Tuesday 21 May 2024

శ్రీ గరుడ పురాణము (182)

 


గయలో నొక పర్వతంపై పరమశివుడు వెలసియున్నాడు. ఆయనను దర్శించిన వారికి పితౄణ (పితృఋణ అనే మాట సరి కాదు) విముక్తి లభిస్తుంది. అక్కడి ధర్మారణ్యంలో కొలువు తీరిన యమధర్మరాజును దర్శిస్తే అన్ని ఋణాలూ తీరిపోతాయి. అలాగే గృద్ధేశ్వర మహాదేవుని దర్శించినవారికి అన్ని బంధనాలూ తొలగిపోతాయి.


ధేనువనం (గోప్రచార తీర్థం) అను పేరుగల మహా తీర్థంలో ధేను దర్శనం చేసిన వారి పితరులకు స్వర్గలోకం ప్రాప్తిస్తుంది. ప్రభాస తీర్థంలో ప్రభాసేశ్వర నామంతో వేంచేసి యున్న పరమశివుని దర్శించినవారు పరమగతిని పొందగలరు. కోటీశ్వర, అశ్వమేధ తీర్థాలను దర్శించినవారికి ఋణాలన్నీ తీరిపోతాయి. అలాగే స్వర్గద్వారేశ్వర దర్శనం సర్వబంధ విముక్తకం.


ఇక్కడి ధర్మారణ్యంలో నున్న గదాలోల తీర్థాన్నీ అక్కడ కొలువున్న రామేశ్వర స్వామినీ దర్శించిన వారికి స్వర్గప్రాప్తి వుంటుంది. ప్రక్కనే కొలువైన బ్రహ్మేశ్వర స్వామిని సేవించిన వారికి బ్రహ్మహత్యాపాతకం నుండి విముక్తి లభిస్తుంది.


గయలోనే ముండపృష్ఠ తీర్థంలో వెలసిన మహాచండీదేవిని దర్శించిన వారి అన్ని వాంఛలూ నెరవేరుతాయి.


ఫల్గు తీర్థంలో ఫల్గు స్వామి, చండి, గౌరి, మంగళ, గోమక, గోపతి, అంగారేశ్వర, సిద్దేశ్వర, గజస్వామి, గయాదిత్య, మార్కండేయేశ్వర భగవానులు వెలసియున్నారు. వీరి దర్శనం పితౄణ భంజకం. అలాగే ఫల్గుతీర్థంలో స్నానం చేసి అక్కడున్న గదాధర స్వామిని దర్శించినవారు పితరుల ఋణం నుండి విడివడతారు. భూమిపై నున్న అన్ని తీర్ధాలూ సముద్రాలూ, సరోవరాలూ ప్రతిదినమూ వచ్చి ఫల్గు తీర్థాన్ని దర్శించి వెళతాయి. మొత్తం భూలోకంలో గయ, గయలో గయాశిరం, ఆ శిరంలో ఫల్గు తీర్థం శ్రేష్ఠ భాగాలు. 


పృథివ్యాంయాని తీర్థాని యే సముద్రాః సరాంసిచ |

ఫల్గు తీర్థం గమిష్యంతి వారమేకందినే దినే ॥ 

పృథివ్యాం చ గయా పుణ్యాగయాయాంచ గయాశిరః ।

శ్రేష్ఠం తథా ఫల్గు తీర్థం తన్ముఖంచ సురస్య హి ॥


(ఆచార...83/22,23)


No comments:

Post a Comment