Saturday 15 August 2015

స్వాతంత్ర దినోత్సవం - సద్గురు శివానందమూర్తి సందేశం

ఈ సంస్కృతి మనకు ఏం చెప్తోంది, అది చెప్పినట్టు మనము జీవిస్తున్నామా? ఈ సంస్కృతి మనలని ఎలాగ జీవించమని అభిలషిస్తున్నదో, మనమట్లా జీవిస్తున్నామా అని ఆత్మవిమర్శ చేసుకోవలసిన సమయం భారతదేశ చరిత్రలో పూర్వం కంటే ఎక్కువగా నేడు ఉంది. మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి, పరిసరాలు పరిశీలించుకోవాలి, మన తప్పు ఎమైనా ఉందా అని తెలుసుకోవాలి. అంటే ఏ విధంగా ఆర్షధర్మంలో పుట్టి.......... చాలా పాతది కాబట్టి సనాతనధర్మం, రాముడు ఆయన వంశంలో 62వ తరం వాడు, ఆయన వంశకర్త కూడా ఈశ్వరుడిని ఆరాధించాడు, ధర్మాన్ని పాటించాడు. అందువల్ల అది చాలా సనాతనం. ఈ ధర్మాన్ని ఈ విధంగా జీవించమని నిరూపించి చూపింది మహర్షులు కాబట్టి ఆర్షధర్మం. భారతదేశంలో ఉంది కాబట్టి భారతీయ ధర్మం............ ఎన్ని పేర్లు చెప్పినా వస్తువు ఒక్కటే. దాంట్లో అది మనల్ని ఏమని అంటోంది, మనమట్లా జీవిస్తున్నామా అని తలుచుకుంటే అసలు ఏదో ఒక విషయంలో మనం మరిచాం, మరిచిపోయామ అనే సందేహం కలుగుతుంది. భారతదేశాన్ని ఒక మారు మనం చిన్నచూపు చూసినట్లైతే 1,000 సంవత్సరాల నుంచి ఆపదలకు గురైంది. వేయి సంవత్సరాల్లో వచ్చిన ఆపదంతా కూడా అనేకమంది దండయాత్రలు చేశారు, ధ్వంసం చేశారు. మామూలు దండయాత్రలు కావు, ఈ సంస్కృతి మీద ద్వేషంతో చేసిన దండయాత్రలవి, అది గుర్తుపెట్టుకోవాలి. ఏ రాజైన వేరే దేశం మీద దండయాత్ర చేస్తే, ఆక్రమిస్తాడు, ధనం కొల్లగొడతాడేమో కానీ ధర్మం మీద ద్వేషంతో రాడు. కానీ అలా జరిగిందిక్కడ. దాని తర్వాత అనేక విషయాలతో ప్రభావితమైనాం. మెల్లమెల్లగా అనేక నాగరికతలు, సిద్ధాంతాలు లోపల, బయట ఉత్పన్నమైనాయి. బాహ్యం నుంచి కూడా అనేక సిద్ధాంతాలు మన మీద దాడి చేశాయి. లోపల కూడా విపరీతార్ధాలు కలిపించుకుంటూ, నేను కొత్త మార్గాన్ని కనిపెట్టాను, నేను కర్తని, కొత్త మార్గాన్ని చూపిస్తున్నాను అని చెప్పి సనాతనధర్మ మార్గానికి కూడా కొత్త లయలు సృష్టించి చెప్పారు కొందరు భౌద్ధం, జైనం మొదలైనవి ఎన్నెన్నో వచ్చాయి. కానీ సనాతనధర్మం దానిలో ఒక చేర్పు గానీ, మార్పు గానీ అవసరమైన స్థితిలో అది లేదు. దానికి ఏ చేర్పు అక్కర్లేదు, దానికి ఏ మార్పు అక్కర్లేదు. ఆ సత్యం తెలుసుకుంటే అది ఎలా ఉంటుంది అనే మీమాంసకు ఒక  కుతూహలం ఏర్పడుతుంది. దాన్ని తెలుసుకున్నామంటే ఈ భారతదేశానికి గతంలో జరిగిన/గడిచిన చెడ్డకాలం మళ్ళీ రాదు, అత్యుత్తమమైనటువంటి, ఉన్నతమైనటువంటి దశ వస్తుంది. గడిచిన శతాబ్దాల్లో ఈ దేశం అనుభవించిన ఘోరమైన విపత్తులున్నాయే ........... అవి గుర్తు చేసుకుంటే ఏమిటంటే మళ్ళీ ధర్మం అనే మాట జ్ఞాపకం వస్తుంది. ఏదో ధర్మలోపం జరిగితేనే మనకి, అంతటా వ్యాపించిన ఈశ్వర సంకల్పం చేత ప్రకృతైనా వైపరీత్య ధోరణి తీసుకుంటుంది, మరో శత్రువైనా వచ్చి మనలని శిక్షిస్తాడు. ఏదో జరుగుతుంది, మనం కష్టాలు పడక తప్పదు. ఏం జరిగిందన్న ప్రశ్నకు సమాధానం సులభం కాదు, 500 సంవత్సరాలు భయంకరమైన దాడులకు గురై, అవమానాలకు గురై, స్త్రీలు అక్షేమంతో కష్టపడి, దోపిడీలకు గురై......... ఏం అపరాధం చేసింది భారతదేశం? అది పెద్ద ప్రశ్న. పుస్తకాలు, చరిత్ర చదివితే సరిపోదు, ఇది ధర్మాన్ని గురించిన మీమాంస. ధర్మాన్ని నమ్ముకున్న దేశానికి ఎందుకు ఆపదలు వచ్చాయి? ఎక్కడో లోపం జరిగింది, పెద్ద తప్పులు చేశాం .............................

