Wednesday 31 December 2014

వైకుంఠ ఏకాదశి ప్రాశస్త్యం

ఓం నమో నారాయణాయ

వైకుంఠ ఏకాదశి, ఉత్తర ద్వార దర్శనం. దీనినే ముక్కోటి ఏకాదశి అని అంటారు. ధనుర్మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశికి వైకుంఠ ఏకాదశి అని, ముక్కోటి ఏకాదశి అని అంటారు. ఆషాఢ శుద్ధఏకాదశి నాడు పాలసముద్రంలో యోగనిద్రలో గడిపి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొన్న శ్రీ మహావిష్ణువు ఈ ఏకాదశి రోజున శ్రీదేవి, భూదేవి తో కలిసి గరుడవాహనం మీద వైకుంఠానికి రాగా వైకుంఠ ఉత్తరద్వారం వద్ద సకల దేవతలు శ్రీ మహా విష్ణువును పూజించారని పురాణ కధనం.

ఈ ఏకాదశి నాడు శ్రీ మహా విష్ణువు 33 కోట్లమంది దేవతలతో వైకుంఠం నుండి భూమికి దిగివస్తాడు కనుక దీనిని ముక్కోటి ఏకాదశి అంటారు.

కృతయుగంలో చంద్రావతి అనే నగరాన్ని రాజధానిగా చేసుకుని 'ముర ' అనే అసురుడు రాజ్యపాలన చేస్తూ ఉండే వాడు. వాడు దేవతలను గాలిస్తూ వచ్చాడు. అప్పుడు దేవతలు వైకుంఠం విష్ణుమూర్తితో మొరపెట్టుకోగా, విష్ణువు వారి దీనస్థితిని చూడలేక భూమికి దిగివచ్చి మురాసురుణ్ణి అంతం సంహరించాడు. ఆ సంహారం ఈ ఏకాదశి నాడే జరిగింది. విష్ణు వైకుంఠం నుండి భూమికి దిగివచ్చిన రోజు కనుక దీనిని వైకుంఠ ఏకాదశి అన్నారు.

ఈ రోజున విష్ణుముర్తి ఆలయాలు, ఆయన అవతారాలకు సంబంధించిన ఆలయాల్లో ఉత్తరద్వారం తెరుస్తారు. దీనిని స్వర్గ ద్వారం అంటారు. ఈ ద్వార వెళ్ళి పరమాత్మను దర్శించుకుంటే వైకుంఠప్రాప్తి లభిస్తుంది.

"ఉత్తరద్వార దర్శనం" గురించి తాత్వికంగా చెప్పుకోవలసి వస్తే ఉత్తరం అంటే పైభాగం అని, తరువాత వచ్చేది అని అర్ధాలు ఉన్నాయి. ఇప్పుడున్న జీవన విధానం నుంచి ఉన్నత స్థితికి, భౌతికజీవనం నుంచి ఆధ్యాత్మిక జీవనానికి ఇది నాంది పలుకుతుంది.

మన శరీరంలో ఆరుచక్రాలు ఉంటాయి. మనలో ఉన్న కుండలిని శక్తిని జాగృతం చేసి, మూలాధార చక్రం నుండి స్వాధిష్టాన, మణిపూరక, అనహత, విశుద్ధి, ఆజ్ఞ చక్రాలను దాటుకుంటూ ఊర్ధ్వముఖంగా (పైకి) ప్రయాణింపజేసి ఏడవదైన సహస్రార చక్రంలో సహస్రకమలంలో పరమాత్మను దర్శించి, బ్రహ్మరంధ్రం ద్వారా జీవాత్మను సచ్చిదానంద రూపమైన పరమాత్మలోఐక్యమవడమే ఉత్తరద్వార దర్శనం అని చెప్పవచ్చు.

No comments:

Post a Comment