినిపించిన ధర్మకర్మాలను ఇలా ప్రవచింపసాగాడు.


"శౌనకాచార్యా! ప్రతి కల్పాంతంలోనూ అన్నీ నశించిపోతాయి. కల్పప్రారంభంలో మన్వాదిఋషులు వేదాలను స్మరించి బ్రాహ్మణాది వర్ణాల ధర్మాలను మరల విధిస్తుంటారు. కలియుగంలో దానమే ధర్మము. పాపమూ శాపమూ సర్వాంతర్యాములుగా పరిఢవిల్లే ఈ కలియుగంలో పాపాన్ని అంతంచేయలేము. పాపంచేసిన వారిని మాత్రమే పరిత్యజించవలసి వుంటుంది.


త్యజేద్దేశం కృతయుగే త్రేతాయాంగ్రామ ముత్సృజేత్ | 

ద్వాపరే కులమే కంతు కర్తారంతు కలౌయుగే ॥


సత్య (కృత) యుగంలో పాపాత్ములుంటే ఆ దేశాన్నే ఋష్యాదులు త్యజించేవారు. అలా త్రేతాయుగంలో గ్రామాన్నీ, ద్వాపరంలో పాపి కుటుంబాన్నీ త్యజించారు. కలియుగంలో పాపం సార్వలౌకికమైపోతుంది కాబట్టి పాపిని మాత్రమే త్యజించగలరు. మనిషి ఆచారం (సదాచారం, శౌచాచారం) ద్వారానే అన్నీ పొందగలుగుతాడు. సంధ్య, స్నానం, జపం, హోమం, దేవపూజనం, అతిథి సత్కారం అనే ఆరు సత్కర్మలనూ ప్రతి దినం చేయాలి. ఆచారవంతుడైన బ్రాహ్మణుడు గాని సర్వసంగపరిత్యాగియైన సన్యాసిగాని కలియుగంలో దుర్లభం. బ్రాహ్మణులు తమ వర్ణ ధర్మాలను పాటించాలి. (అధ్యయనాధ్యాపనాదులను వదులుకోరాదు) క్షత్రియులు దుష్టులైన శత్రువులను గెలిచి ప్రజలను కన్నబిడ్డల వలె చూసుకోవాలి. వైశ్యులు వ్యవసాయ, వ్యాపార, పశుపాలనాదికములను చేయిస్తూ న్యాయసమ్మతంగానే ధనార్జన చేయాలి. శూద్రులు ఈ పై మూడు వర్ణాల వారికీ నిష్కపటంగా సహకరిస్తూ దేశసౌభాగ్యానికి ఊతమివ్వాలి.


Sunday 28 July 2024

శ్రీ గరుడ పురాణము (248)

 


గురువు, అంతేవాసి (ఆశ్రమంలో వుండేవాడు) శిష్యుడు, వేదాంగ ప్రవక్త, బంధువు, శ్రోత్రియుడు (వేదాలలో ఒక శాఖని బోధించినవాడు) అనౌర పుత్రుడు (దత్తపుత్రుని వంటివాడు) రాజు, తెలిసిన మనిషి మృతి చెందినవార్త తెలియగానే గాని దహనానంతరం గాని స్నానం చేయగానే శుద్ధి జరిగిపోతుంది. ఆత్మహత్యకు పాల్పడ్డవారికీ అంతే.


సత్రమును ఇరవైనాలుగు గంటలూ ప్రజలకోసమే ఆశించకుండా నడిపేవాడు (అన్నం ఉచితంగా పెట్టేవాడు) కృచ్ఛ చాంద్రాయణాది వ్రతాలు చేస్తున్నవాడు, బ్రహ్మచర్య దీక్షలో నున్నవాడు, వానప్రస్థి, బ్రహ్మవిదుడైన సన్యాసి- (వీరు మానవాతీతులనో ఏమోగాని) వీరికి ఎవరు పోయినా మైల అంటదు. ఎట్టి అశౌచమూ వుండదు. దాన కార్యక్రమానికైసిద్ధం చేయబడిన సామగ్రికీ, వివాహ నిమిత్తం కూర్చబడిన ద్రవ్యానికీ, సంగ్రామ సమయంలో ఆ భయంతో నున్న ప్రజలకీ మైల వుండదు. అలాగే వరదల వంటి భయంకర విపత్కర పరిస్థితులలో చిక్కుకున్నవారికీ, అరాచక విప్లవ ప్రాంతాల్లో జీవిస్తున్నవారికీ ఏ మైలా అంటదు.


గ్రీష్మ ఋతు ప్రభావం వల్ల కుంచించుకు పోయిన జలాశయం మళ్ళా నీటితో నిండేదాకా ఎటువంటి శుద్ధి కార్యక్రమాలకూ పనికిరాదు. అంటే జలాశయానికే శుద్ధి అవసరం. అది నీటితో నిండినప్పుడే అవుతుంది. 

ఆపత్కాలంలో బ్రాహ్మణుడు క్షత్రియ లేదా వైశ్యవృత్తులను స్వీకరించవచ్చు. వైశ్యుడి వృత్తి అమ్మకమే అయినా అతడు ఎట్టి ఆపత్కర పరిస్థితుల్లోనైనా వైశ్యవృత్తి చేసే బ్రాహ్మణుడు పండ్లు, సోమలత, వస్త్రాలు, లతలు, ఔషధీలతలు, పాలు, పెరుగు, నెయ్యి, నీరు, నువ్వులు, అన్నం, రసం, ఉప్పు, తేనె, లక్క, హవిష్యాన్నం, మణులు, చెప్పులు, మృగచర్మం, మాంసం, సుగంధద్రవ్యాలు, మూలాలు - వీటిని అమ్మరాదు.


బ్రాహ్మణుడు తన శ్రోత -స్మార్త - యాజ్ఞపూర్ణతకై కావలసిన ధాన్యాన్నీ, అత్యావశ్యకములైన మందులనూ తిలలు విక్రయించి కొనుక్కోవచ్చును. అదీ ఆపత్కాలంలోనే. అప్పుడు కూడా లవణాదికములను అమ్ముకొనరాదు. తన వైయక్తికయజ్ఞాలను చేసుకొంటూనే ఆపద్ధర్మంగా ఇతర వృత్తులను చేయు బ్రాహ్మణుడు సూర్యుని వలె నిష్కలుషితంగానే ఉంటాడు. అతని బ్రాహ్మణ్యానికి తరుగూ విరుగూ వుండవు. వ్యవసాయం, పశుపాలనమూ కూడా అప్పుడు తప్పుకాదు. అయితే గుఱ్ఱాలను అమ్ముకోరాదు.


Saturday 27 July 2024

శ్రీ గరుడ పురాణము (247)

 


ఆ రోజు భోజనం మానకూడదు గానీ వారు పెట్టినదేతినాలి. అడగకూడదు. పరిజనులంతా విడివిడిగా మూడు రాత్రులు నేలపైనే శయనించాలి. పిండయజ్ఞానంతరం మృతవ్యక్తినుద్దేశించి విహిత పిండదాన ప్రక్రియానుసారము దంజెమునపసవ్యం చేసుకొని మూడు రోజుల దాకా పిండరూప అన్నాన్ని మౌనంగా భూమిపై పెడుతుండాలి. శ్రాద్ధం పెట్టే అధికారమున్న వ్యక్తి నీలాకాశం క్రింద నిలబడి ఒక శిక్య మట్టి పాత్రతో నీటినీ మరొక మట్టిపాత్రతో పాలనీ ఆ ప్రేతాత్మకు సమర్పించాలి. ఆ సమయానికి ఆ అధికారికి ఏదైనా అశౌచంవుంటే దానిని శ్రౌతాగ్నిలో స్మార్తాగ్నిలో చేసే నిత్యకర్మ (అగ్నిహోత్రం, దర్శ పూర్ణ మాసం, విహిత స్మార్తాగ్నిలో సాయం-ప్రాతః హోమం) అనుష్ఠానం ద్వారా శ్రుతిలో ఆజ్ఞాపింపబడిన పద్ధతి ద్వారా శుద్ధి చేసుకొని శ్రాద్ధకర్మను తప్పనిసరిగా చేయాలి. 


దంతములు మొలవకముందే పిల్లలు మరణిస్తే వారి బంధువులకు ఖననం జరిగిన వెంటనే శుద్ధి లభిస్తుంది. దంతాలు మొలిచాక పుట్టుజుత్తులు తీయించక ముందు మృతి చెందిన పిల్లల బంధువులకు ఒక రాత్రి, ఒక పగలు అశౌచముంటుంది. చూడాకరణమై ఉపనయనం కాక చనిపోయిన బాలల బంధువులకు మూడు రాత్రులు గడిచేదాకా అశౌచం వుంటుంది. ఉపనయనమైన తరువాత మృతి చెందిన వాని బంధువులలో సపిండకులకు పదిరాత్రుల దాకానూ సమానోదకులకు మూడు రాత్రుల దాకానూ అశౌచముంటుంది.


రెండు సంవత్సరాల వయసు రాకుండానే మృతి చెందిన పిల్లల తల్లిదండ్రులకు పది రాత్రులు గడిచేదాకా అశౌచముంటుంది. పరివారంలో జననమో మృతియో జరిగినా ఈ పదిరాత్రుల మైల పట్టింపులో తేడా వుండదు.


సపిండులు మరణిస్తే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులకు పది, పన్నెండు, పదిహేను, ముప్పది దినాల మైల వుంటుంది. పెండ్లికి, నిశ్చితార్థానికి ముందు చూడాకరణ తరువాత మృతి చెందిన కన్య బంధువులకు ఒక పగలు, ఒక రాత్రి గడిచాక శుద్ధి అవుతుంది. దంతాలు మొలిచేలోగానే మృతి చెందిన బాలకుని ఖననం బదులు అగ్ని సంస్కారం చేస్తే ఒక రోజు దాటగానే శుద్ధి జరిగిపోతుంది*.


*ఈ విషయం యాజ్ఞవల్క్య స్మృతి - మితాక్షర - 24వ శ్లోకంలో చెప్పబడింది.


Friday 26 July 2024

శ్రీ గరుడ పురాణము (246)

 


కొన్ని పాపాలకు శాస్త్రంలో ప్రాయశ్చిత్తాలు చెప్పబడలేదు. అటువంటి పాపాలన్నీ చాంద్రాయణ వ్రతం వల్ల నశిస్తాయి. ఏదో పాప ప్రక్షాళన కోసం కాకుండా, పుణ్యుడు మరింత పుణ్య సముపార్జన కోసం చాంద్రాయణ వ్రతాన్ని చేస్తే వాని పుణ్యము పండి దేహాంతంలో చంద్రలోకాన్ని చేరుకుంటాడు. అలాగే ప్రాయశ్చిత్తం కోసం కాకుండా పుణ్యం కోసం కృచ్ఛవ్రతం చేసేవాడు గొప్ప ఐశ్వర్యవంతుడౌతాడు. (అధ్యాయం - 105)


అశౌచం, ఆపద్వృత్తి


మునులారా! ఇపుడు మృత్యువు ఆవరించాక మనిషికి కలిగే మరణశౌచాన్ని వర్ణిస్తాను వినండి.


రెండేళ్ళలోపు వయసున్న బాలకుడు మృతి చెందితే వానిని పాతిపెట్టాలి. జలాంజలి నీయకూడదు. ఈ పాతిపెట్టవలసిన చోటు నగరానికైనా గ్రామానికైనా వెలుపలవుండాలి. శ్మశానం కారాదు. శవాన్ని గంధ, మాల్య, అనులేపనాదులతో బాగా అలంకరించాలి. (మనుస్మృతి 5/68,69). రెండేళ్ళు దాటి, ఉపనయనమయ్యేలోగా మరణించిన బాలకుని బంధుగణమంతా కలసి శ్మశానానికి గొనిపోయి లౌకికాగ్నితో, యమసూక్త, పారాయణ చేస్తూ చితిపై దహనం చేయాలి.


వడుగై, మరణించిన బాలునికి అన్ని క్రియలనూ ఆహితాగ్నితో సమానంగా చేయాలి. మరణతిథికి ఏడవ లేదా పదవరోజున ముందుగా, అతని వర్ణంలో గోత్రంలో నుండు పరిజనులు (సమాన గోత్ర, సమాన పిండ, సమానోదక జనులు) అపనః శోశుచదఘం అనే ఋగ్వేద (1/97/1-8) మంత్రాలతో దక్షిణం వైపు తిరిగి యథాసంభవంగా అంటే వీలైనంతగా ఇంటికి దూరంగా నున్న జలాశయానికి పోయి జలాంజలులివ్వాలి. ఇలాగే మాతామహునికీ ఆచార్యపత్నికీ ఇతరులకు కూడా ఇవ్వాలి. ఉపనయనమైనాక మరణించిన వానికి కూడా సంపూర్ణకర్మకాండను నడిపించాలి.


మిత్రుడు, వివాహితస్త్రీ (సోదరి మొదలైనవారు) వదిన, మామగారు, ఋత్విక్కు మరణించినపుడాయా ఆత్మల అభ్యున్నతికై జలాంజలులిస్తూ పేరునీ గోత్రాన్ని చెప్పి ఒకేసారి జలాంజలి నివ్వాలి. ఈ జలాంజలులనే ధర్మోదకాలని కూడా అంటారు) పాఖండులూ, పతితులూ పోయినపుడు ధర్మోదకాల తంతువుండదు. బ్రహ్మచారి (ఆశ్రమంలో వుండి పోయిన యువసన్యాసి) వ్రాత్యుడు, వ్యభిచారిణియగు స్త్రీకి కూడా ధర్మోదకాలివ్వరు. తాగుబోతుకీ ఆత్మహత్య చేసుకున్నవారికీ కూడా అశౌచముంటుంది కాబట్టి వారు జలాంజలులకర్హులు కారు.


