Saturday 9 August 2014

శ్రావణ పౌర్ణిమ - రాఖీ పండుగ, హయగ్రీవజయంతి

29-08-2015, శనివారం, శ్రావణ పౌర్ణిమ - రాఖీ పండుగ, జంధ్యాల పూర్ణిమ.

పూర్వం దేవతలకు, రాక్షసులకు జరిగిన ఒక యుద్దంలో రాక్షసుల ధాటికి దేవతలు తట్టుకోలేకపోయారు. అప్పుడు తన భర్త అయిన దేవేంద్రుడు గెలవాలన్న గట్టి కోరికతో ఇంద్రుని భార్య అయిన శచీదేవి, ఇంద్రునికి రక్ష కట్టింది. ఆమె కట్టిన 'రక్ష' మహిమ చేత ఇంద్రుడు రాక్షసులపై విజయం సాధించాడు. అందువల్ల శ్రావణ పౌర్ణిమ 'రక్షా పూర్ణిమ'గా ప్రసిద్ధి గాంచిందని ధర్మరాజుకు శ్రీ కృష్ణుడు చెప్పినట్టుగా భవిష్యోత్తర పురాణంలో కనిపిస్తుంది.

బలి చక్రవర్తి, లక్ష్మీ దేవి:
రాక్షసుల రాజు మహాబలి తన భక్తితో విష్ణువును మెప్పించి తన రాజ్య రక్షణా భారం విష్ణువుపై పెడతాడు. దానితో విష్ణువు బలి రాజ్యంలోనే ఉండిపోవలసి వస్తుంది. అపుడు విష్ణవు భార్య అయిన లక్ష్మీ దేవి ఒక బ్రాహ్మణ స్త్రీ రూపంలో బలి వద్దకు వచ్చి శ్రావణ పూర్ణిమ రోజున బలి చేతికి రాఖీ కట్టి నేను నీ సోదరి సమానురాలను అంటుంది. సోదరిగా తన కోరిక మేరకు విష్ణువును వదలివేయమంటుంది. ఆమె కట్టిన రాఖీ చర్యకు మెచ్చిన బలి శ్రీ మహావిష్ణువును ఆమెతో పాటు శ్రీ మహా విష్ణువును కూడా వైకుంఠానికి పంపేస్తాడు.

చారిత్రికంగా చూస్తే భారతదేశం మీద ఇస్లాం పాలకులు ఆక్రమణలకు పాల్పడుతున్న సమయంలో వీర రాజపుత్రులు వారిని ఎదురించి పోరాడసాగారు. చిత్తోడ్ రాజ్యం మీద గుజరాత్ రాజు బహదూర్ షాహ్ దాడి చేసే ప్రయత్నంలో ఉన్నాడు. అంతకముందే రాజు మరణించడం చేత రాణీ కర్ణావతి వైధవ్యాన్ని పొందింది. స్త్రీలు మాత్రమే మిగిలారు. అందువల్ల యుద్ధంలో పోరాడి గెలిచే శక్తి తనకు లేదని గ్రహించి హుమాయూన్ చక్రవర్తికి రాఖీ పంపింది. ఆ కాలంలో రాఖీ అంటే ఎంతో పవిత్ర భావన ఉండేది. సోదరిని తప్పకుండా రక్షించాలనే తపన అంతకన్నా ఎక్కువ ఉండేది. అందువల్ల రాఖీ అందుకున్న హుమాయూన్ తన సైన్యాన్ని వెంటనే పంపాడు. కానీ అప్పటికే రాణి కర్ణావతి సహా 16,000 స్త్రీలు, జీహాదీలు అత్యాచారం చేకుండా రక్షించుకోవడానికి, తమకు తామే నిప్పు అంటించుకుని జూహార్‌కు పాల్పడ్డారు.

యేన బద్ధో బలీరాజా దానవేంద్రో మహాబలః |
తేన త్వామభి బధ్నామి రక్షమాచల మాచల ||

పై శ్లోకాన్నిపఠిస్తూ భార్య-భర్తకు సోదరి-సోదరునకు యుద్ధానికి వెళ్లే వీరునకు విజయ ప్రాప్తి కోసం ఈ రక్షాబంధనను కడతారు. శ్రీ మహావిష్ణువు శక్తిచే మహాబలుడు అయిన బలిచక్రవర్తిని బంధించినట్లుగా, ఓ రక్షాబంధనమా ! నీవు చలించక వీనికి రక్షణ కల్పించుము అని పై శ్లోకం అర్దం. దీనిలో రక్షాబంధనం అంటే సాక్షాత్తూ శ్రీ మహావిష్ణు శక్తేనని తెలియచెప్పే భావం ఇమిడి ఉంది. రాఖీ/రక్ష కట్టడం వలన కట్టినవారికి, కట్టించుకున్నవారికి రక్ష కలుగుతుంది. రాఖీ కట్టినందుకు బదులుగా సోదరుడు సోదరికి పసుపుకుంకుమలు, సారె ఇచ్చి ఆశీర్వదించాలి.

ఉపనయనం చేసుకున్న వారు శ్రావణ పూర్ణిమ రోజున, పాత యజ్ఞోపవీతాన్ని(జంద్యాన్ని) విసర్జించి, కొత్తది ధరిస్తారు. అందువల్ల ఇది జంధ్యాల పూర్ణిమగా ప్రసిద్ధి చెందింది. ఇదే రోజున కొత్తగా ఉపనయనం అయినవారికి ఉపాకర్మ నిర్వహిస్తారు. దీనితో పిల్లవానికి వేదం చదివే అర్హత వస్తుంది.

ఈ రోజే హయగ్రీవజయంతి. శ్రీ మహావిష్ణువు విద్యాప్రదాత అయిన శ్రీ హయగ్రీవస్వామిగా దర్శనమిచ్చేది ఈ రోజునే. హయగ్రీవ ధ్యానంతో సర్వ విద్యలు లభిస్తాయి. జ్ఞాపకశక్తి వృద్ధి చెందుతుంది. ఓం శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని రోజూ జపించడం వలన విద్య యందు ఆసక్తి కలిగి, విద్యల్లో రాణిస్తారు.

అందరికి రాఖీ పండుగ మరియు జంధ్యాల పూర్ణిమ శుభాకాంక్షలు.

Originally Published: Rakhi Purnima 2013
1st Edit: 09-August-2014
2nd Edit: 28-August-2015

No comments:

Post a Comment