Sunday 23 August 2015

బొడ్డుతాడును భద్రపరచడం - హిందూ సంప్రదాయం

గర్భంలో ఉన్న శిశువు బొడ్డుతాడు ద్వారానే తల్లి నుంచి పోషకాలను తీసుకుంటుంది. బొడ్డుతాడులో స్టెంసెల్స్ ఉంటాయని, దాన్ని భద్రపరచాలని ఇప్పుడు అనేక ప్రకటనలు చేస్తూ, స్టెం సెల్ బ్యాంకుల పేరుతో కొత్త కొత్త సంస్థలు పుట్టుకొస్తున్నాయి. నిజానికి ఈ బొడ్డుతాడును దాచాలన్న ఆలోచన ఈనాటిది కాదు. అనాదికాలం నుంచి ఉంది. దీనికి సనాతనహిందూ ధర్మమే మూలమైంది. సనాతనధర్మం ప్రకారం ప్రతి వ్యక్తికి జీవితంలో 16 సంస్కారాలు నిర్వహించాలి. ఇవి పుట్టుకముందు నుంచి మరణం తర్వాతి వరకు ఉంటాయి. వీటిలో ఒకటి జాతకర్మ. ఇది బిడ్డ పుట్టిన తర్వాత 11 రోజులకు చేసే సంస్కారం. పూర్వం ఈ సమయంలోనే బొడ్డుతాడును తీసి, మంత్రించి, రాగి  తాయత్తులో చుట్టి భద్రపరిచేవారు. దానికి ప్రత్యేకమైన పద్ధతి ఉండి ఉండవచ్చు. జీహాదీలు, ఆంగ్లేయుల దండయాత్రల్లో భారతదేశం చాలా విజ్ఞానాన్ని కోల్పోయింది. ఆ క్రమంలోనే ఈ బొడ్డుతాడును భద్రపరిచే ప్రక్రియను హిందువులు కోల్పోయి ఉండవచ్చు. తద్ఫలితంగా ఇప్పుడు దాన్ని వెండిలో చుట్టించి భద్రపరచడం వరకు మాత్రమే మిగిలింది.ఇలా ఎందుకు చెప్పవలసి వస్తోందంటే ఆంగ్లేయులు దేశం మీదకు దండెత్తేనాటికే మన దేశంలో అన్ని శాస్త్రాల్లో విశేషమైన పరిశోధన జరిగింది. దీనికి చిన్న ఉదాహరణ, రాజీవ్ దీక్షిత్ గారు ఉపన్యాసంలో చెప్పినది.

1740 డా. థామస్ క్రూసో అనే ఆంగ్లేయుడు (ఈస్ట్ ఇండియా కంపెనీ సర్జన్) బెంగాల్ లో పర్యటించాడు. అతని పర్యటనలో ఒక ఆశ్చర్యకమైన విషయం వెలుగు చూసింది. భారత దేశంలో అమ్మవారు(చికెన్ ఫాక్స్) తో చనిపోయే వారి సంఖ్య చాలా తక్కువగా దాదాపు లేని విధంగా కనిపించిది. ఈ విషయమై తన పరిశోధన మొదలెట్టాడు. బెంగాల్ లో ఒక సాధారణ మంగలి వైద్యుడు ఒక చిన్న సీసాలోని ద్రవ పదార్థాన్ని సూది ద్వారా శరీరం లోకి ఎక్కించడం చూశాడు. అతను ఇంటింటికీ తిరిగి ఇలా చేస్తూ ఉండడం థామస్ క్రూసోకు ఆశ్చర్యం కలిగించింది. అతనిని పిలిచి వివరం అడిగాడు. ఆ వైద్యుడు ఇచ్చిన సమాచారాన్ని హౌస్ ఆఫ్ కామన్స్ లో ప్రవేశపెట్టాడు.
1. భారత దేశంలో చికెన్ ఫాక్స్, స్మాల్ ఫాక్స్ తో మరణాలు లేవు.
2. భారతీయ వైద్యులు దీనికి విరుగుడు కనుగొన్నారు. వారు చికెన్ ఫాక్స్ వచ్చినవారి పుండ్లనుండి రసిని తీసి నిలవచేసేవారు. తరువాత కొద్దిమొత్తంలో ఈ రసిని బాగున్న వారి శరీరాలలోకి ఎక్కిస్తున్నారు. దానితో శరీరంలో ఉండే రోగనిరోధక శక్తి పెరుగుతుందని చెప్పాడు.
దీని వల్ల మనకు విశదమయ్యే విషయాలు మూడు. రోగనిరోధక శక్తి మనశరీరానికి ఉంది అనేది భారతీయులకు తెలుసు, చాలా చిన్న మోతాదులో రోగ క్రిములను శరీరానికి ఇస్తే ఇక జన్మలో ఆ రోగం బారిన పడకుండా ఉంటారని తెలుసు. వాక్సిన్ కు మూలసిద్దాంతం ఇది. వైట్ బ్లడ్ సెల్స్ గురించి మన భారతీయులకు అవగాహన ఉంది.
మామూలుగానే రోగనిరోదక శక్తి, వాక్సన్ లు యూరోపియన్లు కనుక్కున్నారు అని అంటూ భారత్ పైకి విదేశీయులు దండత్తకపోతే మనకే దిక్కు ఉండేది కాదు అంటున్నారు. హౌస్ ఆఫ్ కామన్స్ వివరాలు తిరగవేయండి మనకింకా ఇలాంటి చాలా విషయాలు బోధపడతాయి.