వ్యక్తి మరణించినపుడు పెద్దపెట్టున ధ్వనులు చేస్తూ రోదించడం నిషిద్ధం. జీవుల స్థితి అనిత్యమనే జ్ఞానం కనీసం అప్పుడైనా వుండాలి. యథాశక్తిగా శ్మశానానికి గొనిపోయి దహనక్రియను గావించి స్వజనులంతా ఆ వ్యక్తి ఇంటికి రావాలి. ద్వారంలో ప్రవేశిస్తూనే వేపాకును నమలి, ఆచమనం చేసి అగ్ని, జలం, పేడ, తెల్ల ఆవాలు ఈ నాల్గింటినీ ముట్టుకొని రాతిపై పాదాలను ఒక్క క్షణం వుంచి అప్పుడు నెమ్మదిగా ఇంటిలోనికి రావాలి. ఎవరి ప్రేతాన్ని ముట్టుకొని శ్మశానం కెళ్ళకుండా ఇంటికి వచ్చినా ఇంటిలోకి ప్రవేశిస్తూ ఈ విహిత కర్మనంతటినీ ఆచరించాలి. దహనం పూర్తయ్యేదాకా గానీ దహనక్రియకు గానీ మరుభూమిలోవుండి వచ్చిన సపిండులు అక్కడే స్నానం చేసి ప్రాణాయామం చేస్తే శుద్దులవుతారు. పుణ్యం కూడా ప్రాప్తిస్తుంది. (ప్రేతానుగమనమే పుణ్యము).


Thursday 25 July 2024

శ్రీ గరుడ పురాణము (245)

 


పలాశ, గూలర, కమల, బిల్వ పత్రాలలో ఒక్కొక్కరోజు ఒక్కొక్క దాన్ని నీటిలో వేసి ఉడికించి ఆ రోజంతా ఆ నీటినే త్రాగాలి. అలా నాలుగు రోజులు నాలుగాకుల నీరు తరువాత అయిదవ రోజున కుశోదకం మాత్రం త్రాగాలి. అంటే ఈ అయిదు రోజులూ ఇంకేదీ తినకుండా తాగకుండా కృశించాలి. ఈ వ్రతాన్ని పర్ణకృచ్ఛవ్రతమంటారు. తొలిరోజు వేడి ఆవుపాలనూ, మలిరోజు వేడి నేతినీ, మూడవరోజు వేడినీటినీ మాత్రమే ప్రాశ్నచేసి (అనగా నోట్లో వేసుకొని) నాలుగవ రోజు పూర్తిగా ఉపవాసముండి పోవాలి. ఈ వ్రతాన్ని మహాతప్తకృచ్ఛవ్రతమంటారు. ఈ కృచ్ఛవ్రతాలు పరమశుద్ధికరాలు, పవిత్రాలు.


కృచ్ఛవ్రతాలలో మరొకటి పాదకృచ్ఛవ్రతం. మొదటి రోజు ఏకభుక్తం (మధ్యాహ్నం పన్నెండుకి భోజనంచేసి మరేమీ తీనకుండా రాత్రి శయనించడం) రెండవ రోజు నక్తవ్రతం (అనగా రోజంతా ఏమీ తినకుండా రాత్రి మాత్రం భోంచేయడం) మూడవ రోజు అయాచితం (ఎవరినీ యాచించకుండా ఇంట్లో వండుకోకుండా ఎవరైనా వచ్చి పెడితే, అదీ ఒకపూట తినడం) నాలుగవ రోజు కటిక ఉపవాసం. ఇదంతా కలిపి పాదకృచ్ఛవ్రతం అవుతుంది. ఇదే వ్రతాన్ని ఒకే నెలలో మూడుమార్లు చేస్తే దానిని ప్రాజాపత్యవ్రతమంటారు. ఈ వ్రతంలో కూడా భోజనం చేయునపుడు ఒకమారు చేతినిండా పట్టు అన్నాన్ని మాత్రమే రోజంతటిలో తిని నాలుగు రోజులుండగలిగితే దానిని అతికృచ్ఛవ్రతమంటారు. పన్నెండు రోజులు పూర్ణ ఉపవాసం చేయడాన్ని పరాకవ్రతమంటారు. ఇరవై ఒక్క రోజుల పాటు నీరు లేదా పాలు మాత్రమే తీసుకొని అతి కృచ్ఛవ్రతపాలనం చేయడాన్ని కృచ్ఛాతి కృచ్ఛవ్రతమని వ్యవహరిస్తారు.


ఆరు రోజుల కృచ్ఛవ్రతమొకటుంది. నూనెను బాగా పిండి చేసిన పిమ్మట మిగిలిన నూల పిప్పిని తొలిరోజూ, గంజిని రెండవరోజూ, మజ్జిగను మాత్రమే మూడవదినమూ, కేవలం జలాన్ని నాలుగవనాడూ పేలపిండిని అయిదవరోజూ ఆహారంగా స్వీకరించి ఆరవరోజు కటిక ఉపవాసం చేయడాన్ని సౌమ్యకృచ్ఛవ్రతమంటారు. ఈ వ్రతాన్నే కొంచెం అతిశయింపజేసి ఒకరోజు తినే పదార్థాన్ని మూడు రోజులపాటు తింటూ మొత్తం పదిహేను రోజులు చేసి పదహారవనాడు పూర్ణోపవాసం చేస్తే దాన్ని తులాపురుష (సంజ్ఞక) కృచ్ఛవ్రతమంటారు.


చాంద్రాయణ వ్రతమనగా చంద్రుని కళలను బట్టి ఆహారాన్ని స్వీకరించడం. అమావాస్యనాడు ఒక నెమలిగుడ్డంత అన్నాన్ని తిని రోజుకొక గుడ్డు ప్రమాణాన్ని పెంచుకుంటూ పూర్ణిమనాడు సంపూర్ణ భోజనం చేసి, మరునాటి నుండి అదే కొలతలో తగ్గించుకుంటూ పోయి అమావాస్యనాడు మరల నెమలిగుడ్డంత ద్రవ్యాన్నే తిని చేసే వ్రతానికి చాంద్రాయణ వ్రతమని పేరు. మొత్తం నెలలో రెండు వందల నలభై గ్రాసాల హవిష్యాన్నమును పైన చెప్పిన క్రమంలో తిని వుండి పోవడానికి విశేష వ్రతమని పేరు. పైన చెప్పిన వ్రతాలను అనుష్టిస్తున్న అన్ని రోజుల్లోనూ ప్రాతః, మధ్యాహ్న, సాయంకాలీన స్నానాలు చేసి పవిత్ర సంజ్ఞక విశేషమంత్రాలను జపిస్తూ గ్రాస పరిమాణంలో అన్నం తినడానికి ముందు ప్రతి గ్రాసాన్నీ గాయత్రితో అభిమంత్రితం చేస్తూ ఒక విధమైన నిరాసక్త, ఆధ్యాత్మిక, ప్రశాంత జీవనాన్ని గడపాలి.


Wednesday 24 July 2024

శ్రీ గరుడ పురాణము (244)

 


మద్యపానం తెలియక చేసి తెలిశాక పశ్చాత్తాపము నొందినవాడు జలమధ్యంలో నిలబడి రుద్రదేవ మంత్రాన్ని జపిస్తూ మూడు రోజులు ఉపవాసంతో గడిపి ఆ మరునాడు గుమ్మిడి ముక్కలను (కుష్మాండీబుచా) నేతిలోముంచి అగ్నికి ఆహుతులనిస్తే ఆత్మశుద్ధి కలుగుతుంది. గురుపత్నీగమనం చేసిన పాపి ఇలాగే చేస్తూ రుద్రదేవమంత్రానికి బదులు సహస్ర శీర్షా... మంత్రాన్ని జపించాలి.


మిగిలిన పాపాలకు నూరుమార్లు ప్రాణాయామం చేయడం లేదా త్రైకాలిక సంధ్యో పాసన, బ్రాహ్మణునిచే పదకొండాహుతులనిప్పించి రుద్రానువాకములు జపించుట మున్నగునవి ప్రాయశ్చిత్త విధానాలు. బ్రహ్మహత్య తప్ప మిగతా పాపాలన్నీ వాయుభక్షణం మాత్రమే చేస్తూ దినమంతా సూర్యరశ్మి పడే చోట జలంలోవుండి రాత్రంతా కూడా అక్కడే వుండి వేయిమార్లు గాయత్రి మంత్రాన్ని జపిస్తే నశిస్తాయి.


వేదాభ్యాసం చేసే శాంతి పరాయణుడైన పంచయజ్ఞానుష్ఠాత నుండి పాపమే దూరంగా పారిపోతుంది. యమ నియమాలున్న వానికి పాపపుటాలోచనలే రావు. బ్రహ్మచర్యం, దయ, క్షమ, భగవద్ధ్యానం, సత్యం, నిష్కాపట్యం, అహింస, అస్తేయం, మాధుర్యం దమం అనే పదీ యమములు. స్నానం, మౌనం, ఉపవాసం, యజ్ఞం, స్వాధ్యాయము, ఇంద్రియనిగ్రహం, తపస్సు, అక్రోధం, గురుభక్తి, పవిత్రత- ఈ పదీ నియమాలు. (మౌనం అంటే శాశ్వతంగా మూగబోవడమని కాదు; కొంతకాలం పాటు కొన్ని వ్రతాలలో 

భాగంగా మాట్లాడకుండా వుండడం).


ఆవు యొక్క పాలు, పెరుగు, నెయ్యి, మూత్రం, మయం పంచగవ్యాలు. వీటిని కుశోదకంతో కలిపి దానినే అన్నానికి బదులు తినడం కృచ్ఛవ్రతమవుతుంది. ఒకరోజంతా దీనిని మాత్రమే స్వీకరించి మరునాడు పగలంతా ఉపవాసముండి రెండవరోజు రాత్రంతా పంచగవ్యాలనే స్వీకరిస్తూ వుంటే దానిని కృచ్ఛసాంతపన వ్రతమంటారు.


తొలిరోజు ఆవుపాలు, మరునాడు ఆవు పెరుగు, మూడవనాడు ఆవునెయ్యి, నాల్గవదినం గో మూత్రం, ఐదవ రోజు గోమయం, ఆరో రోజు కుశోదకం మాత్రమే స్వీకరించి ఏడవరోజు ఏమీ తీసుకోకుండా కటిక ఉపవాసం చేస్తే ఈ మొత్తమంతా కలిపి పరమ పవిత్రమైన 'మహాసాంతపన' వ్రతమనబడుతుంది.


Tuesday 23 July 2024

శ్రీ గరుడ పురాణము (243)

 


శరణని వచ్చి ఆశ్రయించిన వానికి దక్షత వుండీ కూడా శరణివ్వని వాడి పాపానికీ ఇదే తగిన ప్రాయశ్చిత్తం.


గాడిదపైగాని ఒంటిపైగాని ప్రయాణించేవాడు మూడు ప్రాణాయామాలు చేయాలి. తెలియక, అనగా అవి పాపములని తెలియక, చేసిన నగ్నస్నానము, నగ్నశయనము, పగటిపూట రతి అనే పాపాలు కూడా మూడు ప్రాణాయామాల ద్వారా నశిస్తాయి. గురుజనులను 'నీవు' అని సంబోధించరాదు. అట్టి పాపము ఆ గురు జనుల ప్రసన్నతవల్ల పోతుంది. బ్రాహ్మణుని కొట్టడానికి వెళ్ళడమే పాపం. దానికి కృచ్ఛ వ్రతమే ప్రాయశ్చిత్తం. క్రోధంలో ఒళ్ళు మరచిపోయి బ్రాహ్మణుని కొట్టిన పెనుపాపము అతి కృచ్ఛవ్రతమున గాని తీరదు.


విఖ్యాతమైన పాపాలకు ప్రాయశ్చిత్తాన్ని గురుజనులు అనగా పరిషత్తు నిర్ణయాన్ని బట్టి కూడా చేయవచ్చు.


విఖ్యాతం కాని పాపాలకు గుప్త రూపంలోనే ప్రాయశ్చిత్త నిర్ణయం చేయబడాలి. దీని భావమేమనగా ఒక వ్యక్తి బ్రహ్మహత్య చేసినట్లు అతనికే తరువాత తెలిసిందనుకుందాం. ఊరిలో ఇంకెవరికీ తెలియదనుకుందాం. అప్పుడా వ్యక్తి పరిషత్తులో నొకనిని కలుసుకొని తనకి తెలియకుండానే తనవల్ల జరిగిన బ్రహ్మహత్యకు పాపమంటకతప్పదు కాబట్టి ప్రాయశ్చిత్తాన్ని వేడితే ఆయన చెప్పేది గుప్త రూపంలో నున్న ప్రాయశ్చిత్త మనబడుతుంది. ఈ ప్రాయశ్చిత్తాలలో కొన్ని ఇలావుంటాయి.


బ్రహ్మహత్య చేసిన పాపి మూడు రాత్రులు గడిచేదాకా ఉపవాసం చేసి విశుద్ధ జలాల మధ్య అనగా నదీ సరోవరాదులలో పీకల దాకా మునిగి అఘమర్షణ మంత్రాన్ని జపించాలి. మూడు రాత్రులు దాటాక వచ్చే పగటిపూట ఒక పాలిచ్చే ఆవును సత్పాత్రునికి దానమివ్వాలి.


