Wednesday 20 February 2013

భీష్మ ఏకాదశి

|| ॐ || ఓం నమో నారాయణాయ  || ॐ ||

ॐ అంపశయ్య శయనించిన భీష్ముడిని చూడడానికి శ్రీ కృష్ణ పరమాత్మ, ధర్మరాజు వెళ్ళినప్పుడు భీష్ముడి నోటి ద్వారా ధర్మరాజుకి, ఈ లోకానికి ధర్మము, భక్తి గొప్పతనము తెలియపరచాలని , అలాగే భీష్ముడు గొప్పతనం ఈ లోకానికి తెలియపరచాలని భావించాడు.

ॐ భీష్మునిలోని భగవతత్వాన్ని గ్రహించిన కృష్ణుడు ఈయననెంతగానో ప్రశంసించాడు. అంపశయ్య మీద ఉన్నప్పుడు కృష్ణ భగవానుడి ప్రోత్సాహంతోనే సాక్షాత్తూ ధర్మదేవత తనయుడే అయిన ధర్మరాజుకు గొప్ప జ్ఞానాన్ని ప్రబోధించాడు భీష్ముడు. వర్ణాశ్రమ ధర్మాలు, రాజ ధర్మాలు, ఆపద్ధర్మాలు, మోక్ష ధర్మాలు, శ్రాద్ధ ధర్మాలు, స్ర్తీ ధర్మాలు, దాన ధర్మాలు, ఇలాంటి ఎన్నెన్నో ధర్మాలను గురించి ధర్మరాజుకు ఉన్న ధర్మసందేహాలన్నింటినీ తీర్చి చక్కటి సమాధానాలిచ్చాడు భీష్ముడు. చక్కటి కథల రూపం లో... వినగానే ఎవరైనా అర్ధం చేసుకోగల తీరులో అవన్నీ మహా భారతం శాంతి, అనుశాసనిక పర్వాలలో నిక్షిప్తమై ఉన్నాయి. అప్పుడు ధర్మరాజు భీష్మునితో

ॐ "కిమేకిం దైవతం లోకే" అంటే ఈ లోకంలో అందరికంటే గొప్పదైవం ఎవరు?గొప్ప దైవం అంటే బ్రహ్మ, ఇంద్ర, అగ్ని, వరుణ మొదలైన దేవతలు అందరి చేత పూజింపబడే దైవం ఎవరు?

ॐ "కింవా ప్యేకం పరాయణం"- ఈ లోకంలో అందరి గమ్యస్థానం ఏది? ప్రతి జీవుడు(ఆత్మ) చేరుకోదగిన గమ్యస్థానం ఏమిటి?

 స్తువంతః కః -ఎవరిని స్తుతించడం వలన

ॐ కం అర్చయంతః - ఎవరిని అర్చించడం/ పూజించడం వలన

ॐ ప్రాప్యుః మానవః  శుభం -  మనిషికి సర్వశుభాలు కలుగుతాయి.

ॐ కో ధర్మః సర్వ ధర్మాణాం భవతః పరమో మతః - అన్ని ధర్మాల్లోకెల్లా ఏ ధర్మం ఉత్తమమైనది,గొప్పదని మీ అభిప్రాయం?

ॐ కిం జపం ముచ్యతే జంతుః జన్మ సంసార బంధనాత్ - ఎవరి నామజపం చేయడం వలన ఈ అనేక మార్లు జన్మించే అవస్థ నుంచి విముక్తి లభిస్తుంది?

అని అడుగుతాడు.


ॐ జగత్ ప్రభుం - ఈ జగత్తుకు ప్రభువైన వాడు

ॐ దేవదేవం - దేవతలకు కూడా దేవుడు, దేవతలచే ఆరాధించబడేవాడు

ॐ అనంతం - అంతం అంటూ లేని వాడు, అంతటా వ్యాపించి ఉన్నవాడు

ॐ పురుషోత్తమం - అందరిలోకెల్లా ఉత్తమమైనవాడు, మోక్షాన్ని ప్రసాదించేవాడు

 స్తువః నామ సహస్రేణ పురుషః సతతోత్థితః - ఎవరి సహస్రనామాలను స్తుతంచడం చేత మనుష్యులు మంచి స్తితిని పొందుతారో .............

అంటూ మొదలుపెట్టి "విశ్వం విష్ణుః వషట్కారో భూత భవ్య భవత్ ప్రభుః......" అంటూ ఈ లోకానికి పరమపవిత్రమైన శ్రీ విష్ణు సహస్రనామాలను(1000 నామాలను)ఈ లోకానికి అందించారు భీష్మాచార్యుల వారు.

ॐ అటువంటి గొప్ప భక్తుడు, ధార్మిక వేత్త, యోధుడైన భీష్మాచార్యులవారు మాఘశుద్ధ అష్టమి రోజున నిర్యాణం చెందారు. ఆయనకు గౌరవార్ధం మాఘశుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశిగా ఈ లోకం జరపాలని మన శ్రీ కృష్ణ పరమాత్మ ఆదేశించారు.

ॐ 21-2-2013, గురువారం భీష్మ ఏకాదశి, ఈ రోజు తప్పకుండా శ్రీ విష్ణు సహస్రనామాలను పఠించండి. అది నేర్చుకోని వారు " శ్రీ రామ రామ రామ" అని వీలైనన్ని సార్లు జపించండి.

|| ॐ || ఓం నమో నారాయణాయ || ॐ ||   

No comments:

Post a Comment