Monday 6 May 2024

శ్రీ గరుడ పురాణము (167)

 


పద్మరాగమణి - లక్షణాలు - పరీక్షావిధి


దేవతలపాలిటి మహాదాతయు, జగత్తికి సర్వరత్న ప్రదాతయునగు బలాసురుని రత్న బీజరూప శరీరం నుండి సూర్యభగవానుడు కొంత రక్తాన్ని తీసుకొని వెళుతుండగా వినీలాకాశమార్గంలో లంకపై నుండి పోతున్నపుడు లంకాధిపతియైన రావణుడు అడ్డగించాడు. వారి పెనగులాటలో ఆ రక్తం అలా క్రిందికి జారి లంకాదేశంలో ఒక నదిలో పడిపోయింది.


రావణగంగగా ప్రసిద్ధమైన ఆ నది బహు ప్రశస్తమైనది. అందలి జలాలు లంకలోని అద్భుత సౌందర్యవతుల నితంబాల నీడలతో నిత్య సంపర్కం గలగడం వల్లనో ఏమో గాని పరమ రమణీయాలుగా పేరు గాంచాయి. నారీరత్న సంచయసంగ్రాహకులలో రావణుని మించిన వారుండరేమో కదా! ఆ నది యొక్క రెండు తటాలూ పోకచెట్లతో సుశోభాత్ శోభితాలై వుంటాయి. ఆ నదిని అక్కడి వారు గంగతో సమాన పవిత్రంగా చూసుకుంటారు. ఉత్తమ ఫలాలనివ్వడంలో ఆ నది గంగకి తీసిపోదు.


అందులో బలాసురుని రుధిరగతాకర్షక శక్తి ఒక ఆకస్మిక ధనలాభం వలె చేరగానే ప్రతిరాత్రి రత్నాలెక్కడి నుండో వచ్చి ఆ నదీతటంపై స్థిరపడసాగినవి. వాటి యొక్క కాంతులు బంగారు బాణాల్లాగా నదిలో నుండి పైకీ వెలుపలి నుండి నదిలోకీ పరావర్తితం కాసాగినవి. ఆ నదిలో దొరికినవే పద్మరాగమణులు.


ఇవి సౌగంధికాలు కూడ. వీటిలో కురువిందజ రత్నాల, స్పటిక రత్నాల ఉత్తమ, ప్రధాన గుణాలన్నీ వుంటాయి. వాటి స్వరూపం ఎఱ్ఱటి మెరుపుతో బంధూకపుష్పం, గుంజాఫలం, జపా కుసుమం, కుంకుమ, వీరబహుటి కీటవర్ణాలు, పలాశ పుష్పవర్ణం - ఇలా లేతగా కనీ కనిపించని ఎరుపు నుండి నలుపు కలిసిన చిక్కటి రక్తవర్ణం దాకా అన్ని ఎఱ్ఱని నీడలలోనూ అనగా చాయలలోనూ వుంటుంది. సిందూరం, నీలోత్పలం, రక్త కమలం, కుంకుమపూవు, లాక్షారసం రంగుల్లోనూ పద్మరాగం వుంటుంది. ఎంత చిక్కటి రంగులో నున్నా కాంతులు వెదజల్లుతూ వుంటుంది.


No comments:

Post a Comment