ఈ విధంగా తపించి, జపిస్తే అజ్ఞానవశాన తన చేత జరిగిన బ్రహ్మహత్యా పాతకం నశిస్తుంది. దీనికే మరొక ప్రాయశ్చిత్తం కూడా చెప్పబడింది. బ్రహ్మహత్య కర్త ఒక పగలూ ఒక రాత్రి వాయుభక్షణ మాత్రమే చేస్తూ శుద్ధ జల మధ్యంలో అలా నిలబడే వుండిపోయి తెల్లవారగానే బయటికి వచ్చి లోమభ్యస్వాహా మున్నగు ఎనిమిది మంత్రాలనూ ఘోషిస్తూ ఒక్కొక్క దానితో అయిదేసి ఆహుతులను యథావిధానంగా అగ్నిలో వ్రేల్చాలి*.


* ఈ మంత్రాలు యాజ్ఞవల్క్యస్మృతిలో 247వ శ్లోకంలో కనిపిస్తాయి.


Monday 22 July 2024

శ్రీ గరుడ పురాణము (242)




తప్పనిసరి పరిస్థితుల్లో ఇష్టంలేకున్నా మధు, మాంసాలను సేవించినవాడు కృచ్ఛవ్రతాన్నీ అన్యశేష వ్రతాల్నీ ఆచరిస్తే ఆ పాపం శాంతిస్తుంది. గురువుగారు చెప్పిన పనిని చేస్తూ గాని మార్గంలోగాని శిష్యుడు మృతి చెందితే ఆ పాపం గురువును ముట్టుకుంటుంది. గురువు దానికి ప్రాయశ్చిత్తంగా మూడు కృచ్ఛవ్రతాలనాచరించాలి. గురువు గారిని అసంతృప్తికి గురిచేసిన శిష్యునికి మాత్రం ఆ గురువుగారిని ప్రసన్నుని, సంతృప్తుని (సంతుష్టుని) చేసుకోవడమే ప్రాయశ్చిత్తం. గురువుగారిని బాధించిన పాపం పోవాలంటే ఆ గురు ప్రసన్నతే తప్ప మరో దారిలేదు.


నిర్దోషులనూ, అమాయకులనూ పాపులని దూషించి దొంగఋజువులతో నిరూపించే ప్రయత్నం చేసేవాడు మహాపాపి. వీనికి ప్రాయశ్చిత్తం జితేంద్రియుడై, ఒక నెలపాటు మంచి నీళ్ళు మాత్రమే ఆహారంగా తీసుకుంటూ పాపమోచన మంత్రమును జపించుట.


అసత్ ప్రతి గ్రహం అనగా అపసవ్య దానమును పుచ్చుకొనుట కూడా పాపమే. దీనికి ఒక మాస పర్యంతం బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ పయోవ్రతం అనగా పాలనే ఆహారంగా తీసుకొనే వ్రతమును చేస్తూ పశువులసాలలో నివాసముంటూ సదా గాయత్రిమంత్రాన్ని జపిస్తూ గడపడం ప్రాయశ్చిత్తంగా చెప్పబడింది.


వ్రాత్యుని కుపనయనం చేసి యజ్ఞం చేయించిన వాని కంటుకొనే పాపం మూడు కృచ్ఛ వ్రతాలను ఆచరించడం వల్ల నశిస్తుంది. అభిచారకహోమం (మంత్రం ద్వారా అపకారం) వల్ల వచ్చే పాపానికీ ఇదే ప్రాయశ్చిత్తం*. *వేదప్లావి ఒక సంవత్సరం పాటు యవలనే తిని బతకాలి.


* యాజ్ఞవల్క్య స్మృతిలోని 288వ శ్లోకానికి చేయబడిన మితాక్షర వ్యాఖ్యలో ప్రకృతంలో విప్లవ శబ్దానికి మూడర్దాలు చెప్పబడ్డాయి 1. వేదాన్ని రక్షించవలసిన బాధ్యత గలవాడు దానికి తగ్గ సామర్థ్యముండి కూడా ఆ పనిని చేయకపోవడం వేద విప్లవం. 2. అనధ్యయన లేదా అనధ్యాయ కాలంలో వేదాన్ని అధ్యయనం చేయడం అధ్యయన విప్లవం 3. వేదాధ్యయన సమర్థుడూ, వేదాధ్యయనం చేసి గొప్ప స్థాయికి తానుపోయి వేదాన్నిగొని పోగలిగే దక్షుడూ అయినవానికి సరిగ్గా చదువు చెప్పకుండా నిరుత్సాహానికి వానిని గురిచేయడం విప్లవం. ఈ మూడు దోషాల్లో దేనికి పాల్పడినా ఆ దోషి వేదప్లావి అనబడతాడు.


* * వేదమూ ధర్మము క్షుణ్ణంగా తెలిసిన ముగ్గురు లేదా నలుగురు బ్రాహ్మణులతో ఎక్కడిక్కడ ప్రాయశ్చిత్త పరిషత్తులను ఏర్పాటు చేసుకోవచ్చు. మరీ చిన్న గ్రామాలలో నైతే వేదమూ, ధర్మ శాస్త్రమూ బాగా తెలిసిన బ్రహ్మవేత్తయగు ఒక బ్రాహ్మణునే పరిషత్తుగా నిర్ణయించుకొని ఆయనకే సర్వాధికారాలనూ సమర్పించవచ్చు. ఈ విషయం యాజ్ఞవల్క్యస్మృతి, ఆచారాధ్యాయం, 9వ శ్లోకంలో నిర్దేశింపబడింది.


Sunday 21 July 2024

శ్రీ గరుడ పురాణము (241)

 


గోవధచేసిన పాపి పంచగవ్యాలను మాత్రమే స్వీకరిస్తూ ఒక నెలపాటు మునివలె ఏ వికారాలూ లేకుండా గోశాలలోనే జీవిస్తూ గోసేవ చేయాలి. మాసాంతంలో యథాశక్తిగా గోదానం చెయ్యాలి.


ఉపపాతక శుద్ది చాంద్రాయణ వ్రతం వల్ల సిద్ధిస్తుంది. ఒక మాసం దాకా పాలను మాత్రమే స్వీకరిస్తూ 'పరాక' నామక వ్రతం చేసినా అదే ఫలముంటుంది.


క్షత్రియవధను చేసినవాడు ఒక ఎద్దునూ వేయి ఆవులనూ దానంచేయాలి లేదా బ్రహ్మహత్యకు నిర్దేశింపబడిన ప్రాయశ్చిత్తాన్ని మూడేళ్ళ పాటు చేసుకోవాలి. వైశ్యుని వధించిన వాడు వంద గోవులను దానం చేయాలి లేదా బ్రహ్మ హత్యాపాతక ప్రాయశ్చిత్త వ్రతాన్ని ఒక యేడాది పాటు చేయాలి. శూద్రుని హత్యచేసినవాడు గాని స్త్రీ ని వధించిన వాడు గాని బ్రహ్మహత్యా పాతక ప్రాయశ్చిత్త వ్రతాన్ని ఆరునెలల పాటైనా ఆచరించాలి లేదా సత్పాత్రునికి పది సవత్సపయస్వినీ గోవులను దానమైనా ఇవ్వాలి. ఇవన్నీ తెలియకగాని అజ్ఞానవశనగాని అప్రయత్నంగా గాని, చేసిన హత్యలకు ప్రాయశ్చిత్తాలు.


పిల్లి, ముంగిస, ఉడుము, కప్ప, సాధారణ పశువులు- వీటిని చంపడం కూడా పాపమే. ఈ పాపము చేసినవాడు మూడు రాత్రులు గడిచే దాకా పాలను మాత్రమే స్వీకరిస్తూ పాదకృచ్ఛవ్రత పాలనము చేయాలి. ఏనుగును వధించినవాడు అయిదు నీలవృషభాలను పేరుగల విశిష్టలక్షణాలున్న ఎద్దులను సత్పాత్రునికి దానం చెయ్యాలి. చిలుకనుగాని రెండేళ్ళ వయసున్న దూడని గానీ క్రౌంచపక్షిని గాని వధించిన వాడు మూడేళ్ళ వయసున్న దూడను దానం చేయాలి. గాడిద, మేక, గొఱ్ఱ్లలో నొక దానిని చంపినవాడొక ఎద్దును దానంచేయాలి. వృక్ష, గుల్మ, లతాదులను నరికి వేసిన ద్విజుడు నూరుమార్లు గాయత్రిని జపించాలి. 


Saturday 20 July 2024

శ్రీ గరుడ పురాణము (240)

 


ప్రాయశ్చిత్త కర్మలో మరొక విశేషమేమనగా హత్యాప్రయత్నం చేయడమే తప్పు అవతలి వ్యక్తి మరణించినా, ఏదో చావు తప్పి కన్ను లొట్టపోయి బతికి బయటపడినా హత్యకి చెప్పబడిన ప్రాయశ్చిత్త కర్మను చేసుకోకతప్పదు. అంటే అవతలి వాడు చావకపోయినా హత్యా ప్రయత్నంచేసిన వానికి హత్యాపాపమే అంటుకుంటుంది.


మదిరాపానానికి ప్రాయశ్చిత్తం అగ్నివలె వేడెక్కి పొగలు గ్రక్కుతున్న మద్యాన్ని గానీ, సలసలమరుగుతున్న గోమూత్ర, గోదుగ్ధ, గోఘృతాలలో నొకదానిని గాని ఆపకుండా ఆగకుండా భగవన్నామస్మరణ చేస్తూ త్రాగుట. నీరనుకొని మద్యం పొరపాటున తాగేసినవారు జడలు పెంచుకొని మలిన వస్త్రాలను కట్టుకొని మరుగుతున్న నేతిని త్రాగుతూ బ్రహ్మహత్యకు గల ప్రాయశ్చిత్తాన్ని చేసుకోవాలి. తరువాత తన వర్ణానికి తగిన సంస్కారాన్ని చేసుకోవాలి.


వీర్య పానం, సురాపానం, మూత్రపానం, చేసే బ్రాహ్మణి సద్గతి నందకపోగా క్రమంగా గద్ద, కుక్క, పంది యోనుల్లో పుడుతుంది. బ్రాహ్మణుని బంగారాన్ని అపహరించిన వానికి ప్రాయశ్చిత్త కర్మ మేమనగా వాడొక రోకలిని మోసుకొని రాజ సభలోకి (న్యాయస్థానం అప్పట్లో అదే) పోయి తాను చేసిన పాపాన్ని ప్రకటించి రాజు విధించినన్ని దెబ్బలు ఆ రోకటి తోనే తినాలి. ఈ శిక్షాక్రమంలో వాడు మరణించినా, శిక్షానంతరం జీవించినా పవిత్రుడే అవుతాడు. (తెలుగిళ్ళలో ఒక మాటుంది. రాజదండనవుంటే ఇక యమదండన వుండదని.) ఇలా చేయనివారు తమ తప్పునొప్పుకొని తమయెత్తు బంగారాన్ని ఆ బ్రాహ్మణునికి సమర్పించుకున్నా ఆ పాపం పోతుంది.


గురుపత్నితో గమించినవాడు ఎఱ్ఱగా కాలుతున్న ఇనుప స్త్రీ విగ్రహాన్ని కౌగలించుకొని ప్రాణత్యాగం చేయాలి లేదా తన లింగాన్నీ, అండకోశాల్ని తానే కత్తిరించుకొని నైరృత్య దిశవైపు విసిరేయాలి). ఈ మహా పాపానికి ఇంకా రెండు రకాల ప్రాయశ్చిత్తాలు చెప్పబడ్డాయి. పశ్చాత్తపించిన వాడు మూడు సంవత్సరాల పాటు ప్రాజాపాత్య, కృచ్ఛవ్రత పాలనను చేయాలి లేదా మూడు మాసాల పాటు చాంద్రాయణ వ్రతం చేస్తూ ఏకదీక్షగా వేదసంహితను పఠిస్తూ వుండాలి. దీక్షపూర్తయితే పాపం పోతుంది.


Friday 19 July 2024

శ్రీ గరుడ పురాణము (239)

 


మునులారా! ఇక వీటికి ప్రాయశ్చిత్తాలను వినండి.


తెలియక బ్రహ్మహత్యచేసినవాడు ఒక కపాలాన్ని చేత బట్టుకొని మరొక కపాలాన్ని కర్రకు గుచ్చి ధ్వజాన్ని వలె మోస్తూ భిక్షాటన చేస్తూ యమ నియమాలు పాటిస్తూ పన్నెండేళ్ళపాటు తిరుగుతునే వుండాలి. తెలిసి చేసినవాడు (బ్రహ్మ హత్యయని) లోమభ్యః స్వాహా ఇత్యాది మంత్రాలతో తన శరీరాంగాలకు ప్రతీకలుగా విభిన్న శాస్త్ర విహిత ద్రవ్యాలను అగ్నికి ఆహుతి చేసి చివరగా తన శరీరాన్ని కూడా నిర్దిష్ట విధానం ద్వారా అగ్నికి ఆహుతి చేయాలి. బ్రాహ్మణుని రక్షించడం కోసం తన ప్రాణాన్ని అర్పించినా కూడా బ్రహ్మహత్యాపాతకం నుండి విముక్తి కలుగుతుంది. ఇవే కాకుండా ప్రాణత్యాగమక్కరలేని ప్రాయశ్చిత్తాలున్నాయి. అవి ఇంచు మించు ప్రాణం పోయడమంత కష్టం.


