Sunday 9 August 2015

హిందూ ధర్మం - 170 (శిక్షా - 4)

సరైన రీతిలో ఉఛ్ఛరించే క్రమం కూడా వేదాంగం తెలిపింది.

శిక్షాం వ్యాఖ్యాస్యామః| వర్ణస్వరః| మాత్రాబలం|
సామ సంతానః| ఇత్యుక్త శిక్షాధ్యాయః||

అనగా శిక్షా శాస్త్రము వర్ణముల (అక్షరములు) గురించి, స్వరం గురించి (ప్రధానంగా మూడు స్వరాలు ఉన్నాయి. అనుదాత్తము - తక్కువ స్వరంలో చదవడం, ఉదాత్తము - గట్టిస్వరంలో చదవడం, స్వరితము (క్రమానికి అనుగుణంగా పెంచి, తగ్గించి చదవడం), మాత్రా (పాఠక్రమాన్ని అనుసరించి సమయానుకూల శృతితో చదవడం, ఒక అక్షరాన్ని ఎంత సమయం పలకాలో అంత సమయం మాత్రమే పలకడం) (prosodial unit of time), బలం (స్వర ఉఛ్ఛారణలో ఉపయోగించాల్సిన బలం), సామ (క్రమపద్ధతి పాటించడం) (uniformity), సంతానః (పాఠనా క్రమంలో కొనసాగింపు) (continuity) గురించి వివరిస్తుంది.

ఉదాత్తము, అనుదాత్తము, స్వరితములే కాక వేదపఠనం నేర్పే క్రమంలో చేతులను, తలను పైకి, క్రిందకు కదిలిస్తూ కూడా నేర్పిస్తారు. వీటివలన వేదపారాయణలో ఎక్కడా అపస్వరం దొర్లకుండా ఉంటుంది. ఒకవేళ అటువంటిది జరిగినా, చేతి కదలికలను అనుసరించి దాన్ని వెంటనే పసిగట్టగలుగుతారు.

వేదం ఈశ్వరీయం, కాలాతీతం, పరమప్రామాణికం, పవిత్రం. అటువంటి వేదమంత్రాలను భగవానుడు ఎలా అందించాడో, అలాగే వాటిని కాపాడేలా అనేక పద్ధతులను ఉపయోగించారు. ఈశ్వరప్రసాదిత వేదంలో ఒక్క అక్షరం ముక్క కూడా మారకుండా, కొత్తది చేర్చబడకుండా తరం నుంచి తరానికి పరంపరగా వచ్చేందుకు వీలుగా అనేక క్రమాలను, combinations ను ప్రవేశపెట్టారు.

ప్రధానమైన మంత్రాన్ని వ్యాక్యం అని, లేదా సంహితాపాఠం అని అన్నారు. ఇందులో అనేక పదములతో కూడిన మంత్రం ఉంటుంది.దాని ప్రతి పదాన్ని విడగొట్టి 'పద పాఠం' అన్నారు. ఇది విద్యార్ధికి ప్రతి పదానికి సంబంధించిన జ్ఞానాన్ని ఇస్తుంది. తర్వాత వచ్చేది క్రమపాఠం, ఇందులో మంత్రంలోని మొదటి పదాన్ని, రెండవపదానికి, రెండవపదాన్ని మూడవపదానికి, మూడిని నాలుగుకు, ఇలా జోడిస్తారు. ఈ పద్ధతి వలన విద్యార్ధికి విడివిడిగా ఒక్కో పదం యొక్క అర్దం తెలియడమే కాక, పారాయణ క్రమంలో పదాలను ఎలా జోడించాలి, దాని ఫలితంగా స్వరంలో ఎప్పుడు ఎలాంటి మార్పులు చేయాలి అనేవి బోధపడతాయి. పదపాఠం, క్రమపాఠాల్లో పారాయణ చేయడం వలన సంహితా పాఠంలో చెప్పబడిన పదాల యొక్క సహజక్రమం కాపాడబడుతుంది. అందుకే వీటిని ప్రకృతి అన్నారు. అనగా వేదం యొక్క సహజత్వాన్ని కాపాడేవి అని.

ఉదాహరణకు a-b-c-d-e-f అనే పదాలు సంహితపాఠంలో ఉంటే, పదపాఠంలో వాటిని విడివిడిగా ఏ పదానికి, ఆ పదంగా a, b, c, d,e, f అని చదువుతారు. క్రమపాఠంలో a-b, b-c, c-d, d-e, e-f  అని చదువుతారు. క్రమపాఠ పారాయణంలో ప్రావీణ్యం పొందిన పండితుడిని 'క్రమవిత్' అంటారు.

ఒక్కో పాఠంలో మంత్రాలు ఎలా ఉంటాయో, చిన్న ఉదాహరణలో చూడండి.

సంహితా పాఠం
ఓషధయః సం వదంతే సోమేన సహరాజ్ఞా ||

పదపాఠం
ఓషధయః| సం| వదంతే| సోమేన| సహ| రాజ్ఞా||

క్రమపాఠం
ఓషధయః సం| సం వదంతే| వదంతే సోమేన|
సోమెన సహ| సహ రాజ్ఞా| రాజ్ఞేతి రాజ్ఞా||

To be continued ......................

ఈ రచనకు సహకరించిన పుస్తకం.
శృంగేరీ పీఠం వారి Vedic Chanting 

No comments:

Post a Comment