Sunday 2 August 2015

హిందూ ధర్మం - 169 (శిక్షా - 3)

శబ్దాల యొక్క శక్తిని, అక్షరముల వైభవాన్ని చూశాం. మరి వేదమంత్రాల యొక్క పరిపూర్ణశక్తిని మానవుడు పొందాలంటే దానికి కొన్ని నియమాలు ఉన్నాయి. నా గురువులలో ఒకరికి వారి గురువుగారు వేదంలోని ఒక అతి రహస్య విద్యను నేర్పిస్తూ మంత్రపఠనం గురించి ఇలా హెచ్చరించారు. 'నేను నీకు నేర్పే విద్య అత్యంత కఠినమైనది, అది సక్రమంగా జరిగితే శుభఫలితాలు కలుగుతాయి. మంత్రపఠనంలో కానీ, కర్మలో కానీ చిన్న పొరపాటు దొరిలినా, చాలా దుష్పరిణామాలు చవి చూడవలసి వస్తుంది. జాగ్రత్తగా చదివితే ప్రపంచానికి మేలు జరుగుతుంది, కాస్త పొరపాటు జరిగినా అది ఉపద్రవానికి దారి తీస్తుంది. అందువల నీకు చేసే విద్యాబోధన కూడా చాలా కఠినంగానే ఉంటుంది. దానికి తట్టుకుని నిలబడగలవు అనుకుంటేనే నా దగ్గర ఉండు. లేదంటే ఇప్పుడే వెళ్ళిపో' అన్నారు. అన్నిటికి తట్టుకుని నిలబడ్డారు కనుక ఈ రోజు వారు అనేక యజ్ఞాలు చేస్తూ దేవతావహన చేస్తున్నారు, దేవతలను యజ్ఞవేదికకు రప్పించగలుగుతున్నారు. వేదగానం చేస్తున్నారు. ఆ సంప్రదాయ విద్య తెలిసి, ఇప్పుడు ప్రపంచంలో జీవిస్తున్న ఏకైక వ్యక్తి వారే. వేదం నేర్చుకోవడం అంత కఠినం. ఏదో క్లాసులో కూర్చుని బట్టి కొట్టే విద్య కాదిది. గురువుకు ఎంత శ్రద్ధ ఉంటుందో, శిష్యునికి అంతే ఉండాలి. అన్నిటిని తట్టుకుని నిలబడే శక్తి, సహనం ఉండాలి. అటువంటి ఎంతోమంది వేదపండితులు, ఘణాపాఠీలు ఎందరో ఉన్నారు.  

అటువంటి వేదమంత్రోఛ్ఛారణ గురించి శిక్షా శాస్త్రం వివరిస్తుంది.
1. అక్షరశుద్ధిః - అనగా అక్షరములను సరిగ్గా పలకాలి.
2. మాత్రశుద్ధిః - ధీర్ఘాలు మొదలైనవి ఎంత సమయం పలికితే సరైన అర్దం వస్తుందో అంతే సమయం పలకాలి. ఒక్ అక్షరాన్ని ఎంత సమయం పలకాలో, అంతే సమయం పలకాలి. అంతేకంటే ఎక్కువ కానీ, తక్కువ కానీ పలకకూడదు.
3. స్వరశుద్ధిః - అక్షరములను సరైన స్వరంలోనే పలకాలి

అయితే వేదమంత్ర పఠనం సరిగ్గా జరుగుతోందా లేదా అనేది నిర్ధారించుకొనుటకు ఋషులు అనేక పద్ధతులను వివరించారు. 6 రకాల దోషాలు పారాయణలొ దొర్లే అవకాశం ఉందని చెప్పారు.

గీతి శ్రీధ్రీ శిరఃకంపి తధా లిఖితపాఠకః |
అనర్ధజ్ఞః అల్పకంఠశ్చ్య షఢైతే పాఠకాధమః ||

పాట వలే పాడేవారు, వేగంగా చదువేవారు, స్వరం పెంచకుండా, తగ్గించకుండా కేవలం తలను పైకి క్రిందకు తిప్పుతూ ఉండేవారు, పుస్తకం చూసి చదివేవారు, అర్దం తెలుసుకోకుండా పారాయణ చేసేవారు, బలహీనమైన గొంతుతో చదివేవారు వేదపారాయణంలో అధములు అంటున్నది శాస్త్రం.

అక్షరములు, వాటి సమయానుకూల ఉఛ్ఛారణ మారకుండా స్వరం మార్చడం కూడా వ్యతిరేకఫలితాలను ఇస్తుందని చరిత్ర చెప్తోంది.

పూర్వం వృత్తాసురుడనే రాక్షసుడు ఉండేవాడు. వాడు ఇంద్రునిపై యుద్ధం చేయడానికి పూనుకున్నప్పుడు, కుమారుడి విజయం కోసం వాడి తండ్రి త్వష్ట వైదిక మంత్రాలతో యాగం చేశాడు. అందులో శృతి లోపించింది, దాని ఫలితంగా అర్దం మారిపోయింది. 'ఇంద్రశ్శత్రో వర్ధయేత్' అనే వ్యాక్యాన్ని శృతి తప్పి చదివాడు. దాంతో ఇంద్రుడి శత్రువైన వృత్తుడు వర్ధిల్లాలి అనబోయి, శత్రువైన ఇంద్రుడు వర్ధిల్లాలి అనే అర్దం వచ్చింది. అది చిన్నలోపంగా అనిపించినా, అదే వృత్తాసురిడి మరణానికి కారణమయ్యింది. వాడు సర్వనాశనమయ్యాడు.

ఈ కధ ద్వారా రెండు విషయాలు అర్దం చెసుకోవాలి. ఒకటి, ఎవరు పడితే వారు వేదం చదువరాదు, వాళ్ళు బ్రాహ్మణులైనా సరే, గురువు దగ్గర కూర్చుని నేర్చుకున్న వారు మాత్రమే పారాయణ చేయాలి. లేదంటే అందులో దొర్లే తప్పులకు కలిగే వ్యతిరేక ఫలితాలు తట్టుకోలేరు. దానికి బదులుగా అందరూ స్తోత్రాలు, శ్లోకాలు చదవవచ్చు, నామజపం చేయచ్చు. వీటికి ఇలాంటి నియమం లేదు. వేదపారాయణ వినవచ్చు కానీ గురువు దగ్గర నేర్వకుండా పఠనం చేయరాదు. రెండవది, ఎప్పటికైన ధర్మమే గెలుస్తుంది. భగవంతుని ఇచ్ఛకు వ్యతిరేకంగా ఎవరు ప్రవర్తించాలని చూసినా, వారు నాశనమవుతారు. అక్షరాలకు అధిదేవతలు ఉంటారు. వారు వాటిని, వేదాన్ని రక్షిస్తూ ఉంటారు, ఎవరైనా వేదాలను తప్పుడు పనుల కోసం ఉపయోగిస్తే, ఇక వాడి గొయ్యి వాడు తవ్వుకున్నట్లే, వాడి చితికి వాడి నిప్పు అంటించుకున్నట్లే. దేవతలే వాడిని పక్కదారి పట్టిస్తారు.

ఇటువంటి దుష్ప్రభావాలు మానవాళి ఎదురుకొనకూడదనే ఋషులు శిక్షా శాస్త్రాన్ని అందించారు.  

To be continued ......................

No comments:

Post a Comment