అత్యధికంగా కష్టపెడుతున్న, దుస్సహమైన, బహుకాల వ్యాపితమైన రోగంతో గాని అంతకన్న ప్రాణములనార్పివేసేటంత భయంవల్ల గాని చెప్పలేనంత బాధపడుతున్న బ్రాహ్మణుని గాని గోవుని గాని, చేరదీసి ఆదరించి సేవచేసి సంరక్షణ చూసి, సంపూర్ణారోగ్యవంతులను గావించినచో కూడా బ్రహ్మ హత్యాపాతకం పోతుంది.


బ్రాహ్మణుల కడుపున పుట్టాడన్న మాటే గాని ఏ గుణమూ వీడు బ్రాహ్మణుడు అని చెప్పడానికి వీలులేకుండా వున్న వానిని పొరపాటున చంపినా కూడా అది బ్రహ్మ హత్యే అవుతుంది దానికి ప్రాయశ్చిత్తం ఇది :


అడవిలోనికి పోయి మంత్రాలతో ఐతరేయ బ్రాహ్మణాది అంగాలతో సహా వేదాన్ని పూర్తిగా మూడుమార్లు పారాయణ చేయాలి లేదా వేదవిద్యకై తన జీవితాన్ని ధారపోస్తూ తన ధనాన్నంతటినీ యోగ్య పాత్రులకు సమర్పించి వేయాలి. సోమయాగం చేసిన లేదా చేస్తున్న క్షత్రియుని గానీ వైశ్యునిగానీ చంపినా బ్రహ్మ హత్యకు విధింపబడిన ప్రాయశ్చిత్తాన్నే చేసుకోవాలి.

Thursday 18 July 2024

శ్రీ గరుడ పురాణము (238)

 


ప్రాయశ్చిత్తాలు - కృచ్ఛ, పరాక, చాంద్రాయణాది వ్రతాల స్వరూపాలు


విహితస్యాననుష్ఠానాన్నింది తస్యచసేవనాత్ |

అనిగ్రహాచ్చేంద్రియాణాం నరః పతన మృచ్ఛతి ॥


(ఆచార - 105/1)


చేయవలసిన పనులను చేయకపోవడం, చేయకూడని పనులను చేసేయడం, ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోవడం- ఈ మూడిటిలో ప్రతీది మానవుని అధోగతి పాల్చేసే శక్తిని కలిగి వుంటుంది. కాబట్టి ఆత్మశుద్ధికై ప్రతి ఒక్కరూ తాను తెలిసోతెలియకో చేసిన దుష్కర్మకు ప్రాయశ్చిత్తాన్ని చేసుకోవలసిందే. అలా చేసుకున్న వారి అంతరాత్మా ప్రసన్నమవుతుంది. లోకం వారిని ప్రసన్నతాదృక్కులతో చూడడమూ జరుగుతుంది. ప్రాయశ్చిత్తం వల్ల పాపాలునశిస్తాయి. పశ్చాత్తాపం నరకాన్ని దూరం చేస్తుంది.


అలాకాకుండా 'నేను ప్రాయశ్చిత్తం చేసుకోను. నాకు పశ్చాత్తపింపవలసిన అగత్యం లేదు' అని మొండికేసిన వాని కోసం, ఇదిగో, ఈ క్రింద చెప్పబడిన నరకాలన్నీ సిద్ధంగా వుంటాయి.


మహారౌరవం, దాని కన్నను మహాభయంకరములైన తామిస్ర, లోహశంకు, పూతిగంధ, హంసాభ, లోహితోద, సంజీవన, నదీపథ, మహా నిలయ, కాకోల, అంధతామిస్ర, తాపన నరకాలే అవి.


బ్రాహ్మణ హంతకుడు, తాగుబోతు, బ్రాహ్మణుని బంగారాన్ని దొంగిలించినవాడు, గురుపత్నిని కామించినవాడు, వీరితో తిరిగేవారు ఈ మహాపాపులంతా అవీచి, కుంభీపాకమను పేరుగల నరకాలలో పడతారు. అవే అత్యంత భయంకర నరకాలు.


గురువునీ వేదాన్నీ నిందించడం కూడా బ్రహ్మహత్యతో సమానమైన పాతకమే. నిషిద్ధ పదార్థాలను తినుట, కుటిలతతో నిండిన ప్రవర్తన, రజస్వలయగు స్త్రీని పెదవులపై చుంబించుట, మద్యపానం ఒకే రకమైన పాపాలు. అశ్వ, రత్న, స్వర్ణ చౌర్యాలు సమానపాపాలు. మిత్రపత్ని, తనదికాని ఉత్తమ జాతి స్త్రీ, చండాలి, సోదరి, కోడలు వంటి స్త్రీలతో రమించుట కూడ గురుపత్నీ గమనంతో సమానమైన మహాపాపాలే. అలాగే పిన్ని, అత్త, ఆచార్యపుత్రి, ఆచార్యపత్నీ కూతురు వరుస స్త్రీలతోడి రమింపు కూడ గురుపత్నీ గమనంతో సమానమైన మహాపాతకాలే.


ఇలాంటి మహాపాపులకు ముందుగా లింగభేదనం చేసి కొంతకాలమాగి అప్పుడు వారిని వధించాలి. ఇటువంటి పాపంలో పాలు పంచుకుని ఇష్టపూర్వకంగా వ్యభిచరించిన స్త్రీని కూడ క్రమక్రమంగా వధించాలి.


గోహత్య, వ్రాత్యత (వడుగు చేసుకోక పోవడం) బ్రాహ్మణ స్వర్ణ లేదా తత్సమానద్రవ్యాపహరణ, అప్పునెగ్గొట్టుట, దేవపితృఋషి ఋణాలను తీర్చకుండుట, అధికారి అయివుండీ అగ్నికార్యం చేయకుండుట, అమ్మకూడని లవణాదులను అమ్ముకొనుట, పెద్దన్నకు పెళ్ళికాకుండానే తాను చేసుకొనుట, అధ్యయనాధ్యాపనములకు డబ్బును వాడుట, తమ్మునికి వివాహం చేసి తాను పెండ్లిని మానుకొనుట, పరస్త్రీ గమనము, చక్రవడ్డీలను గుంజుకొనుట, లవణం తయారీ, స్త్రీ వధ, శూద్రవధ, నిందితధనంతో జీవనం గడుపుట, నాస్తికత, వ్రతలోపం, కొడుకును అమ్ముకొనుట, మాతాపితలను పరిత్యజించుట, చెఱవులనూ తోటలనూ అమ్ముకొనుట, కన్యపై అపవాదు వేసి దూషించుట, తనకోసం మాత్రమే భోజనమును వండుకొనుట, మద్యపానం చేసే స్త్రీతో సంబంధం పెట్టుకొనుట, స్వాధ్యాయ, అగ్ని, పుత్ర బంధు ఈ నాల్గింటినీ పరిత్యజించుట, అసత్ శాస్త్రాలను చదువుట, భార్యనూ తననూ అమ్ముకొనుట - ఇవన్నీ ఉపపాతకాలు.


Wednesday 17 July 2024

శ్రీ గరుడ పురాణము (237)

 


కర్మవిపాక నిరూపణ


మునులారా! పాపకర్మం వల్ల నరకంలోపడి అనుభవించే నారకీయయాతన పూర్తికాగానే ఆ పాపకర్మ క్షయమై పోతుంది. అనగా తగ్గిపోతుంది కాని పూర్తిగా నశింపదు. ఆ మిగిలిన పాపం శమించే దాకా ప్రాణి మరల మరల జన్మలెత్తుతునే వుండాలి.


బ్రహ్మ హత్యా పాతకుడు నరకంలో ఘోర శిక్షలననుభవించి మరల భూమిపై ముందు కుక్కగా, పిదప గాడిదగా, ఆపై ఒంటెగా జన్మించాలి. మదిరాపానం చేసిన మహా పాతకులకు కప్ప ఆపై పేను జన్మలుంటాయి. బంగారం దొంగ క్రిమిగా, కీటకంగా, గురుతల్పగామి గడ్డిగా, కలుపు మొక్కగా జన్మించి గతించినా వారిపాపం ఇంకా మిగిలేవుంటుంది. అది పోవడానికి వారు క్రమంగా క్షయరోగులుగా నల్లటి పళ్ళవారిగా, వంకర గోళ్ళ వారిగా చివరగా కుష్టు రోగులుగా జన్మించి జీవించి గతిస్తారు.


అన్నం దొంగ రోగిగా, మాటతప్పినవారు మూగవారిగా, ధాన్యం దొంగ అధికాంగునిగా, నూనె దొంగ దానినే తాగి బతికే నీచ కీటకంగా, చెడు సలహాలిచ్చే వాడు దుర్గంధముఖునిగా పుడతారు.


బ్రాహ్మణ ధనాన్నపహరించిన వారూ కన్యని కొనేవారు బ్రహ్మ రాక్షసులుగా ఆపై ఎద్దులుగా, కూరల దొంగ నెమలిగా, పుష్పచోరుడు చుంచెలకగా, ధాన్యాన్ని దౌర్జన్యంగా అపహరించినవాడు ఎలుకగా, పండ్ల దొంగ కోతిగా, పశువులను దొంగిలించిన వాడు మేకగా, పాలదొంగ కాకిగా జన్మిస్తారు. మాంసం దొంగ గ్రద్దగా, బట్టల దొంగ తెల్లమచ్చల 

జీవిగా, ఉప్పుదొంగ కీచురాయిగా జన్మిస్తారు.


ఈ విధంగా పాపాలన్నీ నశించిన పిమ్మట భగవంతుడు వీరిని దరిద్రులుగా పుట్టించి ఒక అవకాశాన్నిస్తాడు. ఆ జన్మలో మంచి పనులు చేస్తే ఉత్తమ జన్మలభించవచ్చు; యోగిపుంగవులుగా మారితే మరుజన్మేలేకపోవచ్చు.


(అధ్యాయం 104)


Tuesday 16 July 2024

శ్రీ గరుడ పురాణము (236)

 


సన్యాసధర్మ నిరూపణ


(సంస్కృతంలో 'సంన్యాస' అనే వుంటుంది. కొన్ని చోట్ల 'సన్యాస' అనే పదం కూడా కనిపిస్తున్నా తెలుగులో ఎక్కువగా కనిపిస్తున్నది 'సన్యాసమే'. అను)


హే సజ్జనులారా! ఇపుడిక భిక్షు ధర్మమను నామాంతరంగల సన్యాసధర్మాన్ని వినిపిస్తాను.


గృహస్థ వానప్రస్థాశ్రమాలలో తాను చేసిన అన్ని యజ్ఞాలకూ మకుటాయమానమైన ప్రాజాపత్య యజ్ఞాన్ని కూడా సంపన్నంచేసి చివరగా వేద విహిత విధానానుసారం సమస్త శ్రౌతాగ్నులనూ తనలో ఆరోపించుకొని ఒక వ్యక్తి సన్యాసాన్ని పుచ్చుకోవచ్చును. సన్యాసి అన్ని ప్రాణుల హితాన్నీ కోరాలి, శాంతుడై, త్రిదండాన్ని ధరించి వుండాలి. కమండలువును పట్టుకొని వుండాలి. అన్ని ప్రకారాల సుఖసాధనయుక్త భావాలనూ పరిత్యజించి, అహంకారాన్ని వదులుకొని భిక్షార్థిగా, ఏదో ఒక గ్రామాన్నాశ్రయించి బతుకును గడుపుకోవాలి. సాయంకాలం ఆ గ్రామంలో కనిపించరాదు.


యమనియమపాలన సన్యాసికి తప్పనిసరి. వాటిని పాటిస్తూ యోగసిద్ధిని గానీ పరమహంస స్థాయిని గానీ పొందిన సన్యాసి త్రిదండికానక్కరలేదు. వెదురు కర్రను ఒక దానిని (ఏకదండి) పట్టుకోవచ్చు. ఈ విధంగా సన్యాసాశ్రమాన్ని పాలించిన వారు తగిన సమయంలో ప్రాణాలనుకూడా వదలివేసి అమరత్వమును పొందగలరు.


(అధ్యాయం - 203)


Monday 15 July 2024

శ్రీ గరుడ పురాణము (235)

 


ఇదే క్రమంలో అన్నదానం కూడా ప్రతి గ్రహం పేరు పేరునా చేయాలి. తరువాత ప్రతి గ్రహం పేరుతో రకమంగా ధేనువు, శంఖం, ఎద్దు, బంగారం, బట్టలు, గుఱ్ఱం, నల్లావు, ఆయుధాలు, మేకలను దానంచేయాలి. గ్రహాలు శాంతించి అనుగ్రహిస్తే జాతకాలను మార్చగలవు. సిరులను కురిపించగలవు; రాజ్యాలనే ఇవ్వగలవు; రోగిని సంపూర్ణారోగ్యవంతునిగా చేయగలవు.


(అధ్యాయం 101)


వానప్రస్థ ధర్మ నిరూపణం


మునులారా! వానప్రస్థాశ్రమాన్ని వర్ణిస్తాను. అవధరించండి. వానప్రస్థాశ్రమంలో ప్రవేశించదలచుకొన్నవాడు తన భార్యను తీసుకొని వెళ్ళవచ్చు, లేదా, సమర్థుడైన కొడుకుపై ఆమె సంరక్షణ భారాన్ని మోపి వెళ్ళవచ్చు. అంతేగాని ఆమె సంగతి చూడకుండా వెళ్ళరాదు.