అయితే ఇప్పుడు మనం బొడ్డుతాడును వెండి తాయత్తులో చుట్టించి, మొలకు కట్టడం వెనుక కూడా విజ్ఞానం ఉంది. మొలతాడు వెండిది కట్టేవారు. ఇప్పుడు అది అనాగరికమని ప్రచారం చేశారు. కానీ అసలు విషయమిది. లోహాలకు శరీరంపై ప్రభావం చూపే శక్తి ఉందని గుర్తించినవారు పురాతన హిందువులు. ఈ సంస్కృతి ప్రతి చిన్న విషయం మీదా చాలా లోతైన పరిశోధన చేసింది. వెండిని శరీరంపై ధరించినప్పుడు అది చలువ చేసే గుణం కలిగి ఉంటుంది. అదే బంగారమైతే ఉష్ణగుణం కలిగి ఉంటుంది. ఎక్కడెక్కడ ఉష్ణగుణం అవసరమో, ఎక్కడ శీతలగుణం అవసరమో మన పూర్వీకులకు బాగా తెలుసు. దీనికి పెద్ద వివరణ ఇవ్వచ్చు. విషయంలోకి వస్తే, స్త్రీపురుష శరీర నిర్మాణం చూసినప్పుడు పురుషులకు వృషణాలు శరీరం బయట ఉంటాయి.  వాటి ఉష్ణోగ్రత సాధరణ శరీర ఉష్ణోగ్రత కంటే 2 డిగ్రీలు తక్కువగా ఉంటుంది. అవి పురుషుల్లో వీర్యోత్పత్తి చేస్తాయి. ఈ వృషణాలు, ఎప్పుడూ కూడా అధిక ఉష్ణోగ్రతకు లోనవ్వకూడదు. అలా అయితే వీర్య ఉత్పత్తి మీద, వీర్యకణాల మీదా ప్రభావం చూపిస్తుంది. ఇవి అధిక ఉష్ణోగ్రతకు లోనవ్వడానికి అనేక కారణాలు ఉంటాయి. అయితే ఎప్పుడైతే మొలకు వెండి మొలతాడు కట్టుకుంటామో, అప్పుడు ఆ లోహప్రభావం వలన ఆ శరీర ప్రాంతంలో ఉన్న ఉష్ణోగ్రత సాధారణస్థాయికి రావడం కానీ, అదుపులో ఉండటం కానీ జరుగుతుంది. అయితే వెండిమొలతాడు కొనే స్థోమత లేకపోవడం చేతనో, లేక అది అనాగరికమని భావించటం చేతనో, ఇప్పుడు కేవలం వెండి తాయత్తులో బొడ్డుతాడు ఉంచి, మొలతాడుకు కడుతున్నారు. అలా వెండి తాయత్తు కట్టడం, వెండిమొలతాడు కట్టడం అనాగరికమేమి కాదు. బంగారు మొలతాడు కట్టకపోవడానికి కారణం మీకు ఇప్పటికే అర్దమై ఉంటుంది.

బొడ్డుతాడులో ఉన్న స్టెం సెల్స్ ను అనేక రోగాల నివారణకు, చికిత్సకు వాడతారు. అయితే కేవలం రాగి తాయత్తులో కట్టినంత మాత్రం చేతనే ఆ కణాలను భద్రపరచలేము. నైట్రస్ ఆక్సైడ్ వాంటి వాయువులను ఉపయోగించి అతిశీతల ఉష్ణోగ్రతల్లో భద్రపరచడం చేత వాటిని పరిరక్షించవచ్చు. కానీ ఇది ఇప్పుడు పెద్ద వ్యాపరమైంది. రోగం వస్తుందో రాదో తెలియదు కానీ, రోగం వస్తుందని ముందే భయపెట్టి అధికమొత్తంలో సొమ్ము చేసుకోవడం కోసం స్టెం సెల్ బ్యాంకులు తెరవడం నిజంగా బాధాకరం. ధర్మం మీద, ఆయుర్వేదం మీద నమ్మకముండి, దేశభక్తి కలిగిన వారు ఎవరైనా ముందుకు వచ్చి, ఆయుర్వేదశాస్త్రంలో సనాతనధర్మం కోల్పోయిన ఈ స్టెం సెల్స్ వైద్యాన్ని తిరిగి పునరుద్ధిరించాలి.

2 comments: