Monday 18 February 2013

మనకు ఆదర్శం మన భీష్ముడు

ॐ ఈ రోజు మాఘశుద్ధ అష్టమి, భీష్మాష్టమి - భీష్మ పితామహుడు పరమపదించిన రోజు.

ॐ మనకు ఆదర్శం మన భీష్ముడు.

ॐ భీష్ముడు మహాభారతంలో కనిపిస్తాడు. ఈయన శంతన మహారాజు, గంగాదేవికి కలిగిన 8 వ సంతానం. ఈయన అసలు పేరు దేవవ్రతుడు. ఈయన తండ్రి శంతన మహరాజు సత్యవతిని ప్రేమిస్తాడు. ఆమెను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకోగా, దేవవ్రతుడు ఉన్నాడు కనుక సత్యవతికి కలిగిన సంతానానికి ఎన్నటికి రాజ్యపాలన చేసే అవకాశం రాదని, అందువల్ల దేవవ్రతుడికి కాకుండా, సత్యవతి సంతానానికే పట్టాభిషేకం చేసి రాజ్యపాలన అప్పగించాడానికి ఒప్పుకుంటేనే వివాహానికి అంగీకరిస్తానని సత్యవతి తండ్రి దాశరాజు తెగేసి చెప్తాడు. ఇది విన్న శంతన మహారాజు భాధపడతాడు.

ॐ తండ్రి ఆవేదనను అర్ధం చేసుకున్న దేవవ్రతుడు దాశరాజు వద్దకు వెళ్ళి తాను పట్టిభిషేకాన్ని చేయించుకోనని, శంతన మహారాజు తరువాత సత్యవతికి కలిగిన సంతానం రాజ్యపాలన చేయడానికి అంగీకరిస్తున్నాని ప్రతిజ్ఞ చేస్తాడు.


ॐ దాశరాజు "నువ్వు అడగకపోవచ్చు కాని నీ సంతానం సత్యవతి సంతానంతో సింహాసనం కోసం పోరాటం చెయ్యచ్చు కదా" అంటాడు. అప్పుడు దేవవ్రతుడు తాను జీవితాంతం బ్రహ్మచారిగానే జీవిస్తానని, అత్యంత కఠోరమైన బ్రహ్మచర్యాన్ని మరణించే వరకు విడువనని ప్రతిజ్ఞ చేస్తాడు. ఈ విధంగా దేవవ్రతుడు భీషణ ప్రతిజ్ఞ చేసి భీష్ముడిగా పేరు పొందాడు.

ఈ విధంగా దేవవ్రతుడు ప్రతిజ్ఞ చేయగానే, ఆయన తండ్రి శంతన మహారాజు దేవవ్రతుడికి స్వచ్చందమరణం(కోరుకుంటేనే మరణం సంభవిస్తుంది)పొందే వరాన్ని ఇస్తాడు.

ॐ సత్యవతీ శమంతునులకు చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు అనే ఇద్దరు పిల్లలు జన్మించారు. శంతనుని మరణం తరువాత చిత్రాంగదుడు రాజయ్యాడు కాని,ఒక గంధర్వునితో యుద్ధంలో మరణించాడు. తరువాత భీష్ముడే విచిత్రవీర్యుడిని రాజు చేశాడు. విచిత్ర వీర్యుడికి కాశీ రాజు కూమార్తెలైన అంబిక, అంబాలికలను వివాహం చేశారు. కామలాలసుడైన విచిత్రవీర్యుడు కొంతకాలానికే ఆనారోగ్యంతో సంతానం కలుగకుండానే మరణించాడు.

ॐ వంశరక్షణకు వేరే మార్గం లేదు కనుక భీష్ముని పట్టాభిషేకం చేసుకోమని సత్యవతి కోరగా తన ప్రతిజ్ఞకు భంగం కలుగుతుందని సింహాసనాన్ని నిరాకరించాడు.

ॐ రోజుకు ఒకమాట మాట్లాడే ఈ రోజుల్లో తన ప్రతిజ్ఞను నిలబెట్టుకోవడం కోసం అందివచ్చిన హస్తినాపురం( నేటి డిల్లీ)సింహాసనాన్ని కూడా తృణప్రాయంగా విడిచిపెట్టిన భీష్మ పితామహుడిని మనమూ, మన రాజకీయ నాయకులు ఆదర్శంగా తీసుకోవాలి.

No comments:

Post a Comment