వానప్రస్థికి బ్రహ్మచర్యం విధాయకం. శృంగారానికి సంబంధించిన ఆలోచన కూడా మదిలో మెదలరాదు. శ్రౌతాగ్నినీ గృహాగ్నినీ తనతోబాటు వనంలోకి తీసుకుపోవాలి. ఎందుకంటే వనమంటే అడవి. అడవిలోకిపోయి ఆశ్రమాన్నీ ఆశ్రయాన్నీ ఏర్పాటు చేసుకొని శాంతంగా క్షమసహితంగా మనస్సునుంచుకొని అహర్నిశలూ దేవోపాసన చేస్తూ జీవించడాన్నే వానప్రస్థాశ్రమం అని వ్యవహరిస్తారు. అక్కడ దున్నని భూమి నుండి పుట్టిన అన్నం ద్వారా అగ్నిదేవునికీ, పితరులకూ, దేవతలకూ, అతిథులకూ, సేవకులకూ తృప్తి కలిగించాలి. ఆత్మజ్ఞాన తత్పరులైవుండాలి. శరీరానికి స్నానం అంగవస్త్రధారణ తప్ప ఏ సంస్కారమూ వుండరాదు. జటలూ, గడ్డమూ ఎంతగా పెరిగినా పట్టించుకోరాదు. ఇంద్రియ దమనం, త్రికాలస్నానం తప్పనిసరి. ఎవరి నుండీ ఎటువంటి దానాన్నీ స్వీకరింపరాదు. స్వాధ్యాయం, భగవద్ధ్యానం, లోకకల్యాణం- ఇవే వానప్రస్థికి నిత్యకృత్యాలు. తప్పనిసరైతే అన్నం కోసం మాత్రమే ధన సంపాదన చేయవచ్చు.


వ్రతాల ద్వారా ఆత్మశుద్ధిని గావించుకోవాలి. వారానికొకమారు, తరువాత పక్షంలో నొకమారు, ఆపై మాసాంతమందే భోజనం చేసే వ్రతం పట్టాలి. చాంద్రాయణం చేస్తూ, భూమిపై శయనిస్తూ వీలైనన్ని ధార్మిక కృత్యాలను (అన్నంతో కాకుండా) ఫలాలతో సంకల్పించి నెరవేర్చాలి. గ్రీష్మర్తువు (గ్రీష్మఋతువు) లో కూడా పంచ- అగ్ని మధ్యంలో (నాలుగు దిక్కులా అగ్నిని రగిల్చి సూర్యుని అయిదవ అగ్నిగా భావిస్తారు. ఈ పంచాగ్నుల మధ్యమే పంచ-అగ్ని మధ్యం). వర్షాలు పడుతున్నా, మంచు కురుస్తున్నా అరుగుపైనే పడుకోగలగాలి. హేమంతరువులో తడిబట్టలు కట్టుకొని, జపం, యోగాభ్యాసం చేయాలి.


పడకమీద తుమ్మముళ్ళు పఱచిన వానిపై క్రోధంగాని, పాదముల క్రింద ఎఱ్ఱ ముఖమలు తివాచీ పఱచిన వానిపై ప్రసన్నతగాని, సర్వాంగాలనూ చందన చర్చతో నెఱపిన వానిపై ప్రేమగాని కలుగరాదు. అప్పుడే అతడు / ఆమె శుద్ధవానప్రస్థి అయినట్లు భావించవచ్చు. సుఖదుఃఖాల కతీతులై సర్వసంగపరిత్యాగులై భగవంతుని వైపు చేసే ప్రయాణంలో చివరిదానికి ముందలి మజిలీ వానప్రస్థం. (అధ్యాయం - 102)


Sunday 14 July 2024

శ్రీ గరుడ పురాణము (234)

 


గ్రహశాంతి


మునులారా! సిరిసంపదలూ, సుఖశాంతులూ కోరుకొనేవారు ముందు తమపై విభిన్న గ్రహాల 'చూపు' ఎలావుందో చూసుకొని 'అది' బాగులేని చోట జాగ్రత్తపడాలి. అంటే తమతమ జాతకాల్లో నున్న గ్రహదోషాలను ఆయాగ్రహ సంబంధిత యజ్ఞాలను చేయడం ద్వారా పోగొట్టుకోవాలి. మనకి తొమ్మిది గ్రహాలున్నాయని విద్వాంసులు చెప్తారు. అవి క్రమంగా సూర్య, చంద్ర, మంగళ, బుధ, బృహస్పతి, శుక్ర, శని, రాహు, కేతువులు వీటిని లేదా వీరిని అర్చించడానికి ప్రతిమలను అనగా మూర్తులను క్రమంగా రాగి, స్పటికం, రక్తచందనం, బంగారం, వెండి, ఇనుము, సీసం, కంచు ధాతువులతో తయారు చేయించాలి. ఇక వారి రంగులు క్రమంగా ఎరుపు, తెలుపు, ఎరుపు, పసుపు, పసుపు, తెలుపు, చివరి మూడు గ్రహాలూ నలుపు. వీరి పూజాద్రవ్యాలు కూడా క్రమంగా అవే రంగుల్లో వుంటాయి. ఈ నవగ్రహాలనూ ఒకచోట శాస్త్రోక్తంగా స్థాపించి (లేదా స్థాపింపబడిన చోటికి పోయి) సువర్ణ, వస్త్ర పుష్పాలను నవగ్రహ మండపానికి సమర్పించాలి. గంధ, బలి, ధూప, గుగ్గులాదులను కూడా ఇవ్వాలి. చరు (అనగా హోమంలో వండబడిన అన్నం)ని మంత్రాల ద్వారా ప్రతి ఒక్క గ్రహాన్నీ ఉద్దేశించి సమర్పించాలి. ఆ తరువాత ఈయీ గ్రహాలనూ ఆయా మంత్రాలతో దిగువనిచ్చిన విధంగా జపించి అర్చించాలి.


ఓం ఆకృష్ణన రజసా... సూర్య

ఓం ఇమందేవా... చంద్ర

ఓం అగ్నిమూర్ధాదివః కకుత్... మంగళ

ఓం ఉద్బుద్ధస్వ... బుధ

ఓం బృహస్పతే... బృహస్పతి

ఓం అన్నత్పరిస్రుతం... శుక్ర

ఓం శం నో దేవీ... శని

ఓం కయానశ్చి... రాహు

ఓం కేతుం కృణ్వన్... కేతు


ఈ నవగ్రహాలకు ఇదే క్రమంలో మందార, మోదుగ, కాచు, ఉత్తరేను, రావి, మేడి, శమి, దూర్వ, కుశ సమిధలను నేయి, పెరుగు, తేనెలలో ముంచి హవనం చేయాలి. తరువాత మరల పైన చెప్పబడిన మంత్రాలను చదువుతూ ఈ క్రింది పదార్థాలను ఆహుతులివ్వాలి. సూర్యునికి బెల్లం, చంద్రునికి ఉప్మా, మంగళునికి పాయసం, బుధునికి బియ్యంతో పరమాన్నం, బృహస్పతికి పెరుగన్నం, శుక్రునికి నెయ్యి, శనికి అరిసెలు, రాహువుకు పండ్ల గుజ్జు, కేతువుకి అనేక రంగుల ధాన్యాలతో ఉడికించిన ముద్ద.


Saturday 13 July 2024

శ్రీ గరుడ పురాణము (233)

 


రెండవ కలశాన్ని ఈ క్రింది మంత్రయుక్త శ్లోకాన్ని పఠిస్తూ ఆ వ్యక్తి తలపై వంచి అభిషేకించాలి.


భగంతే వరుణోరాజా భగం సూర్యో బృహస్పతిః ॥

భగమింద్రశ్చవాయుశ్చ భగం సప్తర్షయో దదుః | ( ఆచార 100 / 7,8)


మూడవ కలశలోని నీటితో వ్యక్తిని అభిషేకిస్తూ ఈ మంత్ర పూత శ్లోకాన్ని చదవాలి.


యత్తే కేశేషు దౌర్భాగ్యం సీమంతే యచ్చ మూర్ధని ॥

లలాటే కర్ణయోరక్ష్ణో రాపస్తద్రఘ్నంతు తే సదా ॥ ( ఆచార 100 / 8,9)


నీ సర్వాంగాలనూ పట్టిన దరిద్రం నేటితో ఈ నీటి పవిత్రత వల్ల కడుక్కుపోవాలి గాక అని ఈ శ్లోకభావం.


అనంతరం నాల్గవ కుండలోని నీటిని పోస్తూ పై మూడు శ్లోకాలనూ పఠించాలి. ఎడమ చేతిలో కుశదర్భలను తీసుకొని, బ్రాహ్మణుడు, ఆ వ్యక్తి యొక్క తలను స్పృశిస్తూ మేడి కర్రనుండి చేసిన స్రువ (చెంచాలాటిదేకాని కర్రచివరి గోయి వుంటుంది. యజ్ఞాలలో వాడతారు) తో ఆవనూనెను కుడి చేతితో తీసుకొని అగ్నిలో ఆహుతులను సమర్పించాలి.


ఈ ఆహుతులను ఈ క్రింది మంత్రాలు చదువుతూ వేయాలి.


మితాయస్వాహా, సమ్మితాయ స్వాహా, శాలాయ స్వాహా, కటంకటాయ స్వాహా, కూష్మాండాయ స్వాహా, రాజపుత్రాయ స్వాహా*


(*యాజ్ఞవల్క్యమితాక్షర గ.ప్ర. అధ్యాయంలో 285వ శ్లోకంలో మాత్రం పై మంత్రాలలో 'స్వాహా' కు ముందు ప్రయుక్తమైన నామాలన్నీ వినాయకునివే అని చెప్పబడింది.)


తరువాత లౌకిక అగ్నిలో గిన్నెలో, బియ్యంతో, అన్నాన్ని వండి చరు (హోమగుండంలో వండినలేదా వేసెడి అన్నం) ని తయారు చేసి దానిని ఇంతకు ముందు చెప్పబడిన ఆరు స్వాహా మంత్రాలతో ఆ లౌకికాగ్నిలోనే హవనం చేసి మిగిలిన దానిని ఇంద్రాగ్నియమాది దేవతలకు బలుల కింద సమర్పించాలి. ఆపై ఒక అరుగుపై దర్భలను పఱచి, దానిపై పుష్ప, గంధ, ఉండేరకమాల, పక్వాన్న, పాయసాలూ, నేయి కలిపిన పులావు, ముల్లంగి (ప్రత్యేకం) గడ్డి, అప్పాలు, పెరుగు, బెల్లంవుండలు, లడ్లు, చెఱకుముక్కలు ఈ ద్రవ్యాలన్నిటినీ చేర్చివుంచాలి.


వినాయక జననియైన దుర్గాదేవిని ప్రతిష్ఠించి చేతులు జోడించి నమస్కరించి, అర్ఘ్యమివ్వాలి. పుత్ర సంతానం కావలసిన స్త్రీ దూర్వా, సరసపుష్పాలతో భగవతి పార్వతీ దేవి నర్చించి స్వస్తివచనాలతో బాటు ఈ క్రింది ప్రార్థనా శ్లోకాన్ని చదవాలి.


రూపందేహియశోదేహి భగం భగవతి దేహి మే । 

పుత్రాందేహి శ్రియందేహి సర్వాన్ కామాంశ్చదేహి మే ॥ ( ఆచార 100 /16)


తరువాత బ్రాహ్మణులను భోజనాలతో తృప్తి పఱచాలి. గురువుగారికి రెండు వస్త్రాలనిచ్చి (అంటే గురు గ్రహానికి) అన్యగ్రహాలను పూజించి మరల ప్రత్యేకంగా సూర్యార్చన చేయాలి. ఈ విధంగా వినాయకునీ గ్రహాలనూ, పూజించిన వ్యక్తులు సర్వకార్యాల్లోనూ సాఫల్యము నందగలరు. ( అధ్యాయం - 100) 


Friday 12 July 2024

శ్రీ గరుడ పురాణము (232)

 


వినాయక శాంతి స్నానం


'మునులారా! మనిషి తెలిసిగాని తెలియకగానీ చేసే కొన్ని పనులు దేవతలకు కోపం తెప్పిస్తాయి. వారు అప్రసన్నులౌతారు. అలా వినాయకుని అప్రసన్నతకు గురైన వారు ఆ విషయాన్ని తెలుసుకొనే అవకాశాన్ని ఆయనే కల్పించాడు' అంటూ వారి లక్షణాలను ఇలా చెప్పనారంభించాడు యాజ్ఞవల్క్య మహర్షి పుంగవుడు.


'వారికి స్వప్నాలెక్కువగా వస్తుంటాయి. ఆ కలలు కూడా స్నానం చేస్తున్నట్లు వస్తాయి. మరి కొన్ని కలల్లో మరణించిన ప్రాణుల తలలు మాత్రమే కనిపిస్తుంటాయి. కలలోనే కాక ఇలలో కూడా వారెపుడూ ఉద్విగ్నులై ఆత్రుతపడుతునే వుంటారు. వారే ప్రయత్నం చేసినా సఫలం కాదు. ఏ కారణమూ లేకుండానే నొప్పులు బాధిస్తుంటాయి. వినాయకుని అప్రసన్నతకు గురైన రాజు రాజ్యాన్ని కోల్పోతాడు; కన్యకు పతి దొరకడు; గర్భిణికి కొడుకు పుట్టడు. కాబట్టి ఇలాంటివారే కాదు ఎలాంటి వారైనా ఈ శాంతిని చేయించాలి.


