Friday 22 August 2014

వినాయకచవితి ఖగోళశాస్త్రం

ఖగోళాన్ని విద్యుత్-అయస్కాంతత్వ (Electro-magnetism) కోణం నుంచి గమనిస్తే, మొత్తం విశ్వమంతా విద్యుత్-అయస్కాంత తరంగాల (Electro-magnetic waves) మీదనే నడుస్తోంది. సమస్త జీవరాశి నిత్యం అంతరిక్షం నుంచి, భూమి పొరల నుంచి విద్యుత్-అయస్కాంత తరంగాలను గ్రహిస్తోంది, బయటకు విడుదల చేస్తోంది. మానవదేహంలో కూడా విద్యుత్ శక్తి ఉంది. మనిషి యొక్క ప్రతి కలదలిక చేత అది బయటకు వెలువడుతోంది. ఇదంతా పురాతన భారతీయ శాస్త్రాల దగ్గరి నుంచి ఆధునిక శాస్త్రవేత్తల వరకు అంగీకరించిన విషయమే. భారతీయ సంస్కృతిలో పండుగ అంటే అది కేవలం ఏదో తతంగం కాదు. ఈ ఖగోళమే ఒక విద్యుత్-అయస్కాంత క్షేత్రం. ఖగోళంలో కలిగే మార్పులు, భూమికి చంద్ర, సూర్యునికి మధ్య ఏర్పడే దూరం వలన అంతరిక్షం నుంచి వెలువడే అతి-సూక్ష్మ విద్యుత్ అయస్కాంత తరంగాలలో కలిగే మార్పులు మనిషిపై, అతని జీవనక్రియలపై, కణాలపై ప్రభావాన్ని చూపిస్తాయి. వీటిని, గ్రహాల కదలికలను ఆధారంగా చేసుకుని, మానవ జీవితంలో వ్యక్తి ఏ విధమైన మార్పును చేసుకుంటే, విశ్వంలో కలిగిన మార్పులకు అనుగుణంగా మారి, వాటి నుంచి అధిక ప్రయోజనం పొంది, ఆరోగ్యంగా జీవించగలడో గ్రహించి, దానికి అనుకూలంగా భారతీయ ఋషులు పండుగలను, ఇతర నైమిత్తిక తిధులను ఏర్పటు చేశారు. ఆయా రోజులలో తినవల్సిన పదార్ధాలను, చేయవలసిన విధులను స్పష్టం చేశారు. లోతుగా చెప్పుకుంటే ఇదొక అధ్బుతమైన విషయం.

వినాయక చవితి కూడా అంతే. అంతరిక్షంలో జ్యోతిర్మండలం ఉంటుంది. అది నక్షత్ర, గ్రహల రాశుల నుంచి వెలువడే వివిధ తరంగాలు, కిరణాల (rays) కారణంగా ఏర్పడుతుంది. మానవనేత్రానికి కనిపిచేది కాదు. ఆ జ్యోతిర్మండలంలో అనేకానేక మండలాలు ఉంటాయి. వాటిలో గణేశమండలం నుంచి వెలువడే విద్యుత్-అయస్కాంత కిరణాలను మానవ దేహం అత్యధికంగా గ్రహించగల సమయమే వినాయక చవితి. ఈ వినాయక చవితి అంతరిక్షం నుంచి వెలువడే విద్యుత్-అయస్కాంత తరంగాలను, కాస్మిక్ కిరణాలను (Cosmic rays) మానవదేహం నేరుగా గ్రహించలేదు. కానీ ఆ శక్తి ప్రకృతికి, అందులో భాగమైన మట్టికి ఉంది. మట్టి పంచభూతాలలో ఒకటి, ప్రాణశక్తి కలిగినది, సమస్త జీవనానికి ఆధారభూతమైనది. మీరు ఒక విత్తనాన్ని మట్టిలో వేస్తేనే మొలకెత్తుతుంది. అంతేకానీ ప్లాస్టర్-ఆఫ్-పారిస్ లో, లేక ఇతర పదార్ధాలలో వేస్తే మొలకెత్తదు సరికదా, విత్తులోని జీవం నాశనమవుతుంది. అందుకే వినాయక చవితికి మట్టి విగ్రహాన్నే పూజించాలి.

