Thursday 1 February 2024

శ్రీ గరుడ పురాణము (77)

 


అనంతరం బ్రహ్మ, నారద, సిద్ధ, గురు, పరగురు, గురు పాదుకలను క్రమంగా ఈ విధంగా ఓం బ్రహ్మణే నమః, ఓం నారదాయ నమః, ఓం సిద్ధాయ నమః, ఓం గురుభ్యో నమః, ఓం పరగురుభ్యో నమః, ఓం గురుపాదుకాభ్యాం నమః అనే మంత్రాలతో పూజించాలి. 

ఇపుడు తూర్పు దిక్కుతో మొదలెట్టి ఇంద్రాది దిక్పాలకులనూ, ఊర్ధ్వ అధో దిశలలో బ్రహ్మనూ అనంతునీ ఈ మంత్రాలతో పూజించాలి. ఓం సవాహనాయ సపరివారాయ అనే ఉపసర్గను అందరికీ చేరుస్తూ ఇంద్రాయ నమః, అగ్నయే నమః, యమాయ నమః, నిరృతయే నమః, వరుణాయ నమః, వాయవే నమః, సోమాయ నమః, ఈశానాయ నమః, బ్రహ్మణే నమః, అనంతాయ నమఃలతో ఆయా దేవతలందరినీ పూజించాలి. పిమ్మట


ఓం వజ్రాయ నమః, ఓం శక్తయే నమః, ఓం దండాయ నమః, ఓం ఖడ్గాయ నమః, ఓం పాశాయ నమః, ఓం ధ్వజాయ నమః, ఓం గదాయై నమః, ఓం చక్రాయ నమః,


అనే మంత్రాలతో ఆయుధాలనూ ఓం పద్మాయ నమః


అనే మంత్రంతో పద్మాన్నీ, ఈశానకోణంలో ఓం విష్వక్సేనాయ నమః అనే మంత్రంతో ఆయననీ పూజించి అనంతరం అనంతుని మరల అర్చించాలి. పిమ్మట హయగ్రీవుని మూలమంత్రంతో సర్వోపచారాలతో మరల పూజించి ప్రదక్షిణ మరల యథాశక్తి మూలమంత్ర జపాన్నిచేసి దానిని ఆయనకే అర్పించి ఇలా స్తుతించాలి :


ఓం నమో హయశిరసే విద్యాధ్యక్షాయవై నమః నమో విద్యాస్వరూపాయ విద్యాదాత్రే నమో నమః | నమః శాంతాయ దేవాయ త్రిగుణాయాత్మనే నమః ॥ సురాసుర నిహంత్రేచ సర్వదుష్ట వినాశినే । సర్వలోకాధిపతయే బ్రహ్మరూపాయ వై నమః ॥ నమశ్చేశ్వర వంద్యాయ శంఖచక్రధరాయ చ ॥ నమ ఆద్యాయ దాంతాయ సర్వసత్త్వ హితాయ చ || త్రిగుణాయా గుణాయైవ బ్రహ్మవిష్ణు స్వరూపిణే । కర్తే హర్తే సురేశాయ సర్వగాయ నమోనమః ॥ (ఆచార 34/50-54)


ఈ విధంగా స్తుతించి సాధకుడు తన మనః కమలమధ్యంలో శంఖచక్రగదాధారి, కోటి సూర్యకాంతి ప్రభుడైన ప్రభువు, సర్వాంగసుందరుడు, అవినాశియగు మహేశునికే ఈశుడు, దేవాధిదేవుడు, పరమాత్మయగు హయగ్రీవుని నిలుపుకొని ధ్యానం చేయాలి. 


హే ఫాలలోచనా! ఈ పూజను గూర్చి చదివినవారికి పరమపదం ప్రాప్తిస్తుంది. 


(అధ్యాయం - 34)


No comments:

Post a Comment