అప్రసన్నతకు గురైన మనిషికి బంధువులూ బ్రాహ్మణులూ కలిసి ఇలా స్నానం చేయించాలి. భద్రాసనం మీద కూర్చుండబెట్టి బ్రాహ్మణులు స్వస్తివాచన పూర్వకంగా ఈ స్నానాన్ని చేయించాలి. పచ్చ ఆవాలను పొడిగావించి నేతితో కలిపి ముద్దచేసి దానినా వ్యక్తి శరీరంపై నలుగుడు పెట్టాలి. తరువాత అతని లేదా ఆమె యొక్క తలకు సర్వౌషధాలూ, సుగంధద్రవ్యాలూ కలిపి తయారు చేసిన నూనెను పట్టించాలి. ఔషధ మిశ్రితమైన నీటితో నాలుగు కుండలను నింపి వుంచి నలుగుడు పిండిని పూర్తిగా లాగివేసి తలపై పట్టించిన నూనె కాస్త తడియారగానే ఒక్కొక్క కుండనూ (ఈ కుండల్లో నీరు పోయడానికి ముందే పుణ్యనది, సరోవరం వంటి అయిదు పవిత్ర జలాశయాల నుండి తెచ్చిన మట్టినీ, గోరోచనాన్నీ, గంధాన్నీ, గుగ్గిలాన్నీ వేసి వుంచాలి) ఆ వ్యక్తి నెత్తి పై నుండి పోస్తూ స్నానం చేయించాలి.


మొదటి కలశలోని నీటిని పోస్తూ ఆచార్యుడు ఈ శ్లోకాన్ని చదవాలి. (మంత్ర)



ఈ మంత్ర శ్లోకాన్ని చదవాలి.


సహస్రాక్షం శతధారమృషిభిః పావనం స్మృతం ||

తేన త్వామభిషించామి పావమాన్యః పునంతుతే | ( ఆచార - 100 / 6,7)


సహస్ర నేత్రాలూ (సహస్ర శక్తులని ఉద్దేశ్యం), అసంఖ్యాక ధారలూ, మహర్షిబృందం పవిత్రములనీ పవిత్రీకరములనీ ఆదేశించిన పవిత్రజలాలతో (వినాయక గ్రస్తుడవైన నిన్ను) అభిషేకిస్తున్నాను. ఉపద్రవశాంతి నీకగుగాక -- అని దీని భావము.

Wednesday 10 July 2024

శ్రీ గరుడ పురాణము (231)

 



సపిండీకరణ శ్రాద్ధంలో శ్రాద్ధ కర్త తిలలతో గంధ మిశ్రిత జలాలతో నాలుగు పాత్రలను నింపివుంచాలి. ఇవి పితరులకై ప్రత్యేకంగా విధించబడినవి. ఇవి కాక విశ్వేదేవులకు రెండు పాత్రలుండాలి. పితృపాత్రలలో నొకదానిని ప్రేతపాత్రగా ప్రత్యేకంగా వుంచి దానిని అర్ఘ్య ప్రదానానికి వినియోగించాలి. తరువాత శ్రాద్దకర్త ఆ పాత్రలోని కొంత జలాన్ని మిగిలిన మూడు పాత్రలలోని నీటితో కలిపి పూర్వంలాగే అర్ఘ్యాది క్రియలను సంపన్నం చేయాలి. ప్రేత పిండాన్ని యేసమానా... తో మొదలయ్యే రెండు మంత్రాలను చదువుతూ మూడు భాగాలుగా చేసి పితరుల పిండాలతో కలపాలి. దీని తరువాత ఏకోద్దిష్టంగా స్త్రీకి పిండాన్ని పెట్టాలి. ఒక యేడాదికి లోపే పెట్టు సపిండీకరణలో కూడా ఏడాది పూర్తయ్యాక పెట్టు విధంగానే సాన్నోదక కుంభాన్ని ప్రతి మాసం బ్రాహ్మణునకు, యథాశక్తిగా, దానం చెయ్యాలి. పితరులకు సమర్పితమైన పిండాన్ని ఆవు, బ్రహ్మ, బ్రాహ్మణుడు, అగ్ని, జలం వీటిలో దేనికైనా అర్పించవచ్చును.


హవిష్యాన్నంతో శ్రాద్ధం పెడితే నెలరోజులకు సరిపడా అన్నం తిన్న తృప్తినీ, పాయసంతో పెడితే ఒక యేడాది బాటు భోం చేసిన తృప్తినీ పితృగణాల వారు పొందుతారు.


మృతవ్యక్తులకి ప్రత్యేకంగా కృష్ణ చతుర్దశినాడు శ్రాద్ధం పెట్టిన వానికి జీవితకాల పర్యంతమూ ఉత్సాహ, శౌర్య, క్షేత్ర, శక్తి సుఖాలుంటాయి. దేహాంతంలో స్వర్గలోక ప్రాప్తి వుంటుంది. (ఇక్కడ మృత వ్యక్తులనగా శ్రాద్దకర్తకు ఊహ తెలిశాక మృతులైనవారు కావచ్చు.)


విధి పూర్వకంగా అన్ని నియమాలనూ పాటిస్తూ భక్తి శ్రద్ధలతో శ్రాద్ధం పెట్టిన వానికి పుత్ర సంతతి, సర్వజనశ్రేష్ఠత, సౌభాగ్యం, సమృద్ధి ప్రముఖత, మాంగలిక దక్షత (ప్రాముఖ్యము అనే మాటను వాడాలి) అభీష్టకామనలపూర్తి, వాణిజ్యంలో లాభం, నిరోగత, యశం, శోకరాహిత్యము, ధనం, విద్య, వాక్సిధ్ది, పాత్రత, గోసంపద, అశ్వాలకలిమి, దీర్ఘాయువు - ఇవన్నీ కలిగి దేహాంతంలో మోక్షము లభిస్తుంది.


కృత్తిక నుండి భరణిదాకా ప్రత్యేక నక్షత్రంలోనూ శ్రాద్ధ కార్యాలను చేసిన వానికి ఇహలోకంలో వస్త్ర, భవనాదులూ, సర్వసుఖ సాధనాలూ పుష్కలంగా లభిస్తాయి. పిత, పితామహుడు పితృదేవతలలో అగ్రగణ్యులు. వీరు తమ శ్రాద్ధ కర్తకు ఆయువు, సంతతి, ధనం, విద్య, రాజ్యం, సర్వసుఖాలు, స్వర్గం, తరువాత మోక్షం కూడా ప్రసాదించగలరు.'


(అధ్యాయం - 99)


Tuesday 9 July 2024

శ్రీ గరుడ పురాణము (230)

 


పృథివీ తేపాత్రం.... అనే మంత్రంతో పాత్రలను అభిమంత్రితం చేసి ఇదం విష్ణుః ... అనే మంత్రాన్ని శ్రద్ధగా పఠిస్తూ మరింత శ్రద్ధగా గౌరవంగా బ్రాహ్మణుని బొటన వ్రేలి నందుకొని పితరులకుద్దేశింపబడిన అన్నంలో దానిని పెట్టాలి. గాయత్రి మంత్రాన్నీ మధువాతా.... అనే మంత్రాన్ని పఠిస్తూ మధ్యలో ఆపి బ్రాహ్మణులను భోజనానికి కూర్చుని మౌనంగా భోంచేయమని ప్రార్థించి మరల ఆ మంత్రాలనే చదువుతుండాలి. మరల బ్రాహ్మణులను మొగమాటపడవద్దని ప్రార్థించాలి. క్రోధాది మనోవికారాలను మనసులోకి రానీకుండా ప్రశాంతమనస్కుడై శ్రద్ధనిండిన గుండెతో వారికి వడ్డిస్తూ తొందరపెట్టకుండా, మంత్రాన్ని జపిస్తూ ఓపికగా భోజనాలు పెట్టాలి. హవిష్యాన్నము (హోమగుండంలో వండబడిన అన్నం) ను వారికి సమర్పించి వారు తృప్తిగా భోజనం చేసే దాకా పురుష సూక్తాన్నీ, పవమాన సూక్తాదులనూ జపిస్తుండాలి. వారు తృప్తిగా భుజించాక మరల మధువాతా... మంత్రాన్ని పఠించాలి. 'మేము తృప్తిగా సుష్టుగా భోంచేశాము' అని వారి చేత అనిపించుకొని వారు భుజించగా మిగిలిన అన్నాన్ని దక్షిణం వైపు తీసుకుపోయి తిలలను అందులో వేసి బ్రాహ్మణులు అన్నంతిన్న పాత్రలనూ వాటి ప్రక్కనే భక్తి మీరగా తెచ్చి ఆదరంగా వుంచాలి. ఎందుకంటే ఆ క్షణంలో వారు మనవూరి సామాన్య మానవులు కారు; పితృలోకం నుండి దిగివచ్చిన మన తండ్రులూ, తాతలూనూ. వారికి వేరువేరుగా ప్రక్షాళన జలాల నిచ్చి వెంటనే తుండుగుడ్డలను కూడా భక్తిగా ఇవ్వాలి.


ఉచ్ఛిష్టానికి సమీపంలోనే పితరాదులకూ మాతా మహాదులకూ పిండ ప్రదానం చేయాలి. తరువాత బ్రాహ్మణులను ఆచమనం చేయవలసిందిగా ప్రార్థించాలి. తరువాత బ్రాహ్మణులు స్వస్తి వాక్యాలను చదువగా శ్రాద్ధకర్త అక్షయమస్తు అంటూ బ్రాహ్మణుల చేతులలో నీరుపోసి తన సామర్థ్యానికి తగినట్లుగా దక్షిణలిచ్చి స్వధాంవాచయిష్యే అనాలి. వాచ్యతాం అంటూ వారు అనుమతి నివ్వాలి. అపుడు శ్రాద్దకర్త తన పితృదేవతలనుద్దేశించి స్వధా అనువాక్యాన్ని పలుకగా పితృదేవతల ప్రతిరూపమైన బ్రాహ్మణులు కూడా అదే వాక్యం ద్వారా అతనిని దీవిస్తారు. అప్పుడు శ్రాద్ధకర్త నీటిని భూమిపై వదలాలి. తరువాత విశ్వేదేవాః ప్రియంతాం అంటూ మరికొంత నీటిని వదిలి పితృదేవతలను ఇలా ప్రార్థించాలి.


దాతారో నో భి వర్ధంతాం వేదాః సంతతిరేవ చ ॥

శ్రద్ధా చనోమా వ్యగమద్ బహుదేయంచనో స్త్వితి | (ఆచార 99 / 26,27)


తరువాత వాజే వాజే.... అనే మంత్రాన్నుచ్ఛరిస్తూ శ్రాద్ధకర్త ప్రసన్నంగా పితరులను యథాక్రమంలో విసర్జించాలి. మొదట్లో బోర్లించి పెట్టిన, సంస్రవజలాలుండిన పాత్రను సరిచేసి చేత బట్టుకొని బ్రాహ్మణులకు ప్రదక్షిణ చేసి వారిని వీడ్కొల్పాలి. వారితో బాటు కొంత దూరం నడచి వెళ్ళి సాదరంగా సాగనంపాలి. తరువాత శ్రాద్ధ కర్మలో మిగిలిన భోజనాన్ని స్వీకరించి ఆ రాత్రి బ్రహ్మ చర్యాన్నవలంబించాలి.


వివాహాది శుభకార్యాలు చేసేటపుడు పితరులకు నందీ ముఖశ్రాద్ధాన్ని పెట్టాలి. వారికి పెరుగు, బదరీ ఫలం, యవమిశ్రిత అన్నంలతో పిండదానం చేయాలి.


ఏకోద్దిష్టశ్రాద్ధం (ఎవరో ఒకే ఒక వ్యక్తి నుద్దేశించి పెట్టేది) విశ్వేదేవరహితం, ఏకాన్న, ఏక పవిత్రకయుక్తం అయివుంటే చాలు. ఈ శ్రాద్ధానికి ఆవాహనం, అగ్నైకరణం కూడా అవసరంలేదు. జంధ్యాన్ని అపసవ్యం చేస్తే చాలు. బ్రాహ్మణులను పవిత్ర భూమిపై ఉపతిష్ఠతాం అంటూ కూర్చోమని ప్రార్థించాలి. అలాగే అభిరమ్యతాం అంటూ విసర్జన చేయాలి. బ్రాహ్మణులు అభిరతాః స్మ అనే వచనాన్ని చెప్పాలి.


Monday 8 July 2024

శ్రీ గరుడ పురాణము (229)




రోగి అంగహీనుడు, అధికాంగుడు, 1. కాణుడు 2. పౌనర్భవుడు, 3. అవకీర్ణాది ఆచార భ్రష్టులు శ్రాద్ధ యోగ్యులు కారు.


పునర్భూకి పుట్టినవాడు. పునర్భూ అనగా వివాహానికి ముందే ఒక పురుషునితో లైంగిక బంధమున్న ఆడది. బ్రహ్మచారిగా గురుకులంలో వున్నపుడే వీర్యస్థలనం జరిగిపోయినవాడు.


శ్రాద్ధాని కొకరోజు ముందే బ్రాహ్మణుని ఆహ్వానించి సిద్ధం చేసుకోవాలి. ఆ బ్రాహ్మణుడు ఆ క్షణం నుండే నియమ నియతుడైవుండాలి. (బ్రాహ్మణులను, బ్రాహ్మణులు plural) శ్రాద్ధదినం నాటి పూర్వాహ్ణంలో వారు రావాలి. రాగానే గృహస్థువారిచే అత్యంతాదరంతో ఆచమనం చేయించి ఆసనాలపై కూర్చుండపెట్టాలి. విశ్వేదేవ లేదా ఆభ్యుదయిక శ్రాద్ధానికి ఇద్దరు బ్రాహ్మణులనూ, పితృపాత్రలో వీలైనంతమంది బ్రాహ్మణులనూ కూర్చుకోవాలి. లేదా విశ్వేదేవపాత్రులుగా తూర్పు ముఖంగా ముగ్గురినీ కూర్చుండబెట్టవచ్చు. శక్తిలేనివారు దానికొకనినీ, దీని కొకనినీ తెచ్చి చేయించుకోవచ్చు. ఈ విధంగా మాతామహులకు కూడా కూర్చుండబెట్టవచ్చును.


