Sunday 16 August 2020

హిందూ ధర్మం - 284 (కర్మ సిద్ధాంతం - 24 వ భాగము)



దొంగతనం గురించి కర్మవిపాకం ఈ విధంగా చెబుతోంది.

సనాతన ధర్మంలో బంగారానికి ఆధ్యాత్మికంగా చాలా ప్రాముఖ్యం ఉంది. బంగారం దొంగిలించినవాడు సాలీడు, మొసలి, పాము జన్మలెత్తుతాడు లేదా పిశాచయోనికి వెళతాడు, అనగా పిశాచమవుతాడు.

బ్రాహ్మణుల సొత్తు దొంగిలించిన బ్రాహ్మణుడు, బ్రహ్మరాక్షసుని జన్మ పొందుతాడు.

ధాన్యాల దొంగతనం ఎలుక జన్మను ఇస్తుంది. కంచు దొంగిలించినవాడు హంసగా, నీటిని దొంగిలించినవాడు పక్షిగా, తేనే దొంగిలించినవాడు అడవిఈగగా పుడతాడు.

పాలు దొంగిలిస్తే కాకి, రసాలను దొంగిలిస్తే కుక్క, నెయ్యి దొంగతనంతో ముంగీస, మాంసం చౌర్యంతో రాబందు, జంతువుల కొవ్వు దొంగతనంతో సముద్రపుపక్షి జన్మ వస్తాయి. నూనె దొంగిలిస్తే గబ్బిలం జన్మ వస్తుంది. ఉప్పు దొంగతనంతో చిఖికా జన్మ, పెరుగు చౌర్యంతో కొంగ, పట్టుదారాలు లేదా వస్త్రాల దొంగతనంతో తిత్తిరి పక్షి జన్మ వస్తుంది.

నారవస్త్రాలు లేదా తెల్లనివస్త్రాల దొంగ కప్పగానూ, పత్తి (కాటన్) వస్త్రాల దొంగ క్రౌంచ పక్షిగానూ, గోవు దొంగ ఉడుముగానూ, బెల్లం దొంగ వాగ్గుడు పక్షిగానూ జన్మిస్తారు.

పరిమళద్రవ్యాలు దొంగిలిస్తే పునుగుపిల్లిగా, ఆకుకూరలు మరియు కూరగాయలు దొంగిలిస్తే నెమలిగా, వండిన లేదా వండని ఆహార పదార్ధాలను దొంగిలిస్తే అడవిపంది జన్మ వస్తాయి.....

అగ్ని చౌర్యంతో కొంగ, నిత్యం వాడుకునే ఉపకరణాల చౌర్యంతో గృహకారి అనే పురుగు, నేసిన బట్టల చౌర్యంతో చకోర పక్షి, ఏనుగు దొంగతనంతో నక్క జన్మ వస్తాయి. గుఱ్ఱపు దొంగ పులిగానూ, దుంపలు, ఫలాలను దొంగిలిస్తే కోతిగానూ పుడతారు. (ఉచితంగా వస్తుందంటే చాలామందికి తెగ ఆనందం. రోడ్డున కనబడిన పండ్లను కోసుకోనిదే వారికి మనసొప్పదు. తెలిసోతెలియకో, సరదాకో చేసిన ఒక పండు దొంగతనంతో కోతిగా జన్మించి, ఆ జన్మంతా ఆకలితో పండ్ల కోసం తపిస్తూ బ్రతకాలి. అలాంటిది అవసరమంటారా? )

స్త్రీని అపహరిస్తే ఎలుగుబంటిగా, నీటి దొంగ ఇబిరిత పక్షిగా, వాహానాల దొంగ ఒంటెగా, ఇతర జంతువులను దొంగిలిస్తే మేకగానూ పుడతారు.

ఇలా మానవుడు చేసే అనేక పాపాలు, వాటికి ప్రతిఫలంగా అనుభవించే జన్మల గురించి శాస్త్రాలు వివరిస్తాయి.


To be continued .......

No comments:

Post a Comment