Sunday 26 May 2024

శ్రీ గరుడ పురాణము (186)

 


స్వంతపుత్రులూ, పిండాధికృతులైన వారే కాక అన్య వంశజులు కూడా మృతుల నామ గోత్రాలను చదివి శ్రాద్ధకర్మలను చేయవచ్చును. గయలోని గయాకూపమను పేరు గల పవిత్ర తీర్థంలో ఎవరి పేరిట పిండప్రదానము చేస్తే వారికే అందడమే గాక వారికి శాశ్వత బ్రహ్మగతిని కూడా ప్రాప్తింపజేస్తుంది.


ఆత్మజోవా తథాన్యోవా గయాకూపే |

యదాతదా |

యన్నామ్నా పాతయేత్ పిండం తం

నయేద్ బ్రహ్మ శాశ్వతం ||


(ఆచర ... 83/61)


గయలోని కోటితీర్థాన్ని దర్శించిన వానికి విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది. ఆ క్షేత్రంలోనే ముల్లోకాలలోనూ పేరున్న వైతరణి అను నది గలదు. అది గయలో పితరులకు ఉత్తమ గతులను కలిగించడానికే బ్రహ్మచే భూమిపై అవతరించబడింది. శ్రద్ధగా పిండ ప్రదానాన్నీ, గోదానాన్నీ ఇక్కడ చేసినవారు తమతో సహా తమ ఇరువది యొక్క తరాలను ఉద్ధరించగలరు.


యా సా వైతరణీనామ

త్రిషు లోకేషు విశ్రుతా ||

సావతీర్ణా గయా క్షేత్రే

పితృణాం తారణాయ హి |


(ఆచార... 83/62,63)


గయాతీర్థ యాత్రికులు బ్రాహ్మణులకు భోజనాలు పెట్టదలచుకున్నపుడు అక్కడ ఒకప్పుడు బ్రహ్మయజ్ఞం చేసినపుడు ఋత్విక్కులుగా వరించిన బ్రాహ్మణులకే అనగా, ఆ సంతతి వారికే భోజనాలు పెట్టాలి. ఆ బ్రాహ్మణులు గయలో బ్రహ్మపద, సోమపానక తీర్థాలలో వుంటారు. ఆ తీర్థాలు బ్రహ్మదేవునిచే నిర్మింపబడినవి. ఈ బ్రాహ్మణులను పూజిస్తే పితరులు స్వయంగా తామే పూజింపబడినట్లుగా భావించి తృప్తులౌతారు.


గయా తీర్థంలో హవ్యకవ్యాది పక్వాన్నాల ద్వారా అక్కడి బ్రాహ్మణులను విధ్యుక్తంగా సంతుష్టపఱచాలి. గయలో వృషోత్సర్గం (ఎద్దును స్వేచ్ఛగా వదలివేయుట) చేసిన వారికి నూరు అగ్నిష్టోమయజ్ఞాలు చేసిన ఫలం దక్కుతుంది. ఇక్కడ స్వపిండం వేసుకోవచ్చు. అది తిలరహితంగా వుండాలి. అన్యులకూ వేయవచ్చును.


ఆత్మనోఽపి మహాబుద్ధిర్గయాయాంతు తిలైర్వినా । 

పిండ నిర్వాపణం కుర్యాదన్వేషామపి మానవః ॥


(ఆచార ... 83/69)


No comments:

Post a Comment