ఆ తరువాత బ్రాహ్మణులకు హస్తార్ఘ్యము (చేతులు కడుక్కోవడానికి నీరు) నూ ఆసనానికి కుశలనూ ఇచ్చి వారి అనుమతి తోనే విశ్వేదేవాస... అనే మంత్రంతో విశ్వేదేవతలనా వాహనం చేసి భోజన పాత్రలో యవలను జల్లాలి. తరువాత పవిత్రయుక్త అర్ఘ్యపాత్రలో శం నో దేవీ.... అనే మంత్రం ద్వారా నీటినీ యవో సి.... అనే మంత్రం ద్వారా యవలనూ పోసి యా దివ్యా.... మంత్రంతో బ్రాహ్మణుని చేతిలో అర్ఘ్యోదకాన్ని ప్రదానం చేసి గంధ, దీపక, మాల, హారాది ఆభూషణాలనూ, వస్త్రాలనూ వారికి దానం చేయాలి.


తరువాత జంధ్యమును అపసవ్యం చేసుకొని అప్రదక్షిణ క్రమంలో అనగా ఎడమ క్రమంలో స్థానం ప్రదానం చేసి కుశలను అశంతస్త్వా... అనే మంత్రంతో (చేతబట్టుకొని) పితరులను ఆవాహనం చేయాలి. అనంతరం పితృస్థానంలో ఆసీనుడైయున్న భూదేవుని అనుమతిని తీసుకొని ఆయంతు నః పితరః.... అనే మంత్రాన్ని పఠించాలి.


పితృకార్యంలో నువ్వులకే ప్రాధాన్యముంటుంది. (ఇతర కార్యాల్లో యవలను వాడతారు) పితృగణాలకు తిలలతో అర్ఘ్యాన్నిచ్చిదానిని బ్రాహ్మణుడందుకోగా క్రిందపడిన జలాలను (వీటినే సంస్రవలంటారు) 'పితృపాత్ర' అని వేరే ఒక గిన్నెను పెట్టి అందులో వుంచాలి. దక్షిణాగ్రకుశస్తంభాన్ని భూమిపై పెట్టి దానిపై పితృభ్యః స్థానమసి... అనే మంత్రం చదువుతూ ఇందాక చెప్పిన అర్ఘ్య పాత్రను పితరులకు ఎడమవైపు బోర్లించి పెట్టాలి. అగ్నైకరణకి అనుమతి నివ్వమని ఆచార్యుని వేడుకొని ఆయన అనుమతించగానే శ్రాద్దకర్త నేతితో కలిపిన అన్నాన్ని అగ్నికి ప్రదానం చేయాలి. పాత్రలో మిగిలిన అన్నాన్ని నెమ్మదైన మనసుతో నిదానంగా పితరుల యొక్క భోజన పాత్రలోకి తీసివుంచాలి. స్తోమతు కలిగినవారు పితరుల భోజనానికై వెండి పాత్రలనుపయోగించాలి.


Sunday 7 July 2024

శ్రీ గరుడ పురాణము (228)

 


శ్రాద్ధాదికారులు - దాని సంక్షిప్తవిధి మహిమ, ఫలాలు


ఋషిగణులారా! ఇప్పుడు సర్వపాపవినాశినియైన శ్రాద్ధ విధిని వినిపిస్తాను.


ఒక మనిషిపోయిన ఏడాదికి ఆ రోజే శ్రాద్ధం పెట్టాలనుకుంటారు చాలా మంది. తద్దినం లేదా ఆబ్దికం ఏడాదికొకసారి పెట్టేదే శ్రాద్దమనుకుంటారు కూడ. కాని, శ్రాద్దమనగా శ్రద్దగా పితృదేవులను తలచుకొని చేయు కర్మయని భావము. ఇది ఏడాది కొకసారే పెట్టాలని లేదు.


అమావాస్య, అష్టకం (* హేమంత, శిశిర ఋతువులుండే నెలలలో వచ్చే బహుళ అష్టమి), వృద్ధి (పుత్రజన్మమున్నగునవి) కృష్ణపక్షం, ఉత్తరాయణ దక్షిణాయన ప్రారంభదినాలు, అన్నాది లాభదినాలు, విషువత్- సంక్రాంతి ("సూర్యుడు తులారాశిలో మేషరాశిలో సంక్రమణం చేయుతిథి), మకర సంక్రాంతి, వ్యతీపాతం, గజచ్ఛాయా - యోగం, చంద్ర- సూర్యగ్రహణాలు, కర్తకి బుద్ధి పుట్టినపుడు – వీటిలో ఎప్పుడైనా శ్రాద్దం పెట్టవచ్చును.


మధ్య వయస్కుడై కూడా అన్ని వేదాలనూ అస్ఖలితంగా చెప్పడంలో దిట్ట (దీనికి పురాణ పదం అగ్ర్య), శ్రోత్రియుడు, బ్రహ్మవిదుడు, మంత్రాలతో బ్రాహ్మణములతో నున్న వేదభాగానికి తాత్పర్యం చెప్పగలిగే విద్యావేత్త, జ్యేష్ఠ సామమను పేరుగల సామవేద భాగాన్ని బాగా అధ్యయనం చేయడానికి గల విహితవ్రతాచరణలన్నీ పూర్తిచేసి దాని అధ్యేతయైన మహావైదికుడు, ఋగ్వేదంలో త్రిమధు అను పేరుగల దానిలో అలాగే అధ్యేతయైన మేధావి, త్రిసుపర్ణనామంతో విలసిల్లే ఋగ్యజుర్వేదాలలోని ఏకదేశభాగా ధ్యేత, వీరిలో నెవరైనా శ్రాద్ధ సంపత్తి' గా ఆహ్వానింపబడి పూజింపబడడానికి అర్హులౌతారు. అనగా వీరికి ఆనాడు భోజనం పెట్టి దానాలిస్తే అక్షయ ఫలాలు అబ్బుతాయి.


అలాగే కర్మనిష్ఠుడు, తపోనిష్ఠుడు, శిష్య వత్సలుడైన మహోపన్యాసకుడు, విశిష్ట ఋత్విక్కు పంచాగ్ని ('సభ్య, ఆవసథ్య, ఆహవనీయ, గార్హపత్య, దక్షిణాగ్నులు పంచాగ్నులు) విద్యను బాగా అధ్యయనం చేసి 'అధ్యేత' అనిపించుకున్నవాడు. బ్రహ్మచారి, మాతృపితృభక్తుడైన జ్ఞాననిష్టుడు కూడ శ్రాద్ధ సంపత్తులనబడతారు.


Saturday 6 July 2024

శ్రీ గరుడ పురాణము (227)

 


భూమి, దీపం, అన్నం, వస్త్రాలు, నెయ్యి, వీటిని దానం చేసిన వానికి లక్ష్మి ప్రాప్తిస్తుంది. ఇల్లు, ధాన్యం, గొడుగు, మాల, వాహనం, నెయ్యి, నీరు, శయ్య, కుంకుమ, చందనాదులను దానమిచ్చినవారు స్వర్గలోకంలో ప్రతిష్ఠితులౌతారు.


సత్పాత్రునికి విద్యాదానమొనర్చిన వానికి దేవ దుర్లభమైన బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. వేదార్థాన్నీ, యజ్ఞాల విభిన్న విధులనూ సంపాదితం చేసి, శాస్త్రాలనూ విభిన్న ధర్మశాస్త్రాలనూ తరువాతి తరం వారికోసం కొంత మూల్యాన్ని స్వీకరించియైనా సరే, వ్రాసిన వానికి బ్రహ్మలోక ప్రాప్తి ఫలంగా వస్తుంది. ఈ ప్రపంచానికి మూలం వేద, శాస్త్రాలే. అందుకే భగవంతుడు ముందుగా వాటినే సృజించాడు. కాబట్టి ఎంతగట్టి ప్రయత్నాలు చేసైనా వేదాల తాత్పర్యాన్ని తరువాతి తరాల వారి కందించాలి. ఇతిహాస పురాణాలను కూడా ఇలాగే వ్రాసివుంచిన వారికి, దానం చేసినవారికి బ్రహ్మదానానికి సమానమైన పుణ్యానికి రెండింతల పుణ్యం లభిస్తుంది.


నాస్తికుల వచనాలూ, కుతర్కాలూ ద్విజుడైన వాడు వినరాదు. ఎందుకంటే ఒకనిని అధోగతి పాలుజేయడానికా శబ్దమే చాలు.


దానం పుచ్చుకొనే అర్హత, అవకాశం వుండీ కూడా తమ వద్ద పుష్కలంగా వున్న దానిని వేరొకరికి ఇప్పించిన వారికీ, తమ వద్దలేకపోయినా ఇతరుల అవసరాన్ని గుర్తించి వారికిప్పించిన వారికీ దాతకు లభించినంత పుణ్యమే లభిస్తుంది.


కులత, పతితులు, నపుంసకులు, శత్రువులు దానమిచ్చినా స్వీకరించరాదు. పెద్దగా సచ్చరిత్రులు కానివారు కుశ, శాక, దుగ్ధ, గంధ, జలాది సామాన్య వస్తువులను అడగకుండానే ఇచ్చినా పుచ్చుకోవచ్చును. తల్లిదండ్రులను పోషించడానికై గాని దేవతలను అతిథులను పూజించుటకు గాని, తనకు ప్రాణం మీదికి వచ్చినపుడు గాని పతితులు కుత్సితులు కానివారెవరు దానమిచ్చినా స్వీకరించవచ్చును; అదీ అవసరం మేరకే.


(అధ్యాయం - 98)


Friday 5 July 2024

శ్రీ గరుడ పురాణము (226)

 


దానధర్మమహిమ


ఋషులారా! దానధర్మం చాలా గొప్పది, అన్ని వర్ణాలలోకి అధ్యాయనాధ్యాపనల వల్ల బ్రాహ్మణ వర్గం గొప్పది, వారిలో సత్క్రియానిష్ఠుడు అనగా కర్మనిష్టగలవాడు శ్రేష్ఠుడు. వారిలో విద్య, తపస్సు గల బ్రహ్మతత్త్వ వేత్త వరిష్ఠుడు. దానమిచ్చువాడు సత్పాత్రుని కీయదలచుకున్నపుడు ఇది చూడాలి, భోజనం పెట్టడానికీ అన్నదానం చేసేటప్పుడూ, ఆకలీ, పేదరికమూ మాత్రమే కొలబద్దలు. అలా కాకుండా గృహాస్థైనవాడు గో, భూ, ధాన్య, ధన, సువర్ణాది దానాలు చేసేటపుడు సత్పాత్రునికే చేయాలి.

విద్యా, తపస్సూలేని బ్రాహ్మణుడు దానం పుచ్చుకోకూడదు. అపాత్రదానం వల్ల దాతా, ప్రతిగ్రహీతా కూడా అధోగతి పాలవుతారు. దానం అర్హులకు ప్రతిరోజూ చేయాలి. నిమిత్తకాలాల్లో - అనగా సూర్యచంద్రాదిగ్రహణాల వంటి ప్రత్యేక దినాల్లో విశిష్ట దానాలను చెయ్యాలి. యాచకులు వస్తే ఎవరికి తగిన దానాన్ని వారికి చేయాలి. విశిష్టమైన గోదానాన్ని చేసినపుడు మాత్రం దాని కొమ్ములకు బంగారు బొడిపెలనూ గిట్టలకు వెండి చుట్లనూ అలంకరించి ఒక కాంస్యపాత్రతో సహా ఇవ్వాలి. కొమ్ములకుండే బంగారం పది సౌవర్ణికాలు (నూటయెనిమిది మాశలు) గిట్టలకు పెట్టే వెండి ఏడు పళంలు వుండాలి.


గోదానాన్ని దూడతో సహా చేయాలి. ఆ దూడనీ అలంకరించాలి. ఆవు రోగరహితమై వత్స సహితమై వుండాలి. దూడ దొరకకపోతే బంగారంతో కాని పిప్పల కఱ్ఱతో గాని చేసిన కొయ్యదూడనీయవలెను. ఇలా దానం చేసిన వానికి ఆవు లేదా దూడపై ఎన్ని రోమాలున్నవో అన్నేళ్ళు స్వర్గ సుఖములు సంప్రాప్తమౌతాయి. అదే కపిల గోవైతే దాత యొక్క ఏడు తరాలు ఉద్దరింపబడతాయి.


గర్భము నుండి దూడ బయల్వెడలుతున్నప్పటి ఆవును పృథ్వీ సమానముగా పూజిస్తారు. స్వర్ణంతో గోదానం చేసే స్తోమతులేనివారు పాలిచ్చే ధేనువును గానీ గర్భముతోనున్న ధేనువును గాని దానం చేసినా స్వర్గ ప్రాప్తి వుంటుంది.


అలసిన మనిషికి ఆసనాదికములను దానమిచ్చి అలసటను దూరం చేయడం, రోగికి సేవచేయడం, దేవపూజనం, బ్రాహ్మణుని పాదాలను కడగడం, ఆయన వాడే జాగానూ, వస్తువులనూ శుభ్రం చేయడం - ఇవన్నీ గోదానాన్ని శాస్త్రోక్తంగా చేసిన దానికి సమానమైన ఫలాన్నిస్తాయి. అలాగే బ్రాహ్మణుడు మిక్కిలిగా ఇష్టపడే వస్తువులను దానం చేసిన వానికి స్వర్గ ప్రాప్తి వుంటుంది.


