Saturday 24 February 2024

శ్రీ గరుడ పురాణము (100)

 


మండపం పూర్వాది దిశలలో నాలుగు ద్వారాలతో శోభిల్లాలి. తోరణ స్తంభాలను ఏర్పాటు చేయాలి. ఇవి అయిదేసి హస్తాల పరిమాణంలో వుండాలి. న్యగ్రోధ (మట్టి) ఉదుంబర, అశ్వత్థ (రావి) బిల్వ, పలాశ, ఖదిర చెట్లలో ఒక్కొక్క చెట్టు నుండి ఒక్కొక్క కర్రను తయారు చేసి వాటిని వస్త్రపుష్పాదులతో అలంకరించి తోరణ స్తంభాలుగా మార్చి భూమిలోకి, ఒక హస్తం మేర లోతుకు పాతాలి. ఈ స్తంభాలు మండపము యొక్క అన్ని దిశల్లోనూ కనబడాలి.


మండపానికి తూర్పువైపు ద్వారంపై మృగేంద్ర, దక్షిణంపై హయరాజ, పశ్చిమంపై గోపతి, ఉత్తరీ ద్వారంపై దేవశార్దూల ప్రతిరూపాలనుంచాలి. క్రమంగా అగ్నిమీలే... ఈ షేత్వేతి... అగ్న ఆయాహి..., శంనోదేవీ... అనే మంత్రాలతో ఆయా దిక్కుల్లో ఈయీ సింహ, గజ, వృషభ, శార్దూల మూర్తులను న్యాసం చేయాలి.


ఇక పతాకల వర్ణాలీ విధంగా వుండాలి.


తూర్పు - మేఘ

ఆగ్నేయ - ధూమ్ర

దక్షిణ - శ్యామల

నైరృత్య - ధూసర*


పశ్చిమ - పాండుర

వాయవ్య - పీత

ఉత్తర - రక్త

ఈశాన్య - శుక్ల


మండప మధ్యభాగంలో అన్ని రంగులు జెండాలూ రెపరెపలాడుతుండాలి. 


ఇంద్రవిద్యోతి... అనే మంత్రంతో తూర్పులో ఇంద్రునీ 

సంసుప్తి.... అనే మంత్రంతో ఆగ్నేయంలో అగ్నినీ,

యమోనాగ... అనే మంత్రంతో దక్షిణంలో యమునీ

రక్షోహణావే.... అనే మంత్రంతో పశ్చిమంలో వరుణునీ,

ఓం వాతేతి... అనే మంత్రంతో వాయవ్యంలో వాయుదేవునీ అభిషేకించి 

ఉత్తర దిశలో ఓం ఆప్యాయస్వేతి.... అనే మంత్రంతో కుబేరుని పూజించాలి. 


No comments:

Post a Comment