ఏదో పరాయిపాలన నుంచి స్వాతంత్రం వచ్చిదనుకున్నాం. అధికారమార్పిడి జరిగింది కానీ ధర్మం జ్ఞాపకం చేసే విధంగా వచ్చిందా అనేది ప్రశ్న. స్వాతంత్రం అంటే ఏమిటి? సద్బుద్ధితో సన్మార్గంలో జీవించడానికి దోహదక్రియగా ఉన్న దానిపేరు ధర్మం. నేను సన్మార్గంలో ఉంటాననుకున్న వాడికి అవమానం జరగకూడదు, క్షేమం జరగాలి. అది సంస్కృతిలో, దేశంలో, నాగరికతలో ఉండాలి. అది స్వాతంత్రం. అట్లా రావలంటే ఎంతో సార్వజనీనమైన అంతఃకరణశుద్ధితో కూడుకున్న స్వాతంత్ర్యం రావాలి, అది నిజమైన భారతదేశం. అది ప్రతి వ్యక్తికి ఎప్పుడైతే వస్తుందో, అప్పుడు భారతదేశం స్వాతంత్రం పొందుతుంది. ఎన్ని వేల సంవత్సరాల నుంచి ఏకఖండంగా ఉన్న భారతభూమి మూడు ముక్కలైంది. అయినా పండుగ చేసుకుంటున్నాం మనం!? 22 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు, ఆశ్రయం కోల్పోయారు, మహాదుఃఖాన్ని అనుభవించారు. వాటిని గురించి స్మరించకుండా, జెండావందనం చేసి పండగ చేసుకుంటున్నామంటే ........ ఈ పండగ నిజమే, వారిని విస్మరించడం కూడా నిజమే. రెండు జరుగుతున్నాయి మనకి. అది ఏ మాత్రం క్షంతవ్యం కాదు. మనం జ్ఞాపకం చేసుకోవాలి.

సద్గురు శివానందమూర్తి


No comments:

Post a Comment