ఈ మట్టి విగ్రహం ఏం చేస్తుంది? ఒక యాంటీనాలా (Anteena) పని చేస్తుంది. ఇందాక చెప్పుకున్న జ్యోతిర్మండలం నుంచి వెలువడే అయస్కాంత తరంగాలను, కాస్మిక్ కిరణాలను మట్టిప్రతిమ గ్రహించి, ఇంట్లోని వ్యక్తులకు, పరిసరాలకు ప్రసారం చేస్తుంది. ఒక రేడియో, తరంగాలను గ్రహించి, పాటలను ప్రసారం చేసినట్లు. బల్బు తీగల ద్వారా విద్యుత్‌ను గ్రహించి, కాంతిని ప్రసరించినట్టు. ఆ రోజు పాటించే నియమాలన్నీ సూక్ష్మాతి సూక్ష్మమైన తరంగాలను అధికంగా, సక్రమంగా గ్రహించడం కోసమే. అన్నిటికంటే ముందు నియమాల పాత్రతను ఇస్తాయి. అందువల్ల వినాయకిచవితి నాడు సంపూర్ణంగా గణపతి అనుగ్రహాన్ని పొందాలనుకునే వారు, ఆరోగ్యవంతమన జీవనం గడపాలనుకునేవారు శాస్త్రం చెప్పినట్టు గణపతి పూజ చేయడం ఉత్తమం. అందులో భాగంగా మట్టి గణపతినే పూజించడం, మద్యాహ్న సమయంలో వ్రతం చేయడం, ప్రాతఃకాలంలో తెల్ల నువ్వులతో తలస్నానం చేయడం, నూనె తగలకుండా, నేతితో చేసిన పదార్ధాలనే గణపతికి నివేదించడం, పత్రితో పూజించడం, బ్రహ్మచర్యం పాటించడం, తరువాత మట్టి గణపతిని స్థానిక జలవనరులో నిమజ్జనం చేయడం ప్రధానమైనవి.

కనుక మట్టిగణపతులనే పూజించండి, గణపతి అనుగ్రహానికి పాత్రులుకండి.

4 comments:

  1. మీరు అన్యధా భావించవలదు, ఇలాంటి వ్యాసాలు చేసే మేలు కన్నా కీడే హెచ్చు. మీ వ్యాసంలో విషయసంబంధం కల ఖగోళశాస్త్రపరమైన అంశాలేవీ నాకు గోచరించ లేదు. గణేశమండలం ఏమిటీ? దానికి సంబంధించిన ఆధారాలు చూపండి! మట్టిప్రతిమను పూజించాలాన్నది నిజమూ, సకారణమూను. కాని మీరు చెప్పిన కారణం అసంబధ్ధం. పైగా మట్టిప్రతిమ ఒక ఆంటెన్నాలాగా పనిచేయటం ఏమిటీ? ఈ విషయంలో శాస్త్రీయమైన ఋజువులు చూపగలరా? తగిన పరిజ్ఞానమూ, తగిన ఆధారాలు లేకుండా శాస్త్రవిషయాలపై వ్యాసాలు వ్రాయటం మంచి పధ్ధతి కాదు. మీ‌ వ్యాసం చాలా అసంతృప్తి కలిగించింది.

    ReplyDelete
    Replies
    1. నమస్కారమండి! దయచేసి ఆ లింక్‌లో ఉన్న సమాచరం చూడగలరు. ఇదే కాక మరికొన్ని సంస్థలు కూడా వీటి మీద పరిశోధన చేశాయి. వాటిని ఆధారంగా చేసుకునే ఈ వ్యాసం రాశాను.
      http://www.sanatan.org/en/a/45_chaturthi.html

      Delete
    2. సంతోషం. వీలువెంబడి తప్పక చూస్తాను. ధన్యవాదాలు వివరణకు.

      Delete
    3. మీరు చెప్పిన సైట్ చూసాను. వారుమతవిషయకంగా వ్రాసినవాటి గురించి ఇక్కడ వ్యాఖ్యానించను సమయాభావ స్థలాభావాలవలన. కాని ఖగోళశాస్త్రరీత్యా వారి వ్రాతలు అసంబధ్ధం. చూడండి, వారు "Shri Ganapati waves reach the earth in a greater proportion and those from Mars too reach the earth. Consequently, most of the waves emitting from the moon are destroyed." అని వ్రాసారు. ఇదంతా నిర్మొగమాటంగా చెప్పాలంటే - కేవలం వట్టి చెత్త - మాత్రమే. ఇలా అన్నందుకు ఏమీ అనుకోకండి. ఆధ్యాత్మికత పేరుతో అశాస్త్రీయవిషయాలను ప్రచారం చేయటం వలన చివరికి జరిగేది, నేను నా తొలి కామెంట్‌లో చెప్పినట్లు కీడు మాత్రమే. అది ఎటువంటిదంటే కూర్చున్న కొమ్మ నరుక్కోవటం వంటి కీడు.

      Delete