Thursday 4 July 2024

శ్రీ గరుడ పురాణము (225)

 


ఉన్ని, పట్టు బట్టలను వేడినీటితో వెచ్చని గోమూత్రంతో కడిగి శుద్ధిచేయాలి. యజ్ఞపాత్రలను చేతితో బాగా మర్దించి కడగాలి. కఱ్ఱతో, దుప్పికొమ్ము లేదా పంటితో నిర్మింపబడిన పాత్రలను మట్టితో తోమి నీటితోకడగాలి, స్త్రీ ముఖానికీ, బ్రహ్మచారి భిక్షా పాత్రకీ, బజారులో అమ్మదలచుకున్న అన్నాదులకి శుద్ధి అవసరంలేదు అని ఎల్లపుడూ పవిత్రాలే. మట్టి పాత్రను పవిత్రం చేయడానికి అగ్నిలో పెడితే చాలు, చండాలుడు దానిని స్పృశించకుండా చూసుకోవాలి. ఆవు వాసన చూసిన అన్నమూ; తలవెంట్రుకలూ, కీటకాలూ పడిన అన్నమూ నీటితో, భస్మంతో, మట్టితో శుద్ధి అవుతుంది. నేలను శుద్ధిచేయాలంటే తుడిచి, కడిగి, తుడవాలి. తగరం, సీసం, రాగి, గాజు పాత్రలను ఉప్పు, నిమ్మరసం దశల వారిగా నీటిలో కలిపి కడగడం ద్వారా శుద్ధి చేయాలి. కంచు, ఇనుము పాత్రలను భస్మంతో తోమి నీటితో కడగాలి. అజ్ఞాతవస్తువులు పవిత్రాలే.


అమేధ్యములచే- అనగా శరీరము నుండి పుట్టినవైన మల, వసా, శుక్ర, శ్లేష్మాదులచే - అశుద్ధములైన పాత్రలను మట్టితో బాగా తోమి నీటితో కడగడం ద్వారా శుద్ధిచేయాలి. ప్రకృతి ద్వారా భూమిపై ఏర్పాటు చేయబడి గోవుచే త్రాగబడు నీరు శుద్ధమైనదే కావున దానిని శుద్ధి కార్యక్రమానికి వాడవచ్చును.


సూర్మరశ్మి, అగ్ని, ధూళి, చెట్టు నీడ, ఆవు, గుఱ్ఱము, నేల, వాయువు, మంచు బిందువులు ఎప్పుడూ పవిత్రాలే. మనిషి స్నానం చేశాక, నీరు త్రాగాక, తుమ్మినాక, పడుకొని లేచాక, భోజనం తరువాత, నడిచి వచ్చాక, బట్టలు మార్చాక ఆచమనం చేస్తే శుద్ధి అవుతుంది.


ఆవులింత, ఉమ్ము, నిద్ర, వస్త్రధారణ, కన్నీరు - ఈ పంచకార్యాలకూ ఆచమనం చేయనక్కరలేదు. దేవుని స్మరించి కుడిచెవిని ముట్టుకుంటే చాలు. బ్రాహ్మణుని చెవిపై అగ్ని మున్నగు దేవతలు ఎల్లప్పుడూ ప్రకాశిస్తుంటారు.


(అధ్యాయం - 97)


Wednesday 3 July 2024

శ్రీ గరుడ పురాణము (224)

 


పాసిపోయిన, చలి, విలువయుండిన, రంగు మారిన, కుక్క ముట్టిన, పతితునిచే చూడబడిన, రజస్వల ముట్టిన, సంఘష్ట, పర్యాయాన్న భోజనమును సర్వదా త్యజించ వలెను. 


*సంఘష్ట - భోజనం మిగిలిపోయింది. వచ్చితినేస్తారా అంటూ పెట్టే అన్నం. 

*పర్యాన్నం - ఒకరికోసం సిద్ధం చేసి వారు స్వీకరించకపోతే మనకి పెట్టునది.


శూద్రాన్నమును భుజించవచ్చును. ఐతే, ఆ శూద్రుడు కొన్ని తరాలుగా మన వృత్తిలో సహాయపడుతున్న వారి కుటుంబం వాడై వుండాలి. మనస్సు, మాట, శరీరం, కర్మ - వీటన్నింటినీ పరిశుద్ధంగా వుంచుకొని భగవదర్పణ బుద్ధితో మెలిగే వారై వుండాలి.


తిలతండులమిశ్రిత పదార్థాలనూ, అప్పాలు, పాయసం, పండివంటలు- ఇట్టి వాటిని దేవతలకో, అతిథులకో సమర్పించాకనే మనంతినాలి.


నీరుల్లి, వెల్లుల్లి వంటి ఉగ్రపదార్థాలు తిన్న వారికి చాంద్రాయణ వ్రతం చేస్తే కాని ఆ దోషంపోదు. మితంగా తింటూ, హితంగా వుంటూ, చిన్న, తెలియని దోషాలకు భగవంతుని క్షమాపణ కోరుకుంటూ, జీవితాన్ని భగవత్ప్రసాదంగా భావించి ప్రతి కర్మనీ భగవంతునికే సమర్పిస్తూ ఆయననే ప్రార్థిస్తూ జీవించేవాడు ఆయననే చేరుకుంటాడు.


(అధ్యాయం -96)


ద్రవ్యశుద్ధి


యాజ్ఞవల్క్య మహర్షి ప్రవచనమింకాకొనసాగుతోంది. 'శ్రేష్ఠమునులారా! ఇపుడు ద్రవ్య శుద్ధిని గూర్చి వినిపిస్తాను.


బంగారం, వెండి, అబ్జ (ముక్తాఫల, శుక్తి, శంఖాములు) కూరలు, త్రాళ్ళు, గొఱ్ఱే చర్మంతో చేసిన వస్తువులు, పాత్రలు, హోమంలో వేయవలసిన ధాన్యాలు, యజ్ఞ పాత్రలు లోపల మెత్తని నున్నని లేపనం లేనివై యుండి అపవిత్ర స్పర్శకులోనైతే వీటితో బాగా కడిగితే చాలు, శుద్ధములైపోతాయి. ధాన్యాదులపై కాస్త నీళ్ళు చిలకరిస్తే చాలు. యజ్ఞంలో వాడవలసిన స్రుక్, స్రువాలు (కర్రచెంచాలు) వేడి నీటితో కడిగితే శుద్ధి జరుగుతుంది. 


Tuesday 2 July 2024

శ్రీ గరుడ పురాణము (223)

 


ఇక విద్యార్థులు, గురువులు, బ్రాహ్మణాది ద్విజులు సంఘంలో పాటించవలసిన నియమాలను చూద్దాం. దేవతామూర్తి, ఋత్విజుడు, స్నాతకుడు, ఆచార్యుల, రాజుల, పరస్త్రీల నీడలు, రక్తం, మూత్రాది విసర్జకాలు దారిలో వున్నపుడు దాటుకొనిపోరాదు. ఆగిగాని, పక్కకి తొలగిగాని వెళ్ళాలి. మంచి పేరుగల బ్రాహ్మణుని, రాజుని, సర్పాన్ని అవమానించకూడదు. అలాగే తనను తాను అవమానించుకోరాదు. విసర్జనాలను, ఇతరులు కాళ్ళుకడుక్కున్న నీళ్ళను దూరంనుండే చూసి తప్పుకోవాలి.


శ్రుతులలో, స్మృతులలో బోధింపబడిన సదాచారాన్ని పూర్తిగా పాటించాలి. ఒకరి రహస్యాన్ని బట్టబయలు చేసి వారిని బాధించరాదు. ఎవరినీ నిందించుటగాని కొట్టుటకాని దోషము. పుత్రునీ శిష్యునీ అవసరం మేరకు దండించవచ్చు. స్వధర్మాచరణ విషయంలో ఎటువంటి వెసులుబాటు కోసమూ చూడరాదు. దాన్ని తప్పనిసరిగా పూర్తిగా చేయవలసినదే. ధర్మ విరుద్ధమైన పనులను చేయరాదు. గృహస్థు తన తల్లిదండ్రులతో, అతిథితో, ధనికులతో వాదించరాదు.


నది, సెలయేరు, పుష్కరిణి, చెఱువులలో స్నానం చేయాలి. ఇతరుల సరోవరంలో స్నానంచేయడానికి ముందు అనుమతిని పొంది, అయిదు మట్టి ముద్దలను బయటికి తీసి ఒడ్డున పెట్టి వెళ్ళాలి.


ఇతరుల శయ్యపై పడుకొనరాదు. దేశం ఆపదలో నున్నపుడు మనం మాత్రం ప్రసన్నం గా భోంచెయ్యరాదు. ఏదో తినాలి కాబట్టి తినాలి.


కృపణుడు, బందీ, దొంగ, అగ్నిహోత్రం చెయ్యని బాపడు, వెదురుతో పని చేయువాడు, న్యాయస్థానంలో నేరం ఋజువైనవాడు (దోషిగా నిరూపింపబడినవాడు), వడ్డీ వ్యాపారి, వేశ్య, సామూహిక దీక్షలనిచ్చేవాడు, చికిత్సకుడు, రోగి, క్రోధి, నపుంసకుడు, నటన - నాట్యాల ద్వారా వేదికలపై పొట్టపోసుకొనే వాడు, ఉగ్రుడు, నిర్దయుడు, పతితుడు, డాబులు కొట్టేవాడు, శాస్త్రవిక్రేత, స్త్రీ వశుడు, గ్రామంలో దేవతలకు శాంతి పూజలు చేయించేవాడు, నిర్దయుడైన రాజు, అబద్ధాల కోరు, మద్యవిక్రేత, బంగారం పనివాడు, వంది వీరి యింటిభోజనమును చేయరాదు.


Monday 1 July 2024

శ్రీ గరుడ పురాణము (222)

 


ఇక అనధ్యయన సందర్భాలను అనగా ఎట్టి సందర్భాలలో వేదాలనూ శాస్త్రాదులనూ చదువుకోకూడదో చర్చిద్దాం.


వేదం చదువుకోవడాన్ని ధర్మశాస్త్రాలు చెప్పుకోవడాన్ని శ్రవణ నక్షత్రయుక్త శ్రావణ పూర్ణిమనాడు గాని హస్త నక్షత్రయుక్త పంచమి నాడుగాని లేదా పుష్యమాసంలో రోహిణీ నక్షత్రం వున్నరోజున గానీ గ్రామానికి వెలుపల జలాశయ సమీపాన గృహ్యసూత్రాను సారం ప్రారంభించాలి. ('యాజ్ఞవల్క్యమితాక్షర, ఆచారాధ్యాయం, 146)


శిష్య, ఋత్విజ, గురు, బంధు బాంధవులలో ఎవరైనా మరణిస్తే ఆ క్షణం నుండి మూడురోజుల పాటు అనధ్యయనమే. అలాగే స్వశాఖ శ్రోత్రియ బ్రాహ్మణుడు మరణించినా మూడురోజుల పాటు చదవకూడదు. సంధ్యా సమయంలో ఉరుములు వినబడినపుడు, ఆకాశంలో మెరుపులు కనబడినపుడు, భూకంప, ఉల్కాపాత సమయాలలోనూ అధ్యయనాన్ని ఆపివేయాలి. వేద, ఆరణ్యక అధ్యయన సమాప్తి జరిగిన తరువాత పూర్తిగా ఒక పగలూ ఒక రాత్రి సెలవిచ్చెయ్యాలి.


అష్టమి, చతుర్దశి, అమావాస్య, పున్నం, చంద్ర సూర్య గ్రహణాలు, ఋతు సంధులలో పాడ్యమి, శ్రాద్ధ భోజనాలు - ఈ వేళల్లో చదువుకి సెలవు... పూర్తిగా ఒక రోజు. అయితే ఏకోద్దిష్ట శ్రాద్ధానికి భోజనం లేదా ప్రతిగ్రహ సమయాల్లో మూడురాత్రులు గడిచేదాకా అనధ్యయనాన్ని పాటించాలి.


ఉత్సవాలకీ, శక్రధ్వజందిగినపుడూ, ఏడుపులూ పెడబొబ్బలూ దగ్గర్లోనే వినబడు తున్నపుడూ, శవం లేచినపుడూ తాత్కాలిక అనధ్యయనముంటుంది. అపవిత్ర దేశంలో, అపవిత్రావస్థలో, మాటిమాటికీ నింగి మెరుస్తుంటేనూ, మధ్యాహ్నం పన్నెండు గంటలలోపల పలుమార్లు ఉరుములు వినబడినపుడూ జలమధ్యంలో, అర్ధరాత్రి వేదశాస్త్రాలను చదువరాదు. ఎవరైనా విశిష్టవ్యక్తి వచ్చినప్పుడు అధ్యయనాన్ని ఆపాలి.


పరుగెడుతూ కానీ మద్యం వాసనవస్తున్న వ్యక్తి పక్కనే వున్నపుడుగానీ, గాడిద, ఒంటె, గుఱ్ఱం, నౌక,చెట్టు, పర్వతంమున్నగు వానిపై కూర్చున్నపుడుగానీ ప్రయాణిస్తున్నపుడు గానీ, దొంగలు రాజులు గ్రామానికి ఉపద్రవాన్ని తెచ్చినపుడు గానీ వేదశాస్త్రాలను చదువరాదు.