Wednesday 31 July 2024

శ్రీ గరుడ పురాణము (251)

 


మంచివాడు, సచ్ఛరిత్రుడునైన పతిని మదమెక్కి వదిలేసిన స్త్రీ ఏడుజన్మల దాకా ఆడదానిగానే పుడుతుంది. అన్ని జన్మలలోనూ విధవగానేపోతుంది. అన్నపానాదుల విషయంలో భ్రష్టురాలైన స్త్రీ మరుజన్మలో పందిగా పుడుతుంది.


ఔరసుడూ, క్షేత్రజ్ఞుడూ ఒకే తండ్రికి పుడితే ఆ తండ్రి పోయినపుడు రెండు రకాల వాళ్ళూ పిండదానం చేయవచ్చును.


పరివేత్త (అన్నకు పెండ్లి కాకుండా తానే ముందు చేసుకున్న తమ్ముడు) పరివిత్తి (తమ్ముడికి వివాహం జరిగిపోయి తాను అది లేకుండా వుండిపోయిన అన్న) ఈ రెండు రకాల వారికీ కృచ్ఛవ్రతం చేసుకునే దాకా శుద్ది లేదు. తమ్ముని పత్ని కూడా కృచ్ఛవ్రతం చేయాలి. కన్యాదాత అతికృచ్ఛం చేసుకోవాలి. ఇటువంటి వివాహాన్ని చేయించిన పురోహితుడు చాంద్రాయణ వ్రతం చేయాలి. అప్పుడుగాని వీరికి శుద్ధి లేదు.


అన్న గూనివాడో, మరుగుజ్జో, నపుంసకుడో, నత్తివాడో, జన్మాంధుడో, ఇతర అంగ విహీనుడో అయితే మాత్రం తమ్ముడు ముందుగా వివాహం చేసుకోవచ్చును. దోషం లేదు.


నిశ్చితార్థంలో ఎవరికో వాగ్దత్తయైన కన్య ఆ వరుడు పరదేశమేగిపోయి (ఇక రాడని తెలిసి)నా, మృతి చెందినా, సన్యాసం పుచ్చుకున్నా, నపుంసకుడని తెలిసినా, పతితుడై పోయినా (ఆమె) వేరొకరిని వరించి వివాహం చేసుకొనవచ్చును. పతితోబాటు, సతీధర్మముననుసరించి, అగ్ని ప్రవేశం చేయు స్త్రీ తన శరీరంపై ఎన్ని రోమాలున్నాయో అన్నేళ్లపాటు స్వర్గంలో నివాసముండగలదు*.


* సతీసహగమనాన్ని ప్రస్తుత రాజ్యాంగం నిషేధించింది - అను


No comments:

Post a Comment